Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వివిధ దేశాల్లో చెల్లిస్తున్న వేతనాల వృద్ధిపై ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ఐఎల్ఒ) గత నెల 26న విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం వేతనాల వృద్ధిలో, అసమానతల్లో, లింగ వివక్షా పూరిత వేతనాల్లో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. సంపద ఏ స్థాయిలో పెరిగితే అదే స్థాయిలో దానికి కారకులైన వారి సంపాదనల్లోనూ మార్పు రావాలి. అలా రానప్పుడే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుంది. ఐఎల్ఒ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా, 2016లో 2.4శాతం వేతన వృద్ధి ఉంటే, 2017లో అది 1.8శాతానికి పడిపోయింది. ఇవే వివరాల్లో చైనాను మినహా యించి చూస్తే, ప్రపంచ వేతన వృద్ధి, 2016లో 1.8శాతంగా ఉంటే 2017లో 1.1శాతానికి పడిపోయింది. చైనా ఎక్కువ జనాభా ఉన్నప్పటికీ కూడా తదనుగుణంగా ఘనమైన వేతన వృద్ధి సాధిస్తూ ప్రపంచ సగటుకు తోడ్పాటునిస్తున్నది. ఐఎల్ఒ వెలువరించిన ఈ వృద్ధి, నిజ వేతనం, అనగా ద్రవ్యోల్బణంతో సరిచూసి లెక్కించగా నమోదైంది. అయితే ఇది 2008 తరువాత అత్యంత తక్కువ వృద్ధిగా ఇప్పుడు నమోదయింది. అభివృద్ధి చెందిన జీ20 దేశాలలో 2015లో 1.7శాతంగా ఉంటే 2016లో 0.9శాతానికి పడిపోయింది. 2017లో 0.4శాతానికి పడిపోయింది. ఐరోపాలో 2015లో 1.6శాతానికి, 2016లో 1.3శాతానికి, 2017లో 0 (సున్నా)గా నమోదయింది. అమెరికాలో చూసినట్టయితే 2015లో 2.2శాతం, 2016లో 0.7శాతం, 2017 లోనూ 0.7శాతం నమోదయింది. ఇలా తక్కువ వేతన వృద్ధి కనబరిచిన దేశాలన్నింటి లోనూ వారి వారి జీడీపీలు పెరుగుతున్నాయి. అయినప్పటికీ వేతనాలలో వృద్ధి ఎందుకు కనిపించడం లేదు? 2015లో అమెరికా సంపద 17ట్రిలియన్ డాలర్లు ఉంటే 2017లో 21ట్రిలియన్ డాలర్లకు చేరింది. మరి వేతనాలలో వృద్ధి ఎందుకు కనిపించడం లేదు? దీనిని బట్టి ఎక్కువ ఆదాయం కలిగిన దేశాలలో వేతన వృద్ధి మందగించిందని అర్థం. సంపద సృష్టిస్తున్న కార్మికులకు సరైన వాటా రావటం లేదు. అందుకే గతేడాది వెలువడిన ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం ప్రపంచంలో సృష్టించిన సంపదలో 82శాతం సంపద ఒక శాతం ప్రజల దరికి చేరుతుంది అనే వాస్తవం దీనిద్వారా తేటతెల్లమవుతోంది. సంపద పోగు పడడానికి శ్రామికులకు చెల్లించకుండా ఉంటేనే సాధ్యమవు తుందనే సత్యం మళ్లీమళ్లీ రుజువుతోంది.
వేతనాల వృద్ధి మందగించడానికి 3 కారణాలుగా ఐఎల్ఒ ప్రకటించింది. 1. ఉత్పత్తిలో గణనీయమైన నెమ్మది ఏర్పడింది. 2. ప్రపంచ పోటీతత్వం పెరిగింది. 3. కార్మికులు బేరమాడే శక్తి కోల్పోయారు. ఉత్పత్తిలో నెమ్మదస్తత ఏర్పడటానికి కారణం సరైన డిమాండు లేకపోవడం, ఈ డిమాండు ఉండాలంటే ప్రజల్లో కొనుగోలుశక్తి ఉండాలి. ఈ శక్తి ఉండాలంటే పనికిదగ్గ ప్రతిఫలం ఉండాలి. కానీ పెట్టుబడిదారుల అత్యాశను కట్టడి చేయనంత వరకు ఈ సంక్లిష్టత అధిగమించడం కష్టమే. ఇక పోటీతత్వం కారణంగా సంయోగాలూ సంలీనాలతో చిల్లర వర్తకాన్ని దెబ్బతీయడంతో వినియోగానికి సరుకు అందుబాటు తగ్గి ఉత్పత్తి నెమ్మదిస్తుంది. మొదటి రెండు కారణాలతో పాటు కార్మిక చట్టాలను నీరుగార్చటం, ఆశ్రిత పెట్టుబడి దారీ తనం ఎక్కువవడం, పెరుగుతున్న నిరుద్యోగం, పెరిగిన పెట్టుబడిదారీ ఆధిపత్యం దృష్ట్యా కార్మికులు బేరమాడేశక్తి రానురాను కోల్పోతున్నారు. కార్మికులు తమ హక్కుల కోసం నినదించకుండా అడ్డుకోవడంలో యాజమాన్యా లతో పాటు చాలా రాజకీయ పార్టీలు కూడా కుమ్ముక్కౌతున్నాయి. ఇది చాలా ప్రమాదకరం. కార్మికుల ప్రశ్నించేతత్వం వారికి మేలు చేయడమే కాక యాజమాన్యాన్ని కూడా జాగరూకతలో ఉంచుతుంది. 1999-2017 మధ్య కాలానికి సంబంధించి 52 దేశాలలో ఐఎల్ఒ సర్వే చేసినప్పుడు శ్రామిక ఉత్పాదకత 17రెట్లు ఉంటే వేతనాలు 13రెట్లే ఉన్నాయి. ఉత్పత్తి పెరిగినప్పుడు వర్కర్ల పని గంటలైనా తగ్గాలి లేదా వేతనాలైనా పెరగాలి. అందుకే ఉత్పాదకతకూ వేతనాలకు ఎప్పుడూ అనులోమానుపాతమే ఉండాలి.
ఐఎల్ఓ నివేదిక ప్రకారం వివిధ దేశాలలో వివిధ రకాలుగా వేతనాల్లో వ్యత్యాసాలు, అసమానతలు బయటపడ్డాయి. ఆశ్చర్యకరమైన అంశం ఏమంటే ఎక్కువ సంపద సృష్టిస్తున్న దేశాలలో అసమానతలు తక్కువగా ఉన్నాయి. తక్కువ సంపద సృష్టిస్తున్న దేశాలలో ఈ వేతన అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. దీని ద్వారా గమనించవలసిన అంశం ఏమంటే వేతనాలలో అసమానతలు లేకుండా చూసుకుంటే ఆ దేశ సంపద గణనీయంగా పెరుగుతుందన్నమాట. వేతనాలలో అత్యంత తక్కువ అసమానతలు కలిగిన దేశం స్వీడన్ అత్యంత ఎక్కువ అసమానతలు కలిగి ఉన్న దేశం చిలీగా రిపోర్ట్ తెలిపింది. నూతన ఆర్థిక విధానాల అమలుకు (1991)ముందు ఒక వర్కరుకు సీఈవోకు వేతన నిష్పత్తి 1:20గా ఉంటే ఇప్పుడు అదే 1:80గా మారింది. ఒక కంపెనిలో ఒకే స్థాయిల్లో పని చేస్తున్న వివిధ ఉద్యోగుల వేతనాల్లో అసమానతలు ఉన్నాయి. ఒకే రకమైన పని చేస్తున్న వివిధ కంపేనీల ఉద్యోగుల వేతనాల్లోనూ వ్యత్యాసాలున్నాయి. కంపెనీ సీఈఓ దృఢంగా ఉండాలని కొందరను కుంటున్నారు, ఉద్యోగులు దృఢంగా ఉండాలని ఇంకొందరను కుంటున్నారు. సీఈఓ దృఢంగా ఉన్నచోట కంపెనీకి లాభాల వృద్ధి పెరగవచ్చునేమో, కానీ స్థూల సంపద తగ్గుతుంది. వర్కర్లు దృఢంగా ఉన్న చోట స్థిరత్వం ఎక్కువ. అందుకే అసమానతలు తక్కువున్న చోట ఆర్థిక వృద్ధి ఎక్కువ.
వేతనాల్లో లింగ వివక్ష
వేతనాల్లో లింగ వివక్ష చాలా దేశాల్లో ఉంది. భారతదేశంలో 1976లోనే సమాన పనికి సమానవేతనం అనే చట్టం వచ్చినప్పటికీ, ముఖ్యంగా అసంఘటిత రంగంలో వేతనాల లింగ వివక్ష చాలా ఉన్నది. ప్రపంచంలో సగటున 16నుంచి 22శాతం తక్కువ వేతనాలు స్త్రీలకు చెల్లిస్తున్నారు. పాకిస్థాన్లో అత్యధికంగా 34శాతం ఫిలిప్పైన్స్లో అత్యల్పంగా 10.3శాతం లింగ వివక్ష వేతనాలున్నాయి. ఇక్కడ కూడా తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో లింగ వివక్ష ఎడం (గ్యాప్) ఎక్కువగా ఉన్నది. అదే ఎక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో, వేతనాల్లో లింగ వివక్ష తక్కువగా ఉన్నది. ఇదెలా సాధ్యమైందంటే అక్షరాస్యతా, చైతన్యమూ, ప్రభుత్వ స్పందన సరైన రీతిలో ఉండటం వలన. అనగా, ఎక్కడైతే వివక్ష లేదో, ఎక్కడైతే చైతన్యం ఉన్నదో అక్కడ అభివృద్ధికి అవకాశం ఎక్కువ.
భారతదేశంలో జీడీపీ 6.7శాతం వృద్ధితో పరిగెడుతున్నదని పాలకులు చెబుతున్నారు. ఈ సంపదలో సర్వీస్ సెక్టార్ది 52శాతం. అట్లాంటప్పుడు కేవలం 20శాతం ప్రజలు మాత్రమే వర్కర్లుగా పాల్గొంటున్న సేవా రంగంలోని వేతనాల్లో వృద్ధి ఎందుకు చోటు చేసుకోవడం లేదన్నది ప్రశ్న? ఒకవేళ కొత్త ఉద్యోగాల భర్తీ ఏమైనా జరిగి తక్కువ జీతాలకే చిన్న వయస్కులను నియమించారా? సాక్షాత్తు ప్రధానమంత్రి, పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం సందర్భంగా సమర్పించిన లెక్కల ప్రకారం రమారమి కోటి ఉద్యోగాలే సృష్టించబడ్డాయి. 2018 లెక్కల ప్రకారం నిరుద్యోగ రేటు 6.9శాతంగా నమోద యింది. ఇది అమెరికాలో 4శాతం లోపే ఉంది. ఉద్యోగాల కల్పన చాలా తక్కువగా ఈ దేశంలో ఉన్నది. అట్లాంటప్పుడు ఇదివరకే ఉపాధిలో వారి జీతాల్లో, వేతనాల్లో గణనీయమైన పెరుగుదల ఉండాలి. అలా ఉండటం లేదంటే, ప్రభుత్వం తమ బాధ్యత మరిచి సంపద వృద్ధి పైనే దష్టి పెట్టి, దాన్ని సష్టిస్తున్న వ్యక్తుల గురించి మరిచినట్టు అవుతుంది. ఈ దేశంలో అత్యంత తక్కువ ఆదాయాలు కలిగిన వారు వ్యవసాయ దారులు, ఆ రంగ కూలీలు. దేశానికి సరిపడా ఆహారోత్పత్తులను పండిస్తున్నారు కానీ వారి ఆదాయాల్లో వృద్ధి చాలా తక్కువ. వీరికి గిట్టుబాటు ధర చెల్లించకున్నా ధరలు పెరుగు తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అన్నట్టు లేబర్ కొరత చాలా ఉన్నది అని వినిపించే ప్రతి రంగంలోనూ వేతనాలు ఎందుకు పెరగటం లేదో సమీక్ష చేసుకోవాలి. ప్రభుత్వం ఈ బాధ్యత విస్మరించింది కాబట్టే భారతదేశంలో కూడా సృష్టించిన సంపదలో 73శాతం సంపదంతా ఒక్క శాతం పెట్టుబడి దళారుల దగ్గరికి చేరిందన్నమాట. వేతనాలలో వద్ధి కేవలం వర్కర్లకు మాత్రమే మేలు చేయదు, ఎప్పుడైతే వర్కర్ల చేతిలో కొనుగోలు శక్తి ఉంటుందో వినియోగం పెరిగి, తద్వారా మరింత ఉత్పత్తి కోరుకునే మార్కెట్లు విలసిల్లి, సమగ్రాభి వృద్దికోసం సంపద రెట్టింపుగా సష్టించబడుతుంది. ఈ ''సృష్టి, వినిమయ, అభివృద్ధి'' చక్రం సరిగ్గా నడవాలంటే సంపద కేంద్రీకృతమయ్యే విధానాలను ఎప్పటి కప్పుడు నిర్వీర్యం చేయాలి.
జి. తిరుపతయ్య
సెల్: 9951300016