Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మరలా మోసం పట్టుబడ్డది. ఆర్థికరంగంలో ప్రభుత్వ అసాధారణ సాఫల్యం చూపటానికి పోయి ఏకంగా మోసానికే పాల్పడింది. అది ప్రభుత్వం ప్రచురించే ఎన్ఎస్ఎస్ఓ నివేదికలోనే పట్టుబడింది. ఎన్ఎస్ఎస్ఓ నివేదిక సమీక్షలో వెల్లడైనదేమంటే ఏ కంపెనీలు లేక సంస్థల ఆదాయం ఆధారంగా జీడీపీ గణాంకాలు తయారు చేయబడ్డాయో ఆ వివరాలే నకిలీ, ఉనికిలేని సంస్థలతో నిండి ఉన్నాయి. ప్రభుత్వ నివేదిక ప్రకారమే ఏ సంస్థల ఉత్పత్తి, ఆదాయం-ఖర్చుల ఆధారంగా జీడీపీ నిర్ధారించబడిందో వాటిలో 36శాతం సంస్థలే నకిలీవి. ఈ సంస్థలన్నిటి కాకిలెక్కలతోనే మోడీ హయాంలో దేశ ఆర్థికరంగం ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే ఎక్కువ అభివృద్ధి రేటు సాధించి సర్వశ్రేష్ఠ స్థానం పొందింది. అంతే కాదు మోడీకి జీహు జూరైన నిటి అయోగ్ చేతివాటం పుణ్యమా అనీ గత యూపీఏ హయాంలో అభివృద్ధి రేటు ఆశ్చర్యకరంగా తగ్గిపోయింది. అంటే యూపీఏ హయాం కంటే మోడీ హయాంలో దేశ ఆర్థికాభివృద్ధి, సమగ్ర అభివృద్ధి ఎక్కువ అని చూపించే బాధ్యత వహిస్తూ నిటి అయోగ్ సందేహాస్పదంగా లెక్కించే పద్ధతినే మార్చేసింది. అందుకోసం నకిలీ సంస్థల ఆదాయం పేరుతో కల్పితాలను వాడుకోవటం జరిగింది. ఆ బోగస్ వివరాల ఆధారంగా నకిలీ అభివృద్ధి రేటు చూపించి మోడీ సాఫల్యపు గుండెని 56అంగుళాలకు పెంచి చూపటం జరిగింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక విఫలమైన ప్రధాని సాఫల్యం చాటుకోవటానికి ఇలాంటి నికృష్ట ఎత్తుగడ ఇంతకు ముందు ఎన్నడూ అవలంబించటం జరగలేదు. నిస్సందేహంగా ఇది మోసకారితనానికి ఒక శ్రేష్ఠమైన ఉదాహరణ.
ఇదివరకటి ప్రణాళికా సంఘాన్ని ఎత్తేసి దాని స్థానే నిటి అయోగ్ పెట్టటం జరిగింది. ఇది ఎన్డీయే ప్రభుత్వం, మోడీ రాజకీయ నిర్ణయం. ఆర్థికరంగంలో ప్రభుత్వ వ్యవస్థల్లో నానా రకాల మార్పులు చేసి మోడీ సాఫల్యాన్ని, ఇమేజిని చాటటానికే నిటి అయోగ్ తయారయింది. ఈ అయోగ్ సూచనల ప్రకారం వివరాలు తయారు చేయటం, గణాంకాలు, విశ్లేషణ కోసం కొత్త కొత్త పద్ధతులు ప్రవేశ పెట్టటం జరిగింది. వారి సూచనల మేరకే జీడీపీ లెక్కించే పద్ధతి మార్చటం జరిగింది. క్షేత్రస్థాయి సమీక్షకు బదులు లేక రిజర్వు బ్యాంకు సమీక్షకు బదులు కార్పొరేటు విషయాల శాఖ నుంచి వివరాలను వాడుకోవటం జరిగింది. దాని ఆధారంగా ప్రపంచ మొత్తంలో అన్ని దేశాల అభివృద్ధి రేటు తగ్గినా కేవలం భారతదేశ వృద్ధిరేటే ఆశ్చర్యకరంగా ఎక్కువగా ఉన్నది. మోడీ హయాంలో సగటు సాలీనా వృద్ధిరేటు 7.35గా నిల్చింది. కొత్త లెక్కింపు పద్ధతి ప్రకారం యూపీఏ హయాంలో సగటు సాలీనా వృద్ధి రేటు 7.75 నుంచి తగ్గి 6.82 అయిపోయింది. నిటి అయోగ్ చూపిన మార్గంలో కొత్త పద్ధతిలో లెక్కింపు మోసంతో మోడీ హయాన్ని ముందుకి ఎగతోయటం జరిగింది. అంటే ముందున్న ప్రభుత్వం కన్నా మోడీ ప్రభుత్వం అభివృద్ధి, ఆర్థికాభివృద్ధిలో చాలా ఎక్కువ సాఫల్యం సాధించిందని ప్రచారానికి నిటి అయోగ్ కావల్సిన మసాలా తయారు చేసింది.
కానీ ఇంత గొప్ప సాఫల్యం వాస్తవంలో ప్రతిఫలించక పోవటంతో చిక్కొచ్చింది. ఆర్థిక రంగంలో ఇంత గొప్ప అభివృద్ధి ఉంటే ప్రజల జీవితాలు, ఆదాయాలపై దాని ప్రభావం ఉంటుంది. చాలా కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. వినియోగం పరిమాణం గణనీయంగా పెరుగుతుంది. విదేశీ పెట్టుబడి వినియోగం కూడా పెరుగుతుంది. మార్కెట్లో సేవలు, సరుకుల కోసం డిమాండు పెరుగుతుంది. ప్రజల ఆదాయాలు పెరుగుతాయి. పొదుపు కూడా పెరుగుతుంది. రైతుల ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ సంక్షోభం తగ్గుతుంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పెరుగుతాయి. కానీ వాస్తవంలో జరిగింది దీనికి పూర్తిగా భిన్నం. కొత్త ఉద్యోగాలు లేకపోగా లక్షలకొద్దీ జనాలు ఉపాధి కోల్పోయారు. రైతుల ఆదాయం పెరగలేదు. ఫలితంగా రుణభారంతో రైతుల ఆత్మహత్యల సంఖ్య పెరిగింది. సన్న, చిన్న, మధ్యతరహా సంస్థలు, చిన్న వ్యాపారుల సంక్షోభం పెరిగింది. మోడీ సాఫల్య సూచకంగా జీడీపీ రేటు అత్యధికం, కానీ దేశ ప్రజల జీవితాల్లో దాని ప్రభావం ఇసుమంతైనా లేదు. ఈ రహస్యం బయట పడింది గత నెల ప్రచురితమైన ఒక సర్కారీ నివేదికలో. జీడీపీ లెక్కింపుకి కంపెనీల విషయాల మంత్రిత్వ శాఖ నుంచి తీసుకున్న పరిశ్రమల జాబితాపై 2016 మే నెల నుంచి 2017 జూన్ నెల వరకు ఒక ఏడాది కాలం పాటు సమయపు సమీక్ష చేయబోయి ఎన్ఎస్ఎస్ఓ గుర్తించినదేమంటే 36శాతం సంస్థలు బోగస్. అంటే మూడవ వంతు లేని సంస్థల లేని గణాంకాలు చొప్పించి పెరిగిన అభివృద్ధి కథలు అల్లారు. ఏ సంస్థల ఉనికే లేదో వాటికి సంబంధించి కాకి లెక్కలు చెప్పి జీడీపీ లెక్కిస్తే వాస్తవంలో దాని ప్రతిఫలం లేకపోవటం సహజమే. ఇప్పుడు కనబడుతున్నదీ అదే. ఇది మోసకారితనం కాకపోతే మరేమిటీ?
- వేదుల రామకృష్ణ