Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. అందుకు అవసరమైన నిబంధనలు రూపొందించుకున్నాం. అందుకనుగుణంగా పోటీ జరగాలి. కానీ కొంతమంది రాజకీయ నాయకులు దీనికి అర్థం మార్చేశారు. గెలువాలంటే ఒకరిని ఓడించాల్సిన పనిలేదు. అసలు పోటీనే అక్కర్లేదు. ఓటే వేయక్కర్లేదు. లొంగదీసుకోవడం, ప్రలోభ పెట్టడం, కొనేయడం కుదరకపోతే భయపెట్టడం. తద్వారా గెలుపును సొంతం చేసుకోవడం. దానికే 'ఏకగ్రీవం' అనే ముద్దుపేరు తగిలిస్తున్నారు. గతంలో సర్పంచ్, వార్డు మెంబర్లను మాత్రమే ఊరోళ్లంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకునేవారు. కానీ నేడు పరిషత్ ఎన్నికల్లోనూ వందల సంఖ్యలో స్థానాలు ఏకగ్రీవమైనట్టు వార్తలు చదువుతున్నాము. ఇవన్నీ ప్రజామోదంతో కాదు. ఏకగ్రీవం పేర సాగుతున్న వ్యూహాల్లో అనేక సందర్భాల్లో ప్రత్యర్థులిద్దరూ విజయం సాధిస్తున్నారు. అక్కడ ఓడుతున్నది మాత్రం ప్రజలే. తాజా రాజకీయాల్లో ఇందుకు అనేక ఉదాహరణలున్నాయి. 'పోటీ'ని తప్పించేందుకు అనేక ఎత్తులు వేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రత్యర్థులతో తలపడకుండానే గెలుపు సొంతం చేసుకుంటున్నారు. స్వయంగా పార్టీలే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. రాజకీయాల్లో గతం నుంచే ఈ సంస్కృతి కొనసాగుతున్నప్పటికీ బంగారు తెలంగాణలో ఇది శృతి మించిందనేది విశ్లేషకుల విమర్శ. ఇటీవల ఆసిఫాబాద్ కొమురంభీం జిల్లాలో చోటుచేసుకున్న తాజా ఘటన అందుకు మచ్చుతునక. మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మిని టీఆర్ఎస్ జడ్పీ ఛైర్పర్సన్ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది. ఎలాగైనా ఆ పదవి చేజారనీయొద్దని ఆమె సహా అనుచరగణం దృఢంగా నిశ్చయించుకున్నారు. గెలుపును లాంఛనం చేసుకునేందుకు వేయని ఎత్తు లేదు. సాధారణంగా ఆమె జడ్పీ చైర్పర్సన్ కావాలంటే ముందు జడ్పీటీసీగా ఎన్నికవ్వాలి. ఆ తర్వాత జడ్పీటీసీల మద్దతుతో ఛైర్పర్సన్ కావాలి. కానీ దీనికి భిన్నమైన రాజకీయాలు అక్కడ చోటుచేసుకున్నాయి. అధికార, ప్రతిపక్ష అభ్యర్థులిద్దరూ ఈ విషయంలో విజయం సాధించారు. పార్టీ అండదండలతో ఒకరు, అధిష్టానం కండ్లుకప్పి మరొకరు మంతనాలు నెరిపారు. తీరా పోటీ లేకుండానే గెలుపు లాంఛనమైంది.
రెండో విడత ఎన్నికల్లో కోవలక్ష్మి సొంత మండలం తిర్యాణిలో తొలుత నామినేషన్ వేశారు. ఏకగ్రీవం కోసం చివరి వరకూ ప్రయత్నించారు. వ్యూహాలు ఫలించక చేసేది లేక పోటీనుంచి వెనక్కి తగ్గారు. మూడోవిడతలో జైనూర్, సిర్పూర్(యు)లో తన అభ్యర్థిత్వాన్ని పరీక్షించుకోవాల నుకున్నారు. రెండు చోట్లా నామినేషన్లు వేసి అవే ప్రయత్నాలు సాగించారు. జైనూర్లో ఎత్తుగడలు ఫలించాయి. మరోచోట ఉపసంహరించుకొని జడ్పీటీసీగా ఏకగ్రీవమయ్యారు. తమ అభ్యర్థిని ప్రత్యర్థి నుంచి కాపాడుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం చేసిన ప్రయత్నం విఫలమైంది. టీఆర్ఎస్ నేతలకు చిక్కకుండా ముందుగానే తన అదుపులో పెట్టుకున్నది. అయినా జరగాల్సింది జరిగిపోయింది. నామినేషన్ కంటే ముందే వ్యూహరచన జరిగింది. హరినాయక్ అభ్యర్థిత్వాన్ని నామినేషన్ సమయంలో స్వయంగా కొడుకు రామారావే ప్రతిపాదించారు. అదే సమయంలో తండ్రి సంతకంతో ఓ ఉపసంహరణ పత్రం సిద్ధం చేసి పెట్టుకున్నాడు. అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన వ్యక్తి సైతం అభ్యర్థి ఆమోదంతో ఉపసంహరించుకునే వెసలుబాటు ఉండడంతో చెకచెకా పావులు కదిపారు. చివరి నిముషంలో తండ్రి నామినేషన్ ఉపసంహరించుకున్నాడు. దీంతో 'పోటీ' అన్న పదం గల్లంతైంది. ఇంకేం ఛైర్పర్సన్ అభ్యర్థి గెలిచేశారు. ఇదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన గిరిజన మహిళ మెస్రం చంద్రకళ సహా ఆమె భర్తను కోవలక్ష్మి అనుచరులు కిడ్నాప్ చేసినట్టు స్వయంగా అభ్యర్థి ఆందోళనకు దిగారు. ఈ ఎన్నిక రద్దు చేసి జైనూర్ జడ్పీటీసీ స్థానానికి మరోసారి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
ఈ పరిణామాలన్నీ పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా స్థానికులకు మాత్రం బహిరంగ రహస్యమే. వ్యూహ ప్రతివ్యూహాలతో ప్రత్యర్థులిద్దరూ గెలిచారని ప్రజలే ఓడారని స్థానికులు భగ్గుమంటున్నారు. పరిషత్ ఎన్నికల్లో అనేకచోట్ల ఇదే జరుగుతోంది. ఎన్నికల కమిషన్ ప్రకటిస్తున్న ఏకగ్రీవాల్లో అత్యధిక స్థానాల్లో జరుగుతున్నదిదే. 'ఓటు వజ్రాయుధం, ఒక్క ఓటు మీ భవిష్యత్తును మార్చేస్తుంది. ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోండి' అంటూ విస్తృత ప్రచారం చేస్తున్న ఎన్నికల సంఘం, అనుసంధానంగా పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థలు ఆ వజ్రాయుధాన్ని ప్రజల నుంచి లాగేసుకుంటున్న మన నేతలను ఏమీ చేయలేకపోతున్నాయి. ప్రజలు ఓటేస్తేనే గెలవాల్సిన నేతలు ఎన్నికల చదరంగంలో ప్రజల్నే ఓడిస్తున్నారు. వారి ఓటు అవసరం లేకుండానే ఎన్నికవుతున్నారు. లేదా వారి ఓటునే లాగేసుకుంటున్నారు. ఐదేండ్లూ వాళ్ల నెత్తిన కూర్చుంటున్నారు. స్థానిక సంస్థలు మొదలు, చట్టసభల వరకు ఈ తరహా తెరచాటు రాజకీయాలు నేడు సర్వసాధారణమయ్యాయి. పోటీ సమయంలోనే బలమైన ప్రత్యర్థులను బరినుంచి తప్పిస్తున్నారు. ప్రత్యక్షపోరు లేకుండా గెలుపును లాంఛనం చేసుకుంటున్నారు. నిన్నమొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో, ఫలితాల అనంతరం చోటు చేసుకున్న పరిణామాలైతే ఈ పరిస్థితిని తలదన్నేలా ఉన్నాయి.
'ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా మరి'.! స్వయంగా అధినేతనే ఈ అనైతిక చర్యలను ప్రోత్సహిస్తుంటే.. కిందిస్థాయిలో ఇంతకంటే భిన్నమైన రాజకీయాలను ఊహించలేము. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ కొద్ది రోజులకే తెరచాటు మంతనాలకు తెరలేపిన టీఆర్ఎస్ పెద్దలు కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను నయానో, భయానో లొంగదీసుకున్నారు. దీంతో తమ ఓటుతో నచ్చిన నేతను గెలిపించుకున్నామన్న ప్రజల ఆనందం పక్షం రోజులైనా తిరక్కుండానే ఆవిరైంది. వేలికి పెట్టిన సిరాచుక్క ఆరకముందే ప్రజా తీర్పును ధిక్కరించి కొందరు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ రెండు సందర్భాలను కలిపి చూస్తే కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ అభ్యర్థులందరూ గెలిచినట్టే. వీరంతా కలిసి ప్రజల్నే ఓడించారు.
నిజానికి అధికారపార్టీ ప్రతిపక్షాలు లేని చట్టసభలను కోరుకుంటున్నదని ఈ పరిణామాలు చూసిన వారెవరికైనా అర్థమవుతుంది. తనను ప్రశ్నించేవారు ఉండకూడదనే ధిక్కార ధోరణితో సాగుతున్నది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల పాత్ర కీలకమన్న విషయాన్ని ఉద్యమనేతలు మరిచిపోతున్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షాలు ఉంటేనే పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుందనేది వాస్తవం. ఎంత బాధ్యతాయుతంగా పనిచేసేవారికైనా ఆచరణలో తప్పులు, తప్పటడుగులు సహజం. పాలనలో లోపాలు సహజం. వాటిని ఎత్తి చూపేవారుంటేనే సరిచేసుకోవడం సాధ్యపడుతుంది. అడిగేవారొకరు ఉన్నారన్నపుడు ఉండే అప్రమత్తతే వేరు. బాధ్యతాయుతమైన పాలకపార్టీ ఏదైనా బలమైన ప్రతిపక్షాన్ని కోరుకోవాలి. ప్రజలపట్ల, ప్రజా సమస్యలపట్ల బాధ్యతగల ఏ ప్రతిపక్షమైనా నిర్మాణాత్మక పాత్ర పోషించాలి.
నిజానికి ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చే ఏ నాయకుడైనా తనకు సేవ చేసే అవకాశమీయండని ప్రజలను కోరాలి. ప్రజల ఓట్లతోనే గెలవాలి. పైగా ఏ పార్టీ తరపున సేవ చేయాలని ప్రజలు ఓటేశారో ఆ పార్టీలోనే కొనసాగుతూ వారి సమస్యలపై చట్టసభల్లో గొంతు విప్పాలి. ఇందుకు భిన్నంగా అధికార, ప్రతిపక్ష పార్టీలిద్దరూ కుమ్మక్కై ప్రజలను ఏమార్చడం సరికాదు. ప్రజాస్వామ్యాన్ని పరిహసించే ఈ వ్యవహారాలను ప్రజలు ఏవగించుకోవడం ప్రారంభమైంది. ప్రజల్లో చైతన్యం, ప్రశ్నించేతత్వం పెరుగుతున్నది. నిన్నమొన్న జరిగిన పరిషత్ ఎన్నికల్లోనే ఆ ప్రభావం కనిపించింది. కాంగ్రెస్ నుండి గెలిచి టీఆర్ఎస్లో చేరిన నేతలను జనం ఊర్లల్లోకి రానీయలేదు. మా ఓట్లతో గెలిచి ఆ పార్టీలోకి ఎందుకెళ్లావనీ, ఇప్పుడే ముఖం పెట్టుకొని ఓట్లడగడానికొచ్చావనీ నిలేశారు. ఇల్లందు ఎమ్మెల్లే బానోతు హరిప్రియ ఎన్నికల క్యాంపెయిన్పై రాళ్లదాడికి దిగిన ఉదంతం తెలిసిందే. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఆసిఫాబాద్ శాసనసభ్యులు ఆత్రం సక్కుకూ గ్రామాల్లో నిరసనలు తప్పలేదు. దీంతో చాలా చోట్ల జెండా మార్చిన పెద్దమనుషులు తలదించుకొని ఇంటి బాట పట్టారు. ప్రజాస్వామ్యానికి, ప్రజల తీర్పుకు భిన్నంగా వ్యవహరించే నేతలకు ఇదో హెచ్చరిక. రాబోయే రోజుల్లోనైనా నేతలు ఓటు విలువను గుర్తించాలి. గెలుపునకు అసలైన అర్థం తెలుసుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అసలు విజేతలు, అంతిమ విజేతలూ ప్రజలే అన్న సంగతి మర్చిపోవద్దు.
- నాందేవ్
సెల్ : 9490099387