Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెల రోజులుగా రాష్ట్రంలో కొత్త సచివా లయం, అసెంబ్లీ భవనాల నిర్మాణాలే తీవ్ర చర్చనీ యాం శంగా మారాయి. అసలు ఎందుకోసం ఈ కొత్త నిర్మాణాలు చేపడు తున్నారో స్పష్టం చేయని సర్కారు తీరుతో లోగుట్టు ఎవరికి ఎరుక అన్నచందంగా మారింది. శాసనసభ, శాసన మండలి, సచివాలయం ఈ మూడు భవనాల నిర్మాణానికి సీఎం భూమిపూజ కూడా చేశారు. ప్రతిపక్షాలు గొంతుచిం చుకున్నా.. హైకోర్టు మెట్లెక్కినా.. అఖిలపక్ష సమావేశమైనా.. ఏమాత్రమూ పట్టనట్టుగానే సర్కారు తన పని తాను చేసుకుంటూ పోతోంది. వాస్తును నమ్మే ముఖ్యమంత్రి ఆ దోషం వల్లే ఆ భవనాలను కూల్చి కొత్తవాటిని నిర్మిస్తున్నారన్న ప్రతిపక్షాల ఆరోపణల నడుమ ప్రజాధనం వృథా అవుతోంది. ఇప్పటికే రూ.60కోట్లతో ప్రగతిభవన్ పేర అద్దాల మేడ కట్టుకున్న ఆయన ఏనాడూ సీఎం హోదాలో సచివాలయం గడప తొక్కలేదు. అత్యాధునిక సదుపాయాల కల్పన కోసమే ఈ నిర్మాణాలంటూ అక్కడక్కడా గులాబీ నేతలు ప్రస్తావిస్తున్నారే తప్ప ప్రజా క్షేత్రానికి మాత్రం అసలు కారణాలను స్పష్టం చేయలేదు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కనీసం తరగతి గదుల్లేక చెట్ల కిందనే చదువులు సాగుతున్న పాఠశాలలు, పైకప్పు పెచ్చులు ఎప్పుడు ఊడుతాయోన్న భయం మధ్య పాఠాలు వింటున్న విద్యార్థులు, కనీసం మూత్రశాలల సౌకర్యంలేని విద్యాల యాలు ఇప్పటికీ మనకు సదృశ్యంగానే ఉన్నాయి. మరోవైపు వేలాది రోగులు వచ్చే ఉస్మానియా జనరల్ ఆస్పత్రి సహా రాష్ట్రంలోని అనేక ఆస్పత్రుల్లో కనీస వసతుల కల్పన మృగ్యం.. పిల్లల భవిష్యత్తు, జాతి నిర్మాణం జరిగే గురుకులాలకు చాలా చోట్ల పక్కా భవనాలు లేవు. ఇంకోవైపు ఇందిరమ్మ ఇండ్లన్నీ పిట్టగూళ్లని వెక్కిరించిన టీఆర్ఎస్ అధినేత 560 చదరపు గజాల్లో రెండు పడకల గదులు, వరండా,వంట గది నిర్మించి ఇస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్క ఇంటికి రూ.5లక్షలు, పట్టణ ప్రాంతాల్లో అదనంగా రూ.25వేలు ఇస్తామన్నారు. మొదటి సంవత్సరంలో పెట్టుకున్న రాష్ట్ర వ్యాప్తంగా 60వేల ఇండ్ల నిర్మాణ లక్ష్యానికిగాను ఈ ఐదేండ్లలో కనీసం 6వేల ఇండ్లు కట్టలేకపోయారు. చాలా ఊళ్లల్లో డబుల్బెడ్రూం ఇండ్లు పునాదుల్లో ఉండగా.. అనేక గ్రామాల్లో ఇంకా పునాదే పడలేదు. కారణం 2014లోనే కేటాయించిన రూ.వెయ్యి కోట్లలో ఖర్చుచేసింది రూ.15కోట్లు మాత్రమే. 'మన ఊరు-మన ప్రణాళిక' ద్వారా తేలిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఇండ్లు లేని పేద కుటుంబాలకు 'డబుల్ బెడ్రూం' ఇండ్లు కట్టాలంటే దశాబ్దాల కాలం పడుతుంది. ఈ పనులన్నింటికే నిధుల్లేని సర్కారు కొత్త సచివాలయ, అసెంబ్లీ నిర్మాణాలకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయంటూ ప్రజల్లో చర్చమొదలైంది. స్వరాష్ట్రంలో స్వపరిపాలన అందించేందుకే ముఖ్య మంత్రి కృషి చేస్తున్నారని, ధనిక రాష్ట్రమైన మనకు ఏ ఢోకా లేదనీ గులాబీ నేతలు ఢంకా బజాయిస్తుంటే ఇది అప్పుల రాష్ట్రం అంటూ ఇటీవల మంత్రి నిర్మలా సీతారామన్ బాంబు పేల్చారు. ఆమె లెక్కల ప్రకారం.. 2014 జూన్ నాటికి 69,517కోట్లు మాత్రమే ఉన్న అప్పులు 2019 మార్చి వచ్చేసరికి ఐదేండ్లలో 159శాతం పెరిగింది. అంటే సగటు పౌరుడి నెత్తిమీద రూ.50వేల వరకు బాకీ పడిందన్న మాట. ఈ నేపథ్యంలో హామీల జల్లును చూసే ఈ ఐదేండ్లకు ప్రజలు టీఆర్ఎస్కు ఓటేశారు. ఆ హామీలను నెరవేర్చకుండా ఇప్పుడున్న సచివాలయం ఇంకా 60 ఏండ్లు పటిష్టంగా ఉంటుందని చెబుతున్నా... దాన్ని కూల్చే పనే పెట్టుకున్నారు. ఇంతకీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లగుంచి సర్కార్ ఏమి దయతలుస్తుందో తెలవకనేపోయే..!
- బి.శ్రీకాంత్
సల్: 9490099393