Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నికలు వచ్చాయి. అయిపోబోతున్నాయి. మే 23న ఫలితాలు తెలియబోతున్నాయి. ఎవరో ఒకరు గెలుస్తారు. మరొకరు ఓడతారు. అయితే గత నెల రోజులుగా కార్పొరేట్ మీడియా ఎన్నికల ఫలితాలను గూర్చి రకరకాల పద్ధతుల్లో జ్యోతిష్యుల చేత చెప్పించింది. విచిత్రం ఏమిటంటే, జ్యోతిష్యులు, సంఖ్యాశాస్త్రజ్ఞులు పరస్పర విరుద్ధ ఫలితాలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబునాయుడు మరల అధికారంలోకి వస్తాడని కొందరు, జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తాడని కొందరూ చెప్పారు. ఇందులో ఇమిడిఉన్న ముఖ్యమైన అంశం ఏమిటంటే ప్రతి జ్యోతిష్యుడూ తాము చెప్పిన ఫలితానికి ఆధారం ఆ నాయకుడికి గ్రహబలం అనుకూలంగా ఉండటమేనని చెప్పారు. అసలు గ్రహాలు ఒక జ్యోతిష్యుడి కండ్లకు అనుకూలంగా కనిపిస్తే, మరొక జ్యోతిష్యుడి కండ్లకు వ్యతిరేకంగా ఎలా కనిపిస్తాయనేది అర్థంకాని విషయం. వారు వేసే గ్రహచలనాల లెక్కలు అంత పరస్పర వ్యతిరేకంగా ఎందుకుంటాయో వారికే తెలియాలి.
ఇక సంఖ్యా శాస్త్రజ్ఞుల విషయానికి వస్తే, వారు కూడా ఫలితాలు పరస్పర విరుద్ధంగా చెప్పారు. ఒక టీవీ చానల్లో వారితో చర్చలో ఈ వ్యాస రచయిత కూడా పాల్గొనడం జరిగింది. నెహ్రూ, గోపాలకృష్ణ అనేవారు పాల్గొనడం జరిగింది. నెహ్రూ తన సంఖ్యా శాస్త్రం ప్రకారం కేంద్రంలో రాహుల్గాంధీ, రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వస్తారని తెలిపారు. గోపాలకృష్ణ కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తారని చెప్పారు. ఇలా పరస్పర వ్యతిరేక ఫలితాలు చెప్పడాన్ని విజ్ఞానం అందామా లేక ఊహాగానాలు అందామా? ఇక నెహ్రూ సంఖ్యా శాస్త్రాన్ని పరిశీలిద్దాం.. ఆయన ప్రతి ఒక్క ఇంగ్లీషు అక్షరానికీ ఒక అంకె ఉంటుందనీ, పేరులోని అక్షరాలను అంకెలలోనికి మార్చి, వాటిని కూడగా వచ్చిన సంఖ్య, ఆ పేరుగల వ్యక్తి లేక ప్రదేశం యొక్క జయాపజయాలను సూచిస్తుందని చెప్పారు. ఇందులో ఉన్న మరొక విశేషాంశం ఏమిటంటే, అక్షరాలను అంకెలలోకి మార్చే సంఖ్యా శాస్త్రాలు రెండు ఉన్నాయట. అవి ఛాల్దియన్ పద్ధతి, పైథాగరస్ పద్ధతి. నెహ్రూ రెండు పద్ధతులలోను అక్షరాల అంకెలుగా మార్చి ఫలితాలు చెప్పారు. విచిత్రం ఏమిటంటే.. రెండింటిలోను అక్షరాలకు ఒకే అంకెలు లేవు. ఉదాహరణకు ఛాల్దియన్ పద్ధతిలో 'ఆర్' అంటే 2, పైథాగరస్ పద్ధతిలో 'ఆర్' అంటే 9. 'ఐ' అనే అక్షరం అంటే ఒక పద్ధతిలో 1, ఇంకో పద్ధతిలో 9. 'ఎస్' ఒక పద్ధతిలో 3, ఇంకో పద్ధతిలో 1. మరో విశేషం ఏమిటంటే కొన్ని అక్షరాలకు ఒకే అంకె ఉంటుంది. ఉదాహరణకు డి, ఎమ్, టిలకు మూడింటికీ అంకె నాలుగే. ఎ, ఐ, ఎస్ లకు అంకె ఒకటి. ఇక వీటిలా కొన్ని అదృష్ట సంఖ్యలట. కొన్ని కాదట. శాస్త్రమంటే ఇలా ఉంటుందా?
మరో ముఖ్య విషయం. సంఖ్యా శాస్త్రానికి మూలమేది? అన్న ప్రశ్నకు సమాధానంగా 'తమిళనాడులోని కొన్ని వేల సంవత్సరాలనాటి తాళపత్ర గ్రంథాలు' అని నెహ్రూ చెప్పారు. మరి తమిళంలో ఉన్న శాస్త్ర గ్రంథాల ఆధారంగా చెప్పేటప్పుడు పేర్లను ఇంగ్లీషు భాషలోనే రాసి, వాటి విలువలను అంకెలలో చెప్పడమెందుకు? తమిళభాషలోని అక్షరాలకే అంకెలలో విలువ ఇవ్వవచ్చుగదా? ఉదాహరణకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పేరు తమిళంలో రాసి, తాటాకు గ్రంథాల ప్రకారం అంకెల విలువ ఇచ్చి, మ్యాజిక్ నెంబరు రావడానికి ఏదో తమిళ అక్షరాన్ని జత చేయవచ్చుగదా? ఆ పేరును ఇంగ్లీషులో రాసి, దానికి 'ఎ' అనే అక్షరాన్ని జత చేయడమేమిటి? అనే ప్రశ్నకు ఆయన వద్ద సమాధానం లేదు.
నెహ్రూ తాను అనేక లక్షల మందికి పేర్లు మార్చి వారు గొప్పవారవడానికి కారకుడనయ్యానని పేర్కొని, గోపాలకృష్ణ ఒక్కరి పేరైనా మార్చారా? అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా గోపాలకృష్ణ అలా పేర్లు మార్చకూడదనీ, ''నేమ్ కరెక్షన్ అంటే నేమ్ కరప్షన్'' అనీ చెప్పారు. ఇలా ఇద్దరు న్యూమరాలజిస్టులూ పరస్పర విరుద్ధంగా మాట్లాడారు. ఇలా సైన్సువాదుల ప్రశ్నలకూ సమాధానాలు చెప్పలేని పరిస్థితి పరస్పర విరుద్ధ విషయాల సమాహారమూ అనేక అక్షరాలకు ఒకే అంకె ఉండటమూ, ఇవన్నీ సైన్సు అనిపించుకుంటాయా?
ఇలాంటి పరస్పర విరుద్ధ ఫలితాలు చెప్పినందువలన ఏం జరగబోతోంది? 23వ తేదీన జ్యోతిష్యులు చెప్పిన ఏదో ఒక ఫలితం కరెక్ట్ కాబోతోంది. దానితో కార్పొరేట్ మీడియా జ్యోతిష్యం, న్యూమరాలజీలు మూఢనమ్మకాలు కాదనీ, జ్యోతిష్యులలో బాగా పాండిత్యం కలవారు భవిష్యత్తును కరెక్టుగా చెప్పగలరనీ, తప్పుడు ఫలితాలు చెప్పినవారు బాగా పాండిత్యం లేనివారనీ, అంతేకాని జ్యోతిష్యం మాత్రం అద్భుతమైన సైన్స్ అనీ ప్రచారం చేయబోతోంది. అంటే మీడియా జ్యోతిష్యం, న్యూమరాలజీ వంటి అశాస్త్రీయ అంశాలను గెలిపించబోతోంది. దేశభక్తులైన సైన్స్వాదులు ఈ అశాస్త్రీయ అంశాల విజయాన్ని అడ్డుకోవాలి. అవి వర్తమాన రాజకీయాలను బాగా అధ్యయనం చేసిన కొందరు మేధావుల ఊహాకల్పనలే అనే విషయాన్ని ప్రజలలో ప్రచారం చేయాలి. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేని అంశాలను శాస్త్రాలుగా ఆకాశానికెత్తడాన్ని ఖండించాలి.
- కెఎల్. కాంతారావు