Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో సీను మారుతున్నది. మొన్నటి వరకు జనం కంటికి కనిపించిన సత్యాలు వేరు.. అనుభవంలోకి వస్తున్న వాస్తావాలు వేరు. ఈ ఐదేండ్లలో పరపతి, పలుకుబడి, అంగబలం మెండుగా సాధించిన కేసీఆర్కు సహజంగానే రాష్ట్రం చిన్నదైంది. అందుకే చూపు దేశంవైపు మళ్లింది. 2019 ఎన్నికలు సమీపించిన దశలో ఇల్లు సర్దుకునే పనిలో పడిన ముఖ్యమంత్రి కొన్ని రోజులు ఢిల్లీ రాజకీయాలు పక్కనబెట్టినా ఇప్పుడు మళ్లీ అదే బాణీ ఎత్తుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు మీడియా ముందుకొచ్చి ''నేతలెవ్వరూ విజయగర్వానికి పోకూడదు. ప్రజలు భారీ మెజార్టీ ఇవ్వడం ద్వారా మనపై బాధ్యత పెంచారు. ప్రజలకు మరింత చేరువై, కష్టసుఖాల్లో తోడై ఉండాలి'' అని పలికిన మాటలు ప్రవచనాలయ్యాయి. వెంటనే రూటు మార్చారు. 'కేసీఆర్ ఇక రాష్ట్రాల బాట' అని అవే పత్రికలు రాయవల్సి వచ్చింది. ఇక్కడ సక్కదిద్దాల్సిన అనేక సమస్యలను గాలికొదిలి గాలిమోటర్లో తిరగడం మొదలెట్టారు.
నిన్నగాక మొన్న గెలిచిన ఎంఎల్ఏలు ఏం చేస్తున్నరో ఎవరికీ తెలియదు. మూణ్నెల్లక్రితం అంబరాన్నంటేలా ఊర్లల్ల సంబరాలు చేసుకున్న సర్పంచులకు ఏం చేయాల్నో తెలియడం లేదు. ఊర్లు కంపుకొడుతున్నా సఫాయి చేయిద్దామంటే సఫాయి కార్మికులు లేరు. ఇటీవలే ఓ ఊరి సర్పంచు జోలెపట్టి అడుక్కొచ్చి పంచాయతీ కార్మికులకు కూలి చెల్లించాడు. రామన్న అనే రైతు ఖాతాలో రెండో విడత రైతుబంధు సొమ్మెందుకు రాలేదో చెప్పెటోళ్లు లేరు. ఈ యేటి రైతుబంధు సంగతేంటో అని మల్లన్న ఎదురుచూస్తున్నడు. రుణం మాఫీ ఎప్పుడైతదో ఎవరికీ తెలుస్త లేదు. ఈ మాఫీ ఇంట్లో ఒక్కరికే వర్తిస్తదా.? వేరుపడ్డ అందరికీ ఇస్తారా.? అనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. పెరిగిన రెండు వేల పింఛన్ ఎప్పుడస్తది బిడ్డా అని అడుగుతున్న అవ్వకు ఏం చెప్పాలో ఆ కొడుక్కు తెలుస్తలేదు.. కొత్తగా పింఛన్ కోసం 57ఏండ్లు దాటిన వృద్ధులు ఎదురుచూస్తున్నరు. ఒకే ఇంట్లో అయ్య రుణమాఫీకోసం, సదువుకున్న కొడుకు నిరుద్యోగ భృతి కోసం కండ్లల్లో కొవ్వొత్తులేసుకున్నరు. మరో యాసంగికి సిద్ధమవుతున్న అన్నదాతలను అవే కష్టాలు పలకరిస్తున్నాయి. బడిపంతుళ్లు పీఆర్సీ కోసం, రేపో మాపో రిటైర్మెంట్ కాబోతున్న ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసు పొడగింపు ప్రకటన కోసం.. కొట్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రయివేటులో ఉన్నత సదువులు చదువుతున్న పేదపిల్లలు ఫీజు రీయింబర్స్మెంటు కోసం రోడ్డెక్కుతున్నారు. ఆస్తులు తాకట్టు పెడితేగాని యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వని స్థితి. తర్వాతి సదువు కోసం తల తాకట్టు పెట్టి అయినా సర్టిఫికెట్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి. ఇలా ఒక్కటేంటి..ఎన్నెన్నో సమాధానం లేని ప్రశ్నలు. పరిష్కారానికి నోచుకోని సమస్యలు. ఇంటిముందు వరకు తెచ్చి పెట్టిన పైపు నుంచి మిషన్భగీరథ నీళ్లు ఎప్పుడస్తయో చెప్పేటోళ్లు లేరు.. ఈ కష్టాలన్నీ పాపం పల్లెవాసులకే అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ప్రతిష్టాత్మక మిషన్ కాకతీయ, కళ్యాణలక్ష్మి పథకం, కేసీఆర్ కిట్టు అన్నీ నిధుల్లేక నీరసించాయి. కాంట్రాక్టర్లకు చేసిన పనులకూ బిల్లులు అందడం లేదు. 40వేల కోట్లకు పైగా బకాయిలు పడడంతో వారు లబోదిబో మంటున్నారు. తట్టాబుట్ట సర్దుకొని బిచాణా ఎత్తేస్తున్న పరిస్థితీ అక్కడక్కడ ఉండొచ్చు. అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయి. అంతే మోతాదులో నేతల నిలదీతలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో ముందుగా కనబడుతున్నది పాపం సర్పంచులే..
రాష్ట్రంలో సంక్షేమం, శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి. ప్రజల ఆశలు, ఆశయాలు, చిరకాల సాఫల్యాల చిరునామా కరువైంది. ఇంటర్బోర్డులో చోటుచేసుకున్న అక్రమాలు 26మంది విద్యార్ధుల ప్రాణాలను బలిగొన్నాయి. ఎందరో తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాయి. ఈ ఘటనతో రాష్ట్ర రాజధాని రగిలిపోయింది. ఇంటర్బోర్డు ప్రాంగణం, సమీప ప్రాంతాలన్నీ ఆందోళనలతో అట్టుడుకుతూనే ఉన్నాయి. ఈ గోస, ప్రజల ఆక్రందన, ఆవేదన ఇక్కడే ఉన్న కేసీఆర్కు వినపడడానికి ఐదు రోజులు పట్టింది. మొన్నెప్పుడో ఎక్కడో ఓ రైతు పట్టాపాసుపుస్తకం సమస్యను వాట్సాప్లో పెడితేనే ఘీంకరించిన ముఖ్యమంత్రికి మా గోడు ఎందుకు వినపడలేదో అన్న ప్రశ్న విద్యార్థుల తల్లిదండ్రుల మెదళ్లను తొలుస్తున్నది. దీన్ని తలదన్నే మరో ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. అక్కడ వెలుగుచూస్తున్న చిన్నారుల వరుస హత్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. సీరియల్ కిల్లర్గా శ్రీనివాస్రెడ్డి బాలికలను ట్రాప్ చేసి లైంగిక దాడులకు ఒడిగట్టి అతి కిరాతకంగా చంపేశాడు. వ్యభిచార కూపంలోకి బాలికల ఉదంతం.. పై అన్ని ఘటనల్లోనూ పోలీసుల నిర్లక్ష్యమే కనిపించింది. పై రెండు సందర్భాల్లోనూ రాష్ట్ర హైకోర్టు సుమోటోగా స్పందించింది. 'హార్మోన్ ఇంజక్షన్లిచ్చి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. బాలికలేమైనా బాయిలర్ కోళ్లా.' ఇంత జరుగుతుంటే సర్కారేం చేస్తున్నది? అని హెచ్చరించింది. ఆ ఉదంతం కూడా ఆ రోజు స్థానికుల చొరవతోనే బయటి ప్రపంచానికి తెలిసింది. ఫ్రెండ్లీ పోలీసులు ఎవరికి మిత్రులుగా వ్యవహరిస్తున్నారో అన్న ప్రశ్నా ఉదయిస్తున్నది. మరో తిరుపతిగా, అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్న యాదాద్రిలోనే భద్రత ఇంత ప్రశ్నార్థకమైతే..రాష్ట్ర వ్యాప్తంగా పరస్థితేంటి? నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో పొట్టకూటికోసం 'ఉపాధి' పనులకెళ్లిన పదిమంది కూలీలు మట్టిపెళ్లకింద సమాధయ్యారు. వాళ్ల పిల్లాపాపలు దిక్కులేనివాళ్లయి బిక్కుబిక్కుమంటున్నారు. దీనిపై ప్రత్యేక కమిటీ లేదు. విచారణా లేదు. కేవలం నీడ కల్పించని ఫలితంగా ఈ ఘోరం జరిగిందన్న విషయం తెలియంది కాదు. ఐనా బాధ్యులపై చర్యలు లేవు. పరిహారం ప్రకటించి చేతులు దులుపుకున్నరు. మేడ్చెల్ జిల్లాలో డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో పైన ఉన్న మోకు తెగి ఐదుగురు కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. విచారణకు ఆదేశించి చేతులు దులుపుకున్నరు. సిగ్గుపడాల్సిన మరో విషయమేంటంటే..భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని చెత్తకుప్పలో పడేశారు. రాష్ట్రం నడిబొడ్డున ఈ పరిస్థితి చోటు చేసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పి చేతులు దులుపుకున్నరు. సోషల్ మీడియా వేదికగా వీటన్నింటినీ ప్రశ్నిస్తున్న జనంపై, ముఖ్యంగా యువతపై స్వయంగా ప్రభుత్వ పెద్దలు కేసులకు పురమాయిస్తున్నరు. ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నది. ప్రశ్నించేవారు పెరుగుతున్నారు.
ఇటీవలి కాలంలోనే పలు విషయాల్లో రాష్ట్ర హైకోర్టు స్వయంగా జోక్యం చేసుకుంది. విద్యాహక్కు చట్టం ఎప్పుడు అమలు చేస్తారు అని మూడు వారాల కింద ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్రం మీద తోసేసే ప్రయత్నాన్ని తప్పుబట్టింది. సుప్రీం కోర్టుకు వెళ్లి అడగాల్సింది. ఎవరొద్దన్నారు? అని ఎదురు ప్రశ్నించింది. మల్లన్నసాగర్ నిర్వాసితులకు 100శాతం పరిహారమిచ్చాకే ఊర్లు ఖాళీ చేయించాలనీ తేల్చి చెప్పింది. ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో తేడాలపై ఐటీ శాఖ నుంచి అధినేత సహా అనుచరగణం నోటీసులు అందుకున్నారు.
నిన్నటి వరకు ఎదురే లేదనుకున్న కేసీఆర్కు ఈ వరుస పరిణామాలు సహజంగానే మింగుడు పడడం లేదు. మరో వైపు పార్టీలోనూ అసంతృప్తులు పెరిగాయి. పార్టీ అధినేతగా కేటీఆర్కు జనం బాధలకంటే ఇల్లు సక్కదిద్దుకునే పనులే ఎక్కువైనట్టు తెలుస్తున్నది. వీటికి తోడు పరిషత్ ఎన్నికలు తెచ్చిన చిక్కులూ.. పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార నేతలెవరూ ఆసక్తి చూపడం లేదు. 'నిధులు వచ్చేది లేదు.. అధికారాలు దక్కేది లేదు' అని బహిరంగంగానే భగ్గుమంటున్న పరిస్థితి. ముఖ్యంత్రిగా అన్నీ తానే అయి చేస్తున్న ఫలితమే ఇది. అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అటు పార్టీకి, ఇటు పాలనలోనూ కాళ్లూ చేతులు, కండ్లూ చెవులూ, మనసూ, మస్తిష్కం అన్నీ ఆయనే అయ్యారని కీలక నేతలు సైతం గుసగుసలాడుతున్నారు. ఎంతటి సీనియర్ నేతలైనా.. కేసీఆర్ ఆజ్ఞల సరిహద్దులు, ఆదేశాల పరిధులు దాటడానికి లేదన్నది అనేక సందర్భాల్లో వెల్లడవుతూనే ఉన్నది. ఇటీవల జరిగిన ఇంటర్ బోర్డు అక్రమాల్లోనూ విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి నిమిత్తమాత్రుడైన స్థితి లక్షలాది మంది తల్లిదండ్రులు కళ్లారా చూశారు. ఇవన్నీ చూసిన ఎవరికైనా అర్థమవుతున్నదొక్కటే. రాష్ట్రంలో పాలన పండుకున్నదనీ, కేసీఆర్ ప్రాభవం తగ్గుతున్నదనీ..! ఇక నుంచి ఎదురీత తప్పదనీ!!
- కొలిపాక నాందేవ్
సెల్: 9490099387