Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అఖండ మెజారిటీతో మోడీ సర్కారు అందలమెక్కింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక కీలక ప్రతిపాదనను మరొకసారి తెరపైకి తీసుకువచ్చింది. అదేమిటంటే... జమిలి ఎన్నికలు. ఇంకా చెప్పాలంటే... వన్ నేషన్, వన్ ఎలక్షన్. దేశంలో ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండటంతో పరిపాలనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేంద్రం ఈ సందర్భంగా చెబుతోంది. కానీ, భారత్ పూర్తిగా భిన్న మతాలు... విభిన్న సంస్కృతులకు నెలవని మోడీ సర్కారు అర్థం చేసుకోవాలి. భారత్లో ఒకే దేశం... ఒకే ఎన్నికలు సూత్రం ఆచరణలో సాధ్యం కాని అంశం. దాంతోపాటు ఒకే దేశం, ఒకే ఎన్నికల నిర్వహణకు చట్టబద్ధంగా ఎన్నో సాంకేతిక అడ్డంకులు ఎదురవుతాయన్నది అక్షర సత్యం. ప్రధానంగా ఈ చర్య సమాఖ్య విధానానికి సంకటాలు తెస్తుంది. దళిత నేత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంతో నిర్వర్తించబడుతున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విఘాతం కూడా. మన దేశ ప్రస్తుత విధానాన్ని పరిహసిస్తూ... ప్రమాదకర అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం (ప్రెసిడెంటీియల్ డెమోక్రసీ) వైపు దేశాన్ని తీసుకెళ్ళేందుకు మోడీ సర్కారు తీవ్రంగా యత్నిస్తోందని చెప్పకతప్పదు. ఇది ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా మార్చేసేందుకు కేంద్రం పన్నిన కుట్రగా అభివర్ణించవచ్చు.
కేంద్రం నిర్వహించిన ఆల్ పార్టీ మీట్లో అఖిలపక్షాలు పాల్గొన్నాయి. అందులో కొన్ని అంశాలపై తక్షణమే చర్చ జరగాల్సి ఉందని సర్కారు ఉద్ఘాటించింది. దాంట్లో ప్రధానంగా మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించు కోవడం స్వాగతించాల్సిన విషయం. గాంధీ జయంతోత్సవాలను ఏ విధంగా నిర్వహించా లని పలు పార్టీల నుంచి సూచనలు సైతం స్వీకరించింది. అయితే, ఇటీవల కాలంలో మహాత్మా గాంధీ త్యాగా లను బదనాం చేస్తున్న దారుణ పరిస్థితి నెలకొంది. అటువంటి నేతలంతా అధికార బీజేపీలోనే ఉన్న విషయం తెలిసిందే. మహాత్మా గాంధీని దూషించి... ఆయనను హత్య చేసిన గాడ్సేను దేశభక్తుడితో పోల్చిన వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనిపక్షంలో ప్రభుత్వం గాంధీ జయంతోత్స వాలను ఎంత ఘనంగా చేసినా ఉపయోగం లేదన్నది సుస్పష్టం.
ఇక జమిలి విషయానికి వస్తే... దేశానికి స్వాతంత్య్రం వచ్చాక లిఖించుకున్న రాజ్యాంగం ప్రకారమే కేవలం 1952, 1957లో మాత్రమే రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్సభ సంయుక్తంగా ఎన్నికలు జరిగాయి. ఆ తదనంతరం ఎందుకు అన్ని రాష్ట్రాల ఎన్నికలు, లోక్సభతో జరగలేదన్న విషయానికి కేంద్రమే సమాధానం చెప్పాలి. ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సమాఖ్య విధానానికి తూట్లు పొడుస్తూ వచ్చాయి. ఆర్టికల్ 356పేరుతో రాష్ట్రాల హక్కులను భారీ స్థాయిలో హరించాయి. అందువల్లే, రాష్ట్రాల ఎన్నికలు లోక్సభతో సంబంధం లేకుండా జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఆర్టికల్ 356 తొలిసారి దేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వంపైనే ఉపయోగించారు. 1959లో అప్పటి కాంగ్రెస్ సర్కారు అక్రమంగా కేరళలోని నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. భారత రాజ్యాంగంలో ఆ ఆర్టికల్ ఉన్నంత కాలం ఒకే సారి ఎన్నికలు జరగినా... మళ్ళీ రాష్ట్రాలపై కేంద్రానిదే పెత్తనమవుతుందని రాజ్యాంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే పరిస్థితి ఉత్పన్నమయితే దాన్ని కేంద్రం ఏ విధంగా ఎదుర్కొంటుందన్న దానిపై సర్కారు తార్కిక సమాధానం చెప్పకపోవడం ప్రశ్నించాల్సిన విషయం. ప్రత్యామ్నాయంగా కేంద్రం చేపట్టే చర్యలపై ఎటువంటి స్పష్టత రాలేదు. ఒకే సారి రాష్ట్రాలతో పాటు కేంద్రానికి ఎన్నికలు జరిగితే.. ఒకవేళ ఏదయినా రాష్ట్రానికి సరైన మెజారిటీ రాకపోయినా... విశ్వాస పరీక్షలో నెగ్గకపోయేటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారన్న దానిపై కేంద్రం వద్ద సమాధానం లేదు.
భారత రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా విశ్వాస పరీక్షలో నెగ్గని ప్రభుత్వాన్ని ఆర్టికల్ 83(2) లోక్సభ, 172(1) అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది. మరి ఒకేసారి ఎన్నికలు అని చెబుతున్న కేంద్రం ఆయా రాష్ట్రాల అసెంబ్లీ రద్దు అయ్యాక సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడితే కేంద్రం గవర్నర్ పేరిట పాలన విధించే అవకాశం ఉందని నిగూఢంగా అర్థం చేసుకోవాల్సి ఉంది. దాంతోపాటు, సర్కారు చెప్పినట్టు లోక్సభ, శాసనసభల కాలపరిమితి పొడిగించడం, తగ్గించడం వంటి చర్యలు పూర్తి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. అంటే, ఆయా అసెంబ్లీలు ఎన్నికయ్యే వరకు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం భావిస్తోందా అన్న అంశం తేలాల్సి ఉంది. ఇంక ఈ పరిణామాలన్నీ నిశితంగా గమనిస్తే... అధ్యక్షతరహా పాలనకు మోడీ సర్కారు తెరతీస్తున్నట్టు కనిపిస్తోంది. చాటుమాటున రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని కేంద్రం భావిస్తోందని అర్థమవుతోంది. రాష్ట్రాలు, కేంద్రానికి ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే సమయం ఎక్కువ పడుతుందనీ.... అప్పుడు పాలనంతా కుంటుపడే అవకాశం ఉందని మోడీ సర్కారు సాకులు చెబుతోంది. కానీ, 79వ పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్పిన ప్రకారం అసెంబ్లీల పదవీకాలాన్ని పెంచడం.. తగ్గించడం రాజ్యాంగ మూలసూత్రాలు, వాటి స్ఫూర్తికి వ్యతిరేకమని గమనించాలి. ఒకే దేశం... ఒకే ఎన్నికలు అంశాన్ని బలపరచడం అంటే... గవర్నర్ పేరిట పాలనలో కేంద్రాన్ని పూర్తిగా అనుమతించడమేనని అర్థం చేసుకోవచ్చు.
ఎన్నికల సంఘం మాటేమిటీ?
ప్రస్తుతం ఎన్నికల సంఘం పనితీరుపై దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఏ స్వతంత్ర దేశంలో అయినా ఎన్నికలను స్వేఛ్చాయుత వాతావరణంలో నిర్వహించడంలో ఈసీదే కీలక పాత్ర. అయితే, 17వ లోక్సభ ఎన్నికల సమయంలో ఈసీ చర్యలు ప్రశ్నార్థమైన విషయం దేశమంతా గమనించింది. అన్ని పక్షాలకు సమానంగా చూడాల్సిన ఈసీ అధికార పక్షానికి ఒక విధంగా... ప్రతిపక్షాల పట్ల మరొక విధంగా వ్యవహరించిన అంశాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఎలక్షన్ కమిషనర్ల నియామకమే లోపభూయిష్టంగా ఉందని పలువురు మాజీ ఎన్నికల కమిషనర్లే వ్యాఖ్యానిస్తున్నారు. దీనివల్ల ఎన్నికల వ్యవస్థ దేశంలో పారదర్శకంగా లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ఆధ్వర్యంలోని కొలీజియంతో ఈసీ కమిషనర్ల ఎంపిక జరగాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఈసీలో వ్యవస్థీకృత మార్పులు అనివార్యమని సామాజికవేత్తలు, మేధావులు అభిప్రాయపడు తున్నారు. కానీ, ఇలాంటి మౌలిక విషయంపై కేంద్రం దృష్టి సారించకపోవడం ఆందోళనకరం. ఇక ఈవీఎంలలో ఎన్నికల నిర్వహణ ప్రతిపక్షాలకు ఎన్నో అనుమానాలున్నాయి. కానీ, వాటిని ఈసీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పోలైన ఓట్లతో వీవీప్యాట్ లెక్క కలవడం వంటి విషయం ఇప్పటికీ సమస్యగానే ఉంది. దాంతోపాటు ఈవీఎంలలో వన్ ప్రొగ్రామెబుల్ చిప్ వాడుతున్నామని ఈసీ చెబుతున్నది. కానీ, ఒకసారి కంటే ఎక్కువ సార్లు వినియోగించ వచ్చని దానిని రూపొందించిన సంస్థ ఈసీఐఎల్ ఒక సమాచార హక్కు కార్యకర్తకు వివరణ ఇచ్చింది. ఈ విషయంపై ఈసీ మాత్రం ఇప్పటికీ పెదవి విప్పడం లేదు. ఇక ఎన్నికల్లో ధన ప్రవాహం గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. డబ్బుల వరదను కట్టడి చేసేందుకు ఈసీ చేసిన చర్యలు పెద్దగా లేకపోవడంతో ఎన్నికలసంఘం అభాసుపాలవు తున్నది. ప్రచార సమయంలో డబ్బు ప్రభావాన్ని నిలువరించాలంటే అందుకు సంబంధించిన చట్టాలు మరింత కఠినతరం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఎన్నికల బాండ్లను తక్షణమే రద్దు చేయాలని... వాటి ద్వారానే రాజకీయ పార్టీలకు ముఖ్యంగా బీజేపీకి విచ్చలవిడిగా నల్లధనం వస్తోందనే అంశం చర్చనీయాంశమ వుతోంది. అందుకని రాజకీయ పార్టీలకు కార్పొరేట్ ఫండింగ్ను తక్షణమే నిషేధించాలి. రాజ్యాంగం అమలులోకి వచ్చాక.... కేంద్రంలో ఏ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం 50శాతం ఓటింగ్ను పొందలేదన్న విషయాన్ని గుర్తెరగాలి. అంటే, ఈ లెక్కన మెజారిటీ ప్రజానీకం వ్యతిరేకిస్తున్నా... ప్రభుత్వాలు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. అందుచేత, ఎన్నికల విధానంలో సమూల మార్పు అవసరమని ఈ విషయం గుర్తు చేస్తోంది. అందుచేత, దేశంలో ఎన్నికలు దామాషా పద్ధతిన జరగాల్సిన తరుణం ఆసన్నమైందని పాలకులు గమనించాలి.
- సాగర్ వనపర్తి
సెల్: 9494041258