Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జులై 18న కర్నాటక శాసనసభలో బల నిరూపణకు ముఖ్యమంత్రి కుమారస్వామి గౌడ సిద్ధమైనా తాజా కర్నాటకం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చెప్పడం కష్టం. తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రతిపక్ష బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప రోజూ ప్రకటిస్తూనే ఉన్నారు. మరో వంక 16మంది ఎమ్మెల్యేల రాజీనామాలపై సుప్రీం కోర్టు 17న అభిప్రాయం ప్రకటిస్తుంది. ఒక నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ రాజీనామాలతో పాటు వారిని అనర్హులుగా ప్రకటించాలనే అభ్యర్థనలు కూడా తన దగ్గర ఉన్నందున నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుందని వాదించారు. అయితే తాము రాజీనామా చేసేనాటికి అనర్హత సమస్య లేదని తిరగుబాటు ఎమ్మెల్యేలు కోర్టుకు తెలిపారు. రాజీనామాలు ఆమోదించడం తప్ప ఆయనకు వేరే మార్గాంతరం లేదని కూడా వారంటున్నారు. రాజీనామాలు అనర్హత రెండు అంశాలు కలసి వచ్చినందున రాజ్యాంగ పరమైన కోణంలో పరిశీలించి చెప్పాలని సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి రంజన్ గొగోరు ప్రకటించారు. రాజీలకు దాదాపు తలుపులు మూసుకుపోయిన నేపథ్యంలో ప్రభుత్వ ఓటమి లేదా బల నిరూపణ ఏంజరుగుతుందో చూడాల్సిందే.
రేపు ఏం జరుగుతుందనేది అలా ఉంచితే ఇప్పటి వరకూ జరిగిందీ జరుగుతున్నదీ మాత్రం బీజేపీ అధికార దాహానికి, అనైతిక వ్యూహానికి అద్దం పడుతున్నది. గత ఏడాది ఎన్నికల్లో 225మంది సభ్యులున్న శాసనససభలో 105స్థానాలు తెచ్చుకుని పెద్ద పార్టీగావచ్చినా అధికారం దక్కక పోవడం ఆపార్టీ భరించలేని వాస్తవంగా ఉంది. అక్కడికీ అతిభరోసాతో ఎవరో వొకరు తమ వైపు రాకపోతారా అని ఆదరాబాదరాగా ప్రమాణ స్వీకారం చేసిన యెడ్యూరప్ప అవమాన కరంగా దిగిపోవలసి వచ్చింది. 79స్థానాలు మాత్రమే వచ్చిన కాంగ్రెస్, 37 తెచ్చుకున్న జేడీఎస్ ఇద్దరు ఇండిపెండెంట్ల మద్దతుతో మంత్రివర్గం ఏర్పాటు చేయడం అప్పట్లో దేశ రాజకీయాల్లోనే ముఖ్య పరిణామంగా నిలిచింది. అయితే అధికారం కోసం చేతులు కలిపినప్పటికీ కాంగ్రెస్ జేడీఎస్లు ఎంత మాత్రం ఒద్దికగా విధానపరంగా పనిచేయలేకపోయాయి. మాజీముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత సిద్దరామయ్య వంటివారు ఈ ప్రభుత్వ మనుగడను బొత్తిగా జీర్ణం చేసుకోలేకపోయారు. రోజూ కీచులాటలు, సర్దుబాట్ల పర్వంగా నడిచింది. నాటకీయ ప్రవర్తనకు మారుపేరైన కుమారస్వామి కన్నీళ్లు పెట్టుకోవడం, ఈ పదవి భరించలేనిదిగా ఉందని బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం బీజేపీకే పనికి వచ్చాయి. బలపర్చే ఇండిపెండెంట్లతో సహా ప్రతివారూ మంత్రిపదవుల కోసం పాకులాడటం పరిస్థితిని సంక్లిష్టం చేసింది. ఈ దశలోనే బీజేపీ అరుణాచల్ ప్రదేశ్, గోవాలలో వలె ఆపరేషన్ కమల్ ప్రారంభించింది. పాలక కూటమిలో ఎమ్మెల్యేలకు భారీ మొత్తాలు ముట్టజెప్పి, మంత్రి పదవుల ఆశచూపి ప్రలోభాలకు గురి చేసింది. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ డీలాపడిపోగా బీజేపీ పథకాలు వేగం పుంజుకున్నాయి. రాహుల్ గాంధీ రాజీనామాతో కాంగ్రెస్ మరింత అయోమయం పాలైన తర్వాత కర్నాటకలోనూ ఆ పార్టీ సభ్యులు పూర్తిగా అదుపుతప్పారు. తోమ్మిది మంది ఆపార్టీ ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీఎస్ సభ్యులు రాజీనామా చేశారు. వాటిపై తర్జన భర్జన జరగుతుండగానే గవర్నర్ వజల్ వాలాను కలిసి రాజీనామాలు అందించారు. వారిలో కొందరు మంత్రులు కూడా. విశేషమేమంటే ఈ సమయంలో బీజేపీ నేతలు యోగీశ్వర్, సంతోష్లు వారి వెంట ఉన్నారు. ఇందులో సంతోష్ యెడ్యూరప్ప సహాయకుడు కూడా! బుజ్జగింపులకు అందకుండా ఉండేందుకు వీరంతా బీజేపీ శివసేన పాలనలోని ముంబాయి వెళ్లి ఒక హోటల్లో తలదాచుకున్నారు. వారికి ఎంత భద్రత కల్పించారంటే కాంగ్రెస్ జేడీఎస్ మిశ్రమ ప్రభుత్వ సూత్రధారిగా పేరొందిన మంత్రి శివకుమార్ వెళ్లినా కలుసుకోలేకపోయారు. అయనను పోలీసులు వెనక్కు పంపేశారు. దేవగౌడకు విశ్వాసపాత్రుడైన రాష్ట్రపార్టీ అధ్యక్షుడు విశ్వనాథ్ రాజీనామా చేసి తప్పుకున్నారు. ఆయనను బీజేపీ ప్రధానకార్యదర్శి మురళీధరరావు కలుసుకున్న వార్త బయిటకురావడం ఆ పార్టీని ఇరకాటంలో పడేసి ఆయనకు చివాట్లు తెచ్చిపెట్టింది. ఈ పరిణామాలతో మాకు సంబంధం లేదనే బీజేపీ వాదన నిజాలేమిటో చెప్పడానికి ఈ వైనాలు చాలు.
ఒక దశలో మొత్తం మంత్రులందరూ ముఖ్యమంత్రికి రాజీనామాలిచ్చి తిరుగుబాటుదార్లకు అవకాశమిచ్చి పునర్యవ్వస్థీకరణ చేసే అవకాశం కల్పించారు. కానీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు వెనక్కు తగ్గడానికి నిరాకరించారు. అలా బీజేపీ వారిని ఎంతగా ప్రలోభపెట్టిందో తెలుసుకోవచ్చు. పైగా తిరుగుబాటు చేసిన సభ్యులు జులై 10న సుప్రీం కోర్టును ఆశ్రయించి తమ రాజీనామాలు ఆమోదించేలా ఆదేశించాలని కోరారు. ఆదేశించే అధికారం లేదు గనక న్యాయస్థానం స్పీకర్ రమేష్ను 12వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఆ దశలో రంగప్రవేశం చేసిన స్పీకర్ రమేష్ రాజీనామాల్లో ఐదు మాత్రం సక్రమంగా ఉన్నాయని మిగిలినవి సరైన రీతిలో లేవనిప్రకటించారు. ఆ ఐదుగురు తనను దశలవారిగా కలుసుకోవాలని చెప్పారు. తనను సుప్రీం కోర్టు ఆదేశించజాలదని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగ బద్దమైన మరో వ్యవస్థను తాను ఆదేశించలేనని కోర్టు కూడా చెప్పింది. ఇదిలా ఉంటే రాజకీయ మల్లగుల్లాలలో కుమారస్వామి రాజీనామా చేస్తారని ఒకసారి వార్తలు వచ్చాయి. రాజీనామా లేదా బలపరీక్ష ఏదో ఒకటి తేల్చుకోవాలని యెడ్యూరప్ప పట్టుపట్టారు. తాను బలపరీక్షకే సిద్ధమని కుమారస్వామి నిర్ణయించుకున్నారు. ఇప్పుడు కర్నాటక శాసనసభా సమావేశాలు నడుస్తున్నాయి. కాబట్టి పరిస్థితి మరింత జటిలంగా తయారైంది. తాజాగా సుప్రీం కోర్టులో తిరగుబాటు ఎమ్మెల్యేల తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తగి వాదనలు చేస్తూ వారు స్పీకర్ ముందు స్వయంగా హాజరైనప్పుడు రాజీనామాలు సరైనవా కాదా అనే ప్రశ్న ఎలా వస్తుందని ప్రశ్నించారు. స్పీకర్ రమేష్ వైఖరిపై దేశవ్యాపితంగా రెండు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా రాజీనామాల ఆమోదం నిరాకరించడం రాజ్యాంగ రీత్యా సరికాదని హిందూ సంపాదకీయం రాసింది. వ్యూహాలు ఉద్దేశాలు ఏవైనా ఒక సభ్యుడు తన పదవిని వదులుకోవడానికి హక్కు ఎక్కడికి పోతుందని కూడా వారంటున్నారు. అయితే అనర్హత వేటు దృష్ట్యా ముందే రాజీనామా చేస్తే ఆ ఎత్తుగడ ఎందుకు సాగనివ్వాలని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. దీనిపై లోతుగా పరిశీలించాల్సి ఉటుందని సుప్రీం కోర్టు కూడా అభిప్రాయపడింది. బుధవారం ఒక నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ అంటుంటే గురువారం బలపరీక్ష జరగవచ్చని భావిస్తున్నారు. రాజీనామాలు ఆమోదిస్తే సభ్యుల సంఖ్య తగ్గి బిజెపి పై చేయి సాధించే అవకాశం వుంది. నిజానికి 2008లోనూ యెడ్యూరప్ప పూర్తి మెజార్టి రాకపోవడంతో ఇదే ఎత్తుగడ అనుసరించారు. రాజీనామా చేయించి ఉప ఎన్నికలలో గెలిపించుకున్నారు. గాలి ముఠాతో చెడిపోయిన తర్వాత వారు ఎంఎల్ఎలను తీసుకొచ్చి హైదరాబాదు హోటల్లో పెట్టి బెదిరించడం దేశమంతా రోత పుట్టించింది. తర్వాత ఆయనను మార్చారు కూడా.
మోడీ అమిత్షా నాయకత్వంలో బీజేపీ నీతివంతంగా నడుస్తున్నట్టు టముకు వేసుకుంటున్నా వాస్తవాలు పూర్తి విరుద్ధంగా వున్నాయని కర్నాటక అనుభవం చెబుతున్నది. అసలు గాలిజనార్థనరెడ్డి గనుల మాఫియాను పెంచి పోషించడమే గాక తనూ కుంభకోణాలలో చిక్కి తొలగింపునకు గురైన యెడ్యూరప్పను నాయకుడుగా పెట్టుకోవడమే ఒక కళంకం. ఇక శత కోటీశ్వరుల క్రీడగా మారిపోయిన రాజకీయంలో ప్రజా ప్రతినిధుల ఎన్నిక కూడా వ్యాపారాత్మకంగా దిగజారింది. రియల్ ఎస్టేట్, లిక్కర్ సిండికేట్లు, నల్లధనం ఆసాములు, కాంట్రాక్టర్లు, కార్పొరేట్ బాసులు ఇతర సంపన్నులే నెగ్గుతున్నారు. ఈ బాపతుకు స్వప్రయోజనం సంపాదన తప్ప విలువలు పద్ధతులు నిబద్దతలు బొత్తిగా గిట్టవు. గతంలోని ఆయారాం గయారాంలను మించి వీరు తేలిగ్గా పార్టీ మార్చేస్తారు. కర్నాటక ఒక కొలిక్కి రాకముందే గోవాలో 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో కలసిపోవడం, ఏపీలో టీడీపీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీన నాటకం నడిపి ఫిరాయించడం అన్నీ ఈ కోవలోవే. ఎమ్మెల్యేలు, ఎంపీలతో బేరసారాలకు కొనుగోళ్లకు అవసరమైన కోటాను కోట్లు సమకూర్చే కుబేరులు బీజేపీతో ఉన్నారు గనకే ఇదంతా సాధ్యమవుతున్నది. ముందే చెప్పినట్టు కాంగ్రెస్ అస్తవ్యస్త స్థితి, అంతర్గత అనైక్యత పరిస్థితిని మరింత దిగజార్చాయి. జేడీఎస్ బలం తక్కువైనా తామే ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప కుదరదన్న వైఖరి మొదట తీసుకుంది. తర్వాత కాస్త తగ్గినా పరిస్థితి చేయిదాటిపోయినట్టు కనిపిస్తుంది. రాహుల్ రాజీనామా ప్రహసంలో తలకిందులవుతున్న కాంగ్రెస్ అధిష్టానం సంక్షోభ నివారణలో ఘోరంగా విఫలమైంది. ఇక కర్నాటక తర్వాత మధ్యప్రదేశ్ రాజస్థాన్లలోనూ ఆ పార్టీ ప్రభుత్వాలను కూల్చేస్తానని బీజేపీ అంటున్నది. తెలంగాణలోనూ బెంగాల్లోనూ పాలకపార్టీల ఎమ్మెల్యేలలో మెజార్టి తమతో టచ్లో వున్నారంటున్న బీజేపీ రాజకీయ నైతికత ఏపాటిదో తేలిగ్గానే తెలుస్తోంది. ఒక వేళ ఎలాగో అధికారంలోకి వచ్చినా 16మంది ఫిరాయింపు దార్ల గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక గతంలోవలెనే పరువు పోగొట్టుకోవలసి రావచ్చని చాలామంది హెచ్చరిస్తున్నా నాయకత్వం వినడం లేదు.
కర్నాటక సంక్షోభం కుమారస్వామి భవిష్యత్తునే గాక రాజీనామాలు అనర్హతల మధ్య సంబంధాన్ని సభాపతి పాత్ర న్యాయస్థానాల జోక్యం వంటి అంశాలను కూడా చర్చకు తెచ్చింది. గనక ఎలాటి నిర్దేశకాలు ముందుకు తెస్తుందో చూడాల్సిందే. కొంత మంది అంటున్నట్టు సభాపతి అధికారాలు న్యాయస్థానాలకు కట్టబెట్టడం లేదా రాజీనామా హక్కును నిరాకరించడం కూడా సమస్యాత్మకమే. ఏ విలువల్లేని క్షుద్ర రాజకీయాల పరాకాష్ట ఇదంతా .
బలాబలాల పట్టిక: బీజేపీ-105, బీఎస్పీ-1, కేఎల్జేపీ-1, నామినేటెడ్-1, కాంగ్రెస్-79. జేడీఎస్- 37, ఇండి-1 (16 మంది రాజీనామాలకు ముందు).
- తెలకపల్లి రవి