Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్నారి ఆడ పిల్లల అపహరణ, హింస, అత్యాచారం, హత్య వంటి ఘటలతో యాదాద్రి భువనగిరి జిల్లా హజీపూర్ గ్రామం ఒక్కసారిగా సభ్య సమాజానికి పలు ప్రశ్నలను సంధించింది. ఇప్పటివరకు గ్రామంలోని ఇద్దరు చిన్నారులు, ఒక యువతి దారుణ హత్యలు వెలుగులోకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ దారుణాలు చేసిన మర్రి శ్రీనివాస్రెడ్డి గతంలో వెలుగులోకి రాని, ఇంకెన్ని చీకటి దారుణాలకు పాల్పడ్డాడో అన్న అనుమానాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్ పాతబస్తీలో రెండవ తరగతి చదువుతున్న 7ఏండ్ల బాలుడిని అత్యాచారం జరిపి అతి దారుణంగా హతమార్చిన సంఘటనలో మద్యం, మత్తుమందుకు (డ్రగ్స్) అలవాటు పడ్డ యువకులు అనుమానితులుగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. నిషేదిత మత్తుమందు చలామణీ, వాటిని సేవించేవారు సమాజంలో ఎటువంటి దారుణాలకైనా పాల్పడే అవకాశం ఉంది. కేవలం చిన్నారులు, మహిళల అపహరణ, హింస, అత్యాచారం వంటి నేరాలే కాక సమాజాన్ని పట్టి పీడించే పలు నేరాలను నియంత్రించడం కూడా పౌరసమాజం, ప్రభుత్వం తమ ప్రధమ కర్తవ్యంగా భావించాలి. ఇటువంటి సంఘటనలు జరినప్పుడే హడావిడి చేసి స్పందించే పౌర సమాజం, ఇటువంటి సంఘటనలు మరెక్కడా జరగకుండా పలు జాగ్రత్తలు, చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. సమాజంలో ప్రతిఒక్కరు బాగస్వాములన్న సంగతి మరువరాదు. ప్రజలను పాలించే ప్రభుత్వాలు కేవలం రాజకీయపరంగా కాకుండా శాంతిభద్రతలకు కూడా ప్రాముఖ్యతను ఇవ్వాలి. పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు, సంపన్న వర్గాలకు, వారి బందోబస్తు సేవలను పోలీసువ్యవస్థను వినియోగించుకుంటూ, సామాన్య ప్రజానికానికి సేవలను తూతూ మంత్రంగా, అప్రధానాంశంగా పరిగణిస్తున్నారన్న అభిప్రాయం ప్రజలలో ఉంది. విచారించదగ్గ విషయమేమిటంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో రాజకీయాలు నేరమయమవుతుండడం, తద్వారా వ్యాపారమవు తుండడం చూస్తూనే ఉన్నాం. రాజకీయాలలో నేరస్తులు చొరబడడం లేదా తమ పబ్బం గడుపుకోవడానికి నేరస్తులకు అండగా నిలబడడం వలన సమాజంలో నేరాలు వివిధ రకాలుగా వ్యవస్థీకృతమవుతున్నాయి. వ్యవస్థీకృతమైన నేరమయ రాజకీయ వాతావరణానికి రాజ్యాంగ వ్యవస్థలు కూడా పరోక్షంగా తోడ్పడుతున్నా యన్న అనుమానాలు మరింతగా సాధారణ ప్రజలలో నెలకొంటున్నాయి. ఎందుకంటే నేరారోపణకు గురికాబడిన వ్యక్తి ఫలానా రాజకీయ పార్టీనో, లేక ఫలానా కులానికి చెందిన వాడనో చెప్పి, రాజ్యాంగబద్ధమైన పోలీసు వ్యవస్థపై ఒత్తిడులు తెచ్చి, కేసును తారుమారు చేస్తూ న్యాయవవస్థను తప్పుదారి పట్టిస్తు న్నారన్న అనుమానాలు కూడా ప్రజలలో ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయాలను ప్రజలకు సేవ చేసే భాగ్యంగా భావించాలే తప్ప వ్యాపారంగా భావించడం వలన సమాజంలో నేరాలకు బీజం పడుతుంది. నేరాలు చేసే వ్యక్తి ఏ రాజకీయ పార్టీ వాడయినా తమపర భేదం లేకుండా విచారణ జరిపి, న్యాయవవస్థ ద్వారా శిక్షలు పడే విధంగా ప్రభుత్వం పోలీసు వ్యవస్థకు ఆదేశాలు చిత్తశుద్ధితో జారీచేస్తే, ప్రజలు కూడా తమవంతు సహకారాన్ని ఇస్తారని, తద్వార ఆరోగ్యమైన సమాజం నిర్మితమౌతుందని భావిద్ధాం.
- గుణశేఖర్ శ్రీవరం|
సెల్: 7382348735