Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజేపీ దేవుని సొంత పార్టీ. వరుణదేవుడు దేశం నలుమూలలా ఉన్న రైతులలో ఎక్కువ మందిపట్ల సానుభూతి చూపటంలేదు. కానీ దేశంలోనే అతి పురాతనమైన కాంగ్రెస్ పార్టీని ఓడించినందుకు మోడీ మే 23న న్యూఢిల్లీలో విజయోత్సవసభ జరుపుతున్న సమయంలో వానదేవుడు చిరుజల్లులు కురిపించాడు. అందుకు మోడీ కూడా ప్రతిస్పందనగా కృతజ్ఞతలు చెప్పారు. ఆ సందర్భంలో మోడీ ''కులం''కు సరికొత్త నిర్వచనాన్ని ప్రకటించారు. కులం అనేది సహజంగానే పీడన, అణచివేతలనే లక్షణాలను కలిగి ఉంటూ సమసమాజ భావనకు వ్యతిరేకంగా ఉంటుంది. వీటిని మోడీ కప్పిపుచ్చుతూ పునర్నిర్వచించారు.
''ఈ సాధారణ ఎన్నికలు భారత దేశంలో రెండే కులాలను మిగిల్చాయి. ఒకటి పేద ప్రజలు, రెండవది పేదరిక నిర్మూలనకోసం పనిచేసేవారు'' ఇదీ మోడీ నిర్వచనం.
పుట్టిన కులాన్ని అధిగమించి ప్రజలందరు ఐక్యంగా పేద ప్రజల అభివృద్ధికోసం కులాలతో నిమిత్తం లేకుండా మన సమాజంలో పనిచేస్తారని మోడీ చెప్పడాన్ని గమనిస్తే ఒక మాంత్రికుడిలా ఆయన సీనియర్ పాత్రికేయులను సహితం సమ్మోహిత పరిచారు. ఇది ఒక విచిత్రమైన ఆలోచన. ఈ స్వప్నం ప్రకారం ఉన్నత కులాలలో పుట్టి సంపన్నులైనవారు ఇదే సమాజంలో కలుషితమైనవారు, మలినమైనవారు అనే పేరుతో విడదీయబడుతున్న చిన్న కులాలకు చెందిన వారిని ఉన్నత కులాలవారు చేతులు చాచి తమవద్దకు పిలుచుకుని వారిని హిందూ తమ్ముళ్ళుగా స్వీకరించి భవిష్యత్తులో వీరికి ధర్మకర్తలుగా ఉంటామని తెలియచేస్తున్నారు. వాస్తవ జీవితం ఇందుకు భిన్నంగా ఉంటుందనేది యదార్థం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశాభివృద్ధిలో ఎక్కువగా లాభపడ్డది ఉన్నత కులాల వాళ్ళు మాత్రమే. ఇక్కడ మరో అంశం గమనించాలి. వాళ్ళ అభివృద్ధి చిన్న కులాల వాళ్ళ పొట్టగొడితేనే సాధ్యమయింది. ఒక వర్గం లాభపడితే మరో వర్గం నష్టపోతుందనేది జగమెరిగిన సత్యం అని మనకు అర్ధం అవుతున్నది.
ఈ విషయాన్ని పరిశీలించండి.
ప్రపంచ అసమానతల నివేదిక 2019 భారతదేశంలో 1980 నుంచి అసమానతలు పెరుగుతున్నాయని వెలువరించింది. ''భారతదేశంలో 1922 నుంచి 2014 వరకు ఆదాయంలో అసమానతలు: బ్రిటిష్రాజ్ నుంచి బిలియనీర్ రాజ్'' అనే శీర్షికలో మన ఆర్థిక వ్యవస్థ ద్వారాలు తెరవడం, నిబంధనలను సరళం చేయడం లాంటి ''గుణాత్మక మార్పుల వలన అసమానతలు బాగా పెరిగాయి అని నొక్కి చెప్పింది. 2014లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న ఒక శాతం వారు 22శాతం జాతీయ ఆదాయం సమకూర్చుకున్నారని, అగ్రస్థానంలో ఉన్న 10శాతం మంది 56శాతం ఆదాయం పొందారని తెలియచేసింది. అగ్రస్థానంలో ఉన్న 0.1శాతం వారే వరుసగా పెద్ద మొత్తంలో ఆదాయం పొందుతున్నారని, వారే క్రింది 50శాతం మంది మొత్తం ఆదాయం కంటే ఎక్కువ పొందుతున్నారని బయట పెట్టింది. అగ్రస్థానంలో ఉన్న ఈ 10శాతం మంది అగ్రకులాల వాళ్ళే, అంటే నిచ్చెనమెట్లలో పై మెట్టుమీద ఉన్నవారెే అని నివేదికలు తలియచేస్తున్నాయి.
సావిత్రీ బాయి ఫూలే విశ్వవిద్యాలయం, జవహర్లాల్నెహ్రూ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ దళిత స్టడీస్ వాళ్ళు ఉమ్మడిగా జరిపిన అధ్యయనంలో వ్యక్తుల విద్యాస్థాయి, ఉపాధి దానితో సమకూరే ఆదాయం దానిపరిమితి, ఆస్తులను ''కులం'' నిర్ణయిస్తుందనే తుది నిర్ధారణకు వచ్చారు. ఈ నివేదిక రాయడంలో ప్రధాన భూమిక నిర్వహించిన నితిన్ తగాడే ప్రకారం భూమి లేక ఇండ్ల రూపంలోఉన్న ఆస్తుల యజమానులుగా ఎవ్వరు ఉన్నారని పరిశీలిస్తే హిందువులలోని ఉన్నత కులాల వాళ్ళే ఎక్కువ ఆస్తులను కలిగి ఉన్నారని తెలియచేస్తున్నారు.
యూజీసీ మాజీ చైర్మన్ ఎస్.కె. తొరాట్ పై నివేదిక గురించి స్పందిస్తూ ''ఈ నాటికీ కులం ప్రధాన భూమిక పోషిస్తున్నదని, కుల వ్యవస్థ నిచ్చెనమెట్లలో క్రిందికి పోతున్న కొద్దీ పేదరికం మరింత పెరుగుతున్నదని, ఆర్థిక అసమానతలు, కులపీడన ఇప్పటికీ క్రింది కులాలవాళ్ళు అనుభవిస్తున్నారు. ఏదైనా ఆస్తి కొనాలన్నా, వ్యాపారం పెట్టాలన్నా అగ్రకులాల వాళ్ళే అందులో కూడ ఆధిపత్యం చెలాయిస్తున్నారు'' అని తెలియచేశారు. విధానాలే అన్నింటినీ శాసిస్తాయని ప్రపంచ అసమానతల నివేదిక సారాంశం.
వరుసగా పాలించిన ప్రభుత్వాలు అమలు పరిచిన విధానాల ఫలితంగా అసమానతలు పెరుగుతూ వచ్చాయి. వీటి భారాన్ని ఇప్పటివరకూ చిన్న కులాలే మోయవలసి వచ్చింది. మోడీ విధానాలు ఇందుకు భిన్నంగా ఏమి లేవు. నోట్లరద్దు యొక్క శాపం అసంఘటిత రంగంలోని ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడింది. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులలో చిన్న కులాలు, ముస్లిం మైనారిటీస్ ఎక్కువమంది ఉంటారు. వారే ఈ భారాలను మోయవలసి వచ్చింది. మోడీ విధానాలు వ్యవసాయ రంగంలోని సంక్షోభాన్ని పరిష్కరించలేదు. వ్యవసాయ రంగమే వెనుకబడిన తరగతులలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నది.
వర్ణ, కర్మల పేరుతో అత్యధిక సంఖ్యాకులను ఆర్థిక చట్రానికి దూరంగా ఉంచిన భూస్వామ్య వ్యవస్థను నడిపిన అల్ప సంఖ్యాకులు అందర్నీ కలుపుకోవడమంటే అది దాత్రుత్వంకాదు. భారతదేశంలో విషపూరితమైన విభజన గీతలను తేనెపూసిన మాటలతో సరిచేయలేము. కులాల మధ్య ఏవో సర్దుబాట్లను కుదర్చడం వలన సామాజిక న్యాయం సాధ్యం కాదు.
వెనుకబడ్డ కులాల, వెనుకబడ్డ వర్గాల వాళ్ళకు ఇప్పటి వరకు అందిన లాభం ఎంత పరిమితమైనది అయినా వందేండ్లనాడు సామ్యవాదం, సామాజిక న్యాయం కోసం ప్రారంభించిన పోరాటఫలితం మాత్రమే. సమసమాజ స్థాపన భావనగల ఈ పోరాటాలకు పూర్తి వ్యతిరేకంగా విడి సావర్కర్ భారతదేశాన్ని హిందుదేశంగా మార్చండని, హిందూతత్వాన్ని సైనికీకరణ చేయండనీ.. మాట్లాడారు. అయితే మనలని దారుణంగా పరిపాలిస్తున్నవారికి సామ్రాజ్యవాదులైన క్రిస్టియన్స్ వ్యతిరేకంగా హిందూత్వవాదులు మాట్లాడేవారుకాదు. సాంస్కృతిక జాతీయ వాదం అనే పేరుతో సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయోద్యమాన్ని వ్యతిరేకించారు.
మోడీ నాయకత్వంలో సావర్కర్ వందేండ్ల నాటి స్వప్నం నిజరూపం దాల్చే సమయం దగ్గర పడుతున్నది. మితవాదంవైపు ఉన్న ఈ గణతంత్ర దేశం హిందూత్వ తత్వశాస్త్రాన్ని పుణికి పుచ్చుకున్న ప్రధాని సామాజిక న్యాయానికి వక్రభాష్యం చెపుతూ, లౌకికతత్వాన్ని వెక్కిరిస్తున్నారు. నయా ఉదారవాద యుగంలో సోషలిజం, సమానత్వం అనేవి బూతు పదాలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పుడు మనముందున్నదారి ఒక్కసారిగా శత్రువును నిందించుకుంటూ, సాకులు వెతుకుతూ మాట్లాడ్డంకాదు. మరోపక్క మెజారిటీ హిందువులు ఉన్నారనే సాకుచూపి దారితోచని దేశభక్తి నరనరానా జీర్ణించుకుంటున్న (కాంగ్రెస్) వారు చేస్తున్నట్టు గుడులు గోపురాలు చుట్టూ తిరగడం కాదు. మన ముందున్న దారి ఒక్కటే.. 20వ శతాబ్దంలోని మొదటి దశాబ్దంలో ఏ విధంగానైతే సమసమాజ భావాలు పుట్టుకొచ్చాయో వాటిని పునరుద్ధరించి వాటి చుట్టూ ప్రజా ఉద్యమాలను నిర్మించడం. సంక్షోభం అనేది తమను తాము శుద్ధిచేసుకోవడానికి, స్పష్టత రావడానికి ఉపయోగపడుతుంది. మొండివాదనలు స్వైర విహారం చేస్తున్నప్పుడు చరిత్రను మరిచిపోవడం అనేది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. నిరాశ చెందడమూ, నిరాసక్తి వహించడం సంపన్న వర్గాలకు ఉన్న సౌకర్యం. కార్మికవర్గ శ్రేణులకు అలాంటి సౌకర్యం లేదు.
- ఆర్. విజయశంకర్
అనువాదం : టి.ఎన్.వి.రమణ,
సెల్: 9494731091