Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్టోబర్ 5 ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం. అంతర్జాతీయ విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ (యునెస్కో) 1966 సెప్టెంబర్ 21 నుండి 15 రోజుల పాటు పారిస్లో ఉపాధ్యాయుల పరిస్థితిపై ప్రత్యేకంగా అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది. అనేక దేశాలు, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ, వివిధ ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్న ఆ సదస్సు ఉపాధ్యాయుల హోదా పెంచడానికి వారి హక్కులు, బాధ్యతలకు సంబంధించి కొన్ని నిర్దిష్ట సిఫారసులతో సమగ్రమైన పత్రాన్ని ఆమోదించింది. 28 ఏండ్ల తర్వాత 1994లో యునెస్కో చేసిన సమీక్షలో ఆ పత్రం 'ఎక్కడ వేసిన గొంగడి అక్కడే' అన్న చందంగా మిగిలిపోయినట్టు, ఆనాటి సిఫార్సులు కాగితాల్లోనే కరిగిపోతున్నట్టు గుర్తించింది. ఆ లోపాన్ని అధిగమించాలనీ నిర్ణయించింది. 'స్టేటస్ ఆఫ్ ది టీచర్స్' పత్రాన్ని ఆమోదించిన అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించి, సదరు సిఫార్సుల అమలును ప్రతియేటా సమీక్షించాలని నిర్ణయించింది.
యునెస్కో పత్రంలోని ముఖ్యాంశాలు :
మానవాభివృద్ధిలో, ఆధునిక సమాజ నిర్మాణంలో, విద్యాభివృద్ధిలో ఉపాధ్యాయులది ప్రముఖ పాత్ర. ఈ పాత్ర ద్వారా ఉపాధ్యాయులు తమ హోదా అనుభవించగలగాలి. విద్యార్ధుల చదువుకు బాధ్యత వహిస్తూ పాఠశాలల్లో వుండే ప్రతీ ఒక్కరికీ 'ఉపాధ్యాయుడు' అనే పదం వర్తిస్తుంది. విద్యా సంబంధిత లక్ష్యాలు, ప్రయోజనాల నేపథ్యంలో విద్యా అవసరాల మేరకు ఉపాధ్యాయుల హోదా ఉనికిలోకి వస్తుంది. విద్యా సంబంధిత లక్ష్యాలు, ప్రయోజనాలూ పూర్తిగా నెరవేరాలంటే ఉపాధ్యాయులకు సరైన హోదా, ఉపాధ్యాయ వృత్తిపట్ల ప్రజల్లో గౌరవం ముఖ్యాంశాలుగా పరిగణించాలి. వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడంపై దృష్టి పెట్టే విధంగా, ఉత్తమమైన విద్యాభ్యాసం సాగించే విధంగా ఉపాధ్యాయులకు పని పరిస్థితులను కల్పించాలి. విద్యావ్యాప్తిలో ముఖ్యపాత్ర వహించే శక్తులుగా ఉపాధ్యాయ సంఘాలను గుర్తించాలి. ఆ విధంగా విద్యా విధానాన్ని నిర్ణయించడంలో వాటిని భాగస్వాములను చేయాలి. విద్యా వ్యవస్థలోని ఇన్స్పెక్టర్, ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేటర్, డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రత్యేక బాధ్యతలుగల ఇతర పోస్టులను వీలైనంత వరకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులకే ఇవ్వాలి.
వృత్తి హోదాను నిలబెట్టుకోవడంలో ఉపాధ్యాయులకూ బాధ్యత ఉంది. వృత్తిపరమైన పని విధానంలో ఉపాధ్యాయులు అందరూ వీలైనంత వరకు అత్యున్నత ప్రమాణాలను సాధించాలి. నైతిక నియమావళి లేదా ప్రవర్తనా నియమాలను ఉపాధ్యాయ సంఘాలు రూపొందించాలి. అలాంటి సూత్రాలు వ్యక్తికి గల ప్రతిష్టను పెంచేందుకు, అంగీకరించిన సూత్రాల మేరకు వృత్తిపరమైన విధులను నిర్వర్తించేందుకు ఉపయోగపడతాయి. వ్యక్తిగత అభివృద్ధిని సాధించేందుకు సామాజిక, ప్రజాజీవితాలలో పాల్గొనే విధంగా ఉపాధ్యాయులకు ప్రోత్సాహాన్నివ్వాలి. ఎన్నికల్లో నిలబడేందుకు, ప్రజా ప్రతి నిధులుగా సేవలు అందించేందుకు ఉపాధ్యాయులకు అవకాశం ఇవ్వాలి. సాధారణ పౌరులు అనుభవిస్తున్న అన్ని హక్కులూ వారికీ ఉండాలి.
యునెస్కో, ఐఎల్ఓ, ఇఐ (ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్) సంయుక్తంగా ప్రతీ యేటా ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటాయి. కానీ అమలు తీరుతెన్నుల సమీక్ష నివేదికలను మాత్రం విడుదల చేయడంలేదు. అందువల్ల మొక్కుబడి కార్యక్రమంగా జరుగుతున్నది. కొన్ని ప్రయివేటు సంస్థలు వివిధ దేశాల్లో ఉపాధ్యాయుల స్థితిగతులను అధ్యయనం చేసే నివేదికలను తరుచుగా వెలువరిస్తున్నాయి. ప్రజల్లో, ప్రభుత్వపరంగా లభించే గౌరవం, జీతభత్యాలు, పని పరిస్థితులు, హక్కులు, బాధ్యతలు మున్నగు అంశాలు ఉపాధ్యాయుల హోదాకు కొలమానాలుగా ఉంటాయి. జెమ్స్ ఎడ్యుకేషన్ సొల్యూషన్ అనే సంస్థ ప్రకటించిన 2016 నివేదికలో చైనాలో ఉపాధ్యాయులకు అత్యధిక గౌరవం లభిస్తున్నట్లు తెలిపింది. గ్లోబల్ టీచర్ స్టేటస్ ఇండెక్స్లో చైనా ఆగ్రస్థానంలో ఉండగా, బ్రిటన్, అమెరికా మధ్య స్థాయిలో, దక్షిణ కొరియా, గ్రీస్ అథమ స్థాయిలో ఉన్నట్టు పేర్కొన్నది. 'మీ పిల్లలు ఏ వృత్తిలో ఉండాలని అభిప్రాయ పడుతున్నారు' అనే ప్రశ్నకు తల్లిదండ్రులు చెప్పిన సమాధానాలను బట్టి ఆ అంచనాకు వచ్చినట్టు పేర్కొన్నది. ఉపాధ్యాయులకు చెల్లించే జీతాల్లో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంది. అక్కడ టీచర్లకు లభించే వార్షిక జీతం అమెరికా డాలర్లలో 68000 అంటే మన రూపాయలలో సుమారు 44 లక్షలు. ఆ దేశంలోని ఉద్యోగుల సగటు వార్షిక జీతం రూ.50వేలు. డాక్టర్లకంటే చాలా ఎక్కువ. టీచర్లకు ఎక్కువ జీతాలు చెల్లించే దేశాల్లో నెదర్లాండ్స్, జర్మనీ, బెల్జియం, తరువాతి స్థానాల్లో ఉన్నట్టు పేర్కొంది. విద్యా ప్రమాణాలు, అభ్యసన సామర్ధ్యాల స్థాయి కూడా ఉపాధ్యాయుల హోదాకు వన్నెతెస్తాయి. ఈ విషయంలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉండగా ఉత్తరకొరియా, జెకొస్లేవేకియా, హంగరీ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఓఈసీడీ (ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ)లోని 21 దేశాల్లో ఉపాధ్యాయుల పనిభారం సగటున వారానికి 38 గంటలు. జపాన్లో 54, బ్రిటన్లో 39 గంటలు చొప్పున పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.
మనభారత దేశంలో కాంట్రాక్ట్, గెస్ట్, పార్ట్టైమ్ తదితర పద్ధతులతో లక్షలాదిమంది టీచర్లకు వృత్తి భద్రత లేకుండా చేస్తున్నారు. 2004 నుండి అపాయింటైన వారికి పెన్షన్ కూడా లేకపోతున్న విషయం తెలిసిందే. నెలకు లక్ష రూపాయల వరకు జీతాలు లభించేవారు కొద్దిమంది వుండగా, కనీస వేతనం కూడా రాని ఐదారు వేల రూపాయలతో దారిద్య్రరేఖకు దిగువ బతుకులీడుస్తున్న వారూ ఉన్నారు. ఇటీవల బీజేపీ పాలిత ఉత్తరా ఖండ్ విద్యాశాఖమంత్రి ఒక పాఠశాలలో 8వ తరగతి గదిలో ఉపాధ్యాయురాలిని 'మైనస్ ప్లస్ మైనస్ ఏమవుతుంది' అని టీచర్ని ప్రశ్నించారు. మైనస్ అవుతుంది సార్..! అని సరిగ్గా చెప్పినా ఆ టీచర్ సమాధానం సరైనది కాదు... ప్లస్ అవుతుందని తప్పు చెప్పటమే కాకుండా ఏం చదువు చెబుతున్నావు అని టీచర్ని మంత్రి దబాయించారు.
ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావటానికి ఉపాధ్యాయులకు అవకాశాలు కల్పించాలని యునెస్కో సిఫార్సుల్లో వుంది. మన దేశంలో విద్యా విధానాల రూప కల్పనలో ఉపాధ్యాయులకు ముఖ్యంగా పాఠశాల ఉపాధ్యాయులకు ప్రత్యేక ప్రాధాన్యత ఏమీ లేదు. ప్రజా ప్రతినిధులుగా సర్వీస్ చేయాలనుకుంటే ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వస్తోంది. జాతీయ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎన్సీఈఆర్టీ) జాతీయస్థాయి ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి 1996లో ''ఉపాధ్యాయుల వృత్తి సంబంధ నైతిక నియమావళి''ని రూపొందించింది. ఆ పత్రం చివరి పేరాలో ''నిజమైన వృత్తి సంఘం సభ్యుల ప్రవేశాన్ని క్రమబద్దీకరిస్తుంది. వారిపై అదుపు కలిగివుంటుంది. వారి సంక్షేమానికి పోరాడుతుంది. ఆ విధంగా సంఘం తన సభ్యుల ఉమ్మడి స్వరంగా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఉపాధ్యాయులు అనుసరించేటట్టు చూడటం ద్వారా ఈ నియమావళిలోని అన్ని నియమాలను సంరక్షించే బాధ్యత ఉపాధ్యాయ సంఘాలు స్వీకరించాలి. ఈ నియమావళి అమలుకు తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకునే బాధ్యత కూడా ఉపాధ్యాయ సంఘాలు స్వీకరించాలి''. కానీ అమలు తీరు తెన్నులను తెలిపే దాఖలాలు కనిపించడం లేదు.
అంతర్జాతీయ సదస్సు జరిగి 51ఏండ్లు గడుస్తోంది. అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించటం 23ఏండ్లుగా జరుగుతోంది. ప్రతి యేటా ఒక ప్రత్యేక థీమ్తో నిర్వహించటం ఆనవాయితీ. ఉన్నత విద్యలో పనిచేసే అధ్యాపకుల హోదా గురించి 1997లో యునెస్కో రికమండేషన్స్ చేసి 20ఏండ్లు గడుస్తోంది. ఈసారి బోధనలో స్వేచ్ఛ, ఉపాధ్యాయుల సాధికారం అనే థీమ్ ఇవ్వబడింది. ఈ విషయంతో చర్చలు, గోష్ఠులు, సదస్సులు, సభలు, సమావేశాలు, రౌండ్టేబుల్స్, ఫంక్షన్స్ నిర్వహించాల్సి వుంది. ఎవరు ఎలాంటి కార్యక్రమం నిర్వహించినా వాటిని యునెస్కో వెబ్సైట్కి అప్లోడ్ చేస్తే రికార్డ్ అవుతుంటుంది. అయితే వివిధ దేశాల్లో ప్రభుత్వపరంగా నిర్వహించి, టీచర్స్ స్టేటస్ పైన నివేదికలు ప్రకటిస్తే ఎంతో ప్రయోజనకరంగా వుంటుంది. అలాంటి నిర్మాణాత్మక కృషి జరగక పోవటం వలన అనేక అంతర్జాతీయ దినోత్సవాల్లాగే ''ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం'' కూడా మొక్కుబడి కార్యక్రమంగానే మిగిలిపోతోంది. జాతీయ ఉపాధ్యాయ సంఘాల బాధ్యతనీ ప్రశ్నించాల్సిందే. ఉపాధ్యాయ సంఘాలు కృషి చేస్తే కొన్ని లక్ష్యాలైనా సాధించే అవకాశం ఉంటుంది.
వృత్తిరీత్యా ఉపాధ్యాయులది ప్రజాస్వామిక పనివిధానం. సమానత్వం, సామాజిక న్యాయం, సెక్యులర్ భావాలు, శాస్త్రీయ ఆలోచనలు, నైతిక విలువలు, చారిత్రక దృక్పథం లాంటి అంశాలు బోధించటమే వారిపని. ఆ పనిలో రాణించటం ద్వారానే సమాజంలో సముచిత హోదా సాధించగలరు. నేటి ప్రయివేటీకరణ చేసి, మార్కెట్ ఆర్థిక విధానాల నేపథ్యంలో ఉపాధ్యాయులు సరికొత్త సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఉపాధ్యాయ దినోత్సవ స్ఫూర్తిని గుర్తించి ఆచరించటానికి పాలకులు, ఉపాధ్యాయులు పునరంకితం కావాలి.
- నాగటి నారాయణ
సెల్: 9398207083