Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశంలో దేశ ప్రజలందరూ సుఖసంతోషా లతో సంతృప్తిగా జీవించడానికి పర్యాయపదంగా 'రామరాజ్యం' అనే మాటను వాడుకలోకి తెచ్చారు. అది మూఢభక్తిలోంచి వెలుగులోకి వచ్చిన మాట! రాముడు, రామరాజ్యం అన్నీ సృజనాత్మక రచనలో భాగమే తప్ప, పురాణంలోని అంశాలే తప్ప - వాటికి చారిత్రక ఆధారాలు లేవు. మన ముందు తరాల్లో ఇక్కడ పుట్టి, దేశం కోసం పోరాడి, ఇక్కడి ప్రజలను చల్లగా చూసుకుంటూ, అన్ని మతాల్ని, అన్ని అభిప్రాయాల్ని గౌరవిస్తూ రాజ్యాలేలిన రాజులు, చక్రవర్తులు ఉన్నారు. మానవాళికి మేలు చేసిన మహనీయులున్నారు. స్ఫూర్తివంతమైన వారి జీవితాల్ని మనం గుర్తుచేసుకుంటూ ఉండాలి. కల్పిత పాత్రల్ని ఆదర్శంగా తీసుకోవడమంటే, ఊహల్ని, కల్పనల్ని ఆదర్శంగా తీసుకోవడమే కదా? ఆదర్శవంతంగా జీవించిన వ్యక్తుల జీవితాల గూర్చి తెలుసుకోవడం, విశ్లేషించుకోవడం - అంటే అది వాస్తవాన్ని అర్థం చేసుకోవడమన్నట్టే - మానవీయ దృక్పథంతో రాజ్యమేలి ఛత్రపతిగా నిలిచిన శివాజీ మహారాజును ఈ దేశ ప్రజలు ఎప్పటికీ మరచిపోరు. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలకు ఆయన అత్యంత ప్రీతిపాత్రుడు. చరిత్ర పరిశోధకుడు, మానవ హక్కుల కార్యకర్త అయిన డాక్టర్ రాం పునియాని రచనల్లో, ఉపన్యాసాల్లో ఎన్నో వాస్తవాలు మనకు అవగతమౌతాయి. 'గతమెంతో ఘనకీర్తి' అని ఊరికే కొనియాడకుండా చారిత్రికాంశాల్ని హేతుబద్ధంగా విశ్లేషించడం డా.పునియాని ప్రత్యేకత. ఆయన దృష్టిలో ఛత్రపతి శివాజీ ప్రజా సంక్షేమ పాలకుడు. మరికొందరు ఆయన్ని ముస్లిం వ్యతిరేకిగా చిత్రించారు. ఇంకా కొందరు ఆయనను గోబ్రాహ్మణులను రక్షించడానికి అవతరించిన వాడిగా పూజించారు. ఏమైనా భారతదేశ ప్రజల హృదయాలలో ముఖ్యంగా మరాఠా ప్రజల్లో చిరకాలం నిలిచిపోయిన ప్రసిద్ధుడైన రాజు. ముంబాయి విమానాశ్రయానికే కాదు, అక్కడి రైల్వే స్టేషనుకు కూడా వారు శివాజీ పేరే పెట్టుకున్నారు. ఇప్పటికీ ఆయన పేరుతో అక్కడి ప్రజలు నూతనోత్సాహాన్ని, ఉత్తేజాన్ని పొందుతున్నారు.
రాజుల మధ్య జరిగిన యుద్ధాలను హిందూ ముస్లింల మధ్య జరిగిన మత కలహాలుగా కొందరు చరిత్రకారులు చిత్రించారు. ప్రసిద్ధ మరాఠా నాటకం 'జాణ్తారాజా' (జగమెరిగిన రాజు) నాటకం కూడా శివాజీని ముస్లిం ద్వేషిగా చిత్రీకరించింది. ముస్లింల పట్ల, వారి మతం పట్ల శివాజీ ఎప్పుడూ ద్వేష భావం చూపలేదు - అని చరిత్రకారుడు సర్దేశాయి 'న్యూ హిస్టరీ ఆఫ్ మరాఠాస్' అనే తన పుస్తకంలో రాశారు. సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించడమే శివాజీ ప్రాథమిక లక్ష్యంగా జీవితాంతం పోరాడాడు. అంతేగాని, ఆయన ఎప్పుడూ ముస్లిం ద్వేషి కాదు. ఇస్లాం వ్యతిరేకీ కాదు. అలా చూపించడానికి ప్రయత్నించినవారు వాస్తవాల్ని వక్రీకరించినట్టవుతుంది.
మతం ప్రాతిపదికన కాకుండా మానవీయ కోణంలో ఛత్రపతి శివాజీ పరిపాలన సాగించాడు. సైన్యంలో, ఇతర అధికారుల నియామకాల్లో మతానికి ఏ మాత్రం ప్రాముఖ్య మివ్వలేదు. అతని సైన్యంలో ఎక్కువ మంది ముస్లింలే. నావికాదళ అధిపతి సిద్దీ సంబాల్ అనే అతను ఉండేవాడు. ఆ దళంలో ఎక్కువమంది సైనికులు కూడా ముస్లింలే. రాజ్యాన్ని రక్షించాల్సిన సైన్యంలో ఆయన నిర్భయంగా ముస్లింలను నియమించుకోవడం, వారి మీద నమ్మకం పెంచుకోవడం గమనించాల్సిన విషయం. అలాంటి వాణ్ణి ముస్లిం వ్యతిరేకిగా చిత్రించడమంటే వారి అవగాహనా రాహిత్యాన్ని బయట పెట్టుకున్నట్టే.. ఇతర మత పెద్దలను శివాజీ ఎంతో గౌరవించేవాడు. హజ్రత్బాబా యాకుబ్ తొర్వాలే పట్ల శివాజీకి ఎంతో గౌరవభావముండేది. జీవితాంతం ఆయనకు పింఛను అందేలా ఏర్పాటు చేశాడు. ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు తన రాజధాని రాయగఢ్లో ప్రత్యేకంగా మసీదు నిర్మించాడు. అంతేగాదు, రాజ్యంలోని, మసీదులను, దుర్గాలకు రక్షణ కల్పించాడు. ఎవరికైనా ఖురాన్ దొరికితే దాన్ని గౌరవంగా తీసుకెళ్లి ముస్లింలకు అప్పగించాలన్న ఉత్తర్వు అమలులో ఉండేది. అలాగే ఫాదర్ అంబోస్ పట్ల కూడా శివాజీకి ఎంతో గౌరవముండేది. గుజరాత్ దాడిలో ధ్వంసమైన చర్చి పునర్నిర్మించడానికి భూరి విరాళం అందించాడు.
యుద్ధ సమయంలో చేతికి చిక్కిన ఇతర మతాల మహిళల పట్ల, పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తించరాదని సైన్యానికి ఆదేశాలుండేవి. అఫ్జల్ఖాన్ను శివాజీ హత్య చేయడాన్ని కొందరు వక్రీకరించారు. ఆదిల్షా రాజులకు శివాజీకి ఏండ్ల తరబడి యుద్ధం సాగుతున్న తరుణంలో, ఆదిల్షా రాజ్యానికి అఫ్జల్ ఖాన్ ప్రతినిధిగా పోరాడాడు. చర్చల పేరుతో శివాజీని తన గుడారానికి ఆహ్వానించి చంపడానికి అఫ్జల్ఖాన్ కుట్రపన్నాడు. ఆ కుట్రకు రూపకల్పన చేసింది ఒక హిందూ - కృష్ణాజీ భాస్కర్ కులకర్ణి. అయితే ఆ కుట్ర వివరాలు ఒక ముస్లిం ద్వారా శివాజీ తెలుసుకున్నాడు. అంటే హిందువయిన శివాజీ మహారాజును రక్షించుకున్నది ముస్లిం అయిన రస్తీం జమాన్. రస్తీం జమాన్ సూచనమేరకే శివాజీ ఇనుప పంజాలు ధరించి అఫ్జల్ఖాన్ను చంపేశాడు. ఇక్కడ మనం కృష్ణాజీ భాస్కర కులకర్ణి పోషించిన పాత్రను విశ్లేషించుకుంటే, మనకు అర్థమయ్యేదేమంటే.. తన మతం వాడయినా సరే.. తక్కువ కులంవాడు రాజుగా ఉండటం భరించలేక శివాజీని చంపడానికి వేరే మతం వాడికి సహాయపడ్డాడు. సరే, ఆ పథకం విఫలమైంది అది వేరే విషయం.
ప్రజారంజకుడైన మహారాజు ఛత్రపతి శివాజీ మనుస్మృతిని ధిక్కరించాల్సిన అవసరం ఎందుకొచ్చిందీ? అంటే - శివాజీ మరాఠా 'కున్భి' కులస్తుడు. అంటే మన తెలుగుప్రాంతాల్లో 'కాపు' అంటారు. బ్రాహ్మణుల మనుస్మృతి ప్రకారం కాపు కులం ఒక శూద్రకులం. శూద్రకులాలను బ్రాహ్మణులు బానిసలుగా మార్చిన విషయం మనకు గతం చెపుతూఉంది. దేశ జనాభాలో తొంభైశాతం ఉన్న ఈ 'శూద్రులు' బ్రాహ్మణులు రచించుకున్న మనుస్మృతి ప్రకారం చదువుకోగూడదు. ఆయుధం ఉపయోగించగూడదు. బ్రాహ్మణులకు ఎదురుపడగూడదు. కేవలం వారి వారి చేతివృత్తులు చేసుకుని జీవించాలి. పైగా తమ రాబడిలో సగభాగం బ్రాహ్మణ పెత్తందారులకిచ్చి, మిగతా సగంతోనే జీవించాలి. ఈ కట్టుబాట్లను ఎవరైనా ధిక్కరిస్తే నాలుకలు కోసేవారు, చెవుల్లో సీసంపోసేవారు. రాజయిన శివాజీకే వివక్ష తప్పలేదు. శివాజీని పట్టాభిషక్తుణ్ణి చేయడానికి స్థానిక బ్రాహ్మణులెవరూ సహకరించలేదు. అప్పుడు దూరప్రాంతం నుంచి ఒక బ్రాహ్మణ్ణి పిలిపించారు. అతను కార్యక్రమం పూర్తి చేయించాడు కానీ, శివాజీ నుదట తన కాలి బొటనవేలుతో తిలకం దిద్దాడు. ఎందుకంటే రాజైనవాడు శూద్రుడు గనక! పరిస్థితి సమకాలీనంలో కూడా మారలేదు. గుళ్లోకి దళితులకి అనుమతి లేదంటే ఒక చోట ప్రస్తుత భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు గుడిబయట మెట్లమీద పూజలు నిర్వహించి, వెనుదిరిగారు.
మనుస్మృతి నిబంధనలు కఠినంగా అమలులో ఉన్న ఆ కాలంలో శూద్రుడై ఉండి శివాజీ ఆయుధం చేపట్టాడు. జ్ఞాని అయ్యాడు. సర్వమత సహనంతో ప్రజల్ని సమభావంతో ఆదరించాడు. అంటరాని కులాల వారికి ఆయుధమిచ్చి వారిని సైనికులుగా తీర్చిదిద్దాడు. అలాంటి శివాజీని కుట్రలు కుతంత్రాలతో బ్రాహ్మణులు హత్య చేశారు. శివాజీ కుమారుడు శంభాజీ తండ్రి బాటలో నడిచాడు. మనుస్మృతిని ధిక్కరించి చదువుకుని 'బుద్ధ భూషణం' అనే పుస్తకం రాశాడు. వేదపురాణాల్ని అధ్యయనం చేసి అవి పనికిరావని తేల్చాడు. 'ఈదేశానికి బౌద్ధం ఒక్కటే మార్గం' అని నిర్ణయించుకుని ప్రచారం చేశాడు. శూద్రకులాల్ని చైతన్యపరిచాడు. శూద్రకులాలు బలపడితే తమకు ప్రమాదమని బ్రాహ్మణవర్గాలు ఔరంగజేబు సహాయంతో శంభాజీని, అతని అనుచరుల్ని బంధించారు. మనుస్మృతిలో చెప్పినట్టు కళ్ళుపీకి, చర్మం వొలిచి, నాలుక కోసం అతిక్రూరంగా హత్య చేశారు. శంభాజీ తలను, అతని అనుచరుల తలలను కోసి, వాటిని వారి కత్తులకు గుచ్చి పూనాలో ఊరేగించారు. మమ్మల్ని ధిక్కరించి కులధర్మాన్ని ధిక్కరించినవాడు చక్రవర్తి అయినా సరే వాడికి ఏ గతి పట్టిందో చూడండంటూ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేశారు. తమను ఎదిరిస్తే ఎవరికైనా అదేగతి పడుతుందని హెచ్చరించారన్నమాట! శంభాజీని పోత్సహించిన అంటరాని వారికి తర్వాత కాలంలో మూతికి ముంత, నడుముకు చీపురూ వచ్చాయి. ఛత్రపతి శంభాజీ హత్యకు గుర్తే.. చెంబులో కర్రలు పెట్టి ఊరేగించడం! మహారాష్ట్రలో అది గుడిపడవా. తెలుగు ప్రాంతాల్లో ఉగాది. అందుకే ఉగాది ఏ విధంగానూ మన పండగ కాదు అనేది విశ్లేషకులు చెపుతున్న మాట. ఈ దేశ మూలవాసులకు అదొక దుర్దినం.. ఛత్రపతి శివాజీ కాలంలోనే కాదు, ఈ 21వ శతాబ్దంలో కూడా ఈ కులమతాలు ఇలాగే కొనసాగాలని ఒక జయ్యరయ్య ఏమాత్రం సిగ్గూ, బిడియం లేకుండా చెపుతున్నాడంటే ఏమిటీ? మంత్రయినా, ముఖ్యమంత్ర యినా సరే, వచ్చి తన కాళ్ళ మీద పడాల్సిందేనని చెప్పుకోవడమన్న మాట! ఆధిపత్య కుల అహంకారం అజ్ఞానంతో ప్రదర్శించుకోవడమన్న మాట!! దీన్ని బట్టి మనం ఎన్నుకుంటున్న నాయకులకు ఏమైనా బుద్ది జ్ఞానం ఉంటోందా లేదా అని జనం ఆలోచించుకోవాల్సి ఉందన్నమాట.
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త
బయాలజీ ప్రొఫెసర్, మెల్బొర్న్ నుంచి.
- డాక్టర్ దేవరాజు మహారాజు