Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సోషలిజంలో శ్రమజీవులకు న్యాయం జరుగుతుంది. కమ్యూనిజంలో కష్టజీవులతో పాటు అశక్తుల అవసరాలూ తీరతాయి. పెట్టుబడిదారీ సమాజం సమస్యల వలయం. అసమానతల పుట్ట. పేదల నరకం. దోపిడీదారుల, వ్యాపారవర్గాల స్వర్గం. దీనికి మతమితవాద పాలన తోడయితే సమాజం చీలుతుంది. సర్వనాశనమౌతుంది. నేడు ప్రపంచంలో మత పాలకులు పెరిగారు. మన దేశంలో అమానవ మతమూర్పులు రాజ్యమేలు తున్నారు. నియంతృత్వానికి, ఫాసిజానికి దారితీస్తున్నారు. విప్లవమనగా మార్పు. సమస్యల తీవ్రత తగ్గించటానికి, సమస్యలనే నిరోధించటానికి, వ్యవస్థనే మార్చటానికి కమ్యూనిస్టులు, సామాజిక సంస్కర్తలు పోరాడ తారు. ఈ విప్లవ శక్తులకు బాహ్య అంతర్గత శక్తులు సమస్యలు సృష్టిస్తాయి. సవాళ్ళు విసురుతాయి.
ప్రపంచీకరణ నేటి సమస్యల ప్రధాన కారణం. అందులో సాంకేతికతల వంటి కొన్ని అనుకూలతలున్నాయి. ప్రపంచీకరణను చైనా అనుకూలంగా మార్చుకుంది. మా సరుకులు లేకపోతే మీరు బతకలేరన్న అమెరికా బెదిరింపులకు మనం లొంగాం. మా సంతలు లేకపోతే మీ సరుకులు అమ్ముకోలేరని అనలేకపోయాం. దాసోహమై నాశనమయ్యాం. ప్రపంచీకరణ అవసరం తీరిన అమెరికా నేడు ప్రపంచీకరణ వద్దంటోంది. ప్రపంచీకరణలో విద్యావైద్యాలు కార్పొరేట్ల వశమయ్యాయి. విద్యా వ్యవస్థ పాడవుతుంటే మనం పట్టించుకోలేదు. ప్రయివేటు విద్య సమాజ నిర్మాతలకు బదులుగా సామాజిక వ్యర్థ నష్ట పదార్థాలను తయారు చేసింది. ఆధునిక యాంత్రిక చదువరులకు దోపిడీ సమాజమే సౌకర్యంగా ఉంది. వాళ్ళు వ్యవస్థ మార్పు కోరుకోరు. ప్రభుత్వ తప్పుడు విధానాలతో కార్పొరేట్ల కబంద హస్తాల్లో ప్రజారోగ్యం క్షీణించింది. రోగనిరోధక చర్యలనుగాక రోగ చికిత్సనే ప్రోత్సహిస్తోంది. అనారోగ్య భారతం ఉత్పత్తి శక్తిసామర్థ్యాలు కోల్పోయింది. బతకడానికే పోరాడాలి. విప్లవ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. డెబ్బైరెండేండ్ల స్వతంత్ర భారతంలో రాజ్యాంగంలో పొందుపరిచిన ఈ సమస్యలే పరిష్కరించబడలేదు. పాలక పక్షాల కార్మిక సంఘాలు బలపడ్డాయి. సంఘాలు జీతభత్యాలు, సౌకర్యాలు, పదోన్నతుల కోసం పోరాడాయే కానీ ప్రజావసరాలు పట్టించుకోలేదు. తమ పోరాటాలన్నీ ఆర్థిక పోరాటాలతోనే ఆగిపోయాయి. సామాజిక, రాజకీయ చైతన్యం సాగలేదు. ఫలితంగా కార్మికుల ప్రవర్తనలో స్థిరత్వం లేదు. సమస్యల సమయాల్లో, సమస్యల పరిష్కారం తర్వాత, కార్యాలయాల్లో, ఇంట్లో, కులమతస్తుల మధ్య వేరువేరు స్వభావం చోటుచేసుకుంటుంది. ఇక విప్లవ భావాలు ఎలా నిర్మించబడతాయి? విప్లవం ఎలా సాగుతుంది? పురుషాధిక్య సమాజంలో పురుషులే కార్యసాధకులన్న అపోహ ఉంది. విప్లవ కార్యక్రమాల్లో స్త్రీల భాగస్వామ్యం తక్కువ. సమాజంలో సగం విప్లవ చర్యలకు దూరమైతే మార్పు సాధ్యమా? కుటుంబ సభ్యుల సహాయసహకారాలు, భాగస్వామ్యం, మాన్యతలతో విప్లవ కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. గమ్యసాధన సులభమవుతుంది.
ప్రత్యామ్నాయ, విప్లవపక్షాల్లోనూ రాజీ ధోరణి పెరిగింది. సమన్వయం కోసం క్రమశిక్షణా రాహిత్యాన్ని, సిద్ధాంత వెసులుబాట్లను సహిస్తున్నాయి. సిద్ధాంత ప్రాతిపదిక తగ్గింది. ఒకప్పుడు ప్రతి ప్రజాసంఘంలో, ప్రతి సామాజిక వేదికలో వామపక్ష భావాలు, ప్రగతిశీల ఆలోచనలు ఉండేవి. ఈరోజు ఈ ప్రహసనం తిరగబడింది. ప్రతి చోటా సంఘ పరివారీయ భావజాల మతఛాందసం చొరబడింది. వామపక్ష సాహచర్యంతో అబ్బిన పరిజ్ణానం, వాక్పటిమ, చర్చా సామర్థ్యాలతో వారిలో ఇతరులను మాట్లాడనీయని స్వభావ సమర్థన సిద్ధమైంది. క్రియాశీలక పోరాటాలు లేవు. విప్లవం మాటే వినపడదు. దీనికి తోడు ప్రత్యామ్నాయ పక్షాలు ముక్కలు చెక్కలయ్యాయి. వీటితో పాటు ప్రజాసంఘాలు, కార్మిక, శ్రామిక సంఘాలూ చీలాయి. ఏ చీలికా గమ్యాన్ని చేరలేదు. అసలు కారణాలు ఆలోచించలేదు. ఆత్మవిమర్శ, విమర్శల ప్రాధాన్యతను నొక్కిచెప్పిన లెనిన్ను అందరూ ఆరాధిస్తారు. కానీ ఆత్మవిమర్శ చేసుకోరు. విమర్శ సహించరు. స్వోత్కర్ష, పరవిమర్శలు పెరిగాయి. ఎవరికి వారు తమదే సరైన పంథా, తామే అసలు విప్లకారులమని వాదిస్తూ ఎదుటివారిని నిందిస్తూ విమర్శిస్తూ ఉంటారు. పరోక్షంగా శత్రుపక్షాలకు సహకరిస్తుంటారు. ఇక విప్లవం ఎలా సాధ్యం? మనం ఈ దేశ లోపభూయిష్ట ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల పాలనలో జీవిస్తున్నాం. రాజ్యాంగ పరిధిలో చేయబడ్డ చట్టాలు మన జీవితాలను శాసిస్తున్నాయి. ఎన్నికల విధానాన్ని, ప్రజా స్వామ్య పద్ధతులను, రాజ్యాంగాన్ని మార్చాలంటే ఆ ప్రక్రియల్లో పాల్గొనాలి. మార్పుకు ప్రయత్నించాలి. సమాజాన్ని మార్చాలంటే సమాజంలో, సమాజంతో బతకాలి. సమాజానికి దూరంగా మార్పు సాధ్యం కాదు.
పాలకులు సంపన్నుల, కార్పొరేట్ల బంధువులు. పీడిత తాడిత జన శత్రువులు. గత ఐదేండ్ల పాలనలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పతనమయ్యాయి. విపక్ష, ప్రత్యామ్నాయ, విప్లవ పక్షాలన్నీ ఏకమవలేదు. దుష్ట పాలకులను పోరాటాలతో హడలెత్తించలేదు. లౌకికత్వ ప్రచారం వెనుకపట్టు పట్టింది. ప్రగతిశీలురైనా కులమత పక్షపాతం పూర్తిగా పోలేదు. ఇక సాధారణ ప్రజల స్థితి చెప్పనక్కరలేదు. ఈ అంశాన్ని ప్రస్తుత పాలకులు చక్కగా వాడుకున్నారు. మెజారిటీ మతస్తులను మత మైనారిటీలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టారు. మీకు మేమున్నామని మెజారిటీకి హామీ ఇచ్చారు. మెజారిటీకి తలొంచి బతక్కపోతే మీ బతుకులే ఉండవని మైనారిటీలను హెచ్చరించారు. ఓట్ల కోసం మత సమీకరణ చేశారు. దేశభక్తి, దేశరక్షణ పేర్లతో జనాల మనోభావనాలు కెలికేశారు. అధికార ధన మంద బలాలు సహకరించగా మళ్ళీ అధికారం సాధించారు.
ప్రభుత్వం సర్వాధికారి. ప్రభుత్వ సంస్థలన్నీ పాలకుల అధీనంలో ఉంటాయి. పాలకులు అస్తవ్యస్తకులైతే అదనపు అధికారాలు చేకూరుతాయి. ఎంత బలమైన నిబద్దత గల సంస్థ అయినా రాజ్యంతో తలపడటం కష్టం. కార్పొరేట్ల ఆధీన మాధ్యమాలు పాలక పక్షపాతాలు. పాలితుల శాపాలు. ప్రజాభిప్రాయ సేకరణ, నిర్మాణం, ప్రచారాలలో ప్రజలకు హాని చేస్తాయి. ఎప్పుడూ లేనివిధంగా ప్రభుత్వాలు కార్పొరేట్లతో కలిసిపోయాయి. వీటితో మతం కలిసింది. మూడూ కలిసి ప్రజలను దోచుకుంటున్నాయి. ప్రజలు అనేక మత్తుల్లో ముంచబడ్డారు. మత్తు పదార్థాలూ, మాదక ద్రవ్యాలూ సర్వవ్యాపితం. వీటికి కులమతాల మత్తు తోడైంది. ఇప్పటి దాకా మతం సాధారాణ మత్తు కలిగించేది. ఇప్పుడది అధికార దాహంతో ఉన్మాదస్థితికి చేరింది. సమాజం మతీకరించ బడుతోంది. కాషాయీకరించబడుతోంది. గరళీకరించబడుతోంది. కొందరు సౌజన్య పక్షపాతంతో, కొందరు భయాందోళనలతో, కొందరు అధికార కొనసాగింపునకు, కొందరు అధికార దురాశతో నిశ్శబ్ద స్తబ్దతలు పాటిస్తున్నారు. మేధోనిశ్శబ్దం తీరని హాని కలిగిస్తుంది. సామాన్యులను, బలహీనులను, అమాయకులను నిర్వీర్యపరుస్తుంది. నిర్వీర్యత మార్పుకు ప్రయత్నించదు. విప్లవశక్తులపై నీళ్ళు చల్లుతుంది. విజ్ణాన శాస్త్రాలు చదువుకొని ఉన్నత పదవులు పొంది, శాస్త్రీయ ఆవిష్కరణలతో సుఖంగా బతుకుతున్నవారికి శాస్త్రీయ దృక్పథం అబ్బలేదు. మూఢవిశ్వాసాలుముంచుతున్నాయి.
మార్క్సిజం, లెనినిజం, మావోయిజం అన్నీ విప్లవమార్గాలే. సోషలిజం, కమ్యూనిజాల లక్షితాలే. ముందువిప్లశక్తుల ధోరణులు మారాలి. గమన విభేదాలు మరిచి గమ్యమే ప్రధానం కావాలి. విప్లవశక్తుల పునరేకీకరణ జరగాలి. సంఘటిత పోరాటాలు జరగాలి. అలౌకిక, అప్రజాస్వామ్య శక్తులను ఎదిరించాలి. అప్పుడే విప్లవశక్తుల సమస్య లు పరిష్కరించబడతాయి. సవాళ్ళు అధిగమించ బడతాయి. విప్లవావకాశాలు మెరుగుపడతాయి.
- సంగిరెడ్డి హనుమంతరెడ్డి
సెల్: 9490204545