Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, నిలువ నీడ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. జీవించే హక్కును భారత రాజ్యాంగం కల్పించింది. పై మూడు లేకుండా మనిషి జీవంచలేడు. అమృతోత్సవాలు జరుపుకుంటున్న నేటి భారతంలో నీడ కోసం పేదలు గుడిసెలు పోరాటం చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 55 కేంద్రాలలో 100గజాల ఇంటి స్థలం కోసం ఎర్రజెండా నీడన సుమారు లక్షమంది పేదలు పోరాటం చేస్తున్నారు. ఈ భూ పోరాటం ప్రధాన మీడియా స్రవంతికి కనబడటం లేదు. ప్రజల జీవితాలకు సంబంధంలేని బూర్జువా పార్టీల నాయకుల తిట్ల పురాణాలే పతాక శీర్షికలు.
జనాభా పెరుగుతున్నది. పట్టణ జనాభా మరింత పెరుగుతున్నది. మనిషి సగటు జీవిత కాలం పెరిగింది. స్వాతంత్రానికి ముందు భారత జనాభా 34కోట్లు నేడు 141కోట్లు. స్వాతంత్రానికి ముందు మనిషి సగటు జీవిత కాలం 32సంవత్సరాలు నేడు 70సంవత్సరాలు. గ్రామాల్లో ఉపాధి కరవై పట్టణాలకు వలస వచ్చి అనేక రకాల చిన్న, చిన్న వృత్తులు చేసుకుంటున్న వారి సంఖ్య నూతన ఆర్థిక విధానాల కాలంలో విపరీతంగా పెరిగింది. దినసరి కూలీలు, అసంఘటితరంగా కార్మికులు, పెట్టి వెండర్స్ తమ ఆదాయంలో 30శాతాంకు పైగా ఇంటికి కిరాయికే పోతుంది. కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పేదలకు అందని ద్రాక్ష పళ్ళు అయ్యాయి.
ఇళ్ల స్థలాల కోసం జరుగుతున్న భూ పోరాటంలో పాల్గొంటున్న వారిలో నూటికి 90శాతం మంది మహిళలే. ఇల్లుతో, నీటితో మహిళలకే అనుబంధం ఎక్కువ. సామాజిక భద్రత, గౌరవం సొంత ఇంటితో కొంతైనా వస్తుంది. ఇంటి యజమానులతో సూటి పోటీ పాటలు ఎదుర్కొనేది మహిళలే. ఇంటిల్లిపాది పనికి వెళ్తే గాని కనీస అవసరాలు తీరని స్థితిలో కుటుంబంలో ఒకరు పనికి వెళ్తుంటే ఒకరు భూపారాటంలో పాల్గొంటున్నారు. చావులు లాంటి ఘటనలు సంభవిస్తే శవాన్ని ఇంటికి తీసుకురనివ్వరు. ఈ విషయంలో కూడా ఆర్థిక, సామాజిక స్థితిగతులను బట్టి అటు ఇటుగా వ్యవహారాలు ఉంటాయి. ఇటువంటి అంశాలకు తోడు కులవివక్షతో దళితులకు, గిరిజనులకు ఇల్లు కిరాయి ఇవ్వడం లేదు. ఇంటి యజమానులు కొందరు ప్రత్యక్షంగా ఎస్సీ, ఎస్టీలకు కిరాయికి ఇవ్వబడదు అని టు-లెట్ బోర్డులు పెడితే మరికొందరు శాఖాహారులకు మాత్రమే అని టు-లెట్ పెడతారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ముఖ్యంగా బదిలీలు అయిన సందర్భంగా కులవివక్ష కారణంగా ఇల్లు కిరాయికి దొరకక పడుతున్న మానసిక వేదన వర్ణనాతీతం.
ఏప్రిల్ మాసపు మండే ఎండలను లెక్కచేయకుండా మహిళలు భూ పోరాటంలో పాల్గొంటున్నారు. భూ పోరాట కేంద్రాలకు నాయకత్వం వహిస్తున్న సీపీఐ(ఎం) నాయకులు, ట్రేడ్ యూనియన్, వ్యవసాయ కార్మిక సంఘం, మహిళా సంఘం తదితర ప్రజా సంఘాల నాయకులు ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి. చంటి పిల్ల తల్లులు, వయసు పైబడిన వారు భూ పోరాట కేంద్రాలకు రావద్దని వారిస్తున్నారు. అయినప్పటికీ పోరాటంలో పాల్గొని మండుటెండలో తన బిడ్డకు పాలిస్తున్న మహిళను ఏంటమ్మా వద్దంటున్నా చిన్న పిల్లతో వచ్చావు, బిడ్డనైనా ఇంటిదగ్గర ఉంచి రావలసింది కదా అని భూకేంద్రానికి బాధ్యత వహిస్తున్న నాయకులు ప్రశ్నిస్తే ఆ చంటి బిడ్డ తల్లి నుండి వచ్చిన సమాధానం ''ఇంట్లో వదిలేసి వస్తే తాగి వచ్చే నా భర్త బిడ్డను ఏం చేస్తాడోనని భయమన్నా'' అని సమాధానం ఇచ్చింది. నెలల తరబడి ఇంటి స్థలం కోసం వేలాదిమంది పేదలు ముఖ్యంగా మహిళలు ఎండ, వాన, చలిని తట్టుకొని నిలబడుతున్నారు. పోలీసు, రెవెన్యూ యంత్రాంగం బెదిరింపులను, కేసులను లెక్కచేయకుండా పోరాడుతున్న పాలకులకు కనికరం లేదు. ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో భూకబ్జా దారులు దారి కాసి దాడులకు పాలుపడుతున్నారు. వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు.
భూ పోరాటానికి ముందు పేదలు అనేకసార్లు ఇంటి స్థలాలు కావాలని అధికారులకు దరఖాస్తులు పెట్టుకున్నారు. ప్రభుత్వ భూమిలేదని సమాధానం అధికారులు నుండి వచ్చేది. ప్రభుత్వ స్థలాలను గుర్తించి గుడిసెలు వేసుకున్న పేదలు సర్వే చేసి, అర్హులైన పేదలందరికీ పట్టాలు ఇవ్వాలని కోరుతున్నారు. పేదల భూ పోరాటాల వల్ల కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూములు రక్షించబడుతున్నాయి. ప్రభుత్వం ఎక్కడెక్కడ ఉన్నాయనేది గుర్తించబడుతున్నాయి. భూ కబ్జాదారులు ఇచ్చే లంచాలకు అలవాటుపడ్డ అధికార యంత్రాంగం, భూవేలం పాటలతో ఆదాయం పొందాలనుకుంటున్నా ప్రభుత్వ పెద్దలు పట్టాలు ఇవ్వడానికి సిద్ధపడటం లేదు. అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం నిర్మాణం పూర్తయిన ఇండ్లను కూడా కేటాయించడం లేదు. కొన్నిచోట్ల నిర్మాణాలు పూర్తిచేశారు. కరెంటు, నీరు, డ్రయినేజీ, రోడ్డు నిర్మించకుండా వదిలేశారు. మరికొన్నిటికి కిటికీలు, తలుపులు బిగించలేదు. పెయింటింగ్ వేయకుండా వదిలేసినవి మరికొన్ని. ఎన్నికలప్పుడు మాత్రం ప్రచారానికి బాగా ఉపయోగించుకుంటున్నారు. బుర్జువ పార్టీలు స్వర్గదామంగా చెప్పే అమెరికాలో లాగా ఖాళీ ఇండ్ల ఆక్రమణ తరహా పోరాటం రాకముందే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం వాగ్దానం చేసిన అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్, ఇంటి స్థలం ఉన్నవారికి రూ.లక్షలు ప్రభుత్వం ఇవ్వాలి. అలాగే ఇంటి స్థలం లేనివారికి స్థలంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షలు, కేంద్ర ప్రభుత్వం 10లక్షలు ఇవ్వాలని భూ పోరాటంలో పాల్గొంటున్న పేదలు కోరుతున్నారు.
అభివృద్ధికి ఆటంకమైన ప్రభుత్వ భూముల వేలం, రియల్ ఎస్టేట్ బూమ్నే అభివృద్ధికి నమునగా పాలకులు భావిస్తున్నారు. భూవేలం ద్వారా ప్రభుత్వం ఆదాయం పొందాలనుకుంటున్నది. ప్రభుత్వమే భూవేలానికి వెళ్లిన తర్వాత ప్రయివేటు భూముల ధరలు హద్దు, అదుపు లేకుండా పెరిగిపోయాయి. దీనికి బదులుగా ప్రభుత్వ భూమిని అర్హులైన పేదలకు కేటాయిస్తే లక్షలాది ఇళ్ల నిర్మాణం జరిగేది. తద్వారా స్టీల్, సిమెంట్, ఇటుక, ఇసుక తదితర సరుకుల డిమాండ్ పెరిగి, ఉపాధి పెరుగుదల, అభివృద్ధి, ప్రభుత్వానికి ఆదాయం పెరిగేది. కానీ ప్రభుత్వాల వర్గ స్వభావం ఈ పని చేయనీయదు. ప్రజాపోరాటాల ద్వారానే ఇల్లు, ఇళ్ల స్థలాలు సాధించాలి.
- జి. ముకుందరెడ్డి
సెల్:94900 98857