Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పదిహేడవ లోక్సభకు ఏడు విడతల ఎన్నికలు మే19న ముగుస్తున్న సందర్భంగా ఇవి జరిగిన తీరూ మిగిల్చిన జ్ఞాపకాలూ ఒకసారి సమీక్ష చేసుకోవాలి. విద్యార్థిలోకం ఎన్నికలను నిశితంగా పరిశీలించాలనీ, వాటిని తమ అనుభవంలో పెట్టుకోవాలనీ సూచనలిస్తుంటారు పెద్దలు. కోట్లకొలదీ డబ్బు ఉంటే తప్ప ఎన్నికల్లో పోటీ చేయడం కుదరదని ఈ దేశ యువతకు అర్థమైంది. ఆ డబ్బు సమకూర్చగలిగేది కేవలం కార్పొరేటు సంస్థలు మాత్రమే అని కూడా అర్థమైంది. ఈ ఎన్నికల్లో హిందూ, క్రైస్తవుల మధ్య కలువ లేనంత దూరం పెరిగి పోయింది, బీజేపీ ఒక్కసారైనా ఈ దేశంలో అందరం సమానమనే నినాదం మాట వరుసకైనా అనలేదు, ఆ మాట అంటే హిందువులు దూరమౌతారేమోనని కాంగ్రెస్సూ అనుకున్నట్టుంది. ఈ ఎన్నికల్లో సెక్యులరిజమ్ (లౌకికత్వం) పూర్తిగా ఓడి పోయింది. ఆ మాట మాట్లాడిన వారిని హిందువులకు వ్యతిరేకులుగా బీజేపీ వర్ణించింది. స్పష్టమైన మరో అంశం దేశ ప్రజలను ఓట్లేయమని అడగటానికి విధానాల ప్రాతిపదిక ఒకటే కాదు. మరేవో పద్ధతుల ద్వారా ఆకర్షించాల్సిందే. ఓట్లు కొనుక్కోవాల్సిందే-అవసరమైతే ప్రభుత్వ డబ్బుతోనే కొనాలన్న ప్రారంభం టీఆర్ఎస్తో మొదలై మోడీతో బలపడి కాంగ్రెస్ వద్దకు చేరింది. ఎన్నికల లబ్ది కోసమే కొన్ని పథకాలు కూడా రూపొందించాలని కూడా నేర్పారు. ఎన్నికలకు పార్టీల మానిఫెస్టోలతో పనే లేదని, అవి కేవలం తతంగాలని కూడా తేల్చేశారు. వర్గం, వర్గ పోరాటం అనే కాన్సెప్టును బూర్జువాపార్టీలు ఊడ్చిపెట్టాయి. శ్రమజీవులు ఈ ఎన్నికలను తమ శ్రామిక జీవనానికి సంబంధమున్నట్టుగా భావించకుండా అస్తిత్వ రాజకీయాల ప్రవాహంలోనురగలై పోతున్నారు. ప్రతి రోజూ పొద్దున్నే తట్టి లేపే సోషల్ మీడియాలో దూషణలతో కూడిన ద్వేషపు మెస్సేజ్లను ఫార్వార్డ్ చేయడంలో తలమునకలై బి.పిలు పెంచుకుంటున్నారు. వెరసి ఇవి ద్వేషపూరిత ఎన్నికలుగా మిగులుతున్నాయి!
ఈ ఎన్నికల్లో ఘనమెంతా అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్, అదే రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి మాయావతితో పాటు ఆనేక మంది తాజా/మాజీ మంత్రులూ ఇతర సీనియర్ నాయకులూ ఎన్నికల ప్రచారాల నుంచి బహిష్కరణకు గురయ్యారు. ''కుట్రదారులూ, విభజనకారులూ రాజకీయాలకనర్హులు'' అంటూ స్వాతంత్య్రానంతరం జరిగిన అల్లర్లను ఉద్దేశించి బాపూ ప్రసంగించారు. కానీ వారినే ధర్మ సంరక్షకులని, బాంబు పేలుళ్ళలో నిందితులై జైలుకెళ్ళిన వారిని ఎన్నికల్లో నిలుపుతున్నారు. మహాత్మా గాంధీ చిత్రపటాన్ని కాల్చి, హీనమైన పదజాలంతో అవమాన పరిచిన వాళ్ళకి గౌరవమిస్తూ, గాంధీని చంపిన గాడ్సేని ఉగ్రవాదిగా వర్ణించిన కమలహాసన్పై కేసు బనాయిస్తున్నారు. ఇది సమంజసమేనా? ప్రియాంకా శర్మ అనే బీజేపీ కార్యకర్త పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మార్ఫింగ్ చేసిన చిత్రాన్ని సోషల్ మీడియాలో అగౌరవ పరిచిన ఘటనలో పోలీసులు ఆమెను అరెస్టు చేయడం, ఆ వెంటనే విడుదలా జరిగిపోయాయి. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రచారంలో బీజేపీ కార్యకర్త వచ్చి చెప్పుతో కొట్టటం, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ లోక్సభ అభ్యర్థి శ్రీమతి అతిషీపై అసభ్య పదజాలంతో బీజేపీ అభ్యర్థ్తి గౌతం గంభీర్ ఆధ్వర్యంలో కరపత్రం పంచటం వంటివి భావి తరాల వారికి ప్రజాస్వామ్యంపై ఏ విధంగా గౌరవాన్నివ్వగలవు?
ఇక మాటల యుద్ధం, చరిత్ర వక్రీకరణలూ మునుపెన్నడూ ఇంతగా జరుగలేదు. ''నువ్వు దొంగ''... అంటే ''కాదు నువ్వే దొంగ... నీ అబ్బ ఇంకా పెద్ద దొంగ'' అని చిన్నప్పుడు వీధుల్లో పిల్లలు తిట్టుకుంటుంటే విన్నాం. ఇప్పుడు సాక్షాత్తు ఎన్నికల ప్రక్రియలో పాలకవర్గ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ నేతల దూషణలు వింటున్నాం. ఐదేండ్లుగా చేసిన పనుల్లో పస లేదో, లేక, చరిత్రలో తమ పాత్ర లేదో కానీ తమ పాలనా దక్షతను చెప్పుకోవాలనే ఇంగితాన్నే బీజేపీ మర్చిపోయింది. లేదా కాంగ్రెస్ పార్టీ విధానాలను, కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన కాలంలో చేసిన తప్పులను విమర్శించడం పక్కనపెట్టి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. బీజేపీ పాలనా లోపాలను ఎత్తి చూపేందుకు అవకాశం లేకుండా చేయడంతో అది ప్రతి దాడితోనే కాలం నెట్టుకొస్తోంది. రాజీవ్ గాంధీ అధికారాన్ని దుర్వినియోగ పరిచారనీ, నేవీ నౌకను వ్యక్తిగతానికి వాడుకున్నారన్న ప్రధాని మోడీ అరోపణకు, ''అలా జరుగలేదని'' మాజీ అడ్మిరల్ ఎల్. రాందాస్ వివరణ ఇచ్చారు. ప్రధాని పదవిలో ఉండి అవాస్తవాలను ప్రచారం చేస్తే భావితరాలు ఏమి గ్రహించాలి? మతం, ప్రాంతం ఇప్పుడు దుర్వినియోగమైనంతగా ఎన్నడూ కాలేదు. ''కాషాయంపై దాడిని మీరు అంగీకరిస్తారా? హిందూ టెర్రర్ అనే పదాన్ని మనకు ఆపాదిస్తే ఊరుకుంటామా..'' అంటూ సాక్షాత్తూ ప్రధాని ప్రజలను రెచ్చగొట్టే ప్రచారాలు చేస్తున్నారు. ఏదో కాటుకు ఏదో దెబ్బ... అన్నట్టు మమతా బెనర్జీ సమాధానమిస్తూ చెంప పగిలే సమాధానమివ్వాలని ప్రధానినుద్దేశించి బెంగాల్లో ప్రసంగించారు. ''మోడీ అంటే బీజేపీ నాయకుల భార్యలకు భయమంటూ'' మాయావతి మరో అంశాన్ని తీశారు. పశ్చిమ బెంగాల్లో ఇతర నాయకుల హెలీకాప్టర్లను దిగడానికి అనుమతినివ్వకపోతే మమతా బెనర్జీ ప్రచారానికెళ్ళిన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అదే స్థితి కల్పించారు. అధికారాన్ని ప్రజాస్వామ్యంలో భాగంగా కాకుండా తమ స్వంత ఇలాఖాలుగా ప్రదర్శిస్తున్నారు. ఆటవిక రాజ్యంలోలాగా పోలింగ్ కేంద్రాల ఆక్రమణలు ఎన్నికల అల్లర్లలో హత్యలూ ప్రతి హత్యలూ ఇప్పుడే చూస్తున్నాం. బెంగాల్లో మే14న జరిగిన అల్లర్లకు బీజేపీ, త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీలు ర్యాలీలు ప్రతి ర్యాలీలతో రాష్ట్రాన్ని రావణకాస్టంగా మార్చాయి. ఈ సంఘటనలన్నీ ప్రపంచమంతా గమనిస్తుంది కాబట్టే మోడీని ''ఇండియా డివైడర్ ఇన్ చీఫ్'' గా అభివర్ణిస్తూ టైమ్ మ్యాగజైన్ ప్రచురించి ఉండవచ్చు. ఈ ఎన్నిక సరళిని ప్రశ్నార్థకంలో పడేసిన మరో అంశం ఈవీఎంలు హాకింగ్ చేయబడుతున్నాయని. దీనిపై సందేహాలను నివృత్తి చేయడంలో ఈసీ ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి.
ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి సలహాలను ఖాతరు చేయకుండా రాజకీయ పార్టీలకు చందాలు అందే ''ఎలెక్టోరల్ బాండ్స్'' అనబడే చట్టం చేశారు. ఈ చట్టం ద్వారా గుప్త నిధులలాగా గుప్తదానాలు ఎవరు చేస్తున్నారో ప్రజలకు తెలియదు, పార్టీలకు కూడా తెలియదు కానీ కోట్ల రూపాయల బాండ్లు మాత్రం పార్టీలకు చేరుతాయి. అవసరం అనుకుంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం తప్ప, ఎవరు కూడా ఆ వివరాలను తాకే అవకాశమే లేదు. కనీసం డబ్బును స్వీకరిస్తున్న పార్టీలకు కూడా తెలియకుండా ఎన్నికల నిధులను ఇవ్వటానికి ఏ ప్రయోజనమూ లేని వారు ఎందుకు సిద్ధపడతారు? అంటే, ఫలానా పార్టీకి నేరుగా డొనేషన్ చెల్లిస్తే ఇతర పార్టీలకు కోపం వస్తుంది గనుక సదరు పార్టీతో ఒప్పందానికి వచ్చి, బాండ్ల రూపంలో గుట్టుగా చెల్లించి ఆ తరువాత తమకు కావలసిన సహకారం పొందుతారన్నమాట! ఈ విధంగా రాజకీయ పార్టీలు నిధులను సేకరించుకోవడంలో ప్రజలకు గానీ లేదా ప్రజాస్వామ్యానికి గానీ ఏ రకమైన ఉపయోగం ఉందో ప్రజలకు వివరించకుండా చట్టాన్ని చేసింది బీజేపీ ఎలెక్టోరల్ బాండ్స్ ద్వారా పార్టీలకు కేవలం మార్చి ఏప్రిల్ నెలల్లో కలిపితే రూ. 3,622 కోట్లు అందింది. మార్చి నెలలో 2256.37 కోట్లు రాగా ఏప్రిల్లో 1365.69 కోట్లు సమకూరింది. ఈ గుప్తదానాలు సేకరించిన నగరాలను వరుసగా ముంబై 694.81 కోట్లు, కోల్కత 417.31 కోట్లు,న్యూఢిల్లీ 408.62 కోట్లు, హైదరాబాద్ 338.7 కోట్లుగా నమోదయ్యాయి. మన రాష్ట్రంలో ఎస్బీఐ ఒక్కటే ఏప్రిల్ నెలలో 338 కోట్లను ఎలెక్టోరల్ బాండ్లను విక్రయించింది. వీటిల్లో 95 శాతం అధికార పార్టీకే చేరాయన్నది బయట పడని వాస్తవం. తెలంగాణలో గత డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ఇదే రకమైన వివరాలు నమోదయ్యాయి. 'ఇలాంటి గుప్త నిధులు వచ్చి పడుతున్నాయి కాబట్టే మొన్న పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బీజేపీ ఒక రోజు, ఒకే బ్యాంకు నుంచి, ఎనిమిది కోట్లు విత్ డ్రా చేసి పబ్లిగ్గా దొరికిపోయింది. పదో పరకో దానం చేస్తే వేరు, కానీ కోట్లల్లో బాండ్లు కొని సదరు బాండ్లను పార్టీలకు ఇస్తున్నారు అంటే వారికి ఏదో రకమైన లబ్ది చేకూరుతున్నట్టే. దాతల వివరాలు, స్వీకరించే పార్టీల వివరాలు దాచిపెట్టే ఈ అన్యాయమైన విధానం స్వచ్ఛ భారత్ కానే కాదు.'
- జి. తిరుపతయ్య