Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అన్ని ఎన్నికలూ అయిపోయాయి. గెలిచిన నాయకులు ప్రజాస్వామ్య విలువల రక్షణ కోసం పనిచేయాలా? అంతూ పొంతూలేని సంక్షేమ పథకాలు, పెరుగుతున్న ప్రభుత్వాల అప్పులు చూసిన తర్వాత ఈ ప్రశ్న తలెత్తింది. అసలు అభివృద్ధి అంటే ఏమిటీ? ప్రజల విశ్వాసం అంటే ఏమిటీ? నరేంద్ర మోడీ భారీ మెజారిటీతో గెల్చారు. అన్ని ఎన్నికలలో కేసీఆర్ ఘన విజయాలు సాధించారు. అంటే వీరు ప్రజల గుండెల్లో గూడుకట్టుకొని ఉన్నారా? విశ్వాసం వేరు, స్వార్థం వేరు. ప్రజల విశ్వాసం ఎన్నికలలో గెలుపోటములు నిర్ణయిస్తుందా? స్వార్థ ప్రయోజనాలు రక్షించటంలో విజయం దాగివుందా?
ప్రజలు స్వార్థపరులు కాదు. శ్రమజీవులు. దేశ సంపద పెంచుతున్నవారు! ఉత్పత్తి శక్తులు వారే. కొంతమంది ప్రజలను దోపిడీచేసి, దోపిడీ పేరుతో సంక్షేమ పథకాలంటూ ప్రజలను స్వార్థపరులను చేసి, వాళ్ల స్వార్థాన్ని పెంచి, ప్రజల ఆశతో తమకే ఓట్లు వేసేలా రాజకీయ చాణక్యం నెరపుతున్నారు. గెలుస్తున్నారు. ఓటు తమకు సంక్షేమ పథకాలు ప్రజలకు.. సంక్షేమ పథకాలు ఎందుకూ? ఓటు కోసం. ఈ సంక్షేమ పథకాలు రకరకాలుగా వెలుస్తున్నాయి. పాలకుల పని ఓట్ల వేటగా మారిపోయింది. సంక్షేమ పథకాల సొమ్ము ఎవరిది? ప్రజలది.. ప్రత్యక్ష పన్నులులేవు. అన్నీ పరోక్షపన్నులు. ఉదాహరణకు రెండు రూపాయలతో ఉత్పత్తి అయిన సబ్బు రూ.20కి జనం వద్దకు చేరుతుంది. ఇందులో రకరకాల పన్నులు.. ఇందులో ప్రతి అడుగూ దోపిడీ అడుగే.. ప్రజల బలహీనతలను సొమ్ముగా.. ఓటుగా మార్చుకోవటంలో పాలకులు రాజకీయ పక్షాలు చాలా చతురత ప్రదర్శిస్తారు. మద్యం ప్రజల ఆరోగ్యం పాడుచేస్తుందని అందరికీ తెలుసు. మద్యం వ్యాపారంతో వేల కోట్లు సంపాదిస్తోంది ప్రభుత్వం. మద్యం తాగేది ఎవరూ? సామాన్యులు. సొమ్ము సామాన్య ప్రజలది. షోకు ప్రభుత్వానికి.. ఇటువంటి దుర్మార్గ ఆదాయాలతో ప్రభుత్వ ఆదాయం పెరిగిందని, ప్రభుత్వం ఆర్థికంగా శక్తివంతంగా ఉందని వెయ్యి పెన్షన్ రెండువేలు పెంచేస్తారు. ఓటు వేయటానికి ఇది చాలు. ఇది విశ్వాస ఓటుగా భావిద్దామా? ప్రజలు విశ్వాసంతో తమ నాయకున్ని ఎన్నుకొన్నారని సర్దుకున్నామా? జనం సర్కార్పై ఆధారపడేలా రాజకీయం నెరిపి, ఆ రాజకీయంతో కుర్చీ ఎక్కుతున్న వీరు ప్రజల విశ్వాసం పొందిన వారని ఎలా భావించగలం?
ప్రజల విశ్వాసంతో కుర్చీ ఎక్కితే.. గెలిచిన తమ నాయకున్ని చూసి ప్రజలు గంతులేసేవారు. నాట్యం చేసేవారు. జిందాబాద్ అని అరిచేవారు. ప్రజలు ఓటు వేస్తున్నారు. ఎవరు గెల్చినా తమ బతుకులలో వెన్నెల కాయదని నిశ్శబ్దంగా ఉంటున్నారు. ఎవరు గెల్చినా వారికి ఒకటే.. కష్టం తప్పదు.. దుఃఖం తప్పదు.. తమ నాయకుడు గెల్చాడని విశ్వాసంతో గంతులు వేయటానికి వారి గుండెల్లో అనందం లేదు. ఇక్కడ జనం చైతన్యాన్ని ప్రశంసించాలి. అయితే ఈ చైతన్యం ప్రజల రాజకీయ విజ్ఞతకు పనికిరావచ్చు కానీ, ప్రజాస్వామ్య పటిష్టతకు, రాజ్యాంగ మౌలిక విలువలకు, దేశ విముక్తికీ పనికొచ్చేది కాదు. ఇంతకుముందు తాము గెలిపించిన పెద్దమనిషి ఈ ఐదేండ్లూ తమ ముఖం చూడలేదని కసితో కక్షతో ఓడించటానికి ఎదుట వ్యక్తికి ఓట్లు వేస్తారు. ఇది ఎదుట వ్యక్తిమీద విశ్వాసంతో కాదు, ప్రజలు ప్రతీకార రాజకీయాలకు ఈ ప్రజాస్వామ్యంలో అవకాశముంది. కానీ, నిజమైన ప్రజానాయకున్ని ఎన్నుకోవటానికి అవకాశం లేదు. నూరుశాతం కోటీశ్వరులు 50శాతం క్రిమినల్స్ ఉన్న పార్లమెంట్లలో ప్రజల విశ్వాసం పొందిన వారుంటారా? తమ మీద ప్రజలు విశ్వాసంతో గెలిపించారని నాయకుడు చెప్పుకోవటం తప్ప, ఎన్నికలలో ప్రతి అడుగు స్వార్థంగా ఉంది. ఎక్కడా ఏ విశ్వాసముండదు. ప్రజలను కూడా ఈ వ్యవస్థ స్వార్థపరులుగా మార్చింది. ఎవరు సంక్షేమ పథకాలు ఎక్కువగా విసిరేస్తే వారికి ఓటు వేసి గెలిపిస్తున్నారు. ఇందులో విశ్వాసం లేదు. ప్రజల అభిమానం లేదు. గెలిచిన నాయకులు ప్రజల విశ్వాసాన్ని వమ్ముచేయనని, మాట మీద మాట విసురుతుంటారు. కానీ ప్రజలకు ఆ విశ్వాసం లేదు. నమ్మకం లేదు. మోసం చేయకపోతే చాలు అనుకుంటారు.
ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నాయకులను ప్రజలు మోసగాళ్లుగా, దగా కోర్లుగా, అవినీతి, అధర్మ పరులుగా భావిస్తున్నారు. ఇంకా విశ్వాసం సంగతేమిటీ?
గెలిచిన నాయకులు తమపై విశ్వాసంతో ప్రజలు ఓట్లువేసారని గొప్పలు చెప్పుకుంటారు. కానీ విశ్వసించటానికి ఈ స్వతంత్ర భారతంలో ప్రజలకేమైనా మిగిలిందా? ప్రజలకు ఎటు చూసినా దోపిడీ కనిపిస్తుంది. అడుగు అడుగు దోపిడీ.. వైద్యం దోపిడీ, విద్య దోపిడీ, రైతు పంట దోపిడీ, శ్రమ దోపిడీ.. అబద్ధాలాడని, అవినీతి పరులు కాని రాజకీయ నాయకులున్నారా? తప్పు చేయటానికి భయపడే ప్రజలు, వీరిని విశ్వసించి ఓటు వేస్తారా? తప్పనిసరి అయి.. ఎవరికో ఒకరికి ఓటు వేయాల కాబట్టి అందులో ఎవరి ద్వారా తమకు సంక్షేమ పథకాలు ఇతోధికంగా అందుతాయో వారికి ఓటు వేస్తున్నారు. లేదా కులం మతం చూసి ఓటువేస్తున్నారు. లేదా ఒకరిని ఓడించాలని ఇంకొకరికి ఓటు వేస్తున్నారు. ఇందులో విశ్వాసం లేదు. ప్రజాస్వామ్యం లేదు. రాజ్యాంగ సూత్రాలు లేవు. ధర్మం లేదు. న్యాయం లేదు. అంతా దగాకోరుతనమే!
మతం.. కులం.. వాడుకోవటం రాజ్యాంగ రీత్యా తప్పు. కానీ మన రాజకీయాలు మన ఎన్నికలు మతం, కులం పేరుతో నడుస్తున్నాయి. దొంగాట ఇక్కడే ప్రారంభమయ్యింది. పోటీలో ఉన్న వారందరూ అవినీతి పరులు, స్వార్థపరులు అయినప్పుడు ప్రజలు ఎవరికో ఒకరికి ఓటువేస్తారు. ఇందులో విశ్వాసం ఏమీలేదు. తప్పనిసరి తంతు. డెబ్భై ఏండ్లుగా నడుస్తున్న దోపిడీ తంతు.. తాము వేస్తున్న ఓటు మూలంగా కోటీశ్వరులు ఇంకా ఇంకా పెరుగుతున్నారని, నిరుద్యోగులు ఇంకా ఇంకా పెరుగుతున్నారని, సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని, శ్రమజీవులు అప్పుల పాలవుతున్నారని ప్రజలకు తెలియదు. తెల్సినా ప్రజలు చేయగలిగిందేమీ లేదు. ఎన్నికల వ్యవస్థ అలా ఉంది.. ఓటరు తమ ఓటు వేయటానికి నాలుగు కారణాలున్నాయి. ఒకటి సంక్షేమ పథకాలు, రెండు కులం, మతం, మూడు డబ్బు పంపిణీ, నాలుగు అధికారంలోకి వస్తుందనుకునే పార్టీ. ఇందులో విశ్వాసం ఏమీలేదు. మోడీకి వచ్చిన ఓట్ల శాతం 38. 62శాతం వ్యతిరేకంగా ఓట్లు వేసారు. విశ్వాసమేముంది?
అసలు ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి? ఎన్నికల తంతు ఎలా నడుస్తుంది? పార్టీ టిక్కెట్ల మీద ఆధారం.. పార్టీ ఎవరికి టిక్కెట్లు ఇస్తుంది? కోట్ల డబ్బు ఖర్చు పెట్టేవారికి టిక్కెట్లు ఇస్తుంది. కోట్ల ఖర్చుచేసే వారికి టిక్కట్లు ఇస్తుంది. కోట్లు ఖర్చుచేసేవారు ధర్మాత్ములా? కష్టపడి సంపాదించిన వారా? చెమట పంచి ఉత్పత్తిని పెంచినవారా? కానే కాదు. దళారీలు, కాంట్రాక్టర్లు ప్రజల చెమటను వ్యాపారంగా మార్చేవారు. స్మగ్లర్లు, క్రిమినల్స్.. ధర్మంగా కోట్లలో సంపాదించటానికి ఈ వ్యవస్థలో అవకాశమే లేదు. అటువంటి వారికి టికెట్లు ఇస్తున్నారు. ప్రజలు ఇందులో ఎవరికో ఒకరికి ఓటు వేయాలి. ఇందులో విశ్వాసం ఏమీలేదు. ధనికవ్యవస్థ, ధనికవర్గాల మధ్య పోటీ, దోపిడీ శక్తుల గెలుపు.
ఎన్నికలంటేనే వేలకోట్ల ఖర్చు వ్యవహారంగా మారిపోయింది. కోట్లు ఉన్నవాడిది రాజ్యం.. వాడు చట్టసభలలోకి వెళ్తాడు. తమ కోసం చట్టాలు చేస్తారని ప్రజలు భావిస్తారనుకుంటే భ్రమ.. ఇందులో విశ్వాసమేముంది? ఎవరి స్వార్థం వారిది. మన ప్రజాస్వామ్యం, రాజకీయాలు, ఎన్నికలు పూర్తిగా స్వార్థంగా మారిపోయాయి. ఎన్నికలనేవి క్రయ విక్రయాలుగా మారిపోయాయి. టిక్కెట్టు అమ్మకం.. ఖరీదు ఓటు అమ్మకం ఖరీదు. ఇప్పుడు ఎన్నికల రాజకీయాలలో కొత్త దుర్మార్గం ప్రవేశించింది. ఎదుటి పార్టీ అభ్యర్థులను కొన్ని కోట్లకు ఖరీదు చేస్తున్నారు. లేకపోతే ఓట్లు చీలాలని, కొన్ని కోట్లు యిచ్చి నిలబెడుతున్నారు. పైగా ఈ దగాకోరు ప్రజాస్వామ్య వ్యవస్థలో కొందరు రాజకీయ నాయకులు అవినీతిపరులే! పాలకులు, ప్రతిపక్షాలు ఒకే జాతి.. ఒకరిని ఒకరు బ్లాక్మెయిల్ చేయటం.. అధికారం ఉందని ప్రతిపక్ష అవినీతి పరులను వేటాడటం.. ఇది దోపిడీ రాజకీయ ఆట.. ఎన్నికల వేట.. ఇందులో ప్రజల విశ్వాసమేముంది?
విశ్వాసమనేది ప్రజలకు పాలకులకు రాజకీయ నాయకులకు రాజ్యాంగంపై ప్రజాస్వామ్యంపై ఉండాలి. ఎవరికీ లేదు. సంక్షేమ పథకాలు, కులం, మతం, ప్రజాస్వామ్య బలానికి పనికిరావు. ఎన్నికల ఓట్లకు పనికొస్తాయి. మన ఎన్నికలు మన రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేస్తున్నాయి.
తమను ప్రజలు భారీ విశ్వాసంతో గెలిపించారని, మోడీ, కేసీఆర్, జగన్, స్టాలిన్ ఎవరన్నా అది దగాకోరు మాటే.. ప్రజలకు ఎవరి మీద విశ్వాసం లేదు. ఎన్నికలలో డబ్బు సంచులే పనిచేస్తాయి. ఈ సారి డబ్బు సంచులతో పాటు సెంటిమెంట్ పనిచేసింది. అది ప్రజల విశ్వాసం కాదు. మోడీకి హిందూ సెంట్మెంట్, కేసీఆర్కు తెలంగాణ సెంట్మెంట్, జగన్ పట్ల చంద్రబాబు వ్యతిరేకత సెంట్మెంట్, స్టాలిన్ తమిళ సెంట్మెంట్... ప్రజాస్వామ్యం లేదు. ప్రజల విశ్వాసం లేదు.. అంతా దగా...
- సిహెచ్. మధు
సెల్: 9949486122