Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏప్రిల్ 14 బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పుట్టిన రోజు. హైదరాబాద్లో నిర్మాణంలో ఉన్న తెలంగాణ సెక్రటేరియట్ నూతన భవన సమీపంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఈరోజు ఆవిష్కరణకు సిద్ధమైంది. ఆయన పట్ల దేశ ప్రజల ప్రేమాభిమానాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఆ రకంగా భారత రాజ్యాంగ నిర్మాతకు దక్కాల్సిన గౌరవం దక్కుతోంది. 'లైట్ ఆఫ్ ఆసియా'గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గౌతమ బుద్ధుణ్ణి; ఆయన బోధించిన ధర్మాన్ని ప్రచారం చేసిన అశోక చక్రవర్తిని ఈ ఆధునిక కాలంలో కూడా ప్రజలు స్మరించుకుం టున్నారు. అంతేకాదు, హిందూ మతాన్ని త్యజించి ఆరులక్షల మందితో అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించడం కూడా ఆధునికులకు స్ఫూర్తినందిస్తోంది. తెలంగాణ టూరిజంశాఖ నాగార్జున సాగర్లో బుద్ధవనాన్ని ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేసింది. అంతర్జాతీయ స్థాయిలో దాన్ని నిలబెట్టడానికి ఇంకా కృషి చేస్తోంది. ఇక భారతదేశం బయట జరిగే విషయాలు చెప్పు కోవాలంటే... ఉత్తర అమెరికాలో అంబేద్కర్ జయంతి ని... ''డా||బి.ఆర్. అంబేద్కర్ సమానత్వపు రోజు (ణA్ ఉఖీ జుQఖAూ×ు్) గా గుర్తించి జరుపుతున్నారు. అంతేకాదు, నెల పొడవునా 'దళిత్ర చరిత్రమాసం'గా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ విషయాలు ఇలా ఉంటే, ఇదే రోజు 2023 ఏప్రిల్ 14న, గుజరాత్లో మరో మహాద్భుతం జరుగుతోంది. గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీనగర్లో యాభైవేల మంది దళితులు బౌద్ధం స్వీకరిస్తున్నారు. ఆ రాష్ట్రంలోని పలు గ్రామాల్లోంచి, పట్టణాల్లోంచి, నగరాల్లోంచి, అటవీ ప్రాంతాల్లోంచి దళితులూ, ఆదివాసీలు అక్కడి రమాకాంతా మైదానంలో సమావేశమవుతున్నారు. హిందూ మతాన్ని త్యజించి, బాబాసాహెబ్ అంబేద్కర్ నడిచిన దారిలో నడవాలని అనుకుంటున్నారు. అక్కడి దళితులు, ఆదివాసీలు, వెనకబడిన జాతుల వారు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు. దంగాపూర్ ఆదివాసీలు కుటుంబాలకు కుటుంబాలు తరలివచ్చి బుద్ధ దీక్ష తీసుకుంటున్నారు. కార్యక్రమం చూడటానికి మరికొన్ని లక్షల మంది అక్కడికి చేరుతున్నారు. ఈ కార్యక్రమాన్ని స్వయం సైనిక్ దళ్ (ఎస్ఎస్డి) అనే స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తోంది! ఇప్పుడు ఈ ఏప్రిల్ 14న జరగబోయే కార్యక్రమం బౌద్ధ భిక్షు ప్రజ్ఞారత్న ఆధ్వర్యంలో జరుగుతుంది. వీరు పోరుబందర్లోని గ్రేట్ అశోకా బౌద్ధ విహార్ నుండి వచ్చి ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. అక్కడి వారందరితో బుద్ధదీక్ష ఇప్పిస్తారు. కార్యక్రమాలు ఈ విధంగా కొనసాగితే, రాబోయే రెండేండ్లలో అంటే 2025 నాటికి ఒక కోటి మంది దీక్ష తీసుకుంటారని దీని వెనక కృషి చేస్తున్న స్వయం సైనిక్ దళ్ ఆశిస్తోంది.
ప్రభుత్వం వివిధ మతాల మధ్య విద్వేషాలు రగిలించడం మాత్రమే కాదు, హిందూ మతస్థుల మధ్య కూడా కలహాలు సృష్టిస్తోంది. బలవంతంగా హిందూత్వను ప్రజల మీద రుద్దడం వల్ల ఫలితాలు వ్యతిరేకంగా వస్తున్నాయి. హిందూ మతంలోని ఎగుడు దిగుళ్ళని, నిచ్చెన మెట్ల కుల సంస్కృతిని బలపర్చడం, మహిళల హక్కులు, మానవ హక్కులు హరించడం ఈ దేశ ప్రజలు భరించలేకపోతున్నారు. మనుధర్మ శాస్త్రాన్ని మన ప్రాచీన రాజ్యాంగం అంటూ నెత్తికెత్తుకోవడం, దేశ ద్రోహులైన గాడ్సే, సావర్కర్ల స్థాయి అనూహ్యంగా పెంచడం - ఈ దేశ ప్రజలకు నచ్చడం లేదు. నీతిలేని, చదువులేని ప్రబుద్ధులంతా మహా నాయకులై వెలిగిపోవడం - అధర్మమే ధర్మంగా చలామణి అవుతూ ఉండటం - ఈ దేశ ప్రజలకు కష్టంగా ఉంది. అందుకే వేల సంఖ్యలో జనం బుద్ధ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దీన్ని హిందూ దేశంగా మార్చాలని కలలు కంటున్న నేటి పాలకులకు, లక్షల మంది హిందూ మతాన్ని త్యజించడం - ఒక చెంప పెట్టుకాబోతోంది!
అధికారంలో ఉన్న వారు ఉగ్రమార్గాన్ని వెతుక్కుంటూ ఉంటే దానికి ధీటైన సమాధానం చెప్పగల సమతా మార్గాన్ని, నైతిక రుజుమార్గాన్ని సామాన్య ప్రజలు వెతుక్కుంటున్నారు. దేవుడనే రాముడి బూచీ చూపించి పాలకులు రాజకీయాలు చేస్తుంటే... అసలు దేవుడనేవాడే లేడన్న బుద్ధ మార్గాన్ని ప్రజలు ఇష్టపడుతున్నారు. శోభాయాత్రల పేరుతో పాలకులు అల్లర్లు, కల్లోలాలు ప్రోత్సహిస్తుంటే... మనసు ప్రశాంతంగా ఉంచుకుని సర్వ జనాభ్యుదయాన్ని కాంక్షించే బుద్ధమార్గాన్ని జనం కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్య నాయకులంతా ఆ రాష్ట్రం వారే. బ్యాంకులు దోపిడీ చేసి పారిపోయిన దొంగలంతా అక్కడివారే. అలాంటి గుజరాత్ రాష్ట్రంలో సామాన్యుల ఆలోచనలు ఎలా ఉన్నాయో ఈ కార్యక్రమం తేటతెల్లం చేస్తుంది. అబద్దాలతో అధికారంలో ఉందామనుకున్న వారికి బదులుగా - అబద్ధం ఆడరాదనీ, దొంగతనాలు చేయకూడదని చెప్పిన బుద్ధ మార్గాన్ని గుజరాత్ ప్రజలు కావాలనుకుంటున్నారు. ఇది ఎంతో ఆహ్వానించతగిన పరిణామం. మనం బతుకుదాం. మరొకరిని బతకనిద్దాం. మొత్తానికి మొత్తంగా మనిషిని బతికించుకుందాం - అనే సూత్రానికి కట్టుబడ్డ సామాన్యుల చైతన్యం చాలా గొప్పది. వెలుగు వెంట నీడలుండటం కాదు, నీడల్ని మాయం చేయగల వెలుగులు అక్కడ దేదీప్యంగా ప్రసరిస్తున్నాయి.
హిందూమతంలోని పూజలు, భజనలు, పాపాలు, పుణ్యాలు, ఆత్మలు, పునర్జన్మలు, ఆచారాలు, సంప్రదాయాలు వీటన్నిటి కంటే ముఖ్యంగా ఉన్నతులు, నిమ్నవర్గాలు - వంటివన్నీ మూఢనమ్మకాల పుట్టలు. వీటిలో వేటికీ ఆధారాలు లేవు. నిరూపణలు లేవు. కేవలం విశ్వాసాల ఆధారంగా శతాబ్దాలుగా కొనసా గుతూ మానవుల జీవితాలు దుర్భరం చేస్తున్నాయి. అందుకే, వాటన్నింటినీ వదిలి స్వేచ్ఛాలోచనకు, మానవ వాదానికి, విశ్వ మానవ సౌభ్రాతృత్వానికి విలువనివ్వాలని స్వయం సైనిక్ దళ్ ప్రచారం చేస్తుంది. మనుషుల్ని ఎగుడు దిగుడు స్థాయిలో ఉంచి, వివక్ష చూపుతున్న హిందూ ధర్మాన్ని తిరస్కరించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం. ఆనాడు అంబేద్కర్ చేసిందే ఆదర్శంగా తీసుకుని, ఈ రోజు దేశంలో లక్షల మంది బౌద్ధం స్వీకరిస్తున్నారు. మనుషులందరిదీ ఒకే స్థాయి అని నినదిస్తున్నారు. ఎవరి జ్ఞానాన్ని వారు ఎవరి వివేకాన్ని వారు తట్టిలేపుకోవాలని, నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించాలని, బుద్దిని ఉపయోగించాలని స్వయం సైనిక్ దళ్ జనానికి బోధిస్తోంది. దీక్ష తీసుకునే విషయంలో ఎవరూ ఎవరినీ బలవంతం చేయడం లేదు. ఎవరూ ఎవరినీ ప్రభావితం చేయడం లేదు. ఎలక్షన్లలో మాదిరిగా ఎవరూ ఎవరినీ డబ్బుతో లొంగదీసుకోవడం లేదు. స్వచ్ఛందంగా ఇలాంటి పని ఆలోచనా పరులే చేస్తారు. అదీగాక, ఇది - పూజలో మంత్రాలు వల్లెవేసి మతమార్పిడి చేసేతంతు కాదు. అసలు బౌద్ధం-మతేమే కాదు! అదొక జీవన విధానం!! బద్ధుడి బోధనలు పూర్తిగా స్వీకరించి, అందుకు అనుగుణంగా తమజీవన విధానం మార్చుకుంటారు. అంతే - ఇది న్యాయ సమ్మతంగా, చట్టబద్ధంగా, మనస్ఫూర్తిగా చేయవల్సిన పని! దీక్ష తీసుకునే వారు వారి వారి కలెక్టర్ ఆఫీసుల్లో అప్లికేషన్లు నింపాలి. ఆ తర్వాత అందులో ప్రకటించిన వన్నీ నిజాలా కాదా - అనేది పోలీసు ఎంక్వయిరీ జరుగుతుంది. దీక్ష తీసుకున్న వారి వివరాలన్నీ గజిట్లో అచ్చేస్తారు. ఇదంతా అధికారికంగా జరిగే కార్యక్రమం.
ఈ స్వయం సేవక్ దళ్ ఎప్పుడు ఏర్పడింది? ఏయేం పనులు చేస్తుందో చూద్దాం... తొలుత 2006లో ఇది యాభైమందితో ఏర్పడింది. ఒకే ఆలోచనా విధానం గల మిత్రులయిన దళిత కార్యకర్తలతో మొదలైంది. ఆ సంఖ్య క్రమంగా ఊహించని రీతిలో పెరుగుతూ పోయింది. ఈ స్వయం సైనిక్ దళ్లో ఎవరు చేరవచ్చు? అంటే - నిచ్చెనమెట్ల సంస్కృతిని తిరస్కరించే వారంతా చేరొచ్చు. అందరికీ సమానమైన స్థాయి, హక్కులు, బాధ్యతలు కావాలనుకునే వారు చేరొచ్చు. మనుషులంతా ఒక్కటే అన్న భావన గలవారే ఈ స్వయం సైనిక్ దళ్ సభ్యులవుతారు. వీరిలో కొందరు నాయకులు, మరికొందరు కార్యకర్తలు అనే హెచ్చుతగ్గులుండవు. కలిసి మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి చింతన శిబిరాలు ఉంటాయి. అందులో అందరూ సమానమే. కొందరు వేదిక మీద ఉండి ఉపన్యసించడం, మరికొందరు వేదికముందుండి వినడం ఉండదు. ఏదో ఒక మైదానంలో అందరూ నేల మీద కూర్చుంటారు. ఎక్కడి వారు అక్కడే నిలబడి మాట్లాడుతారు. అందరూ సమానమనే భావన - బాధ్యత అందరిదీ అనే భావన - అక్కడ ఉన్నవారందరిలో కలుగుతుంది. స్వయం సైనిక్ దళ్ సభ్యులు ఆకుపచ్చ దుస్తులు ధరిస్తారు. ట్రాఫిక్, రవాణా, వైద్య రంగాలకు సంబంధించి ప్రాథమిక పరిజ్ఞానం కలిగి ఉంటారు. సామాన్య పౌరులకు ఏ ఇబ్బంది కలగకుండా ఇదే రోజు ఒక మహార్యాలీ కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చేవారి కోసం 800ల బస్సులు, 5వేల కార్లు ఏర్పాటు చేసుకున్నారు. గాంధీనగర్ విధాన సభ ముందున్న అంబేద్కర్ విగ్రహం దగ్గర 22 ప్రతిజ్ఞలు చేస్తారు. ఈ ర్యాలీ ఉద్దేశమే మంటే... సామాన్య పౌరుల్లో చేతనత్వాన్ని కలిగించడం. బుద్ధమార్గంలోకి రావాలనుకునే వారిని ఆహ్వానించడం ఏ నిర్ణయమూ తీసుకోలేక కొట్టుమిట్టాడు తున్న వారికి ఒక ఉత్తేజాన్ని కలిగించడం. దిశానిర్దేశం చేయడం.
ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి రోజున ఇలాంటి దీక్షలు ఢిల్లీ, కోల్కత్తా, బెంగుళూర్, భోపాల్, ముంబాయి, హైదరాబాద్, లక్నో వంటి పెద్ద పెద్ద నగరాలలో జరపాలని స్వయం సైనిక్ దళ్ పథకాలు వేసుకుంది. రాబోయే కాలంలో బుద్ధ దీక్ష కార్యక్రమాలు దేశంలో ఇంకా పెద్ద ఎత్తున జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మోసం, దగా నిత్యకృత్యాలై జీవితాలు దుర్భరమై పోతున్న ఈ రోజుల్లో... కేవలం బౌద్ధమే నైతిక మార్గం చూపగలదని, ప్రజల మానసిక ఆరోగ్యం కాపాడగలదని, మానవ జాతిని రక్షించగలదని మానవ ప్రేమికులంతా భావిస్తున్నారు. మానవవాదు లంతా ఆశిస్తున్నారు. ఈ దేశ ప్రజలు మానవీయ విలువల పరిరక్షణ కోరుకుంటున్నారని - ఈ సంఘటన చెప్పకనే - బలంగా చెపుతోంది!!
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడమీ
అవార్డు విజేత, జీశశాస్త్రవేత్త.