Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గిరిజన తండాలను పంచాయతీలుగా గుర్తించాలని 1996 నుంచి గిరిజన సంఘం రాష్ట్ర వ్యాపితంగా ఆందోళన పోరాటాలు నిర్వహించింది. ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్రలు, బస్సు, సైకిల్ యాత్రలు నిర్వహించి సెమినార్, సదస్సుల ద్వారా చైతన్యపరిచి సాగించిన గిరిజన పోరాటాల ఫలితంగానే తండాలు పంచాయతీలుగా ఏర్పడ్డాయి.
తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ రాజ్ చట్టం 2018ని గిరిజనులు స్వాగతించారు. 73, 74 రాజ్యాంగ సవరణకులోబడి తోలంగాణ ప్రభుత్వం 2018 మార్చి 29న శాసనసభ ఆమోదంపొంది ఏప్రిల్ 18న అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం 294వ షెడ్యూలు చిన్నచిన్న తండాలను పంచాయతీలుగా మార్చింది. గ్రామస్వరాజ్యం దేశానికే ఆదర్శంగ ఉండేటట్టు అభివృద్ధివైపు తీసుకెళ్ళాలని ఒక ప్రణాళిక వేసింది ప్రభుత్వం.
తెలంగాణ రాష్ట్రంలో గ్రామ జనాభా 3,50,31,366 మంది ఉన్నారు. రాష్ట్ర జనాభాలో ఇది 58శాతం. ఈ జనాభా కలిగిన గ్రామాలను ఈ పంచాయతీరాజ్ 2018 చట్టం 12,751 గ్రామ పంచాయతీలుగా, 1,13,270వార్డులుగా, 3140 తండా పంచాయితీలుగా గుర్తించింది. తండా పంచాయతీలు అత్యధికంగా నల్గొండ జిల్లాలో 844, అతితక్కువగా మెడ్చల్జిల్లాలో 61పంచాయతీలు ఉన్నాయి. నూతనంగా ఏర్పడిన ఈ పంచాయతీల్లో సెక్షన్ 37 ప్రకారం స్థానిక సమస్యలు అధ్యయనం చేసి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వాలు అవి చేయని ఎడల న్యాయసలహాలు తీసుకొని ముందుకు వెళ్ళవచ్చు.
గిరిజన తండాలు అన్ని తరగతుల కంటే వెనుకబడి ఉన్నాయి. రాష్ట్రంలో 13వేల తండాలు ఉన్నాయని ఒక అంచనా. ఇప్పటికీ 7వేల తండాలకు రోడ్లు లేవు. 6వేల తండాలకు కరెంటులేదు. వేల తండాలు విద్య, వైద్యానికి దూరంగా ఉన్నాయి. 71ఏండ్ల భారతావనిలో గిరిజనుల జీవనపరిస్థితి ఇది. గ్రామాలకు దూరంగా, అడవులకు దగ్గరగా అన్నింటికి అడవే ఆధారంగా జీవనం సాగిస్తున్నారు.
నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, పంచాయతీ సభ్యులు గ్రామసభ నిర్వహించి సమస్యలను అధ్యయనం చేయాలి. కలసికట్టుగా వాటిని పరిష్కరించే మార్గం వెతకాలి. విధులపట్ల, నిధులపట్ల అవగాహన పెంచుకోవాలి. అవసరం ఉన్న వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలి. తాగునీరు, పారిశుధ్యం, అంటువ్యాధులు సీజన్లో వచ్చే వ్యాధులను నిర్మూలించేందుకు క్యాంపులు నిర్వహించాలి. వీధిదీపాలు ఏర్పాటు చేయాలి. హరితహారంలో భాగంగా ప్రతీ ఇంటికీ 6మొక్కలు నాటే కార్యక్రమం తీసుకోవాలి. ప్రతీ పంచాయతీలో ప్రజలకు ఉపయోగపడే విధంగా మునగ, రాచ ఉసిరి, చింత, వేప, మామిడి, నిమ్మ, జామ, కొబ్బరి, పూల మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలి. 85శాతం చెట్లు బతికి ఉండేలా చూడాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావిధానం పైన కొన్ని చర్యలు తీసుకొని మెరుగు పర్చుకోవాలి. ప్రయివేటు స్కూల్స్కు ధీటుగా విద్యను బోధించే విధంగా పాఠశాలల అభివృద్ధికి గ్రామసభ నిర్ణయం తీసుకోవాలి. జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. మురికి కాలువలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి 24గంటల వైద్యం అందేవిధంగా డాక్టర్లు, నర్సులను అందుబాటులో ఉంచాలి. వర్షాకాలంలో వ్యాధుల పట్ల ప్రత్యేక అవగాహన క్యాంపులు ఏర్పాటు చేసి అవసరమైన చికిత్స నిర్వహించాల్సిన బాధ్యత ఉన్నది. పశుగ్రాసం, వ్యవసాయానికి సరిపడ నీరు అందించాలి. ఎలాంటి పంటలు వేయాలో అవగాహన కల్పించాలి. చేపలు, కోళ్ళు, పశువుల పెంపకంలో మెళకువలు నేర్పాలి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి గ్రామ అవసరం తెలుసుకొని ఉపయోగ పడేవిధంగా బడ్జెట్కు రూపకల్పన చేయాలి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు అందేవిధంగా చూడాలి. పింఛన్లు, పొదుపు సంఘం నిధులు, ప్రజాపంపిణీ వ్యవస్థ, సరుకులు, రేషన్కార్డు, ఇండ్ల రుణాలు, లోన్లు, జననమరణ దృవపత్రాలు సకాలంలో అందేవిధంగా పర్యవేక్షణ చేయాలి.
గ్రామంలో ఉన్న ఉద్యోగస్తులు, సీనియర్ సిటిజన్లు, నిధుల ధాతలు, ఇతర మేధావులు, అనుభవజ్ఞులు అభివృద్ధిలో పాలుపంచుకొని సూచనలు సలహాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది. సెక్షన్ 52ప్రకారం రోడ్లు, బిల్డింగ్, దీపాలు, మురుగునీరు, స్మశానవాటిక సమస్యలు పరిష్కరించుకోవటమే గాక, ప్రకృతి ఎరువులు తయారు చేయాలి. సెక్షన్ 70ప్రకారం ఇంటిపన్ను, నీటిపన్ను, భూమిపన్ను, వాహనపన్ను, దేవదాయపన్ను, చెట్టు పన్ను, మార్కెట్ పన్నులు అక్కడిి పరిస్థితిని బట్టి వసూలు చేయాలి.
ప్రభుత్వం కూడా తండా పంచాయతీలను రెవెన్యూ పంచాయతీలుగా మార్చి కర్నాటక తరహాలో తండా అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి ప్రతి పంచాయతీకి నిధులను విడుదల చేయాలి. ఇప్పటికి పంచాయతీ కార్యాలయాలు లేవు. ఫర్నీచర్, అటెండర్స్, స్వీపర్స్లేరు. చివరకు రిజిస్టర్, మినిట్బుక్స్ కూడాలేని పరిస్థితి ఉన్నది. పంచాయతీ నిర్వహణకు నిధులు కేటాయించకుండా పంచాయతీ అంటే ఉపయోగంలేదు. తండా అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి నేరుగా తరడాకు 50లక్షలు ఖర్చుచేసే విధంగా నిధులు కేటాయించాలి. లేనిచో మరో పోరాటం గిరిజనులు చేయాల్సి ఉంటుంది.
- ఎం. ధర్మానాయక్
ఫోన్ : 9490098685