Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2019-20 బడ్జెట్ అటు సగటు మనిషికి, ఇటు రైతులకు, ఉద్యోగస్తులకుగానీ మింగుడుపడటం లేదు. పూర్తిస్థాయిలో మొదటిసారి ఒక మహిళా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని దేశపౌరులంతా ఆశపడ్డారు. విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి తగినట్టుగా ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని సవరించకపోవడం వేతనజీవులకు వేదనే మిగిల్చింది. అలాగే ఈ రోజుల్లో ప్రతిపౌరుడు ద్విచక్ర వాహనాన్ని వాడటం సర్వసాధారణం. పెట్రోల్, డీజిల్పై అదనంగా ఒకరూపాయి పన్ను విధించడం అన్యాయం. ఇప్పటికే రోజువారీ ధరలు విపరీతంగా పెరుగుతుంటే మళ్లీ అదనంగా పెంచడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.
అలాగే అనుకూలమైన ధరలు లేక, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతున్న అన్నదాతలను ఆదుకునే బడ్జెట్ కానే కాదు. ఇప్పటికే వ్యవసాయాన్నొదిలి గ్రామీణ యువత కూడా పట్టణబాట పడుతుంటే సమాజంలో గౌరవం పొందలేని అన్నదాతలను ఆదుకోవాలన్న ధ్యాసలేకపోవడం దారుణం. అవును అన్నదాతలను ఎందుకు ఆదుకోవాలి? వారేమైనా ఎన్నికలవేళలో ఆర్థిక వసతులు కల్పిస్తారా.. అందులో ప్రతి రాజకీయ నాయకునికి, గ్రామీణ నేపథ్యంలో వచ్చినా వేరే ప్రత్యా మ్నాయ ఆదాయమార్గం ఉంటుంది కాబట్టి బడ్జెట్లో వారికి ప్రాధాన్యత ఇవ్వకపోయినా ఎవరు ప్రశ్నిస్తారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ఏడాదికి ఆరువేల రూపాయలు పథకం ఏమాత్రం ప్రయోజనకారి కాదు.
ఒక దేశ ప్రగతికి సూచికలు రెండే రెండు. ఒకటి విద్య, రెండోది వైద్యం. ఏ దేశంలోనైతే ఈ రెండూ ఉచితంగా అందించగలుగుతారో ఆదేశం ప్రగతి పథంలో పయనిస్తుందని చెప్పవచ్చు. నిజానికి ఈ రోజు ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఖర్చుపెట్టేదీ ఈ రెండింటిపైనే. కొన్ని కుటుంబాలు ఈ రెండింటివల్ల కుదేలవుతున్నాయి. కాని ఈ బడ్జెట్లో ఈ రెండు రంగాలకు తగిన కేటాయింపులు చేయకపోగా, పెత్తనం చెలాయిస్తున్న కార్పొరేట్ వ్యవస్థపై ఒకమాట కూడా చెప్పలేదు. కార్పొరేట్ రంగ కాలేజీవాళ్లు, ఆస్పత్రివారు విపరీతంగా డబ్బు వసూలుచేసి నల్లధనాన్ని ప్రోగుచేస్తున్నారు. వారిపై అజమాయిషీ లేకపోవడం కనీసం ఆ దిశగ ప్రయత్నం చేయకపోవడం అన్యాయం. ఇక ఈ ప్రభుత్వం ఏ పేదల గురించి ఆలోచిస్తున్నట్టు?
ఇక దేశ ఆర్థిక రంగానికి సంబంధించిన 'బ్యాంకింగ్ రంగానికొస్తే ప్రభుత్వానికి, బ్యాంకులను ప్రయివేట్పరం చేయాలన్న ఉద్దేశ్యం ఉందేమోనన్న అనుమానం కలుగుతోంది. గత నాలుగైదు ఏండ్లుగా నిరర్థక ఆస్తులు హనుమంతుని తోకలా పెరిగి, లక్షల కోట్లు నష్టాలతో బ్యాంకులు కుదేలవుతున్న సంగతి ప్రతిరోజూ పత్రికలలో చూస్తున్నాం. ఈ నిరర్ధక ఆస్తులకు కారణం బడా బాబులు తీసుకున్న రుణాలు చెల్లించకపోవడమే. ఈ బడా బాబులు ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారికి సన్నిహితంగా మెలుగుతారు. ఒక సామాన్యునికి రుణసదుపాయం కావాలన్నా, ఒక సగటు మనిషికి గృహ నిర్మాణం రుణం కావాలన్నా సవాలక్ష నిబంధనలు పెట్టే ఆయా బ్యాంకుల యాజమాన్యాలు, రిజర్వ్ బ్యాంక్, ఈ బడాబాబుల విషయానికి వస్తే నిబంధనలన్నీ సరళీకృత మవుతాయి. వారికి తలుపులు బార్లా తెరిచి ఆహ్వానం పలుకుతారు. రుణం ఇచ్చేటప్పుడు సిఫార్సు చేసిన రాజకీయ నాయకులే వసూళ్లను కూడా అడ్డుకుంటారు. మన న్యాయవ్యవస్థ కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది. ఒకసారి రుణవసూళ్ల కోసం కోర్టు గడపతొక్కితే దశాబ్దాలుగా ఆ సమస్య అలాగే ఉంటుంది. అందువల్లే చాలా మంది కోర్టును ఆశ్రయిస్తారు. ఇక ఈ బడ్జెట్లో బ్యాంకులకు సమకూరుస్తున్న 75000 కోట్ల మూలధనం ఏమూలకూ సరిపోదు. లక్షల కోట్ల నిరర్ధక ఆస్తులు కుప్పలు తెప్పలుగా ఏడాదికేడాదికి పెరిగిపోతుంటే వాటిని రాబట్టుకునే చర్యలేవీ తీసుకునే ప్రయత్నం చేయకపోతే బ్యాంకింగ్ రంగం బాగుపడేదెప్పుడు? బ్యాంకులకు నష్టాలొస్తున్నాయన్న మిషతో బ్యాంకు ఉద్యోగస్తుల జీతాలు రానురాను గొర్రెతోకలాగే మారిపోతున్నాయి. దీనికి కారణం బ్యాంక్ ఉద్యోగుల వేతనం, పెన్షన్ బ్యాంక్ లాభాలతో ముడిపెట్టడం. ఉద్యోగస్తులకు ఏమాత్రం సంబంధంలేని బడాబాబుల నిర్వాకం వల్ల నిరర్ధక ఆస్తులు పెరిగి బ్యాంక్ల లాభాలపై ప్రభావం చూపితే ఉద్యోగుల బాధ్యత ఎంతవరకు? నిరర్ధక ఆస్తుల పెరుగుదలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసినట్టుగా ఈ బడ్జెట్లో ఎక్కడా కనపడలేదు. అయితే ఈ బడ్జెట్ వ్యాపారవర్గాలను కూడా సంతృప్తి పరచలేదేమో ననిపిస్తోంది. ఒకవైపు మంత్రి నిర్మలాసీతారామన్ తనకున్న ఆంగ్లభాషా పరిజ్ఞానంతో బడ్జెట్ ప్రవేశపెడుతుంటే అటు స్టాక్ మార్కెట్ నష్టాలతో నడిచాయి. దీనిని బట్టి తెలుస్తోంది ట్రేడ్ వర్గాలకు కూడా ఈ బడ్జెట్ రుచించలేదేమో.. మొత్తంపై ఈ బడ్జెట్ మెజార్టీ దేశ ప్రజలకు నిరాశే కలిగించిందని చెప్పాలి. ఉదయం లేస్తూనే జాతీయవాదం, అవినీతి రహిత సమాజం గురించి మాట్లాడే దేశ ప్రజల మనసుల గెలిచిన మోడీ హయాంలో ఇలాంటి బడ్జెట్ దేశ ప్రజలు ఆశించలేదనే చెప్పాలి.
- చెన్రెడ్డి అల్వాల్రెడ్డి
సెల్: 9491466085