Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నారదుడు తంబూర దీస్కుండు. గీ పారి యాడ్కి బోతె బాగుంటుందని జెరసేపు సోంచాయించిండు. యాడికో ఎందుకు ఎప్పటి తీర్గ యాద్గిరి గుట్టకు బోతె బాగుంటదని అనుకుండు. అనుకోని నారాయన నారాయన అన్కుంట చిర్తలు గొట్టుకుంట గాయిన మొగులు మీదికెల్లి ఎల్లిండు.
నడిరనాత్రి అందరు పండుకున్నరు. నర్సిమ్మసామి గుడి తలుపులు తాలం బెట్టి ఉన్నయి. నారదుడు యాద్గిరి గుట్ట మీద దిగిండు. మాయమై నర్సిమ్మసామి ముంగట్కి బోయిండు.
''నారాయన, నారాయన'' అన్నడు
నర్సిమ్మ సామి కండ్లు దెర్సి- ''నువ్వా నారదా! గిట్లొచ్చినవేంది ?'' అని అడిగిండు.
''తెలంగానల ఏమైతున్నదో జెర జెప్పు సామీ !''
''ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపి అయ్యిండు. ఇగ దాంతోని హుజూర్నగర్ ఎమ్మెల్యే సీటుకు గాయిన రాజినామా జేసిండు. శాసన సబల 18మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మిగిలిండ్రు. అంతకుముందు 11మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గోడ దుంకి టిఆర్ఎస్లకు బోయిండ్రు. తాండూర్ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి కాంగ్రెస్కు చెయ్యిచ్చి మోటరెక్కిండు. దాంతోని మొత్తం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గోడ దుంకినట్లైంది. కాంగ్రెస్ల ఆరుగురు ఎమ్మెల్యేలే మిగిలిండ్రు. గులాబి కండ్వ ఏస్కున్న 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రగతి బవన్కు బోయిండ్రు. కెటిఆర్ దీవెనార్తి దీస్కుండ్రు. ఆడికెల్లి సక్కగ స్పీకర్ పోచారం శీనువాస్రెడ్డి ఇంటికి బోయిండ్రు. ఆల్లను టిఆర్ఎస్ల గల్పుమన్నరు. గిట్ల అడ్గంగనే గట్ల స్పీకర్ గాల్లను టిఆర్ఎస్ల గల్పిండు.''
''దీని మీద కాంగ్రెసోల్లు ఏమన్నరు?''
''ముందుగాల కాంగ్రెసోల్లు దర్నలు జేసిండ్రు. కెసిఆర్, కెటిఆర్ దిస్టి బొమ్మలను తల్గబెట్టిండ్రు. నల్గొండ జిల్లల; జడ్చర్లల గోడ దుంకిన 12 మంది ఎమ్మెల్యేలకు యూత్ కాంగ్రెస్ లీడర్లు పిండాలు బెట్టిండ్రు. బట్టి విక్రమార్క బూకర్తాల్ జేసిండు. ఉత్తమ్కుమార్ రెడ్డి విలేకరులతోని మాట్లాడుకుంట శాసనసబల అపొజిసన్ పార్టి లేకుంట కెసిఆర్ జేస్తుండు. అపొజిసన్ పార్టి లేకుంటె అసెంబ్లి ఉంటేంది? లేకుంటేంది? కెసిఆర్ అసెంబ్లిని దీస్కబోయి ఫాంహౌస్ల బెట్టుకుంటె బాగుంటది. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గవిస్తం గివిస్తం అన్కుంట కెసిఆర్ ఆశ బెట్టిండు. కొందర్ని బెదిరిచ్చిండు. ఇంకొందరిని కోట్ల రూపాలిచ్చి గొన్నడు. అసెంబ్లిల టిఆర్ఎస్కు మెజార్టి ఉన్నంక గుడ్క గిట్ల జేసుడు ఏమన్న బాగుందా? మేము గీదాని మీద సుప్రీం కోర్టు దాంక బోతం. గోడ దుంకిన ఎమ్మెల్యేల ఇండ్ల ముంగట దినాం మా కాంగ్రెసోల్లు గూసుంటరు. మా ఓట్లు మాకియ్యుండ్రని ఒక్క తీర్గ లొల్లి బెడ్తరు. అని ఉత్తమ్కుమార్ అన్నడు. పర్ద ఎన్క ఉండి కెసిఆర్ గీ డ్రామ నడిపిస్తున్నడని బట్టి విక్రమార్క అన్నడు.''
''కాంగ్రెస్ లీడర్లు గిట్లంటె కెటిఆర్ ఏమన్నడు?''
''మేము ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యేను బొట్టు బెట్టి బిల్వలేదు. గదిస్తం గిదిస్తమన ఆశ బెట్టలేదు. ఎవ్వల్ని బెదిరియ్యలేదు. ఎవల్ని గొనలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మా తాన్కి వొచ్చి మోటర్ ఎక్కనియ్యుండ్రని ఒక్క తీర్గ బత్మిలాడిండ్రు. ప్రగతి బవన్ ముంగట గూసోని బూకర్తాల్ జేసిండ్రు. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే అయితె పెయ్యి మీద గ్యాసునూనె బోస్కోని పుల్లల డబ్బ దీస్కుండు. గాయిన తాని కెల్లి నేను పుల్లల డబ్బి గుంజుకున్న. బోయెడు రామాయనం రాసినంక వాల్మీకి అయిన తీర్గ మా పార్టిలకొచ్చినంకనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అస్లి లీడర్లు అయ్యిండ్రు. బోడ కోతి లెక్క ఉన్నోల్లు హన్మంతుడయ్యిండ్రు. కాంగ్రెసోల్లు ఏమైన సుద్దపూసలా? 1971ల 13 మంది తెలంగాన ప్రజాసమితి ఎంపిల కాంగ్రెస్ గుంజలేదా? 2004ల 10 మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ల గల్పుకోలేదా? గాల్లు జేస్తె రైటు.. మేము జేస్తె తప్పా? 23మంది వైసిపి ఎమ్మెల్యేలను చెంద్రబాబు టిడిపిలకు గుంజితె గిదేందని ఒక్క కాంగ్రెస్ లీడరన్న అడిగిండా? అని కెటిఆర్ అన్నడు''
''గోడ దుంకిన 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏమన్నరు దేవా?''
''గోడ దుంకిన 12మంది ఎమ్మెల్యేలు విలేకరుల మీటింగ్ బెట్టిండ్రు. విలేకరులకు తలా ఒక లడ్డు ఇచ్చిండ్రు. ఏ కుషిల లడ్లు దినిపిస్తున్నరని విలేకరులు అడిగిండ్రు. మోటరెక్కిన కుషిల అని గాల్లు అన్నరు. చెయ్యి గుర్తు మీద గెల్సి కాంగ్రెస్కు చెయ్యెందుకు కిచ్చిండ్రని విలేకరులు అడిగితె... చెయ్యిల ఏల్లు ఒక్క తీర్గ లెవ్వు. గదే తీర్గ కాంగ్రెస్ లీడర్లు ఒక్క తీర్గ లేరు. ఒకలు ఎడ్డెం అంటె ఇంకొకలు తెడ్డెం అంటరు. టిఆర్ఎస్ల గల్వుమని మమ్ములను ఒక్క తీర్గ బత్మిలాడిండ్రు. మేము ఎంతగనం సమ్జాయించినా గాల్లు ఇనలేదు. మీరు మోటరెక్కితేనే నియోజకవర్గాలు ముంగట్కి బోతయి. డబల్ బెడ్రూం ఇండ్లొస్తయి. కొల్వులేని మా పోరగాల్లకు కొల్వులొస్తయి. ఎర్ర జొన్నలకు, పస్పుకు మంచి దర వొస్తది. రైతులు బేఫికర్గ ఉంటరు. సుకూన్ల పంటరు. పంట పొలాలకు నీల్లు వొస్తయి అని మా తాన్కి వొచ్చిన జెనం అన్నరు. టిఆర్ఎస్ల గల్వకుంటె మీ ఇండ్ల ముంగట బూకర్తాల్ జేస్తమని బెదరిచ్చిండ్రు. జెనం కోసం మేము మోటరెక్కినం అని గోడ దుంకిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జెప్పిండ్రు''
''కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్లకు గుంజుడు తప్పు గాదా?''
''2004ల అప్పటి కాంగ్రెస్ ముక్యమంత్రి వైఎస్ఆర్ అపొజిసన్ల ఉన్న టిఆర్ఎస్ ఎమ్మెలల్ల 10మందిని కాంగ్రెస్లకు గుంజిండు. గప్పుడు వైఎస్ఆర్ మీద కెసిఆర్ గరమైండు. రాజకీయాలల్ల గింత అరాకిరి ఉంటదా? గింత వ్యభిచారం ఉంటదా? అని అడిగిండు. గిప్పుడు కెసిఆర్ జేసింది సంసారమా? అని నర్సిమ్మసామి ఇంకేమో జెప్పబోతుంటె తెల్లారింది. నారదుడు మాయమై మొగులు మీద్కి బోయిండు.
తోక :- పొద్దుగాల ఎందుకో ఏమో పేపర్ బారు పేపరెయ్యలేదు. పేపర్ గొన్కునేతందుకు ఆనంద్బాగ్ చౌరస్తకు బోయిన. గాడ ఒక డబ్బల పేపర్లు, వార, నెలల పత్రికలు బెట్టుకోని ఒక ముస్లాయిన అమ్ముతున్నడు. గాయినకు ఒక కాలు లేదు. ఇంతకుముందు గాయిన పాన్లు గట్టి అమ్మెటోడు. గని గిప్పుడు పేపర్లు సిగిలేట్లే అమ్ముతున్నడు. గాయిన తాన్కి బోయి పేపర్ గొన్న
''నీ పేరేంది?'' అని అడిగిన
''నా పేరు బాలకుమార్ సార్''
''నీ కాలెట్ల బోయింది?''
''69 తెలంగాన మూమెంట్ల తుపాకి గుండ్లు దాకితె నా మోకాలు దాంక తీసేసిండ్రు సార్. నాకు హాండిక్యాప్ ఫించనొస్తది. తెలంగాన కోసం కొట్లాడి కాలు పోడగొట్టుకున్నందుకు హెల్త్ కారట్ ఇయ్యమని అడిగితె కాంగ్రెస్ జమానల తెలంగాన కోసం కొట్లాడినవు అని నన్ను దూరం బెట్టినోల్లు ఇయ్యాల 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను దగ్గర కెట్ల దీస్కున్నరు సార్'' అని గాయిన అడిగితె ఏం జెప్పాల్నో ఎర్కలేక ఎడ్డిమొకం ఏస్కున్న. తెలిదేవర
భానుమూర్తి
సెల్: 9959150491