Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నారదుడు మొకానికి పోడర్ బూస్కుండు. తంబూర దీస్కుండు. చిర్తలు దీస్కోని ఒకపారి గొట్టి జూస్కుండు. యాడికి బోవాలె. యాడికి బోతె బాగుంటదని జెరసేపు సోంచాయించిండు. యాడికో ఎందుకు యాద్గిరి గుట్టకు బోతె బాగుంటదని అనుకున్నడు. అనుకోని చిర్తలు గొట్టుకుంట నారాయన; నారాయన; అన్కుంట గాయిన మొగులు మీదికెల్లి ఎల్లిండు.
నడిరాత్రి అందరు పండుకున్నరు. యాడ సప్పుడు లేదు. నారదుడు యాద్గిరి గుట్టమీద దిగిండు. గుల్లెకు బోయిండు.
''నారాయన; నారాయన '' అన్నడు.
నర్సిమ్మ సామి కండ్లు దెర్సి- ''నువ్వా నారదా! శానొద్దులకు వొచ్చినవేంది'' అని అడిగిండు.
''మీ తోని ముచ్చటబెడ్తె దేసంల ఏమైతున్నదో ఎర్కైతది దేవా!''
''ఎలచ్చన్లు అయిపోయినయి గదా నారదా!''
''ఎలచ్చన్లు అయిపోయినంకనే అసల్ రాజకీయాలు షురువైతయి గదా''
''ఉత్తరప్రదేస్ల మహాకూటమి పేరు మీద సమాజ్ వాది; బహుజన్ సమాజ్; ఆర్ఎల్డీ పార్టీలు లోక్సబ ఎలచ్చన్ల పొత్తు బెట్టుకున్నయి. 'యే దోస్తీ హారు నహీ ఛోడేంగే; ఛోడేంగే దమ్ మగర్ తేరె సాత్ న ఛోడేంగే' అని మాయవతి; అకిలేశ్యాదవ్ పాట బాడిండ్రు. 'మాతోని గెలిచే ధీరుడెవ్వడురా శూరుడెవ్వడురా' అని లేని మీసాలు దువ్విండ్రు. బస్తీమే సవాల్ అన్నరు. బీఎస్పీ 38, ఎస్పీ 37, ఆ ఎల్డీ 3 సీట్లకు పోటీ జేసినయి. 60 సీట్లల్ల మేము గెలుస్తం. ఎట్లన్న ఎన్డీఎకు మెజార్టి రాదు. సంటర్ల మేమే గిర్రదిప్పుతం. నేను ప్రతాన మంత్రిని అయిత అని మాయవతి అన్నది. గని బీఎస్పీ 10 ఎస్పీకి 5 సీట్లే వొచ్చినయి''
''కింది మీదికైనందుకు మాయవతి ఏమన్నది సామీ''
''గిదొక బేకార్ కూటమి. బీఎస్పీకి యాదవులు ఓట్లు ఎయ్యలేదు. కమస్కం అకిలేశ్ కుటుంబానిక గూడ యాదవుల ఓట్లు పడలేదు. కనోజ్ కెల్లి అకిలేశ్ పెండ్లాం డింపుల్ యాదవ్ పోటి జేసింది. గాడ మూడున్నర లచ్చల యాదవుల ఓట్లున్నయి. గని గవన్ని గామెకు రాలేదు. గామెకు వొచ్చిన ఓట్లన్ని బీఎస్పీయే. అకిలేశ్కు ఆకర్కి పెండ్లాంను గూడ గెలిపియ్య శాత గాలేదు. ఎస్పీతోని పొత్తు బెట్టుకోకుంటె మాకు కమస్కం 30 సీట్లు వొచ్చేటియి, బేకార్ కూటమి జెయ్యబట్కె బిజెపికి 62 సీట్లు వొచ్చినయి'' అని మాయవతి అన్నది''
''గామె గట్లంటె అకిలేశ్ ఊకున్నడా?''
''దోస్త్ దోస్త్ నా రహా; ప్యార్ ప్యార్ నా రహా అని గాయిన పాట బాడిండు. 2014 లోక్సబ ఎలచ్చన్ల బిఎస్పీకి ఒక్క సీటు గూడ రాలేదు.
గిప్పుడు మేము జెయ్యబట్కె బీఎస్పీకి 10 సీట్లు వొచ్చినయి. 11 అసెంబ్లి సీట్లకు అయ్యేటి బై ఎలచ్చన్ల ఎవ్వరితోని పొత్తు బెట్టుకోకుంట మేము పోటి జేస్తం అని అకిలేశ్ అన్నడు''
''ప్రతాని కుర్సి కోసం కలలు గన్న మమతాబెనర్జి ఏమన్నది?''
''పెండ్లాం ఆడామె. చెల్లె అడామె. అక్క ఆడామె. అమ్మ ఆడామె. అమ్మమ్మ ఆడామె. ఆడోల్లు లేకుంటె గీ దునియనే లేదు. బిజెపికి ఆడోల్లంటె గౌరవం లేదు. మోదీకైతె అసల్లేదు. యుపిల జై సీతారాం అంటరు. గాంది గూడ 'రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం' అని అన్నడు. గని బిజెపి సీతను దీసేసింది. తీసేసి జై శ్రీరాం అంటున్నది. గిదేమన్న బాగున్నదా? దీని మీద ఆడోల్లందరు హర్తాల్ జెయ్యాలె. రాస్తా రోకోలు జెయ్యాలె. అదాలత్ల కేసు లెయ్యాలె. సీతామాతకు న్యాయం జరిగె దాంక నేను బూకర్తాల్ జేస్త. జై సీతారాం. జైజై సీతారాం జై హింద్ జై బంగ అని మమతా బెనర్జి అన్నది''
''కర్నాటకల జెడిఎస్; కాంగ్రెస్ గల్సి నడిపిస్తున్న సర్కార్ సక్కగున్నదా?''
''గండాలు; సుడిగుండాల నడ్మ కర్నాటక సర్కార్ నడుస్తున్నది. కాంగ్రెస్ జెయ్యబట్కె ముక్యమంత్రి కుమారసామికి నెత్తి నొప్పిలేసింది. బిపి బెర్గింది. పెయ్యి కరాబైంది. ఎంతమంది డాక్టర్లకు సూబెట్టుకున్నా గాయిన రోగం తక్వైత లేదు. ఎన్ని తాయిత్తులు గట్టిపిచ్చుకున్నా గాయిన నెత్తి నొప్పి బోతలేదు. ముక్యమంత్రి కుర్సి మీదికెల్లి దిగుతె నెత్తినొప్పి తక్వయితది. పెయ్యి మంచిగైతదని కుమారసామికి ఎర్కే. ఎర్కున్నా ముక్యమంత్రి కుర్సి మీది కెల్లి గాయినకు దిగ బుద్ది అయితలేదు. నువ్వే సవుటవు అంటె నువ్వే సవుటవు నీకు శాతగాదంటె నీకు శాతగాదు అన్కుంట కాంగ్రెస్ ; జెడిఎస్ లీడర్లు తిట్టుకోబట్టిండ్రు. కొట్లాడుకోబట్టిండ్రు. గీల్ల సంసారం సక్కగ లేదనుకోని 10 కోట్ల రూపాల మంత్రి కుర్సి సూబెట్టుకుంట బిజెపి లైట్ కెల్లి విశ్వనాత్ దిగిండు. దేవెగౌడను కాంగ్రెస్ ముంచింది. కాంగ్రెస్ చెయ్యి ఇయ్యబట్కె తుంకూర్ల గాయిన ఓడిపోయిండు. దినాం కుమారసామిని కాంగ్రెస్ ఒక్క తీర్గ సతాయిస్తున్నది అని విశ్వనాత్ అన్నడు''
''బీహార్ల నితీశ్, బిజెకి దూరమైతున్నడని అంటున్నరు. నివొద్దేనా?''
''నివొద్దే బీహార్ల బిజెపి, జేడీయు నడ్మ దూరం బెర్గుతున్నది. గీ రొండు పార్టీలు కొట్లాడెతందుకు రడీగున్నయి. వన్ టూ త్రీ అనంగనే గీ పార్టీలు దంగలకు దిగుతయని అంటున్నరు. బీహార్ల ఇఫ్తార్ల దావత్లతోని కొత్త రాజకీయంకు పర్ద లేపిండ్రు. బిజెపి ఇచ్చిన ఇఫ్తార్ దావత్కు జెడియు లీడర్లు ఎవ్వరు బోలేదు. గదే తీర్గ జెడియు ఇచ్చిన ఇఫ్తార్ దావత్కు బిజెపి లీడర్లెవ్వరు బోలేదు. గని మహాకూటమిల ఉన్న మాజీ ముక్యమంత్రి జతిన్ రాం మాంజి ఇచ్చిన ఇఫ్తార్ దావత్కు బీహార్ ముక్యమంత్రి నితీశ్ కుమార్ బోయిండు'' అని నర్సిమ్మ సామి జెప్పిండు.
ఇంతల తెల్లారింది. అయ్యగార్లు సుప్రబాతం సద్వబట్టిండ్రు. నారదుడు మాయమై మొగులు మీద్కి బోయిండు.
తోక :- మాపటీల చౌరస్తల ఉన్న పాన్డబ్బా కాడ్కి బోయిన. గాడ సిగిలేట్లు దాక్కుంట పాన్లు దినుకుంట మా దోస్తులు ముచ్చట బెడ్తున్నరు.
''కాంగ్రెస్కు చెయ్యిచ్చి తాండూర్ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి గోడ దుంకిండు. గాయిన తోని మొత్తం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గోడదుంకి గులాబి కండ్వలు ఏస్కున్నట్లు అయ్యింది. అసెంబ్లిల మెజార్టి ఉన్నంక గూడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్లకు ఎందుకు గుంజిండ్రు'' అని సత్నారి అడిగిండు.
''మొన్నటి దాంక ఫెడరల్ ఫ్రంట:్ అన్కుంట కెసిఆర్ బిజెపికి దూరమైండు. కాంగ్రెస్ ముక్త భారత్ అని మోదీ అంటె కాంగ్రెస్ ముక్త అసెంబ్లి అనుకుంట మల్ల బిజెపికి దగ్గరయ్యేతందుకు కెసిఆర్ కోషిస్ జేస్తున్నడు'' అని యాద్గిరి జెప్పిండు.
- తెలిదేవర భానుమూర్తి
సెల్: 9959150491