Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కామ్రేడ్ తెలకపల్లి(టి) నర్సింహయ్యగారి గురించి నా మొదటి జ్ఞాపకం ఒక రాజకీయ పాఠశాల. కచ్చితంగా ఎప్పుడో జ్ఞాపకం లేదు గానీ, నేను విద్యార్థి సంఘంలో పని చేసేటప్పుడు జరిగిన రాజకీయ పాఠశాలలో ఆయన అర్థశాస్త్ర పాఠాన్ని బోధిస్తుంటే విన్నప్పుడు ఒక మంచి అధ్యాపకుడుగా నా బుర్రలో ముద్ర పడింది. మంచి భాష, స్వచ్ఛమైన ఉచ్ఛారణ, హడావుడి లేకుండా నింపాదిగా, సుబోధకంగా చెప్పే తీరు అసలు సిసలైన ఉపాధ్యాయుడిని గుర్తుకు తెచ్చింది. ఆయన వేష భాషలు కూడా విద్యాబుద్ధులు నేర్పే అయ్యవారిని తలపించాయి. ఆ తరువాత కాలంలో ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన అనేక పార్శ్వాలు, ముఖ్యమైన అంశాలు తెలిసినప్పటికీ ప్రారంభంలో ఏర్పడిన ఈ భావన చెరిగిపోలేదు.
కార్మిక సంఘం, పార్టీ బాధ్యతల్లోకి వచ్చిన తరువాత నరసింహయ్యతో నాకు పరిచయం పెరిగింది. సంబంధాలు ఎక్కువయ్యాయి. ఆయన వ్యక్తిత్వాన్ని సమగ్రంగా సందర్శించే అవకాశం కలిగింది. ప్రజా ఉద్యమానికి, మార్క్సిస్టు పార్టీకి చాలా కష్టమైన, క్లిష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు కర్నూలు జిల్లాలో ప్రధాన బాధ్యత తీసుకొని ఆయన ఉద్యమాన్ని, పార్టీని పునర్నిర్మాణం చేశారు. పిన్నవయసు నుంచి వయసు పండినదాకా ఆయన నిర్విరామంగా ఉద్యమం కోసం కృషి చేస్తున్నప్పటికీ 1970, 80 దశకాలలో ఆయన కృషి ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది. మితవాద, అతివాదాల వైపు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేస్తే, వేర్పాటువాదం పార్టీని ఒంటరిపాటు చేస్తే, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన అత్యవసర పరిస్థితి కొంతమంది కార్యకర్తలను, నాయకులను దూరం చేస్తే - ఆయన నిబ్బరం కోల్పోకుండా, నిరాశ చెందకుండా పట్టుదలతో దాదాపు మళ్ళీ ప్రారంభం నుంచి ఉద్యమాన్ని పునర్నిర్మించారు. తరాల అంతరాలున్నా యువతరాన్ని ఆకర్షించారు. ఆనాటి ఆయన పాత్ర చూస్తే పిల్లలకోడి జ్ఞాపకం వస్తుంది. ఆకలి వేస్తే గింజలు తినడం నేర్పుతూ, కష్టం వచ్చినప్పుడు రెక్కల మాటున దాచుకుంటూ పిల్లలను ఎలా పెంచి పెద్ద చేస్తుందో అలా నర్సింహయ్య విద్యార్థులు, యువకుల నుంచి కార్యకర్తలను అభివృద్ధి చేశారు. ఆ పునాదిపైనే మళ్ళీ ఉద్యమం పెరిగి పెద్దదయింది. ఆయన సౌమ్యత, ఓపిక, నిలకడ, నచ్చచెప్పే సామర్థ్యం, ధీరత్వం, నిరాడంబరత కార్యకర్తలందరికీ ఆదర్శం. కాఠిన్యం లేకపోవడం, పెళుసుదనం లేకపోవడం, హడావుడి, అట్టహాసాలు లేకపోవడం బలహీనతలుగా చూసే ఈ రోజుల్లో నర్సింహయ్య లాంటి మెత్తటి మనిషి కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఎలా నిర్మించగలిగారని ఆశ్చర్యపోయేవారు ఉండవచ్చు. ఈయన వల్ల ఏమి అవుతుందని చప్పరించిన వారు ఆనాడూ ఉన్నారని నర్సింహయ్యగారే జ్ఞాపకం చేసుకున్నారు. అయితే నవ్విన నాప చేనే పండుతుందని ఎలా రుజువు చేశారో కూడా జ్ఞాపకాల్లో ప్రస్తావించారు. తారాజువ్వలు బుస్సుమని ఎగిరి మిరుమిట్లు గొలిపి క్షణంలో మళ్ళీ పతనం అయిపోతాయి. దీపం నిలకడగా నిరంతరం వెలుగునిస్తూనే ఉంటుంది. అలాంటి దీపమే నర్సింహయ్య.
ఆయన జీవితమంతా ఉద్యమాలతోనే పెనవేసుకుపోయింది. 1949లో కమ్యూనిస్టు భావాలవైపు వచ్చిన ఆయన 50వ దశకంలోనే అనేక బాధ్యతలు నిర్వహించారు. 2019లో కన్నుమూసే వరకూ అంటే ఏడు దశాబ్దాల పాటు అచంచలమైన విశ్వాసంతో ఆదర్శప్రాయమైన జీవితం గడిపారు. 1970 నుంచి 1997 వరకూ కర్నూలు జిల్లా సీపీఐ(ఎం) కార్యదర్శిగా , దీర్ఘకాలం రాష్ట్ర కమిటీ సభ్యుడుగా ఉన్నారు. తర్వాత కూడా చాలా కాలం బాధ్యతలు చూస్తూనే వయోభారం వల్ల విరమించుకున్నారు. గార్గేయపురంలో 1928లో పుట్టిన నరసింహయ్య అక్కడ భూస్వాముల కాల్పులను ప్రత్యక్షంగా ఎదుర్కొని నిలబడిన ధీరుడు. ఆనాటి నుంచి గ్రామాలలో రైతు వ్యవసాయ కార్మిక ఉద్యమాలలో పనిచేసిన ఆయన నదీజలాల సమస్యలపై ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. ఎన్టీ రామారావు హయాంలో ఇందుకు సంబంధించి ఏర్పాటైన హైపవర్ కమిటీలో సభ్యులుగా విలువైన సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితి కాలంలో అజ్ఞాత జీవితం గడిపిన ఆయన ఆ తర్వాత కొద్ది మాసాలు రాష్ట్ర కేంద్రానికి వచ్చి ప్రజాశక్తి వారపత్రికలోనూ పనిచేశారు. వాస్తవానికి జిల్లాలో ఉద్యమం పరిమితం గనక రాష్ట్ర కేంద్రానికి రమ్మని అగ్రనాయకులు అడిగినా అక్కడ ఉద్యమ నిర్మాణానికే అంకితమైనారు. భూస్వామ్య శక్తుల ఆధిపత్యానికి నిలయమైన ఆ జిల్లాలో అనేక భూ పోరాటాలు, రాయలసీమ పేపరు మిల్లు పునరుద్ధరణ పోరాటం వంటి వాటిని నిలబెట్డడంలో ఆయన కృషి గణనీయం. కర్నూలు జిల్లాకే పరిమితం కాకుండా అనంతపురం, కడప, మహబూబ్నగర్ జిల్లాల్లో కూడా ఉద్యమ వ్యాప్తికి సహకరించడం ఆయన ప్రత్యేకత. విద్యార్థి ఉద్యమ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పాటు వైద్య విద్యార్థులను సమీకరించడంలో ఆయన విలక్షణ పాత్ర నిర్వహించారు. కర్నూలు మెడికల్ కాలేజీ నుంచి అత్యధికంగా ఉద్యమంలోకి వచ్చిన విషయం ఒకసందర్భంలో అఖిలభారత వైద్య విదార్థి మహాసభలో వెల్లడైంది. జైలు జీవితంలోనూ అర్థ్శశాస్త్ర అధ్యయనం కొనసాగించారు. ఓంకార్ వంటి వారికి ఇంగ్లీషు నేర్పించారు. అంటే ఆయనకు విప్లవ రాజకీయాలతో పాటు విజ్ఞానంపైనా అంత ఆసక్తి.
ఆయన తన స్వార్థం కోసం ఎన్నడూ ఏదీ కోరడం గానీ, పదవీ లాలస గానీ, పార్టీ నిర్ణయాలను అతిక్రమించడంగానీ ఎరగం. నర్సింహయ్య జీవితం మనకు ఒక కమ్యూనిస్టుని మనకు దర్శింపజేయడమే కాకుండా ఒక సామాన్యమైన, ఉదాత్తమైన మనిషిని కూడా మనకు చూపిస్తుంది. సామాన్యులందరి లాగే ఆయనా, ఆయన కుటుంబం కష్టాలను ఎదుర్కొన్నారు. అయితే నిబద్ధత గల కొందరిలాగా వాటిని తట్టుకున్నారు. జీవితాంతం అనారోగ్యం పీడిస్తున్నా, తిరిగి తిరిగి తిరగబెట్టి బాధిస్తున్నా అది శరీరాన్నే బాధించగలిగింది తప్ప ఆలోచనను, వివేచనను ఎప్పుడూ బలహీనం చేయలేదు.
ఆయన కుటుంబం మొత్తం ఆశయానికి అంకితమయిన తీరు, అలా తీర్చిదిద్దడం గొప్ప విషయమే. నర్సింహయ్యగారి తల్లి సరస్వతమ్మగారిని ఒకసారి నేను కలిశాను. ఆమె వద్ద కొద్దిసేపున్నా ఆ వయసులోనూ ఆమెలో తొణికిసలాడిన ఆశయవాదం నన్ను ఉత్తేజపరిచింది. ఆయన ఆత్మకథకు ముందు మాట రాసిన సందర్భంలో ఆమె గురించి మరిన్ని విషయాలు తెలుసుకొనే అవకాశం కలిగింది. కమ్యూనిస్టు ఉద్యమంలో ఇటువంటి తల్లులు, త్యాగమూర్తులు ఎంతోమంది మనకు కనిపిస్తారు. ఇక రాష్ట్రంలో మహిళా ఉద్యమ వ్యవస్థాపక నేతల్లో ఒకరైన టిసి లక్ష్మమ్మగారు నర్సింహయ్యగారి భార్యగా కన్నా స్వతంత్ర వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగానే నాకు కనిపించేవారు. ఆమె ఆప్యాయత, పలకరింపు, ఉద్యమం గురించి ఆతురత ఇవన్నీ ఉత్సాహాన్ని నింపేవి. నిరుత్సాహాన్ని దరిదాపులకు రానీయకుండా తోడ్పడేవి. 2015లో ఆమె మరణం ఆయనకు తీరనిలోటైనా కుటుంబ సభ్యుల ఆదరణలో ఆఖరి వరకూ చురుకుగా ఉండగలిగారు. జనవరి 18న మరణించడానికి ముందు రాత్రి కూడా ఆయన వార్తలు తెలుసుకున్నారంటే ఎంత సజీవమైన వ్యక్తిత్వమో అర్థమవుతుంది.
కమ్యూనిస్టు ఉద్యమంలో కాకలు తీరిన నరసింహయ్య వ్యక్తిత్వం పట్ల ఉద్యమంలో అందరికీ ప్రత్యేక గౌరవం ఉండేది. 2002లో హైదరాబాదులో జరిగిన అఖిలభారత మహాసభల్లో అప్పటి కార్యదర్శి హరికిషన్ సింగ్ సూర్జిత్ ఇతర సీనియర్లతో పాటు ప్రత్యేకంగా అభినందించారు, ఆయన మరణవార్త తెలిసిన సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఫోన్ చేసి జోహారులర్పించారు. ఉద్యమ నిర్మాతలుగా నిలిచిన పెద్దల పట్ల గౌరవం అది. కర్నూలులో జరిగిన అంతిమ యాత్రలో కమ్యూనిస్టు కార్యకర్తలూ అభిమానులే గాక ఇతర పార్టీల వారు కూడా జిల్లాలో ఒక రాజకీయ పితామహుడుగా నివాళులు అర్పించడం, యువ కామ్రేడ్స్ కూడా ఎంతగానో స్పందించడం చూశాను. కార్యకర్తల బాగోగులు పట్టించుకోవడమే గాక వారి కుటుంబాలను కూడా ఎంతో అభిమానంతో పరామర్శిస్తూ ఆయన ఉద్యమ నిర్మాతగా ఆశయాలు వ్యాప్తి చేయడమే గాక ఆత్మీయతను కూడా పంచిపెట్టారని అంతిమయాత్రలో పాల్గొన్నప్పుడు అందరూ గుర్తు చేసుకున్నారు. సంపూర్ణ సార్థక జీవితం గడిపిన ధన్యజీవి టిఎన్గారి మార్గం కమ్యూనిస్టులకు సదా అను సరణీయం. ఆయనకు మరోసారి నా విప్లవ జోహార్లు.
- బి.వి. రాఘవులు