Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వీర తెలంగాణ రైతాంగ విప్లవ జ్వాల దొడ్డి కొమరయ్య. ఆ వీరుణ్ణి కన్న నేల కడవెండి. ఎందరో వీరుల కన్నతల్లి. ఆ ఒడిలోనే వీరత్వం తొలి పోద్దై పోడిచింది. సమసమాజ నిర్మాణం కలలు కన్నది. ఎర్రపూల వనమైంది. కడవెండి నెత్తుటి తడి ఆరకముందే రైతాంగ ఉద్యమం ఎరుపెక్కింది. సాయుధ పోరాటంగా కీలక మలుపు తిప్పింది. కొమరయ్య వీర మరణం ఉద్యమ బాటగా, కార్మివర్గ శ్రేయో రాజ్యం కోసం నిర్మితమౌతున్న పోరాటాలకు దిక్సూచిగా నిల్చింది. జూలై 4న దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా అనాటి పోరాట జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుందాం..
పోరాటాల పోతుగడ్డ వరంగల్ జిల్లా పాలకుర్తి మండలంలోని విస్నూర్ గ్రామాన్ని కేంద్రంగా దేశ్ముఖ్ రాపాక వెంకట రాంచంద్రారెడ్డి ఆరాచక పాలనలో ప్రజల బతుకులు దారుణంగా దెబ్బతిన్నాయి. దేశ్ముఖ్ ప్రజాకంఠకుడిగా ప్రజలచే కీర్తించబడ్డాడు. దేశ్ముఖ్ తల్లి జానమ్మ. దేవరుప్పుల మండలంలోని కడవెండి గ్రామంలో కొడుకు అండతో తన గుప్పిట్లో పెట్టుకుంది. 20 ఎకరాలు భూమి లేని జానమ్మ 400 ఎకరాలకు అతి తక్కువ కాలంలో యాజమానురాలైంది. అన్ని రకాలుగా ప్రజలపై పెత్తనం చెలాయిస్తూ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ప్రజలచే 'దొర' అని పిలిపించుకుంది. ఆమె ఆగడాలను గ్రామానికి చెందిన దొడ్డి మల్లయ్య వ్యతిరేకించాడు. దీంతో తన అనుచరి ముంజ రామక్కతో మల్లయ్యపై విస్నూరు పోలీసు స్టేషన్లో తప్పుడు కేసు పెట్టించింది. కేసు నడిపించేందుకు దేశ్ముఖ్ అన్ని విధాల అండగా ఉన్నప్పటికీ అత్యచారం కేసు నుండి మల్లయ్య బయట పడ్డాడు. గ్రామంలో ఒక మందకు వెట్టిగా గొర్రె లేదా మేకను జానమ్మకు ఇవ్వటాన్ని మల్లయ్య తన సామాజికవర్గంలో వ్యతిరేకించి వారిని చైతన్య పర్చాడు. దీంతో మల్లయ్యను చితక్కొట్టాలని రాంచంద్రారెడ్డి, జానమ్మ దొరసాని తన అనచరుల్ని ప్రేరేపించారు. దేశ్ముఖ్ వత్తిళ్ళు తట్టుకోలేక మల్లయ్య బహద్దూర్ యార్ జంగ్ వద్ద తబ్లీక్ మతం స్వీకరించాడు. ఖాదరలీ నామకరణం చేసుకుని గుండు చేయించుకున్నాడు. ప్రజలు జానమ్మను అస్యహించుకునే పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
'సంఘం' స్థాపన
1944లో ఆంధ్రమహాసభ(సంఘం) భువనగిరిలో సభ నిర్వహించింది. దాని ప్రభావంతో దోపిడీకి వ్యతిరేకంగా పల్లెలు ఎరుపెక్కుతున్నాయి. భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం.. కడవెండి గ్రామం నుండి పిట్టల నర్సయ్య, ఎర్రంరెడ్డి మోహన్ రెడ్డి, దొడ్డి మల్లయ్య, నల్లా నర్సింహులు సంఘంలో చేరారు. 1944 అక్టోబరు 3న గ్రామ పెెద్దరైతు దావుద్రెడ్డి ఇంట్లో సమావేశం పెట్టారు. ముఖ్యఅతిథిగా ఆరుట్ల రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు. దావుద్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆంధ్రమహాసభ నూతన కమిటీ అధ్యక్షులుగా దావుద్రెడ్డి, కార్యదర్శిగా నల్లా నర్సింహులు, ఎర్రంరెడ్డి మోహన్రెడ్డి, దొడ్డి మల్లయ్య, మాచర్ల కొండయ్య, మచ్చ రామయ్యలు ఎన్నికయ్యారు. ఒక్కో 'అణా' చెల్లించి సంఘంలో సభ్యులుగా చేరారు. సంఘం అండతో జానమ్మకు పన్నులు కట్టడం మానేశారు.
రాజకీయ పాఠశాల ఏర్పాటు
సంఘం బలపడడంతో కార్యాకలాపాలకు కేంద్రమైంది కడవెండి. మాశెట్టి రాంచంద్రయ్య ఇల్లు కార్యాలయం. తరచూ జరిగే సమావేశాల్లో గ్రామంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించి ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకునేవారు. గ్రామ కమిటితో పాటు కొండల్రెడ్డి, మడమటింటి మల్లయ్య, సాలయ్య, ఫైండ్ల యాదగిరి, జంపాల మల్లయ్య లాంటి యువ కిశోరాలు ఉద్యమంలో చురుకుగా పనిచేసేందుకు ముందుకు వచ్చారు. దొడ్డి మల్లయ్య కుటుంబంపై వత్తిడి పెరగడంతో ఉద్యమాల్లో కొనసాగేందుకు దొడ్డి కొమరయ్య సిద్ధమయ్యాడు. సంఘం కార్యక్రమాల్లో ఉత్సహంతో కొమరయ్య పాల్గొనడం మొదలైంది. వారం వారం 'ప్రజాశక్తి' తెప్పించుకొని ఆంధ్రమహాసభ కార్యాలయంలో చదివి విన్పించేవారు.
80 పుట్ల వరిధాన్యం జప్తు..
విస్నూరు దొర ఉద్యమాన్ని అణిచి వేయాలని తలచాడు, పోలీసులను ఉపయోగించి కారణం లేకుండానే సంఘం నాయకుల్ని అరెస్టు చేయించాడు. సంఘంలో పని చేయొద్దని హెచ్చరించి వ్యక్తిగత పూచికత్తుపై వదిలి పెట్టారు. దేశ్ముఖ్ బెదిరింపులకు, దొరసాని కక్ష్యాసాధింపు చర్యలకు భయపడకుండా కార్యకర్తలు ఐక్యతను చాటారు. గ్రామంలో జానమ్మ అక్రమాలపై సంఘం ఆధ్వర్యంలో ఐక్య ఉద్యమాన్ని చేపట్టారు. అధికారులు పోరాటధాటికి దిగొచ్చి జానమ్మ వద్ద ఉన్న 80 పుట్ల వడ్లను జప్తు చేశారు. ఈ ఘటన రూపంలో జానమ్మకు అవమానం ఎదురైంది.
కొమరయ్య వీర మరణం
1946 జూలై 4న దేశ్ముఖ్ రాంచంద్రారెడ్డి మామ గడ్డం నర్సింహారెడ్డి నేతృత్వంలో కుట్ర పన్నారు. దేశ్ముఖ్ అనచరుడు మస్కీనలీ నాయకత్వంలో గుండాలు కడవెండి గ్రామంలోకి వచ్చారు. 40 మంది ఉన్నారు. వీరికి విస్నూరు పోలీసులు రక్షణ కవచంలా నిలిచారు. చీకటి పడుతుండడంతో కార్యకర్తల ఇండ్ల పైకి రాళ్ళు రువ్వుతున్నారు. పెంకులు పగిలిపో తున్నాయి. గుండాలు బండ బూతులు తిడుతూ రెచ్చగొడుతున్నారు. గ్రామంలో ప్రజా నాయకులుగా ఎదిగిన ఎర్రంరెడ్డి మోహన్రెడ్డి, నల్లా నర్సింహులు లను హత్య చేయాలని దేశ్ముఖ్ అప్పటికే కుట్ర పన్నారు. ఈ సమాచారం నాయకులకు ముందే తెల్సింది. కడవెండి ఆర్గనైజర్గా కె. రాంచంద్రారెడ్డి వచ్చారు. దేశ్ముఖ్ చర్యలను ఎదుర్కోనేందుకు నాయకత్వం సిద్ధమైంది. ప్రజలు రెండు వందలమందికి పైగా తరలిరావడంతో గుండాలకు వెన్నులో చలి మొదలైంది. వారి కుట్రలకు వ్యతిరేకంగా ర్యాలీగా బయల్దేరారు. నాయకత్వం ముందు వరుసలో ఉంది. కార్యకర్తలు, జనం వారి అడుగుల్లో అడుగేస్తూ ప్రభంజనంలా కదిలారు. ఆంధ్రమహాసభకు జై.. సంఘం వర్ధిల్లాలి.. కమ్యూనిస్టు పార్టీకి జై..దేశ్ముఖ్ దౌర్జన్యాలు నశించాలి.. అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది.
గొర్రెలను ఊళ్ళోకి తోలుకొచ్చి దొడ్డిలోకి చేర్చాడు కొమరయ్య. ఇంటిలోకి వెళ్ళి భోజనం చేస్తుండగానే ఊళ్ళో అలజడి తెల్సుకుని వచ్చి ర్యాలీలో పాల్గొన్నాడు. తన అన్న మల్లయ్యతో కల్సి ముందు వరుసలో నిలిచాడు. అక్కడ గడీ పక్కనే దాక్కున్న గడ్డం నర్సింహరెడ్డి, మస్కీనలీలు ఎటువంటి హెచ్చరికలు లేకుండానే ర్యాలీగా వస్తున్న వారిపై నాటు తుపాకులతో కాల్పులు జరిపారు. నినదిస్తున్న కొమరయ్య పోట్టలోకి తూటా దూసుకుపోయింది. బయటకు వస్తున్న పేగులను వత్తి పెడుతూ నేలకొరిగారు. గుండాలు పేల్చిన తూటాలకు కొమరయ్య అన్న మల్లయ్య గాయపడ్డాడు. కాలులోకి తూటా దిగింది. రేషవల్లి కొండయ్య, లక్షీనర్సయ్యలకు గాయాలయ్యాయి. ప్రాణాలు విడిచినా వెనక్కి వచ్చేది లేదని వాలంటీర్లు, కార్యకర్తలు, ప్రజలు గుండాలకు వ్యతిరేకంగా నినాదాలివ్వసాగారు. ఆర్గనైజర్ రాంచంద్రారెడ్డి కార్యకర్తలు సంయమనం పాటించాలన్నాడు. ప్రతీకార దాడులకు దిగి వారిని హతమారిస్తే నిజాలు మరుగున పడ్తాయని, నిజాం ప్రభుత్వం ఉద్యమాన్ని తీవ్రంగా అణిచివేస్తుందని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని, నిజాం ప్రభుత్వ పతనానికి ఈ ఘటన నాంది కావాలన్నారు. గ్రామ నాయకులు ప్రజల్ని ఒప్పించడంతో ఎలాంటి ప్రతీకార చర్యకు పాల్పడలేదు. కొమరయ్య మృత దేహాన్ని జనగాం తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు న్నాయని, ప్రజల్ని అదుపు చేయడం కష్టమని పోలీసులు చెప్పడంతో నెల్లుట్ల గ్రామం వద్ద పూడ్చి పెట్టారు. కొమరయ్య హత్యను నిరసిస్తూ తెలంగాణ అంతటా నిరసనలు, ఆందోళనలు జరిగాయి. దొడ్డి కొమరయ్య నెత్తుటి ముద్దైండు.. కొమరయ్య బలిదానం కొలిమైమండింది.. రగులుతున్న విప్లవోద్యమానికి సింధూరమైండు.. నిజాం పాలన అంతానికి నాంది పలికిండు.
ఈ ఘటనపై కాంగ్రేస్ పార్టీ చౌడవరపు విశ్వనాధం నేతృత్వంలో విచారణ కమిటి వేసింది. ఆ కమిటి కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చి ప్రజాద్రోహనికి పాల్పడింది. వీర తెలంగాణ ఉద్యమాన్ని గుర్తించకుండా చరిత్రను తొక్కిపెట్టింది. ఇప్పుడు మన పాలకులు చరిత్రను మార్చేయత్నానికి పూనుకున్నారు. ''నిజాం మంచి రాజు'' అని కితాబిస్తున్నరు. నిజాంను కీర్తించడమంటే ఆనాటి పోరాటాన్ని, ప్రజల త్యాగాల్ని, అమరవీరుల రక్తతర్పణను కించపర్చడమే ఆవుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజల అకాంక్షలు నేరవేరడం లేదని ఏడాది పాలన పరీశిలిస్తే అర్ధమవుతున్నది. దొపిడి, నియంతృత్వం, నయా వంచన కొనసాగుతున్న నేపధ్యంలో కమ్యూనిస్టు పార్టీలు ప్రజా సమస్యలపై కల్సి పని చేయటం స్వాగతించాల్సిన పరిణామం. కమ్యూనిస్టు ఉద్యమ పు:ననిర్మాణం కోసం, నూతన రాష్ట్రంలో ''నవ తెలంగాణ నిర్మాణం'' కోసం వామపక్ష, కమ్యూనిస్టు, లౌకిక ప్రజాతంత్ర శక్తులు, సామాజిక సంస్థలు కల్సి పనిచేయాల్సిన తక్షణ కర్తవ్యం ఉంది. దొడ్డి కొమరయ్య స్ఫూర్తినందుకొని ప్రజా ఉద్యమాలు నిర్మించడమే నిజమైన నివాళి.
మామిండ్ల రమేష్ రాజా