Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరీ తీరక ముందే కొత్త విద్యా విధానం చర్చకొచ్చింది. జూన్ 30లోగా ఈ ముసాయిదాపై నిపుణులు, విద్యావేత్తలు, ఇతరులు అభిప్రాయాలు చెప్పాలి. కనీసం ప్రాంతీయ భాషల్లో ముసాయిదాను అనువదించి ప్రజలకు అందించాలన్న ఆలోచన కూడా చేయకుండా కేంద్ర మానవ వనరుల శాఖ పరుగులు పెట్టిస్తోంది. 'మమ' అన్పించు కోవాలనుకొంటోంది.
టి.ఎస్.ఆర్ సుబ్రమణ్యం అధ్యక్షతన 2015లో కమిటీ వేసినప్పుడు ఆయన తన నివేదికలో ఘాటుగా కొన్ని విమర్శలు చేశారు. 'మన ప్రభుత్వాలు పరీక్షలు, బదిలీలు, నియామకాలు తప్ప చదువును గురించి పట్టించు కొన్న దాఖలాలు లేవ'న్నారు. అసలు భారత దేశంలో విద్య అత్యంత రాజకీయ ప్రాధాన్యం లేని అంశమని, మీడియాకు కూడా ఇదేమీ పట్టదని వ్యాఖ్యానించారు. ఈ నివేదికను ప్రభుత్వం యథాతథంగా అందించ కుండా తొక్కిపెట్టి (అది మరో రూపంలో వెలుగులోకి వచ్చిందనుకోండి) మరికొన్ని ప్రతిపాదనలను 2016లో చర్చకు పెట్టింది. ఇప్పుడు ఇస్రో మాజీ అధినేత డా|| కస్తూరి రంగన్ నివేదిక 475 పేజీలలో పాఠశాల విద్య, ఉన్నత విద్య వేర్వేరు భాగాలుగా ఆన్లైన్లో అందు బాటులో ఉంది. ప్రస్తుతం పాఠశాల విద్యకు మనం పరిమితమవుదాం.
నివేదిక చాలా వివరంగా విస్తృతాంశాల్లోకి వెళ్లింది. అయితే ప్రధానాంశాల ప్రస్తావన కంటే, స్పష్టమైన సిఫార్సుల కంటే వ్యాఖ్యానం ఎక్కువైంది. గొప్ప నీతి వాక్యాల వల్లింపుగా మారింది. కొన్ని అంశాల్లో కొంత మెరుగ్గా వున్నా సారాంశమే పస లేకుండా వుంది.
వెనక్కి.. ఇంకా వెనక్కి...
నివేదిక ఆదిలోనే మన ప్రాచీన విద్య గుణ గాన కీర్తన ఘనంగా విన్పిస్తుంది. మన విద్య 'స్వయం విముక్తి' లక్ష్యంగా సాగిన ఏకైక ప్రపంచ విద్య అనీ, భారతీయుల తాత్విక పురోగతి అంతా ఇందులోనే వుందని చరకుడు, చాణుక్యుడి నుంచి, గాంధీ, అరవిందుడు వరకు దీన్నుంచే ఉద్భవించారని పేర్కొని ఈ వారసత్వాన్ని శ్లాఘించింది. ఇక నలంద, తక్షశిల సంగతి సరేసరి.
నివేదిక సారమంతటా ఇదే కన్పిస్తుంది. మనదొక సుదీర్ఘ చారిత్రక వారసత్వం అన్న మాట వాస్తవం. దాన్నిప్పుడు నివేదికల్లో శ్లాఘించుకొంటే ఏం లాభం? అందులోంచి ఇప్పుడు మనం స్వీకరించాల్సినవి ఏవి? త్యజించాల్సినవి ఏవి? జరిపితే, ఈ చర్చగదా జరపాలి. వేదం వింటేనే చెవుల్లో సీసం పొయ్యడం, పలికితే నాలుక తెగ్గొట్టడం కూడా మన వారసత్వమేగదా! అందరికీ విద్య, అందరికీ సమానమైన విద్య అనేది లేకపోవడం కూడా అంతే నిజం గదా! కనీసం ఈ ఆధునిక ప్రజాస్వామిక చరిత్రలోనైనా మనం 'కామన్ స్కూలు' సాధించుకోలేక పోయాం గదా! ఈ చర్చ మాత్రం ఇందులో లేదు. ప్రస్తుత ప్రభుత్వం నుంచి ఇవి గాక ఏమాశించగలం? అని దీన్ని కూడా వదిలేద్దాం. సూటిగా కొన్ని అంశాల్లోకి వద్దాం.
సమాధానాలు దొరకని సూచనలు
శిశు విద్యను కూడా ప్రాథమిక విద్యలో కలిపేసి మూడవ ఏటి నుంచి ఎనిమిదవ ఏటి వరకు మొదటి దశ విద్యగా ఈ నివేదిక ప్రతిపాదించింది. పూర్వ ప్రాథమిక విద్య, ప్రాథమిక విద్యతో పాటు అందరికీ దక్కాలని, ఇది లేని పేద పిల్లలు మిగిలిన పిల్లల కంటే వెనకబడి పోతున్నారని చాలా కాలంగా చర్చ నడుస్తోంది. అదే సందర్భంలో ఆరేండ్ల లోపు పిల్లల్ని 'నియత' విద్యలోకి నెట్టడం ఎంత సబబు అనే ప్రశ్న వుంది. ప్రస్తుతం ఈ వయస్సు పిల్లలు అంగన్ వాడీల్లోను, కాన్వెంటుల్లోను ఉన్నారు. ఇవేవీ విద్యాశాఖ పరిధిలో లేవు. ఇప్పుడు ఇవన్నీ విద్యాశాఖలోకి వస్తాయి. సిలబస్ కూడా ఈ శాఖే రూపొందిస్తుంది. వీరితోపాటు 1, 2 తరగతుల పిల్లలు కూడా ఒక యూనిట్గా ఉంటారు. చిన్న పిల్లల్ని 'నియత' విద్యలోకి తెచ్చి విద్యా హక్కు పరిధిలోకి కూడా తెచ్చి ఒత్తిడి చెయ్యడం ఎంత సరైంది? అసలు దీన్ని 'విద్య' అనాలా? దీనికెలాంటి వ్యవస్థ ఉండాలి? అనేది గందరగోళంగా వుంది.
మరొక కీలకాంశం బడి మానేస్తున్న పిల్లలు. ఒకటవ తరగతిలో 95.1శాతంగా ఉన్నా మన స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) 12వ తరగతికల్లా 51.3శాతానికి పడిపోతోందని నివేదిక ఎంతో విచారం వ్యక్తం చేసింది. దీని కారణాల్ని సామాజి కార్థికారోగ్య భద్రతా కోణాల్లో చూడాలని పేర్కొంది. ప్రత్యేకంగా ఒక చాప్టరును 'తక్కువ భాగస్వామ్య సమూహానికి' కేటాయించింది. నిజానికి బడి మానే స్తున్న వారూ, బడిలో వున్నా నాసిరకం చదువులతో సరిపెట్టుకొంటున్న వారూ వీరే! మంచి ఉపాధ్యాయు లను ఇలాంటి వారున్న స్కూళ్లకి పంపడం, సామాజిక సేవకుల్ని తోడు తెచ్చుకోవడం లాంటి చిట్కాలతో పరిష్కారమయ్యే సమస్యేనా ఇది?
హాస్టళ్లు, కస్తూర్బాలు, గురుకులాలు పెట్టడం, వీరికి భద్రత కల్పించి ప్రేమగా చూడడం, బడి వీరికనుకూలంగా ఉండడం ఇవన్నీ ముఖ్యమే. నివేదికలో చెప్పినట్టు వీరు ఎక్కువగా వున్న ప్రాంతాల్ని ప్రత్యేక విద్యా జోన్లుగా చేసి ప్రత్యేక ప్యాకేజీ అమలు చెయ్యడం కొంత ఉపయుక్తమే. కానీ ఇదొక రాజకీయ విధానానికి సంబంధించిన అంశం. చాలా బడుగు దేశాల్లోను, మన దేశంలోని కేరళ లాంటి రాష్ట్రాల్లోను అద్భుత ఫలితాలు ఎలా వచ్చాయో దీని కోసం సర్వ శక్తులు వీరిమీద ఎలా ఒడ్డారో, వియత్నాం ఈ రంగంలో ఎంత గొప్ప ప్రగతి సాధించిందో కమిటీ లోతుగా చర్చించి ఉంటే బావుండేది. దీనికవసరమైన వనరుల గురించి కచ్చితంగా చెప్పి ఉంటే మరీ బావుండేది.
భాషల్ని గురించి, మరీ సంస్కృతాన్ని గురించీ, విద్యలో భాషల ప్రాధాన్యత గురించీ, ఇందులో సుదీర్ఘ చర్చ చేసి ఆరవ తరగతి లోపు ప్రాంతీయ భాషతో పాటు, ఇంగ్లీషు, ఆ తర్వాత హిందీ తప్పనిసరి చేస్తూ నివేదిక పేర్కొంది. తమిళనాడులో నిరసన రావడంతో వెనక్కి తగ్గింది. ఇంత కాలమైనా విద్యారంగంలో మనకు ఒక శాస్త్రీయ భాషా విధానం లేకపోవడాన్ని ఈ నివేదిక గుర్తించి ఉంటే బావుండేది. ప్రపంచంలోని అన్ని దేశాలు మాతృభాషతో పాటు మరో భాషను నేర్పుతున్నాయి. అమెరికా కూడా స్పానిష్ను రెండో భాషగా నేర్పుతోంది. మాతృభాషా మాధ్యమంలో అయిదు లేదా ఎనిమిదివ తరగతి వరకు బోధించాలని ఈ నివేదిక న్యాయంగానే పేర్కొంది. క్లాసికల్ భాషలు కూడా నేర్చుకోవాలని, ఎన్ని భాషలు నేర్చుకొంటే అంత మంచిదని నీతి వాక్యాలు చెప్పింది. కానీ మాతృభాష, ఇంగ్లీషు తప్పనిసరి చేసి మిగిలిన భాషల్ని పరిచయం వరకు, ఐచ్ఛికంగా ఉండేలా చేసి ఉంటే సరిపోయేది. అసలు ఎక్కడా లేనట్టు మన పిల్లలు మూడు భాషలు తప్పనిసరిగా ఎందుకు నేర్చుకోవాలి? ఈ ప్రశ్న దీనికి తలెత్తనే లేదు. కస్తూరి రంగన్ కమిటీ చేసిన మరో సిఫార్సు ప్రకారం 'పాఠశాల కాంప్లెక్సులు' ఇక పాలనా వ్యవస్థలుగా మారాలి. తొమ్మిది, పది మైళ్ల లోపు పాఠశాలల్ని ఒక ఉన్నత పాఠశాల పరిధిలోకి తేవాలి. ఆ స్థాయిలో ఒక కమిటీ ఏర్పడి, సకల పాలనా పర్యవేక్షణా వ్యవస్థలు, అకడమిక్ వ్యవస్థలు అందులోనే సాగాలి. ఇక బ్లాకు (మండలం) వ్యవస్థలుండరాదు. 2022 కల్లా దీన్ని అమలు చేెయాలని నిర్దేశించింది. చాలా రోజులుగా ఇది నలుగుతున్నా రెవెన్యూ పంచాయతీ పాలనా వ్యవస్థలు వేరుగా ఉండడంతో ఇది అమలుకు నోచుకోలేదు.
ఇంకొన్ని సిఫార్సులు
ఈ నివేదిక ఇంకా చాలా సిఫార్సులు చేసింది. పరీక్షల్ని 'కోర్' అంశాలకే పరిమితం చేయాలని, పాఠశాల విద్యను నలభై సెమిస్టర్లుగా విభజించాలని, పాఠ్యగ్రంథాల్ని మూల అంశాలకి కుదించాలని, లోక జ్ఞానం కోసం ఒక కోర్సు ఉండాలని, ఒక కళ తప్పనిసరి అని, సైన్సు-ఆర్ట్స్, వొకేషనల్-నాన్ వొకేషనల్ లాంటి విభజనలు ఇక కుదరవని చెప్పుకొచ్చింది.
ఉపాధ్యాయ విద్య ఇక నాలుగేండ్లని, ఉపాధ్యాయ శిక్షణను విశ్వవిద్యాలయాలు అటానమస్ కళాశాలలు మాత్రమే నిర్వహించాలని, ఒకే క్యాడరులో నాలుగంచెల ప్రమోషన్ నిచ్చెన ఉపాధ్యాయులకు ఉండాలని సిఫార్సు చేసింది. దీంతో పాటు పాలసీల కోసం, పాలన కోసం, అకడమిక్ అంశాల కోసం జిల్లా, రాష్ట్ర, కేంద్రాలలో కొత్త వ్యవస్థల్ని ప్రతిపాదించింది.
దాటవేతలు-దాగుడుమూతలు
ఇంత సుదీర్ఘ కసరత్తు చేసిన కమిటీ మన విద్యారంగం చూస్తుండగానే ప్రయివేటుపరం కావడం, కార్పొరేట్ల ప్రవేశం, వాటి నిలువు దోపిడీ, అత్యంత అశాస్త్రీయ బోధనా విధానాలు ఎంత ప్రమాదకరంగా మారాయో మాత్రం లోతుగా చర్చించలేకపోయింది. చదువు సరుకు కాదని, సేవా సంస్థలు మాత్రమే ప్రయివేటు విద్యా సంస్థలను నడపాలని, 'పబ్లిక్' అనే పేరు పెట్టుకోరాదని, అన్ని విషయాల్లో ప్రభుత్వ ప్రయివేటు సంస్థలు సమానమేనని చెపితే సరిపోతుందా? కొఠారీ లాగా 'కామన్ స్కూల్'ను స్పష్టంగా ఎందుకు సిఫార్సు చేయలేకపోయింది? దీన్ని ప్రభుత్వ బాధ్యతగా ఎందుకు చెప్పలేకపోయింది?
బలమైన ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఉన్న చోట, దీన్ని ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తున్న చోట, ఇదొక రాజకీయ విధానంగా వున్న చోట విదేశాల్లోనే కాదు భారతదేశం లోనూ పిల్లలకు సమానమైన మంచి విద్య లభిస్తోంది. కేరళ దీనికి చక్కటి నమూనా. ఢిల్లీ కూడా ఇదే బాటలో వుంది. వీటిని ఉదహరించి దీనికి తగ్గట్లు ఏంచెయ్యాలో ఈ నివేదిక సూటిగా పేర్కొనలేకపోయింది.
శాస్త్రీయ విధానం, హేతుతత్వం లాంటి పదాలు అక్కడక్కడా కన్పిస్తాయి. శాస్త్రవేత్తగా కస్తూరి రంగన్ ఇవి చెప్పలేకుండా ఉన్నట్లుంది గానీ చరకుణ్ణి, చాణుక్యుణ్ణి, చంద్రగుప్తుడినీ కీర్తించిన నివేదిక అశోకుడినీ, అక్బర్నీ ఎందుకు ప్రస్తావించలేక పోయింది!
అమెరికా, చైనాల సరసన చేరాలన్న తహతహ ప్రదర్శించిన నివేదిక విద్యారంగం ప్రయివేటుపరం అవుతుండటంతో అమెరికా వెనకబడి, దానికంటే పదిహేను దేశాలు ముందు కెళ్ళాయని బెర్నీ శాండర్స్ చెప్పిన మాటలైనా ఎందుకు గుర్తుకు తెచ్చుకోలేక పోయింది.
నివేదికలు బాగుంటాయి. ప్రపంచంలో ఎవ్వరికీ లేని గొప్ప నివేదికలు మనకున్నాయి. గతంలో వాటికి పట్టిన గతి ఏంటి? ఇంతకన్నా ఇప్పుడైనా ఏదో జరుగుతుందని నమ్మే స్థితిలో మన మున్నామా? తీవ్రమైన ప్రజా ఒత్తిడి లేకుండా, రాజకీయ విధానాలు మారకుండా పెద్ద మార్పుల్ని మనం ఆశించగలమా? ఇంత పెద్ద నివేదిక మనకు మిగుల్చుతున్నది ఈ శేష ప్రశ్నల్నే!
- వి. బాలసుబ్రహ్మణ్యం