Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గతంలోని సంక్షేమ విధానాలను అవలంబించిన కాలంతో పోల్చినప్పుడు నయా ఉదారవాద పాలనలో భారతదేశ స్థూల జాతీయోత్పత్తి వృద్ధిరేటు చాలా ఎక్కువగా ఉంది. అంతకు ముందటి వృద్ధిరేటు కంటే ఇది రెండురెట్లు ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. అలాగే నయా ఉదారవాద విధానాలు అవలంబించిన కాలంలో వ్యవసాయరంగ వృద్ధిరేటు ముఖ్యంగా ఆహారధాన్యాల వృద్ధిరేటు అంతకు ముందటి కాలంలోకంటే తక్కువ ఉందని కూడా ఈ గణాంకాలు చెబుతున్నాయి.
తలసరి గణాంకాలను తీసుకున్నప్పుడు ఈ తేడా మరీ తీవ్రంగా ఉంది. నయా ఉదారవాద పాలనలో తలసరి స్థూల జాతీయోత్పత్తి అంతకుముందటి కాలంతో పోల్చినప్పుడు రెండురెట్లు ఉండగా అదే కాలంలో ఆహారధాన్యాల ఉత్పత్తి తలసరి వృద్ధిరేటు దాదాపు శూన్యంగా ఉంది. నయా ఉదారవాద విధానాలను అవలంబించక ముందటి శకంలో పరిగణనలోకి తీసుకునే కాలాన్నిబట్టి ఆహారధాన్యాల వృద్ధిరేటు 0.5నుంచి 1శాతం మధ్య ఉండేది.
ఆహారధాన్య, ఆహారధాన్యేతర రంగాలలో పెరుగుతున్న అసమతౌల్యతవల్ల నయా ఉదారవాద శకంలో అంతకుముందటి కాలంలోకంటే ఆహారధాన్యాలకు డిమాండ్ పెరిగివుండాల్సింది. దానితో ఆహారధాన్యాల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడటమో లేక ఆహారధాన్యాల దిగుమతులు పెరగటానికి దారితీయటమో జరిగివుండాల్సింది. అయితే అందుకు పూర్తిగా విరుద్ధ పరిస్థితి మనకు కనపడుతోంది. ఆహారధాన్యాలను అధిక పరిమాణంలో దిగుమతి చేసుకోవటానికి బదులుగా భారతదేశం ఆహార ధాన్యాలను పెద్దఎత్తున ఎగుమతి చేస్తోంది. నయా ఉదారవాద విధానాలను అవలంబించకముందు ఆహారధాన్యాల ధరలు నిరంతరం ద్రవ్యోల్బణానికి లోనయ్యేవి. నయా ఉదారవాద కాలంలో ఆహారధాన్యాలు ధరలలో సగటున ద్రవ్యోల్బణం రేటు తక్కువగా ఉంది. గత 25ఏండ్ల నయా ఉదారవాద కాలంలో ఎవో కొన్ని సందర్బాలలో తప్ప ప్రభుత్వ ఆధీనంలో గల ఆహారధాన్యాల నిల్వలు 'సాధారణ' స్థాయిలోకంటే చాలా ఎక్కువ పరిమాణంలో ఉన్నాయి.
ఇదెలా సాధ్యం? తలసరి వృద్ధి రేటు క్షీణిస్తున్న ఆహారధాన్య రంగానికి, తలసరి వృద్ధిరేటు పెరుగుతున్న ఆహారధాన్యేతర రంగానికి మధ్య పెరుగుతున్న అసమతౌల్యత కారణంగా ఏర్పడిన పరిస్థితివల్ల డిమాండ్ తీవ్రంగా పెరగటానికి బదులుగా వాస్తవంలో దానికి పూర్తి విరుద్ధంగా సరఫరా ఎందుకు పెరుగుతోంది? విషయాన్ని వేరేవిధంగా చెప్పాలంటే ఆర్థికవేత్తలు పిలిచే ఆహారధాన్యాల 'ఆదాయ వ్యాకోచ డిమాండ్' అంటే తలసరి నిజ ఆదాయం 1శాతం పెరిగినప్పుడు ఆహారధాన్యాల తలసరి డిమాండ్ పెరగటం సాధారణంగా సానుకూలం. పర్యంవసానంగా నయా ఉదారవాద కాలంలో ఆహారధాన్యాల కొరత పెద్దఎత్తున ఏర్పడాల్సింది. కానీ మనకు ఆహార ధాన్యాల నిల్వలు సమృద్ధిగా ఉన్నట్టు కనపడటం, వాటిని ఎగుమతి చేయటం ఎలా జరుగుతోంది? ఇది ఒక విచిత్రం.
ఈ విచిత్రాన్ని వివరించటానికి ఆదాయ అసమానతలు పెరగటం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెబితే సరిపోదు. ఆదాయ వ్యాకోచంతో ఏర్పడే డిమాండ్ ఆదాయ పంపిణీపై ఆధారపడుతుందనేది నిజమే. ఈ పంపిణీ మరింత అసమానం అయినప్పుడు ఆదాయ వ్యాకోచంతో ఆహార ధాన్యాలకు ఏర్పడే డిమాండ్ పడిపోతుంది. ఆహార ధాన్యాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా సంపన్నులు పేదలకంటే సగటున తలసరి మరింతగా వినిమయం చేసినప్పటికీ సంపద ఏమేరకు పేదల నుంచి సంపన్నులకు బదిలీ అవుతుందో ఆ మేరకు ఆహార ధాన్యాల డిమాండ్ తగ్గుతుంది. అయితే ఆదాయ పంపిణీ క్షీణించటాన్ని చూపి ఈ పరిస్థితిని వివరించటం సాధ్యపడదు. ఎందుకంటే ఆహార ధాన్యాల ఆదాయ వ్యాకోచ డిమాండ్ తగ్గటాన్ని గురించి మాత్రమే మనం మాట్లాడటం లేదు. అది ప్రతికూలం కావటాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. జనాభాలో ఒక ప్రధాన విభాగం పరిస్థితి నిరపేక్షంగా క్షీణించినప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది.
ఈ విచిత్రాన్ని వివరించటానికి ఇలా జరిగేవుంటుందనే వివరణతప్ప మరొకటి లేదు. అయితే దీనిని సాదాసీదాగా సూచించటంతోనే సరిపోదు. ఇలా ఎందుకు జరిగింది? అని మనం అడగాలి. ఉదాహరణకు ఒకవేళ బ్రిటిష్ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ 'లాభ ద్రవ్యోల్బణం(ప్రోఫిట్ ఇన్ఫ్లేషన్)'గా పేర్కొన్న మౌలిక నగదు ఆదాయాలకు(బేస్ మనీ ఇన్కమ్స్) సాపేక్షంగా ధరలు పెరిగితే జనాభాలో ఒక ముఖ్య విభాగం పరిస్థితి నిరపేక్షంగా క్షీణించటం సాధ్యమే. అయితే నయా ఉదారవాద శకంలో ఆహారధాన్యాల ధరలలో ద్రవ్యోల్బణం ఏర్పడటాన్ని మనం చూడలేదు. కార్మికుల కొనుగోలు శక్తికి సాపేక్షంగా పెరిగే ఆహారధాన్యాల ధర ద్వారా ఇది జరగలేదనేది సుస్పష్టం. కానీ వేగంగా పెరగని ఆహారధాన్య ధరకు సాపేక్షంగా కార్మికుల కొనుగోలు శక్తిని బలహీనపర్చటం ద్వారా జనాభాలోని ఒక ప్రధాన విభాగం పరిస్థితి నిరపేక్షంగా క్షీణించటానికి దారితీసింది.
అయితే ఇలా చెప్పటంతోనే సరిపోదు. ఏమంత వేగంగా పెరగని ఆహార ధరకు సాపేక్షంగా కొనుగోలుశక్తి క్షీణించటం ఎలా జరిగింది? ఆహారధాన్యాలతోసహా వ్యవసాయ ఉత్పత్తి వృద్ధి మందగించటమనేది ఈ ప్రశ్నకు ఒక స్పష్టమైన సమాధానంగా ఉంటుంది. ఉత్పత్తి ఇలా మందగించినప్పుడు రైతుల, వ్యవసాయ కార్మికుల చేతుల్లో వుండే కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. కాబట్టి ఒకవేళ ఉత్పత్తి తగ్గితే ఉత్పత్తిదారులు నుంచి వచ్చే డిమాండ్ తగ్గిపోతుంది.
ఒకవేళ ఆహారధాన్య ఉత్పత్తిలో ఒక యూనిట్ తగ్గితే ఉత్పత్తిదారుల అంటే రైతుల, వ్యవసాయ కూలీల నుంచి వచ్చే ప్రత్యక్ష డిమాండ్ (వారు తక్కువ పరిమాణంలో ఆహారధాన్యాన్ని వినిమయం చేస్తారు), వారి ఇతర సరుకుల వినిమయం తగ్గటంతో వారి పరోక్ష డిమాండ్ కూడా తగ్గుతుంది. అలా ఇతర సరుకులకు తగ్గిన డిమాండ్వల్ల ఆయా సరుకుల ఉత్పత్తిదారులు తమ ఆహారధాన్యాల అవసరాల(డిమాండ్)ను తగ్గించుకోవలసిన స్థితికి నెట్టబడతారు.
అయితే ఏదైనా ఒక వాస్తవ ఆర్థిక వ్యవస్థలో ఆహారధాన్య ఉత్పత్తిలో ఒక యూనిట్ పడిపోవటంవల్ల ఒక యూనిట్ కంటే ఎక్కువ డిమాండ్ పడిపోదు. ఇదే విషయం తల్లకిందులైనా కూడా ఇదే జరుగుతుంది. ఆహారధాన్య ఉత్పత్తి ఒక యూనిట్ పెరిగితే వాటికిగల డిమాండ్ ఒక యూనిట్ కంటే ఎక్కువగా పెరుగుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థలో నియంత్రించటానికి సాధ్యపడని స్థాయిలో ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. కాబట్టి ఆహారధాన్య ఉత్పత్తి తగ్గటం వల్ల వాటికిగల డిమాండ్(దానికదిగా అది ఒక యూనిట్ కంటే తక్కువ డిమాండ్ తగ్గిస్తుంది) పెరుగుతుంది. ఒకవేళ ఉత్పత్తి 100నుంచి 99కి తగ్గితే, అంటే ఒక యూనిట్ తగ్గితే దానివల్ల డిమాండ్ ఒక యూనిట్ కంటే తక్కువగా తగ్గుతుంది. అప్పుడది 99.5 అవుతుంది. అటువంటప్పుడు డిమాండ్ 0.5శాతం అధికం అవుతుంది.
కాబట్టి నయా ఉదారవాద కాలంలో ఆహారధాన్యాల అధిక సరఫరాను వివరించటానికి కేవలం తలసరి ఆహారధాన్య వృద్ధిరేటు పతనాన్ని చూపితేనే సరిపోదు. మరేదో విషయం దీనిలో స్పష్టంగా ఉంది. అదేమిటో తెలియాలంటే మనం ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. వ్యవసాయాధారిత జనాభా (ప్రస్తుత సందర్బంలో మనం ఈ జనాభాపై దృష్టి సారిస్తున్నాం గనుక) చేతుల్లోగల నిజ కొనుగోలు శక్తి రెండు కారకాలపై ఆధారపడుతుంది: తాము చేస్తున్న ఉత్పత్తి, తాము చేస్తున్న ఉత్పత్తికి చెందిన ఒక్కో యూనిట్ను కొనటానికి కావలసిన నిజ కొనుగోలు శక్తి. ఈ రెండూ స్పష్టంగా రెండు వేరువేరు విషయాలు. ఒకవేళ అదే భౌతిక ఉత్పత్తిని ఉత్పత్తి చేసినా ఉత్పత్తిదారుల చేతుల్లోని నిజ కొనుగోలు శక్తి లేక నిజ ఆదాయాలలో తేడా ఉంటుంది. అది వారు చెల్లించవలసిన ఇన్పుట్ ధరలపైన, తాము చేసిన ఉత్పత్తికి వచ్చే ధరలపైన, కొనుగోలు చేసే సరుకులకు వారు చెల్లించవలసిన ధరలపై అది ఆధారపడి ఉంటుంది.
నయా ఉదారవాద శకంలో భారతదేశంలో జరిగిందేమంటే రైతుల, వ్యవసాయ కార్మికుల చేతుల్లోని నిజ ఆదాయం కుదింపునకు గురైంది. వ్యవసాయ ముఖ్యంగా ఆహారధాన్య ఉత్పత్తి వృద్ధి క్షీణించటం, ఒక్కో యూనిట్ ఉత్పత్తికి అందే నిజ ఆదాయం కూడా క్షీణించటం, ఇన్పుట్ ధరలు సాపేక్షంగా పెరగటం, ఉత్పత్తి ధరలు సాపేక్షంగా పడిపోవటం (ఉదాహరణకు ధాన్య సేకరణ ధరలలో ఇది ప్రతిబింబిస్తుంది), వారు కొనుగోలు చేసే వివిధ రకాల వస్తువుల(ముఖ్యంగా అవసర సేవలైన విద్య, ఆరోగ్య సంరక్షణలపై అయ్యే వ్యయం పెరగటం) ధరలు పెరగటం వంటి కారణాలవల్ల వీరి నిజ ఆదాయం కుదింపునకు గురైంది.
ఒకవేళ మనం వ్యవసాయ, పారిశ్రామికరంగం మధ్యవుండే వాణిజ్య షరతుల (టర్మ్స్ ఆఫ్ ట్రేడ్)ను పరిగణనలోకి తీసుకుంటే రైతుల, వ్యవసాయ కార్మికుల జీవన వ్యయంలో ఏర్పడిన ఈ పెరుగుదల మసకబారుతుంది. అటువంటి వాణిజ్య షరతుల చలనాలు ప్రయివేటీకరణకు గురైన అవసర సేవలను అందించే విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాలలో ఆకాశాన్ని అంటుతున్న ధరల పెరుగుదలను గ్రహించలేవు.
ఒకవేళ ఉత్పత్తి అయిన ప్రతి యూనిట్ ఉత్పత్తి నిజ కొనుగోలు శక్తి మారకపోతే ఆహారధాన్య ఉత్పత్తి(లేక దాని వృద్ధి రేటు)లో క్షీణత మాత్రమే అధిక ఆహారధాన్య సరఫరా నెలకొనే అసంబద్ధమైన పరిస్థితి ఆవిర్భవాన్ని వివరించజాలదని మనం పైన చూశాం. ఒకవేళ ఆహారధాన్య వృద్ధి రేటు పడిపోవటంతోపాటు ఉత్పత్తిదారుల ఉత్పత్తికి చెందిన యూనిట్ నిజ కొనుగోలు శక్తి తగ్గిపోతే ఆహారధాన్యాల అధిక సరఫరా జరిగే పరిస్థితి ఆవిర్భవించే అవకాశం ఏర్పడుతుంది. దీనిని వేగంగా వృద్ధి చెందే ఆహారధాన్యేతర రంగం(దీని ఉత్పత్తికి చెందిన ఒక్కో యూనిట్ ప్రత్యక్ష, పరోక్ష ఆహారధాన్య డిమాండ్ను అంతగా పెంచలేదు) మార్చలేకపోవచ్చు. ఈ రంగంలో ఒక నిర్దిష్ట కాలంలో జరిగిన సాంకేతిక ప్రగతి శ్రామిక ఉత్పాదకత వృద్ధిరేటును పెంచుతుంది. దానితో ఉద్యోగిత తగ్గుతుంది. తత్ఫలితంగా ఉత్పత్తికి చెందిన ప్రతి యూనిట్కుగల ఆహార డిమాండ్ తగ్గుతుంది. దానితో ఆహారధాన్యాల మార్కెట్లో అధిక సరఫరా మరింతగా ప్రస్ఫుటమౌతుంది.
అయితే విషయాన్ని మరింత దగ్గరగా చూసినప్పుడు ఆహారధాన్యాల తలసరి వృద్ధి రేటు పడిపోవటం కూడా ఉత్పత్తిదారుల ఉత్పత్తికి చెందిన ఒక్కో యూనిట్ నిజ కొనుగోలు శక్తి పడిపోయిన ఫలితమే. ఇన్పుట్ ధరలు పెరగటం, ధాన్య సేకరణ ధరలు పెరగ పోవటం, జీవన వ్యయం పెరగటంవంటి విషయాల ద్వారా ఇది జరుగుతుంది. ఇవన్నీ మెజారిటీ ప్రజల 'సాధారణ పునరుత్పత్తి'ని కూడా సంక్లిష్టం చేస్తాయి.
కాబట్టి కుదింపునకు గురైన రైతాంగ వ్యవసాయం సరఫరా పార్శ్వాన్ని(తన ఉత్పత్తి తలసరి వృద్ధిరేటును తగ్గించటం ద్వారా), డిమాండ్ పార్శ్వాన్ని(ఉత్పత్తి వృద్ధిరేటు తగ్గించటం, ముందుగానే జరిగిన ఉత్పత్తిదారుల ఉత్పత్తికి చెందిన ఒక్కో యూనిట్ నిజ కొనుగోలు శక్తి క్షీణించటం ద్వారా) ప్రభావితం చేస్తుంది. సరఫరా పార్శ్వంకంటే డిమాండ్ పార్శ్వం మరింత తీవ్రంగా ప్రభావితం అవుతుంది. అందుకనే నయాఉదారవాద శకంలో స్థూల జాతీయోత్పత్తి వృద్ధిరేటు అంతకుముందుకంటే ఎక్కువగావున్న స్థితిలో కూడా ఆహారధాన్యాల సరఫరా అధికంగావున్న పరిస్థితిని, ఆహారధాన్యాల వృద్ధిరేటు తక్కువగావున్న పరిస్థితిని గమనిస్తాం. వేరేమాటల్లో చెప్పాలంటే నయాఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థలో అనుసరించే విధానాల వర్గ స్వభావం కారణంగా ఆహారధాన్యాల సరఫరా అధికమయ్యే పరిస్థితి ఉత్పన్నం అవుతుంది.
- ప్రభాత్ పట్నాయక్
అనువాదం: నెల్లూరు నరసింహారావు
సెల్:8886396999