Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మతతత్వ ఉన్మాదం తలకెక్కి ఎందరో అమరుల త్యాగఫలమైన స్వాతంత్య్ర సమరస్ఫూర్తికి తూట్లుపొడుస్తూ, మన రిపబ్లిక్ రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న శక్తులు విలయ తాండవం చేస్తుండగా నేడు షహీద్ భగత్సింగ్ అమరత్వాన్ని గుర్తుచేసుకుని మనం మరింతగా ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం కట్టవలసిన సమయం ఇది. 1931వ సంవత్సరం మార్చి 23వ తేదీనాడు సాయంత్రం బ్రిటిష్ వలసపాలనను సాయుధంగా కూలదోయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ అనే విప్లవ సంస్థకు చెందిన ముగ్గురు యువ సోషలిస్టు విప్లవకారులను లాహోర్ జైలులో బ్రిటిష్ ప్రభుత్వం ఉరికంభం ఎక్కించింది. తాము ఉరికంభం ఎక్కేనాటికి ఈ ముగ్గురు విప్లవకారుల వయసు 24సంవత్సరాలు. వీరు చనిపోకముందు తాము యుద్ధ ఖైదీలమని, తమని యుద్ధఖైదీలుగా భావించి కాల్చిచంపమని కోరారు. అయినప్పటికీ వలస పాలకులు వారి అభ్యర్థనను తిరస్కరించి వారిని ఉరితీసి, రాత్రికి రాత్రే రహస్యంగా వారి భౌతికకాయాలను ఖననం చేశారు. అఖిల భారత హిందూ మహాసభ 1921వ సంవత్సరంలోను, ఆర్ఎస్ఎస్ 1925వ సంవత్సరంలోను అస్తిత్వంలోకి వచ్చినప్పుడు భగత్సింగ్ కౌమారదశలో ఉన్నాడు. భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) కూడా 1925వ సంవత్సరంలోనే ఆవిర్భవించింది. అనేకమంది హిందూ జాతీయ వాదులకు, కమ్యూనిస్టులకు అనుశీలన్, యుగన్తరన్ వంటి విప్లవ గ్రూపులతో సంబంధాలు ఉండేవని అందరికీ తెలుసు. 1920వ దశకంలో జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలలో జరుగుతున్న మార్పులను అవగాహన చేసుకుంటున్న ఒక యువ విప్లవకారుడిగా భగత్సింగ్ ముందు అనేక రాజకీయ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆయన అత్యంత సంక్లిష్టమైన సర్వస్వతంత్ర పంథాను ఎంపిక చేసుకున్నాడు. ఆయన ఒక నాస్తికుడుగా, ఒక విప్లవ సోషలిస్టుగా, ఒక అంతర్జాతీయవాదిగా తన ప్రాపంచిక దృక్పథాన్ని నిర్మించుకున్న తీరు ''నేనెందుకు నాస్తికుడనయ్యాను'' అనే వ్యాసంలోని ప్రతి అక్షరం ప్రతిబింబిస్తుంది.
భగత్సింగ్ స్పష్టంగా తన ప్రాపంచిక దృక్పథాన్ని తన రచనలలోను, ఆచరణతోను ప్రకటిం చినప్పటికీ కొన్ని మతతత్వ సంస్థలు తమ పేర్లకు సిగ్గులేకుండా భగత్సింగ్ పేరును జోడిస్తుంటాయి. భగత్సింగ్ నాస్తికుడే కాకుండా అతను, అతని కామ్రేడ్స్ నికరంగా మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడారు. మతతత్వ సంస్థలకు చెందిన యువతకు విప్లవ నౌజవాన్ భారత్ సభలో సభ్యత్వం ఇవ్వకూడదని 1928వ సంవత్సరంలో జరిగిన నౌజవాన్ భారత్ సభ సమావేశంలో భగత్ సింగ్, ఆయన సహచరులు స్పష్టం చేశారు. లాలా లజపతిరారు పట్ల భగత్సింగ్కు అత్యంత గౌరవభావం ఉండేది. బ్రిటిష్ పోలీసులు విపరీతంగా కొట్టటంవల్లనే ఆయన మరణించాడనే వాస్తవం భగత్సింగ్ను ప్రతీకారం తీర్చుకునేలా చేసింది. అంతలా తను గౌరవించిన వ్యక్తి మతతత్వ రాజకీయాలవైపు మరలగానే భగత్సింగ్ లాలా లజపత్రారు పైన ఒక కరపత్రాన్ని ఆయన ముఖచిత్రంతో ప్రచురించాడు. ఆ కరపత్రానికి ఆయన పెట్టిన పేరు ''పతనమైన నాయకుడు''!
''కీర్తి'' పత్రిక 1928వ సంవత్సరం జూన్ 28వ సంచికలో భగత్సింగ్ రెండు వ్యాసాలను రాశాడు. వాటిలో ఒకటి: ''మత కలహాలు-వాటి పరిష్కారాలు'', రెండవది: ''అంటరానితనం మీద''. మత కలహాలలో ''మతతత్వవాదులైన రాజకీయ నాయకుల, వార్తాపత్రికల'' పాత్రను భగత్సింగ్ స్పష్టంగా గుర్తించాడు. మతతత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేని, మతతత్వ ప్రవాహంలో కొట్టుకుపోతూ జాతీయ నాయకులుగా చలామణీ అవతున్నవారిని ఆయన హేళన చేశాడు. పాత్రికేయ వత్తిని గురించి భగత్ సింగ్ ఇలా రాశాడు:
''ఒకప్పుడు పవిత్రంగా భావించబడిన పాత్రికేయ వృత్తి నేడు అత్యంత దిగజారింది. ప్రజలను చైతన్యపరచటం, ప్రజల మనసులలో నుంచి రాగద్వేషాలను తొలగించి వారిని మత ఛాందసం నుంచి కాపాడటం, మతతత్వ భావనలను రూపుమాపి సమిష్టి జాతీయవాదం వైపు ప్రజలను మరలించటం వార్తాపత్రికల ప్రధాన కర్తవ్యం. అయితే ఈ కర్తవ్యాలను నిర్వహించకుండా అజ్ఞానాన్ని వ్యాప్తిచేయటం, మతమౌఢ్యాన్ని, మత దురహంకారాన్ని బోధిస్తూ ప్రచారం చేయటం, భిన్నత్వంతో విలసిల్లే మన సంస్కృతిని, సమిష్టి వారసత్వాన్ని నాశనం చేసేలా ప్రజల మనసుల్లో మతతత్వ విషాన్ని నింపటమే లక్ష్యంగా వార్తాపత్రికలు పనిచేస్తున్నాయి. (సంప్రదాయక్ దంగే ఔర్ ఉన్కా ఇ లాజ్, కీర్తి, జూన్, 1928). మతతత్వానికి పరిష్కారం విప్లవ మార్క్సిస్టు సిద్ధాంతంలో ఉందని భగత్సింగ్ గ్రహించాడు. ఆయన ఇలా రాశాడు: ''కడుపు నింపుకోవటానికి సంబంధించిన భౌతిక ప్రశ్నలు ప్రతి విషయానికి పునాదిగా ఉంటాయి ఇది మార్క్సిజం అందిస్తున్న జ్ఞానంలో ఒక అంశం. పరస్పర కలహాలకు, హింసకు ప్రజలు దిగకుండా ఆపాలంటే వర్గ చైతన్యం కావాలి. పెట్టుబడిదారులే తమ నిజమైన శత్రువులని పేదలు, కష్టజీవులు, రైతులు గ్రహించవలసిన అవసరం ఉంది. మతం, వర్ణం, జాతీయత, జాతి ప్రాతిపధికన చూపే వివక్షను రూపుమాపటంలో వారి ప్రయోజనం దాగిఉంది. ఇది వారికున్న సంకెళ్ళను తెంచి వారిని స్వేచ్చా జీవులుగా మారుస్తుంది. అది వారికి ఆర్థిక స్వాతంత్య్రాన్ని ఇస్తుంది...
జారిస్టు పాలన ప్రజలను చీల్చి వివిధ జాతుల మధ్య కలహాలను రెచ్చగొట్టేదని రష్యా చరిత్ర తెలిసిన వాళ్ళకు తెలుసు. అయితే కార్మికులు అధికారంలోకి వచ్చాక అటువంటి హింస కనుమరుగైంది. ఇప్పుడు ప్రతివ్యక్తీ ఒక 'మతానికి చెందిన వాడు'గా కాకుండా ఒక 'మానవుడు'గా భావించ బడుతున్నాడు''. అలా భగత్సింగ్ మత హింసను నిరోధించాలంటే వర్గ చైతన్యం అవసరమని పేర్కొన్నాడు. ఒకవైపు దేశంలో మత హింస పేట్రేగిపోతుండగా కలకత్తా నగరంలో ట్రేడ్ యూనియన్ కార్మికులు మతహింసలో పాల్గొనకపోవటం, హిందూ, ముస్లిం కార్మికులు కలిసి హింసను అడ్డుకోవటం ఒక ఆశాకిరణంలా కనిపిస్తున్నదని భగత్సింగ్ అన్నాడు. యువత తమను తాము హిందువులుగాను, ముస్లింలుగాను లేక సిక్కులుగాను భావించకుండా తామందరమూ మానవులం అని భావించటంలోనే భారతదేశ భవిత ఉందని ఆయన చాటాడు. 1914 -15నాటి అమరులు రాజకీయాల నుంచి మతాన్ని వేరుచేశారు. మతం వ్యక్తిగత విషయమని, దానిలో ఎవరూ జోక్యం చేసుకోరాదని వారు అన్నారు. అలాగే ప్రజలను విడదీసి, వారి ఐకమత్యాన్ని దెబ్బతీసే మతాన్ని రాజకీయాలలో ప్రవేశపెట్టకూడదని కూడా వారు పేర్కొన్నారు. గదర్ ఉద్యమం ఐక్యంగా మిగలటానికి కారణం సిక్కులు, హిందువులు, ముస్లింలు కలిసికట్టుగా తమ జీవితాలను త్యాగం చెయ్యటమే.
భారతీయ జన జీవన సంస్కృతిలో అత్యంత అమానుషమైన అంటరానితనమనే దురాచారాన్ని ఆచరించటంపైన భగత్సింగ్ నేరుగా దాడిచేశాడు. మతమార్పిడుల గురించి గుండెలు బాదుకోవటం పైన ఆయన ఇలా అన్నాడు: ''...మీరు(హిందువులు) వాళ్ళను పశువుల్లా చూస్తే వాళ్ళు మిమ్మల్ని వదిలి మరిన్ని హక్కులను అనుభవించవచ్చనే ఆశతోను, సాటి మనుషులుగా చూడబడతామనే నమ్మకంతోను ఇతర మతాలను ఆశ్రయిస్తారు. ('అచ్చోట్ కా సవాల్, కీర్తి, జూన్, 1928). భగత్సింగ్ అంటరానితనాన్ని సంస్కరించటం గురించి మాత్రమే మాట్లాడలేదు. ఆయన దళితులను 'నిజమైన కార్మికవర్గం' అని అన్నాడు. దళితులు తమను తాము విముక్తి చేసుకోవాలని భగత్ సింగ్ కోరాడు. ఆయన శశికాంత్ హింగోనేర్కర్ కవితను ఇలా ఉటంకించాడు: 'ఒకవేళ మీరు మీ బొటనవేలును కోల్పోకుండా ఉండివుంటే చరిత్ర కొంతవరకు మరోలా సాగేది. కానీ మీరు మీ బొటనవేలును, చరిత్రను వాళ్ళకు దారాదత్తం చేశారు. ఏకలవ్యా! ఆ రోజున ఎండి వాళ్ళు నీవైపు తిరిగి చూడలేదు. ఏకలవ్యా! నన్ను క్షమించు. వాళ్ళ తియ్యని మాటలు ఇక నన్ను మోసగించలేవు. నా బొటనవేలు ఎప్పటికీ నానుంచి దూరం కాదు...'
దళితుల విముక్తి కోసం, అణచివేతకు గురవుతున్న అశేష ప్రజల విముక్తి కోసం భగత్సింగ్ చెప్పిన మాటలు నేటికీ తమ సమకాలీనతను కోల్పోలేదు: 'ఎవరైతే ముందుగా విముక్తిపొందుతారో వారే మొదటి దెబ్బ వెయ్యాలి. ఆధిపత్య వర్గానికి చెందిన ప్రతిఒక్కరూ హక్కులన్నిటినీ ఆస్వాదిస్తూ కింది వాళ్ళను తమ పాదాల కింద అణచివేయటానికి ప్రయత్నిస్తుంటారు. ఆవిధంగా ఆచరణలో బలవంతుడి మాటే శాసనం అవుతుంది. కాబట్టి కాలాన్ని వృధాచేసుకోకుండా మీ కాళ్ళమీద మీద మీరు నిలుచోవటానికి ఐక్యమై సామాజిక వ్యవస్థకు సవాలు విసరండి. మీకు రావలసిందేదో మీకు దక్కకుండా చూసే ధైర్యం చేస్తున్నదెవరో తెలియనివ్వండి. ఎవరి దయాదాక్షిణ్యాల మీదో ఆధారపడకండి. అటువంటివారి పట్ల భ్రమలను వీడండి. అధికార యంత్రాంగం ఉచ్చులో చిక్కుకోకుండా చూసుకోండి. ఎందుకంటే వీళ్ళు మీకు మిత్రులుగా ఉండకుండా వారుపాడే పాటకు తాళం వెయ్యమంటారు. నిజం చెప్పాలంటే పెట్టుబడిదారీ వర్గంతో ఉద్యోగస్వామ్యం(బ్యూరోక్రసీ) కలయికే మీ దారిద్య్రానికి, అణచివేతకు కారణం. కాబట్టి ఎప్పుడూ వీరి దగ్గరకు చేరకండి. వారి కుయుక్తులను కనిపెడుతూ వుండండి. అయితే పరిష్కారం ఏమిటి? మీరే నిజమైన కార్మికవర్గం. మీరు ఐక్యమైతే పోయేదేమీలేదు సంకెళ్ళు తప్ప. అస్తిత్వంలోవున్న వ్యవస్థపైన ఉవ్వెత్తునలేచి తిరగబడండి. క్రమేణా మెరుగు పడటం, సంస్కరణ వాదం వంటివాటితో మీకు ఏమీ ఉపయోగం ఉండదు. సామాజిక ఉద్యమంతో విప్లవాన్ని మొదలెట్టి రాజకీయ, ఆర్థిక విప్లవం కోసం నడుం బిగించండి. మీరు మాత్రమే దేశాలకు ఆయువు. మీ పునాదులపైనే దేశాల మనుగడ ఉంది. ఓ నిదురపోతున్న సింహాల్లారా! మేల్కొనండి. విప్లవ పతాకను ఎత్తిపట్టి తిరగబడండి! (భగత్ సింగ్, 'అచ్చోట్ కా సవాల్', కీర్తి, జూన్, 1928).
దాదాపు ఒక శతాబ్దం క్రితం భగత్సింగ్ రాసిన రాతలు నేటికీ మనలను ఉత్తేజితులను చేయటమే కాకుండా నేటి విపత్కర పరిస్థితులలో కూడా మనల్ని కార్యోన్ముకులను చేస్తున్నాయి. షహీద్ భగత్సింగ్ త్యాగధనుడైన ఒక విప్లవకారుడేకాదు అయన భారత విప్లవోద్యమానికి ఒక దిక్సూచి. ఆ దిక్సూచి చూపిన మార్గంలో పయనించి విప్లవనావను గమ్యం చేర్చటం నేటి విప్లవోద్యమ కర్తవ్యం.
- నెల్లూరు నరసింహారావు
సెల్:8886396999