Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఘట్టం తుది దశకు చేరింది. రాజకీయ పార్టీల ప్రచార ఆర్భాటాలకు నేటితో తెరపడనుంది. ఇన్నాళ్లూ రాజకీయ పార్టీల అధినేతలు, అభ్యర్థులూ ఆయా నియోజకవర్గాలను చుట్టేసి ఓటర్లను ప్రసన్నం చేసుకొనే పనిలోనే నిమగమయ్యారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అనేక మాటల తూటాలు పేలాయి. ఈ రెండ్రోజులూ చాలా కీలక సమయం. ఐదేండ్ల తమ జీవితాలను ప్రభావితం చేసే రాజకీయ నాయకుడు ఎవరో, ఎవరికి ఓటు వేస్తే తమ జీవితాలు బాగుపడతాయో ఆలోచించుకునే ఖరీదైన సమయం. అందువల్ల ప్రజాస్వామ్య దేవాలయానికి ప్రవేశద్వారం లాంటి పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించడానికి ముందే ప్రతీ ఒక్కరూ ఓ స్పష్టమైన ఆలోచనతో ఉండాలి. నా దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ తాకట్టు పెట్టదలచుకోలేదు.. నా ఈ ప్రజాస్వామిక దేశంలో నేనెవరికీ బానిస కాదలచుకోలేదు.. ఓటు అస్త్రంతో నా సేవకుడెవరో నేనే ఎంచుకుంటున్నా అని సంకల్పించుకోవాలి. ఓటేసే ముందు ప్రతిఒక్కరూ మనస్సాక్షితో ఆలోచించాలి. పవిత్రమైన రాజకీయాలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. నేటి ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రవాహం విచ్చలవిడిగా జరుగుతున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రజల్ని ఆలోచింపజేయడానికి బదులు భావావేశాలు రెచ్చగొట్టడం, వారిని మత్తులో ముంచి, ప్రలోభాలకు గురిచేసి ఓట్లు దండుకొనే నాయకులు ఇంకా ప్రజలకేం సేవ చేస్తారో ప్రతిఒక్కరూ ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన తరుణమిది.
ప్రజల తరఫున పోరాటం చేయకుండా స్వప్రయోజనాలే పరమావధిగా పార్టీలు మారడం, రాజకీయాన్ని వ్యాపారంగా చేసుకొని కోట్లకు పడగలెత్తుతూ ప్రజాస్వామిక విలువలకు పాతరేస్తున్న నాయకులకు కచ్చితంగా బుద్ధిచెప్పాల్సిన బాధ్యత ఓటర్లపైనే ఉంది. ఇక పార్టీల ఎన్నికల మ్యానిఫెస్టోల సంగతికి వస్తే.. ప్రజలకు ఇంకేదో చేస్తామంటూ అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తున్నాయి. అధికారంలో ఉన్ననాడు తమకేమీ చేయనోళ్లు ఇప్పుడు చేస్తామంటే ఎలా నమ్మాలని ప్రజలు అడుగుతున్నారు. అందుకు సమాధానం చెబుతూ తమ నిజాయతీ రుజువు చేసుకోవాల్సిన బాధ్యత కచ్చితంగా నేటి రాజకీయ నాయకులపై ఉంటుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకారమై ఐదేండ్లు పూర్తికావస్తున్నా నాటి అమరవీరుల త్యాగాలు ఫలించనేలేదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. నిరుద్యోగ సమస్యతో పాటు ప్రజల ఆశించిన మేర ఏ పనీ కాలేదనే బాధ వారిలో కనబడుతోంది. సమస్య ఎక్కడ ఉందో దాన్ని సమూలంగా నిర్మూలించినప్పుడే ప్రభుత్వాల చిత్తశుద్ధి బయటపడుతుంది. అలాకాకుండా నామమాత్రపు చర్యలకే పరిమితమైతే అది మరింత తీవ్రరూపం దాల్చి ముప్పుతెస్తుంది. ఏ రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలు ఓ నిరంతర ప్రక్రియలా సాగాలి. ఉదాహరణకు.. ఫలానా పార్టీ కొన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తే వాటిని పూర్తిస్థాయిలో అమలుచేయడం కుదరకపోతే.. తొలుత ఇచ్చిన హామీలు ఎంత మేరకు తాము పూర్తిచేయగలిగామో, మళ్లీ అధికారంలోకొస్తే ఆ పథకాలను ఎంత సమర్థంగా ముందుకు తీసుకెళ్తామో ప్రజలకు గణాంకాలతో సహా వివరించే ప్రయత్నం చేయాలి. మన దగ్గర రాజకీయనాయకులకు ఆ చిత్తశుద్ధే కరువైనట్టు కనిపిస్తోంది. ఎప్పటికా మాటలాడి తప్పించుకొనే ధోరణులు ఎక్కువవుతున్నాయి. జవాబుదారీతనంతో వ్యవహరించే నాయకులను ప్రజలు ఇష్టపడతారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని నెరవేర్చేవాడే గొప్ప నాయకుడు కాగలుగుతాడు. అలాంటి నాయకులనే ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారు. అంతేగానీ, ఓటర్ల నాడిని బట్టి ఎక్కడి మాటలు అక్కడ చెబుతామంటే నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు.
ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారనే అంశంపై పూటకో సర్వేతో ప్రజల్ని తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్న ధోరణులు కనబడుతున్నాయి. కేవలం కొద్దిమంది ప్రజల అభిప్రాయాన్ని మొత్తం ప్రజల అభిప్రాయంగా చిత్రీకరించే ప్రయత్నాలను కొందరు చేస్తున్నారు. ఈ తరుణంలో ప్రలోభాలకు గురై ఓటు అమ్ముకుంటే రేపు అన్యాయం జరిగితే నిలదీసే హక్కును కోల్పోతారు. కేవలం రాజకీయ నాయకుల మాటలతో భావావేశాలకు లోనై వాస్తవాలను తెలుసుకోకుండా ఓటేస్తే ఆ తర్వాత చేసేదేమీ ఉండదు. ఓటు అనేది ప్రజలకు ఒక్క రోజు అధికారం. మీ ఓటుతో ఆ అధికారం నాయకులకు బదిలీ అయిపోతుంది. అందువల్ల మీ బాధ్యతలను, హక్కులను ఇంకొకరికి బదలాయిస్తు న్నప్పుడు అందుకు అవతలివాడు సమర్థుడో కాదో, మీ ఆశయాలను, ఆకాంక్షలను కొనసాగించే వాడో, కాదో చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా. తెలంగాణ విజన్తో ముందుకు తీసుకెళ్లే నేతలను ఎన్నుకోవాలి. ఎవరికి ఓటు వేయాలో, ఎవర్ని గెలిపిస్తే మన స్థితిగతులు మారుతాయో చర్చించుకొని, గత అనుభవాలను బేరీజు వేసుకుంటూ తమ నిజమైన సేవకుడ్ని తేల్చుకొని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మనవి.
డాక్టర్ చుక్కా రామయ్య
- ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు