Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజాస్వామ్య వ్యవస్థ బాగులేనప్పుడు ఎన్నికల వ్యవస్థ బాగుందని భావించగలమా? ఎన్నికల వ్యవస్థలో ఎన్నో లోపాలున్నప్పుడు.. ఇది ప్రజాస్వామ్య మనగలమా? నిజానికి ఇది ప్రజాస్వామ్యం కాదు. ధనవంతుల రాజ్యం.. ప్రజలు ఎన్నుకొన్న ప్రజా ప్రతినిధులను.. ప్రజా ప్రతినిధులు ఎన్నుకొన్న చట్టసభల ప్రతినిధులను ఖరీదు చేసి లొంగదీసుకొని, వారిని పార్టీ ఫిరాయింపు దారులుగా మార్చే వ్యవస్థలో ప్రజల ఓటుకు విలువ ఉందా? చట్టబద్ధంగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు పార్టీ ఫిరాయించి అదే చట్టసభలలో కూర్చోవటం. నిన్న అధికార పక్షాన్ని విమర్శించి, నేడు అధికార పక్షం జిందాబాద్ అనటం నిజమైన ప్రజాస్వామ్యంగా భావిద్దామా? ప్రజలు పార్టీకి ఓటువేస్తున్నారు. పార్టీ గుర్తుకు ఓటు వేస్తున్నారు. ఒక పార్టీని గెలిపించి.. ఆ పార్టీకి తమను పరిపాలించే హక్కునిస్తున్నారు. వ్యక్తికి ఓటు వేయటం లేదు. ఇప్పుడు భారతదేశాన్ని మోడీ తన యిష్టారాజ్యంగా పరిపాలిస్తున్నా.. జనం బీజేపీ పరిపాలన అంటారు. బీజేపీకి ఓటువేసారు. తెలంగాణలో కేసీఆర్ తన యిష్టారాజ్యంగా పరిపాలిస్తున్నా.. ప్రజలు టీఆర్ఎస్ పరిపాలన అంటారు. టీఆర్ఎస్ గుర్తుకే ఓటువేసారు. ప్రజలు వ్యక్తులకు ఓటు వేయటం లేదు. పార్టీకి ఓటువేస్తున్నారు. గెల్చిన వ్యక్తి పార్టీ ఫిరాయిస్తున్నాడు. ప్రజల ఓటుకు విలువుందా? ఇది ప్రజాస్వామ్యమేనా? ఈ ఫిరాయింపుల మూలంగా ఒక్కొక్కసారి ప్రభుత్వాలే మారిపోతున్నాయి. అంటే ప్రజలు ఒకపార్టీని తమ ఓటు ద్వారా గెలిపిస్తే.. గద్దెనెక్కిస్తే.. గద్దెనెక్కించాలనుకుంటే.. మరో పార్టీ పరిపాలిస్తోంది. మరో పార్టీ గద్దెనెక్కుతుంది. ఇదేమి ప్రజాస్వామ్యం?
పార్టీ ఫిరాయింపులనేవి దేశమంతా జరుగుతున్నాయి. ప్రధాని మోడీ అయితే ఏకంగా ఫిరాయింపులు డైరక్టుగా చేయించకుండా భారత రాజ్యాంగ స్వతంత్ర వ్యవస్థలను తన గుప్పిట్లో ఉంచుకొని వాటిద్వారా తనకు అనుకూలంగా మార్చు కుంటున్నారు. నిజానికి ఇటువంటివి చిల్లర రాజకీయాలు. ఇప్పటి పాలకపక్షాలన్నీ ఆఖరుకు మోడీ కూడా ప్రతిపక్షాలను బలహీనం చేయాలని చూస్తున్నారే తప్ప ప్రజలను ఆకర్షించాలని చూడటం లేదు. మంచిపనులు చేసి, అభివృద్ధి చూపించి ఆదర్శవంతమైన పరిపాలన చేస్తే ఏపాలకునికైనా అడ్డదారులు అవసరముండదు. ప్రజలే ఓట్లు వేస్తారు. తాము మంచిపనులు చేయటం లేదని భయమే ప్రజలు ఆదరించరనే భయమే అడ్డదారులకు తావిస్తుంది. ఫిరాయింపులు, దొంగ ఓట్లు, ఓటర్ల జాబితాలో అవకతవకలు, ప్రతిపక్షాలపై రకరకాల దాడులు ఇవేవీ అవసరముండదు. ఆదర్శవంతమైన పరిపాలన తెస్తానంటున్న బీజేపీ కూడా ప్రజాస్వామ్య వ్యతిరేకదారులలో వెళ్తోంది. నిజానికి మోడీ కాలంలోనే ప్రభుత్వ స్వతంత్య్ర వ్యవస్థలను రాజకీయ ప్రతిపక్షాలపై ప్రయోగించటం ప్రారంభించారు. ప్రజాస్వామ్య నైతిక విలువలను ధ్వంసం చేసిన ప్రధానులలో మోడీ ప్రధములు. మోడీ పరిపాలన, ప్రజాస్వామ్యయుతంగా ఆదర్శవంతంగా ఉంటే.. ప్రజలు తలకెక్కించుకునేవారు. ఎంతగా నరేంద్రమోడీ దిగజారారంటే తన రాజకీయ ప్రత్యర్థులను అవినీతి అంతం పేరుతో దాడులు చేయించి బలహీనం చేయించేవారు కాదు. పుల్వామా ఘటనను ఎన్నికల ప్రయోజనంగా మార్చుకునేవారు కాదు. బీజేపీ కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నది. ఏదో విధంగా తమపార్టీలోకి వచ్చేవారికి శాలువా వేస్తున్నారు. కర్నాటక యడ్యూరప్ప అక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టటానికి కాంగ్రెస్పార్టీవారిని దాచిపెట్టారని కొన్నారని ఎన్నో వార్తలొచ్చాయి. దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీయే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నప్పుడు ఇక దేశానికి దిక్కెవరు? దేశంలో అవినీతిని అంతం చేస్తానని దినానికి పదిసార్లు చెప్పే ప్రధాని మోడీకి ఒక విషయం తెలియదనుకోను. పార్టీ ఫిరాయించటం, ప్రోత్సహించటం పార్టీ వీడినవారిని తమ పార్టీలో చేర్చుకోవటం అన్నీ అవినీతిపనులే. అందరూ కలసి ఓటర్లకు ద్రోహం చేస్తున్నారు. ఫిరాయింపుల వెనుక కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని, లేదా అవినీతి పరులు చట్టవ్యతిరేక పరులు రాజకీయం వెనుక రక్షణ పొందుతున్నారని అందరికీ తెల్సిన రహస్యమే? ఫిరాయింపులు జరుగుతున్నవి రాష్ట్రం కోసం కాదు దేశం కోసం కాదు. వ్యక్తి స్వార్థం, పార్టీ స్వార్థం, పాలకుల స్వార్థం ఫిరాయింపులలో కనిపిస్తోంది. పార్టీ ఫిరాయించిన చట్టసభల సభ్యుడు పార్టీకే కాదు, జాతికి, తనకు ఓటు వేసిన ప్రజలకు, రాజ్యాంగానికి ద్రోహం చేస్తున్నాడు. కొన్ని రాష్ట్రాల పాలకులు మెజారిటీ రాకున్నా ఫిరాయింపుల ద్వారా ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. ఈ దేశాన్ని ఎవరు రక్షించాలి? ఫిరాయించిన సభ్యులు తమ ఫిరాయింపును సమర్థించుకుంటారు. నియోజకవర్గ ప్రజల కోసం చేస్తున్నామని పాలకవర్గంలో ఉంటే తనను గెలిపించిన ప్రజలకు ప్రయోజనమని అందుకే పార్టీ మారానని.. ఎంత దబాయింపు ఇది.. దొంగ రోడ్డుపైకి వచ్చి లోక కళ్యాణం కోసం దొంగతనం చేసానన్నట్టుగా ఉంది. ఇటీవల కధలు ఇంకా దూరం పోయాయి. తెలంగాణలో శాసనమండలి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్నువీడి టీఆర్ఎస్లో చేరిన ఇద్దరు సభ్యులు ఇంతకాలం తామున్న కాంగ్రెస్పార్టీని, తమకు టిక్కెట్టు యిచ్చి గెలిపించిన పార్టీని, పార్టీ నాయకుడు ఉత్తమ్కుమార్రెడ్డిని బహిరంగంగా విమర్శించి దుమ్మెతిపోస్తున్నారు. ఉత్తమ్కుమార్ మాటలు తమ ఆత్మాభిమానం దెబ్బతిం దంటున్నారు. దేశం ఎటుపోతోంది? ఇంత అల్లరి ఎందుకు? పార్టీ ఫిరాయించదల్చుకుంటే పార్టీకి, పదవికి రాజీనామా చేసి మరో పార్టీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి మళ్లీ గెలవాలి. అదీ పద్ధతి. 'ఫిరాయింపుల చట్టం' ఒకటి తెచ్చారు. పార్టీ ఫిరాయించే వ్యక్తి ఆ చట్టాన్ని ఖాతరు చేసే స్థితిలో లేడు. ఆ చట్టంలో అన్నీ లొసుగులున్నాయి. పార్టీ ఫిరాయించి ఎన్నికయిన వ్యక్తి పదవి వెంటనే రద్దు అవుతుందని లేదు. ఇది ఏ సమీక్షకు అవసరం లేని మామూలు విషయం. స్పీకర్, న్యాయవ్యవస్థ ఇందులో తలదూర్చవల్సింది, సమీక్ష చేయవల్సింది ఏమీలేదు. ప్రజలుపార్టీకి ఓటు వేసారు. వ్యక్తికి కాదు. స్వతంత్య్ర అభ్యర్థి వేరు. కానీ చట్టం అలా లేదు. ఫిరాయింపుల చట్టం లొసుగుల వలన చట్టం తెచ్చి లాభంలేని పరిస్థితి. ఫిరాయించే వ్యక్తి పదవి అర్హత స్పీకర్ చేతుల్లో పెట్టింది. ఈ వ్యవస్థలో స్పీకర్, గవర్నర్లు ఎవరు? పాలకపక్ష సేవకులు, స్పీకర్లు, ముఖ్యమంత్రి కనుసైగల కింద చట్టసభలు నడిపిస్తారు. స్పీకరు, గవర్నర్ వ్యవస్థలు స్వతంత్రమైనవి. ఈ స్వతంతతను పదవిలోకి వచ్చినవారు కాపాడటం లేదు. స్పీకర్లను, గవర్నర్లను ఎవరు నిర్ణయిస్తారు? పాలకపక్షం తమ అనుకూలమైన వ్యక్తిని స్పీకర్గా నిర్ణయిస్తే.. కేంద్ర ప్రభుత్వం తమకనుకూలమైన వ్యక్తిని గవర్నర్గా నియమిస్తుంది. వీరు రాజ్యాంగంలో ఆట ఆడుతున్నారు. ఇక్కడ విషాదమేమిటంటే స్పీకర్, గవర్నర్ల వ్యవస్థలలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవటానికి పెద్దగా వీల్లేదు. ఈ బలహీనత వలన ఫిరాయింపులు ఇష్టారాజ్యంగా ఒక వ్యాపారంగా, కోట్ల డబ్బుచేతులు మారటంగా, కొనటం, అమ్మటంలా వాళ్ల అవినీతి బ్లాక్ మెయిల్ అస్త్రంగా జరుగుతున్నాయి. ఇన్ని కథలున్న ఎన్నికల వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల వ్యవస్థలో ఇన్ని లోపాలున్నప్పుడు మన ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉందని చెప్పలేం. ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులను ఫిరాయింపులు కదలిస్తున్నాయి. ఫిరాయింపులను, ముఖ్య మంత్రులు, ప్రధానులే ప్రోత్సహించినప్పుడు ఈ దేశానికి దిక్కెవరు? ప్రజాస్వామ్యం ఎలా రక్షించబడుతుంది?
- సహస్ర