Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వర్గలోకంలో దేవేంద్రుడు కొలువుదీరి ఉన్నాడు. అష్టదిక్పాకులతో మంతనాలు సాగిస్తున్నాడు. పాలనా పద్ధతులపై సభలో తీవ్రమైన చర్చ జరుగుతున్నాయి. అకస్మాత్తుగా ఇంద్రుడు సింహాసనంపై నుండి లేచి నిలబడ్డాడు. చేతులు జోడించి సభాద్వారం వద్దకు వెళ్ళాడు. ద్వారం వద్ద అంబేద్కర్...
''మహానుభావా! మీ రాకకు కారణమేమి? రండి నా స్థానంలో ఆసీనులు కండి! మీ అధ్యనానికేమీ భంగం కలుగలేదు కదా! ''మా గురువు బృహస్పతుల వారే మీ జ్ఞాన సంపదను కొలవదగ్గ సూచికలు లేవని చెబుతుంటారు!'' అన్నాడు దేవేంద్రుడు.
''మరేం లేదు దేవేంద్రా! నా పుట్టిన రోజు సందర్బంగా నా దేశానికి వెళ్ళిరావలెనని మనసు పరితపిస్తున్నది!'' అన్నాడు అంబేద్కర్.
''ఆవశ్యం! మీ కోరిక తీర్చటం నా బాధ్యత! మీకు తోడుగా నేను వచ్చుటకు అనుమతివ్వగలరా?'' అన్నాడు దేవేంద్రుడు.
అంబేద్కర్ నవ్వుతూ వద్దన్నట్లు తలూపాడు!
''అంబేద్కరా! మీకు తోడుగా వచ్చుటకు నాకైనా అనుమతించండి!'' అంటూ వచ్చాడు నారదుడు.
సరేనన్నాడు అంబేద్కర్. ఇద్దరూ కలసి భారతదేశానికి వచ్చారు. ముందుగా ఈశాన్య రాష్ట్రాలను సందర్శిస్తూ ముందుకు సాగారు.
ఈశాన్య రాష్ట్రాలు, అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి అంబేద్కర్ ఆవేదన చెందాడు.
''ఈశాన్య రాష్ట్రాలను ప్రత్యేక శ్రద్ధతో చూడాలని నేను ఎంతో అభిలషించాను. కాని అదేం జరగలేదు!'' అన్నాడు నారదుడితో.
నారదుడు మౌనంగా ముందుకు సాగాడు. ఢిల్లీకి చేరుకున్నారు. వర్తమాన పరిస్థితులను అంబేద్కర్కి వివరించాడు నారదుడు.
''ఏమిటిది? ప్రభుత్వరంగ సంస్థలను అమ్మవలసిన అవసరం ఏముంది?'' ప్రశ్నించాడు అంబేద్కర్.
''బడ్జెట్లో నిధులు సమీకరించుకునుటకు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతున్నారు!'' అన్నాడు నారదుడు.
''లక్షల కోట్లు సమీకరించుకోగలిగిన సహజ వనరులు ఉన్న దేశంలో కేవలం వేల కోట్ల రూపాయల కోసం ప్రభుత్వరంగ సంస్థలు అమ్ముకుంటారా ఎవరైనా?'' అన్నాడు.
''ఇంకెక్కడి సహజవనరులు స్వామీ; ఖనిజాలు, బొగ్గు, వజ్రాలు, అడవులు, ఆఖరికి మంచినీళ్ళు కూడా మిగలకుండా ఆదాని గుత్తసొత్తుగా మారిపోతున్నాయి!'' అన్నాడు.
''సహజవనరులు ఈ జాతి సంపద! దానిపై ఈ దేశ ప్రజలకు మాత్రమే అధికారం ఉంటుంది! అదానీ ఎవరు? అతనికేం హక్కు ఉన్నది?'' అన్నాడు అంబేద్కర్ ఆగ్రహంగా.
నారదుడు ఉలిక్కిపడ్డాడు! భయంగా అటూ, ఇటూ చూశాడు.
''ఎందుకు భయపడుతున్నావు!'' ఆశ్చర్యంగా అడిగాడు అంబేద్కర్.
''ఈ దేశంలో గాంధీనీ, నెహ్రూను, నిన్ను ఎవరైనా ఏమైనా అనొచ్చు! అవమానించుతారు కూడా! కాని అదానీని ఒక్కమాట కూడా అనకూడదు! అన్నారో దాని ఫలితం అనుభవిస్తారు! ఈ దేశ ప్రతిపక్ష నాయకుడైన రాహుల్గాంధీ, అదానీ ఆస్తులపై చర్చ జరగాలని అన్నందుకే ఆయన్ను ఎన్నికల్లో పాల్గొనకుండా చేస్తున్నారు'' అన్నాడు నారదుడు.
''ఏమిటీ దౌర్భాగ్యం! ప్రతిపక్ష నాయకుడికే భావప్రకటనా స్వేచ్ఛ లేకుండా పోయిందా? ఇక మనమెందుకిక్కడీ పద పోదాం'' అన్నాడు అంబేద్కర్.
నారదుడు దారితీశాడు. తోవలోని ప్రాంతాలు, రాష్ట్రాల విశేషాలు వివరిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ చేరుకున్నారు.
ఉత్తరప్రదేశ్ వివరాలు విని అంబేద్కర్ చలించిపోయాడు.
దేశంలో కెల్లా విద్య అట్టడుగు స్థానంలో ఉంది! దళితులపై దాడులను చూస్తుంటే, స్వాతంత్య్రం కంటే ముందు స్థితి ఉన్నట్లు కన్పిస్తున్నది! దళితులపై దాడులు, అత్యాచారాలు చేసి వారికి సన్మానాలు చేసి సంస్కృతి ఇక్కడ నెలకొన్నది! ఇదేనా నేను ఆశించిన వ్యవస్థ! మనుషుల కన్నా జంతువులకే ఎక్కువ గౌరవం దక్కుతున్నది! మనుషుల ప్రాణాలకు విలువే లేదా! దళితులు పశువుల కన్నా హీనమా? ఇక్కడ ప్రజాస్వామ్యమున్నదా?'' అంటూ ఆవేదన చెందాడు అంబేద్కర్.
''మీరన్నది నిజమే! నాగరిక సమాజంలో ముందుగా మనుషులకు హక్కులుండాలి. ఆ తర్వాత జంతువులకు, పక్షులకు ఉండవచ్చు. కాని మనుషులకున్న హక్కులను రద్దుచేసి, జంతువులకు హక్కులు కల్పించటం ఇక్కడే చూస్తున్నాము'' అన్నాడు నారదుడు.
''ప్రజాస్వామ్యానికి, అణగారిన వర్గాలకు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ.. రాజ్యాంగంలో అనేక ఆర్టికల్స్ను, సెక్షన్లను పొందుపర్చాను. పరిపాలన సమున్నతంగా జరగటానికి, పార్లమెంటు, ఎన్నికల కమిషన్, జ్యుడిషియరీ, సిబిఐ, ఈడి, కాగ్ లాంటి వ్యవస్థలకు రూపకల్పన చేశాను. ఈ వ్యవస్థలన్నీ సమన్వయంతో పనిచేయటానికి అవసరమైన విధి విధానాలు రూపొందించాను'' అన్నాడు అంబేద్కర్.
''అయ్యా! మీరు ఎంతో ముందు చూపుతో ప్రపంచంలోనే అతి గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించారు. కాని ఆ వ్యవస్థలన్నీ అస్తవ్యస్థంగా తయారయ్యాయి! రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయటానికి సిబిఐ, ఈడి లాంటివి ఆయుధాలుగా వాడుకుంటున్నారు. కాగ్ నివేదికలు పార్లమెంటులో ప్రవేశపెట్టడమే మానేశారు! బడ్జెట్ మీద కూడా చర్చలు లేవ!'' అన్నాడు నారదుడు.
చర్చలు చేయకుండా బడ్జెట్ ఆమోదించటం ఏమిటి? ఇది రాజు గారి పరిపాలనా? ఆధునిక ప్రజాస్వామ్యం లో ఇది ఎంత మాత్రం సహించరానిది!'' అన్నాడు అంబేద్కర్.
''మీరిలా ప్రజాస్వామ్యం అంటున్నారనే, మీరు రాసిన రాజ్యాంగాన్ని కాదని మనుస్మృతే మా రాజ్యాంగం అంటున్నారు కొందరు!''
''ప్రజాస్వామ్య కాలంలో మనుస్మృతి అమలు చేస్తారా? ఆ మనుస్మృతిని నేనెప్పుడో తగలపెట్టాను కదా!'' అన్నాడు అంబేద్కర్ నవ్వుతూ.
''అయ్యో! స్వామీ! మీరు తగలబెట్టిన దానినే తలకెత్తుకుంటున్న ఉన్మాదుల సంఖ్య పెరుగుతున్నది!'' అన్నాడు నారదుడు.
అంబేద్కర్ ఆలోచిస్తూ ముందుకు సాగాడు. కొంత దూరం ప్రయాణించాక ''అంబేద్కరా! అటు చూడండి!'' అంటూ ఎంతో ఆనందంతో అరిచాడు నారదుడు.
నారదుడు చూపిన దిక్కుకు దృష్టి సారించాడు. అంబేద్కర్.
''125 అడుగుల భారీ విగ్రహం! విహ్రం కాదది విప్లవం! దేశంలో కెల్లా ఇదే మీ పెద్ద విగ్రహం! తెలంగాణ ముఖ్యమంత్రికి మీ మీదున్న ప్రేమకు నిదర్శనం. అంతే కాదు! ఆ రాష్ట్ర సెక్రెటేరియట్కు కూడా మీ పేరే పెట్టారు!... అని చెప్పుకుంటూపోతున్నాడు నారదుడు.
''ఆపు! నారదా! నేనెప్పుడో చెప్పాను. నేను విగ్రహాల్లో లేను. పుస్తకాల్లో మాత్రమే ఉంటానని. అందుకేని నా విగ్రహాలను చూస్తే నాకేమీ ఆనందం కలగదు. పైగా బాధ కలుగుతుంది! అన్నాడు అంబేద్కర్.
''మీ విగ్రహం లాగానే ఎందుకుచూడాలి. మీ మూర్తి ద్వారా స్ఫూర్తి పొందటానికి అని ఎందుకనుకోరాదు!'' అడిగాడు నారదుడు.
''నా విగ్రహాల ద్వారా ప్రజలు స్ఫూర్తి పొందితే చాలదు. పాలకులు నా రాజ్యాంగం ద్వారా స్ఫూర్తి పొందాలి. రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ద్వారా భావ ప్రకటనా స్వేచ్ఛను, యూనియన్లు పెట్టుకునే హక్కును కల్పించాను. కాని తెలంగాణలో గత మూడేండ్లుగా ఆర్టీసీ కార్మికులు యూనియన్లు లేకుండా నియంతృత్వపు ఉక్కుపాదాల కింద నలిగిపోతున్నారు! దీన్ని ఏవిధంగా చూస్తావు! నారదా?'' ఆవేదనగా ప్రశ్నించాడు అంబేద్కర్.
నారదుడు తలదించుకున్నాడు.
నా రాజ్యాంగం అలంకార ప్రాయం కాదు! ఆచరణాత్మకం. ప్రజల సొమ్ము అపన్నంగా అస్మదీయుల ఖజానాకు తరలిస్తూ అవినీతి లేదంటూ నీతి సూత్రాలు వల్లెవేయటం, సహజ వనరులన్నీ దోస్తుల పేరు మీద దఖలు పర్చటం, ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మి, నేను కల్పించిన రిజర్వేషన్లను తుంగలో తొక్కటం, ఏకంగా రాజ్యాంగం స్థానాన మనుస్మృతిని ప్రతిష్టిస్తామని ప్రగల్భాలు పలకటం, రాజ్యాంగ వ్యవస్థలను నీరుగార్చటం, సంపద సృష్టికర్తలైన కార్మికులు, రైతుల కోసం చేసిన చట్టాలు రద్దుచేసి, యాజమానులు, కార్పొరేట్లలకు గులాంగీరి చేసే చట్టాలు చేయటం ఇవన్ని భారత జాతికి ద్రోహం చేసే చర్యలు. రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలు'' అన్నాడు అంబేద్కర్ ఆగ్రహంగా.
''కానీ స్వామీ! ఇవన్నీ మీరు కల్పించిన ఓటు ద్వారా గెలిచిన పార్టీలే చేస్తున్నాయి! కదా!'' అన్నాడు నారదుడు.
''అవును అందుకే నేను ముందు చెప్పాను. ఓటు హక్కు, రాజ్యాంగం రెండు గొప్పవి. అయితే అవి వరించి వారి చేతిలో ఉన్నప్పుడే సాధ్యం. అందుకే ప్రజలు ఇప్పటికైనా ఓటుహక్కుతో మంచివారిని అధికారంలోకి తెచ్చుకోవాలి! లేకుంటే భారత దేశం మధ్య యుగాల్లోకి వెళుతుంది. మళ్ళీ ముంతా, చీపురూ తప్పవు!'' అంటూ అంబేద్కర్ మాయమైపోయాడు.
నారదుడూ మాయమైపోయాడు.
(హిందూ మతాన్ని త్యజించి, బౌద్ధుడిగా నిలిచిన అంబేద్కర్కి క్షమాపణతో...)
- ఉషాకిరణ్