Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశం ఎటుపోతుందో, ఆఖరుకు ఏమై పోతుందో అర్థంకాని పరిస్థితి. పదవిపిచ్చీ కుర్చీ మోజూ ఎవరిని ఎటు తీసుకుపోతుందో, ఈ బురద రాజకీయాలు ఆఖరుకు దేశాన్ని ఏమిచేస్తాయో తెలియని గతి, జరుగుతున్న సంఘటనలు రాజకీయ నాయకుల మాటలు, ఎన్నికల హౌరూ గమనిస్తే.. దేశం అన్ని రకాల విలువలను పోగొట్టుకున్నట్టే కనిపిస్తోంది. నైతిక విలువలు పతనమయ్యాయి. ప్రజాస్వామ్య విలువలు ధ్వంసమయ్యాయి.
మోడీలాగా ప్రధాని కుర్చీ విలువలను దిగజార్చిన నాయకున్ని చూడలేదు. అన్ని విలువలను ధ్వంసం చేసే విధంగా మోడీ మాట్లాడుతున్నారు. ప్రాంతీయ నాయకులుగా చలామణీలో వున్న దేవగౌడ లాంటివాళ్లు ప్రధాని అయ్యారు. విపి సింగ్, చంద్రశేఖర్ లాంటి నాయకులు ప్రధానులయ్యారు. కొంతకాలం మొరార్జీదేశారు కూడా ప్రధాని కుర్చీలో కూర్చున్నారు. వీరెవరూ సంపూర్ణ మెజారిటీ వున్నవారు కాదు. అయినా వీరంతా నైతికవిలువలూ ప్రజాస్వామ్య విలువ కాపాడుతూ.. ప్రధాని కుర్చీ విలువలూ పెంచారు. మోడీ దేశ ప్రధానిగా ఎన్నికలలో మాట్లాడుతున్న మాటలు బురద రాజకీయాలకు, చిల్లర రాజకీయాలకు ప్రతీకగా ఉన్నాయి. ప్రజాస్వామ్య భారతదేశానికి ఆ పదవిలో ఉన్న వ్యక్తి నడవడి, ప్రవర్తన ఆదర్శనీయంగా, ఆచరణీయంగా ఉండాలి. ప్రధానియే రాజకీయ బురదలో కాలుపెట్టి, ఆ బురదను ఇతరులపై చిమ్మితే.. ఇంతకంటే ఘోరం ఇంకొకటి లేదు. ఈ దేశం ఎవరిని నమ్మాలి? ఏ రాజకీయాలను నమ్మాలి? ఏ ఆదర్శాలను నమ్మాలి? ప్రజలు ఏ దారిలో వెళ్లాలి?
పార్టీ ఫిరాయింపులు చట్టరీత్యానే కాదు, నైతికంగా సమర్థనీయం కాదు. ప్రజలు వ్యక్తులకు ఓటు వేయరు. పార్టీకి, పార్టీ గుర్తుకు వేస్తారు. ఎన్నికైన నాయకుడు పార్టీ ఫిరాయిస్తే అంతకంటే ఘోరం ఇంకొకటి లేదు. ఫిరాయింపు నాయకుడు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ద్రోహం చేస్తున్నారు. ఓటు వేసిన ప్రజలను వంచనకు గురిచేస్తున్నాడు. పార్టీ ఫిరాయింపు పెద్ద తప్పు.. ప్రధాని కుర్చీలో వున్న వ్యక్తి.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తే ఎలా?
ఏదో విధంగా ప్రతిపక్షాలను ధ్వంసం చేయాలి. ఇదీ ఇప్పటి పాలకుల వైఖరి. ప్రతిపక్ష రాజకీయపార్టీలే ప్రజాస్వామ్యానికి దిక్చూచి అనే విషయం ఈ పాలకులు అర్థం చేసుకోవటం లేదు.. అంటే పాలకులు నియంతృత్వాన్ని కోరుతున్నారు. 'ప్రజాస్వామ్యం'ను పూర్తిగా తుడిచిపెట్టాలని చూస్తున్నారు. తాము చెప్పిందే అందరూ వినాలి. ప్రశ్నించకూడదు. ఎదురు మాట్లాడకూడదు.. ఇటు వంటి భావజాలంలో ప్రధాని మోడీ ప్రప్రధములు కావటం జాతి దురదృష్టంగా భావించాలి. ఎన్నికల సందర్భంలో ప్రధాని.. పదవీ హుందాతనాన్ని మరిచి మాట్లాడారు. ఇటువంటి సందర్భాలు ఏ ఎన్నికలలోనూ లేవు. ప్రధానియే ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే ఎలా? ప్రధాని ఎన్నికల కోడ్ ఉల్లంఘన గూర్చి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎలా? ఎటుపోతున్నాం మనం?
బెంగాల్ ఎన్నికల సభలో మోడీ మాట్లాడుతూ.. ''బెంగాల్ మమతా బెనర్జీ పార్టీ సభ్యులు నలభైమంది తనతో టచ్లో ఉన్నారన్నారు'' అంటే అర్థమేమిటీ? మామూలు ఒక రాష్ట్ర పాలక శాసనసభ్యులు భారత ప్రధానితో టచ్లో ఉండటమేమిటీ? అది బహిరంగంగా చెప్పటమేమిటో? మోడీ ప్రజల ఓటుకు విలువ యివ్వలేదు. ప్రజలు తృణమూల్ కాంగ్రెస్కు ఓటువేసి గెలిపించిన ఎమ్మెల్యేలు నలభైమంది తనతో మాట్లాడుతున్నారు, వాళ్లను బీజేపీలో చేర్చుకొని మమతాబెనర్జీ కుర్చీ లాగేసుకుంటాం.. ఇది మాట ఇదీ నియంతృత్వ ఆట.. మే 23 తర్వాత ప్రజలు ఎవరికి పట్టాభిషేకం చేస్తారో తెలియదు కానీ, మోడీ ఇలా మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికల ద్వారా మళ్లీ ప్రధాని అయితే, దేశం చీకటిరోజులు ఎదుర్కోవల్సి ఉంటుంది.
- సిహెచ్. మధుసిహెచ్. మధు
సెల్: 9949486122