Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'జైహింద్' అనే నినాదాన్ని ఆరెస్సెస్, జనసంఫ్ు, బీజేపీ వారెవరూ సృష్టించలేదు. దేశభక్తి, దేశభక్తి - అని గొంతులు ఎండిపోయే విధంగా అరచి గీపెడుతున్న వారికి ఎవరికీ ఆ ఆలోచనే రాలేదు. దేశం గర్వించదగ్గ ఏ చిన్న పనీ వారు చేసింది లేదు. అయితే, మరి ఆ పని ఎవరు చేశారూ? జైహింద్ - అనే మాటను ఎవరు వాడుకలోకి తెచ్చారూ?.. అవి, స్వాతంత్య్ర పోరాటం సాగుతున్న రోజులు! సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీని రూపొందించుకున్న రోజులు. ఆ ఆర్మీలో దేశంలోని భిన్న ప్రాంతాల వారు ఉండేవారు. పరిచయస్తులు, మిత్రులు ఎవరైనా కలిస్తే వారు వేరు వేరు రకాలుగా అభివాదం చేసుకునేవారు. కొందరు 'నమస్కార్' అని, మరికొందరు 'రామ్రామ్' అని, ఇంకొందరు 'అస్సలాము అలైకుం' అని సంభోదించుకునేవారు. సుభాష్చంద్రబోస్ సెక్యులర్ భావాలు కలిగిన వాడు గనక, తన ఆజాద్ హింద్ ఫౌజ్ (ఆర్మీ)లో ఇన్ని రకాల పలకరింపు (విష్)లు ఉండటం ఆయన ఇష్టపడలేదు. దేశభక్తి ఉట్టిపడేలా, దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా అందరూ ఒకేరకంగా పలకరించు కోవాలని ఆయన కోరుకున్నారు. అందుకు ఒక మాటను, లేదా నినాదాన్ని రూపొందించమని మిత్రు లకు, తన ఆర్మీలో ఉన్న ముఖ్యులకు సూచించారు.
అలా ఎందరో ఎన్నెన్నో రకాలైన మాటలు సూచించారు. తన నేషనల్ ఆర్మీలో మేజర్గా పనిచేసే ఒక వ్యక్తి ఒకరోజు వచ్చి - ఒకరికొకరు ఎదురుపడ్డప్పుడు 'హలో' అని పలకరించుకోవాలని సూచించాడు. సుభాష్చంద్రబోస్కు అది నచ్చలేదు. ఎందుకంటే అది మన దేశానికి సంబంధించిన పలకరింపు కాదు. ఆ మాట ఇతర దేశాలలో కూడా ఉంది. ఒకరికొకరు అభివాదం చేసుకోవడానికి ఎలాంటి మాట కావాలో బోస్ అతనికి మరొకసారి వివరించాడు. అంతే... ఆ మేజర్ మరో రెండు మాటలు చెప్పాడు. ఒకటి 'జై హిందుస్థాన్' అని, మరొకటి 'జైహింద్' అని వినగానే జైహింద్-అన్నది బోస్కు బాగా నచ్చింది. చిన్న మాటయినా అది బలంగా ఉందనిపించింది. జైహింద్ - అంటే భారతదేశానికి జయము కలుగుగాక అని అర్థం. అప్పటి స్వాతంత్య్రోదమ కాలానికి అది బాగా సరిపోతుందని అనుకున్నారు బోస్. అదే జైహింద్ అనే మాటను తన నేషనల్ ఆర్మీలో ప్రవేశపెట్టారు. ఆ మాటలో స్వాతంత్య్రం సంపాదిస్తామన్న ఆత్మవిశ్వాసం ఉంది. దేశభక్తి ఉంది. పలకడానికి సుళువుగా ఉంటూనే, మనోబలాన్ని పెంచే బలం కూడా ఆ మాటలో ఉంది. సుభాష్చంద్రబోస్ అన్నీ బాగా ఆలోచించి తన ఉపన్యాసాలలో కూడా ఆ మాట తరచూ ఉపయోగించేవారు. ఆ విధంగా 'జైహింద్' అనతి కాలంలో ఒక జాతీయ నినాదం అయ్యింది.
ఇంతకూ 'జైహింద్'కు రూపకల్పన చేసిన ఆ నేషనల్ ఆర్మీ మేజర్ ఎవరూ? అంటే - ఆయన మన తెలంగాణ - హైదరాబాదువాడే. పేరు ఆబిద్ హసన్ సఫ్రానీ. చిన్నప్పటి పేరు జైనుల్ ఆబిదీన్ హసన్. చిన్నప్పుడే ఆనాటి శాసనోల్లంఘన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. దానితో చదువు ఆగిపోయింది. కొంతకాలం తర్వాత ఇంజనీరింగ్ చదువుదామని జర్మనీ వెళ్ళాడు. అక్కడే నేతాజీని కలుసుకున్నాడు. అప్పుడు బోస్ జర్మనీలోనే ఉన్నారు. అప్పుడే ఆబిద్ జీవితం మలుపు తిరిగింది. చివరిదశలో ఉన్న ఇంజనీరింగ్ కోర్సు వదిలేసి, బోస్కు వ్యక్తిగత కార్యదర్శిగా చేరాడు. అప్పటికే జర్మన్ భాషపై కొంత పట్టు సాధించడం వల్ల, జర్మన్ భాష అనువాదకుడిగా కూడా నేతాజీకి సహాయపడ్డాడు. ఇండియాకు తిరిగి వచ్చాక ఇక్కడ ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఆజాద్ హింద్ ఫౌజ్)లో 1942-45 మధ్య ఆబిద్ హసన్ మేజర్గా పనిచేశాడు. ఆ తర్వాత ఐ.ఎఫ్.ఎస్. (ఇండియన్ ఫారెన్ సర్వీసు) సాధించాడు. 1948-1969 మధ్య కాలంలో డెన్మార్క్కు, ఆ తర్వాత ఈజిప్టుకు భారత రాయబారిగా సేవలు అందించాడు. 5 ఏప్రిల్ 1984న హైదరాబాద్లోనే తన డెబ్బయి రెండవ యేట కన్నుమూశాడు. జీవితాన్ని దేశభక్తికి అర్పించిన మహౌన్నతుడిగా నిలిచిపోయాడు.
'జైహింద్' నినాదానికి రూపకల్పన చేయడమే కాదు, ఆయన గొప్పతనాన్ని శ్లాఘించడానికి మరో విశేషం కూడా ఉంది. ఆజాద్ హింద్ ఫౌజ్లో ఉన్నప్పుడే ఆబిద్ హసన్ తన పేరుకు ''సఫ్రానీ'' అని తగిలించుకున్నాడు. సాఫ్రాన్ అంటే కాషాయరంగు. దాన్ని హిందువులు పవిత్రమైందిగా భావిస్తారు గనక, దాన్ని ఆయన స్వీకరించి తన పేరుకు చివర 'సఫ్రానీ' అని చేరుకున్నాడు. మత సామరస్యానికి గుర్తుగా, హిందువుల పట్ల తన సోదరభావాన్ని ప్రకటించుకోవడానికి ఒక ముస్లిం యువకుడు ఆ నిర్ణయం తీసుకున్నాడు. మధ్యలో కొంతకాలం కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నా అందులో ఎక్కువ కాలం ఉండలేదు. దేశ విభజన జరిగి పాకిస్థాన్ విడిపోయిన తర్వాత ఐఎఫ్ఎస్ పూర్తిచేయడానికి తన పూర్తి సమయం కేటాయించాడు. నేతాజీ సుభాష్చంద్రబోస్కు కార్యదర్శిగా ఉన్న రోజుల్లో ఆబిద్ ఆయన వెన్నెంటే ఉండేవారు. ఆయన నౌకలో ఏ దేశం వెళ్ళినా, వెంట వెళుతూ ఆయనను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునేవాడు. తర్వాత కాలంలో నేతాజీకి ఆబిద్ హసన్కు చుట్టరికం కూడా కలిసింది. నేతాజీ మేనల్లుడు అరబిందో బోస్ - ఆబిద్ హసన్ అన్న కూతురు సురయా హసన్ను పెండ్లి చేసుకున్నాడు. ఆబిద్ హసన్ అన్న బద్రల్ హసన్ గాంధీజీతో కలిసి పనిచేసినవాడు. ఇక్కడ సురయా హసన్ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పుకోవాలి. 1928లో పుట్టిన సురయా ఆ రోజుల్లో కేంబ్రిడ్జి యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ టెక్స్టైల్ డిజైనింగ్లో పట్టా తీసుకుని వచ్చింది. హైదరాబాద్లోనే స్థిరపడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తన వ్యాపారం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించుకుంది. అంతరించి పోతున్న ఒకనాటి చేనేత కళని పునరుద్ధరించింది. బిద్రి, హిమ్రు, ఇక్కల్, కలంకారీ వంటి వాటిని గద్వాల్, ఉప్పాడ వంటి వస్త్రాల్ని ఇక్కడి నుంచే ఖండాంతరాలకు అందించింది. కాంగ్రెస్ కార్యకర్తగా, ఖాదీ ఉద్యమకారిణిగా జీవితాంతం కృషి చేసిన ఆమె, ఇటీవల 2021లో హైదరాబాద్లో తుదిశ్వాస వదిలింది.
సైన్యంలో మేజర్గాను, విదేశాలలో భారత రాయబారిగానూ పనిచేయడమే గాక, ఆబిద్ హసన్కు ఉరుదూ, పర్షియన్ కవిత్వమంటే చాలా చాలా ఇష్టంగా ఉండేది. విశ్వకవి 'జనగణమన అధినాయక జయహే' గీతాన్ని ఆయన హిందుస్థానీలోకి అనువదించాడు. హిందీ-ఉర్దూలు కలిసి ఏర్పడిందే హిందూస్థానీ భాష. ''శుఖ్ సుఖ్ చైన్ కి బార్ ఖా బర్ సే''గా అది చాలా ప్రాచుర్యం పొందింది. దానికి కెప్టెన్ రామ్సింగ్ ఠాకూరి సంగీతం సమకూర్చాడు. అయితే అది మిలట్రీ మార్చింగ్ సాంగ్లా ఉంటుంది. దీనికి కూడా మళ్ళీ ఒక ప్రాధాన్యత ఉంది. 15 ఆగస్టు 1947న దేశానికి స్వాతంత్య్రం లభించిన మరునాడే నాటి తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎర్రకోట మీద మన మువ్వన్నెల జెండాను ఎగరేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సందర్భంలో ఆ కార్యక్రమానికి కెప్టెన్ ఠాకూరిని ఆయన మ్యూజిక్ బ్యాండ్ని నెహ్రూ ఆహ్వానించారు. స్వతంత్ర భారత దేశంలో తొలిసారి ఎర్రకోట దగ్గర ఆబిద్ హసన్ గీతం, కెప్టెర్ ఠాకూరి సంగీత సారధ్యంలో ప్రపంచానికి వినిపించడం జరిగింది.
ఆబిద్ హసన్ సఫ్రానీ 'జనగణమన' గీతాన్ని హిందుస్థానీలోకి ఈ విధంగా అనువదించాడు. భావం, లయ ఏమాత్రం చెడకుండా అద్భుతంగా ఆవిష్కరించాడు...
శుభ్ సుఖ్ చైన్కి బర్ఖా బర్సే
భారత్ భాగ్ హై జాగా
పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా
ద్రావిడ్ ఉత్కళ్ వంగా
చంచల్ సాగర్ వింధ్య హిమాలరు
నీలా యమునా గంగా - తెరేనిత్ గుణ్ గాయే
తుర్aసే జీవన్ సాయె - సబ్ తన్ పాయే ఆశా
సూరజ్ బన్కర్ జగ్పర్ చమ్కే
భారత్ నామ్ సుభాగా
జయహౌ జయహౌ జయహౌ
జయ జయ జయహౌ భారత్ నామ్ సుభాగా
సబ్కె దిల్ మే ప్రీత్ బసాయె తెరీ మీఠా వాణీ
హర్ సూబేకొ రహనే వాలే హర్ మహజబ్ కె ప్రాణి
సబ్ ఖేద్ ఔర్ ఫరక్ మిటాకె
సబ్ గోద్ మె తెరీ ఆకే - గూంథే ప్రేమ్కి మాలా
సూరజ్ బన్ కర్ జగ్ పర్ చమ్కె భారత్ నామ్ సుభాగా
శుఖ్ సవేరే ఫంఖ్ పకేరే - తెరే హి గుణ్ గాయె
బాస్ భరీ భర్పూర్ హవాయేఁ
జీవన్ మె రుత్ లాయే
సబ్ మిల్కర్ హింద్ పుకారే
జరు ఆజాద్ హింద్కి నారే -
ప్యారా దేశ్ హమారా
సూరజ్ బన్కర్ జగ్పర్ చమ్ కే
భారత్ నామ్ సుభాగా జయహౌ జయహౌ
జయ జయ జయహౌ భారత్ భాగ్ హై జాగా
(శుభం, సుఖం, ప్రశాంతత వర్షాలై కురవనీ, భారతదేశపు భాగ్యం మేలుకుంది. పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా, ద్రావిడ్, ఉత్కళ్, వంగా - వింధ్య హిమాలయాల ఒడిలో యమునా గంగలు ఉవ్వెత్తున ప్రవహిస్తూ నీ గుణగణాల్ని కీర్తించనీ, ప్రతి ఉదయం అన్ని మతాల, అన్ని ధర్మాల వారు, వారి వారి హృదయాల్లో నీ తీయని మాటలే నిలుపుకోనిరు. భేదాభిప్రాయాలు, తేడాలు అంతమొందించుకున్న వారందరి ఒడిలో ప్రేమతో అల్లిన నీ పూలమాలలే ఉన్నాయి. భారతదేశం సూర్యుడిలా ప్రపంచానికి వెలుగు పంచనీ. ఉషోదయాల రెక్కలు నీ గుణగణాల్ని కీర్తిస్తున్నట్టు, వీస్తున్న గాలులు సమయానికి చక్కని రుతువులు తెస్తున్నట్టుగా ఉన్నాయి. అందరం కలిసి భారతావనికి విజయం కలగాలని జైహింద్ - అని జయ జయ హింద్ అని నినదిద్దాం! - సంక్షిప్త భావం)
గత చరిత్రలోంచి ఎలుగెత్తి సగర్వంగా చెప్పుకోవాల్సిన ఇలాంటి ఘట్టాలు మనం చెప్పుకోం! అనవసరమైన వాటికి ప్రాధాన్యమిస్తుంటాం!! ఇక సమకాలీనంలోనైతే అవివేకపు అంశాలే ఎంతో ప్రాధాన్యమైనవిగా ప్రభుత్వ పెద్దలు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. నిజాయితీగా ఆలోచించగల వారికి మాత్రమే ఈ విషయం బోధపడుతుంది!
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.