Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాతీయ విద్యా విధానం ముసాయిదా విద్యారంగంలో సామాజిక న్యాయం గురించి ఎటువంటి ప్రస్తావనా చేయలేదు! ఇది దిగ్భ్రాంతిని కలిగించే విషయం! వివక్షతను, అణచివేతను నిర్మూలించాలన్న అంశమే ముసాయిదాలో లేదు. రిజర్వేషన్ విధానం గురించి మాటమాత్రంగా కూడా ప్రస్తావించ లేదు. పైగా సెకండరీ విద్య అనంతరం చదువుల కోర్సులలో ప్రవేశాలకు మెరిట్ ప్రాతిపదిక ఉండాలన్న విషయాన్ని పదే పదే ప్రస్తావించారు. ఉపాధ్యాయ శిక్షణ కోర్సు బి.ఎడ్లో రిజర్వేషను నియమం పాటించడం తప్పనిసరి అయినా, ఆ సందర్భంలో కూడా రిజర్వేషను ఊసు ఎత్తలేదు. స్కాలర్షిప్ల చెల్లింపు విషయంలో సామాజిక-ఆర్థిక వెనుకబాటుతనం ఒక అంశం. అయినా ఇక్కడ కూడా రిజర్వేషన్ ప్రస్తావన లేదు. బోధనా సిబ్బందిని నియమించే విషయంలో గాని, ప్రమోషన్ల విషయంలో గాని రిజర్వేషన్ ప్రస్తావన లేనే లేదు. 'అర్హతతో కూడిన జ్ఞాన సమాజం' అన్నది ముసాయిదా లక్ష్యంగా పేర్కొన్నారు. శతాబ్దాల తరబడి అవకాశాలకు దూరంగా నెట్టివేయబడి, అణచివేతను ఎదుర్కొంటున్న కింది కులాల వారు, లింగ వివక్షత ఎదుర్కొంటున్న మహిళలు, మత విద్వేషాల దాడులకు బలైన మైనారిటీలు, సమాజాభివృద్ధిలో ఇప్పటికీ భాగం కాలేక దూరంగా ఉండిపోతున్న గిరిజన తెగలు-వీరందరినీ ఏవిధంగా విద్యావ్యవస్థలో సంపూర్ణ భాగస్వాములుగా చేయాలి? ఈ ముఖ్యమైన సవాలును జాతీయ విద్య ముసాయిదా పట్టించుకున్నట్టు లేదు.
'ఈ తరగతులన్నింటినీ ఇతరులతో సమాన స్థాయికి తీసుకు రావాలంటే వీరికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడమొక్కటే మార్గం' అన్న అంబేద్కర్ మాటలను జాతీయ విద్య ముసాయిదా మరిచిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరగతులకు ఏవిధంగా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలో ముసాయిదాలో నిర్దిష్టంగా ఏమీ ప్రస్తావించలేదు. ఉన్నత విద్యారంగంలో ప్రయివేటు సంస్థలకు పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించాలని చెప్పింది. ఆ ప్రయివేటు సంస్థలు ఈ వెనుకబడ్డ, అణగారిన తరగతుల విషయంలో స్వచ్ఛందంగా ఏమైనా చేయదలుచుకుంటే చేయడం మంచిదని మాత్రమే సూచనగా పేర్కొంది.
రోహిత్ వేముల ఉదంతం దరిమిలా దేశ వ్యాప్తంగా ప్రజాతంత్రవాదులందరూ వ్యక్తం చేసిన నిరసనల తర్వాత కూడా ఉన్నత విద్యారంగంలో 'సామాజిక న్యాయం' అంశాన్ని ముసాయిదా నివేదిక నిర్లక్ష్యం చేయడం సహించరానిది. ఒక్క రోహిత్ మాత్రమే కాదు! తమిళనాడుకు చెందిన 17ఏండ్ల ఎస్.అనిత అనే దళిత విద్యార్థి మెడికల్ సీటు విషయంలో 'నీట్' నిబంధనకు మినహాయిం పును ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకుంది. శతాబ్దాలుగా సమాన త్వానికి ఆస్కారం లేనప్పుడు తక్కిన వారితో సమాన ఫక్కీలో పోటీ పడడం తన వంటి దళితు లకెలా సాధ్యపడుతుందని ఆమె తన ఆత్మహత్య లేఖలో పేర్కొంది. ఇటీవల ముంబై వైద్య కళాశాలలో మెడిసిన్ పీజీ కోర్సు రెండో సంవత్సరం చదువుతున్న డా|| పాయల్ తడ్వీ అనే దళిత విద్యార్థిని తన అగ్రవర్ణ సహచరుల, సీనియర్ల వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఇటువంటి ఉదంతాలు లెక్కకు మించి ఉన్నాయి. ఉన్నత విద్యాసంస్థలలో అమలు జరుగుతున్న వివక్షత, ప్రొఫెసర్ల, అధికారుల నిర్లక్ష్యం ఎందరినో బలి తీసుకున్నాయి. జాతీయ ముసాయిదా ఈ నేపథ్యాన్నంతటినీ పరిగణనలోకి తీసుకుని ఒక పరిష్కారాన్ని సూచి స్తుందని ఆశించిన వారికి నిరాశే మిగిలిందని చెప్పాలి.
సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన తరగతుల నుంచి వచ్చేవారు జయప్రదంగా ఉన్నత విద్యను పొందడానికి అవసరమైన ఆర్థిక తోడ్పాటును, శిక్షణను అందించే ఏర్పాట్లు జరగాలని మాత్రం నివేదిక పేర్కొంది. అదే సమయంలో ప్రాచీన గురుకుల సంప్రదాయా లను, పద్ధతులను, మత బోధన సంస్థలను గొప్పగా చిత్రించారు. ఈ ప్రాచీన గురుకులాలలో అగ్ర వర్ణాల వారికే ప్రవేశార్హత ఉండేదన్న చేదు నిజాన్ని ముసాయిదా రూపకర్తలు గమనంలో ఉంచుకున్నారా? ఒక పక్క 'సామాజిక న్యాయం' అనే రాజ్యాంగ లక్ష్యాన్ని నీరుగార్చుతూ, ఇంకోపక్క కుల వివక్షతకు మారుపేరైన ప్రాచీన గురుకులాలను ఆకాశానికెత్తడం వెనక అసలు ఉద్దేశం ఏంటి? దేశ సంస్కతి, నాగరికత, విద్య-వీటి గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా మన ప్రాచీన సాంప్రదాయాలను, వారసత్వాన్ని, 'అధర్మం'పై 'ధర్మం' విజయం సాధించిన వైనాన్ని ప్రస్తావించడం, పురాణ సాహిత్యాలను ప్రమాణాలుగా పరిగణించడం చూస్తే ఈ జాతీయ విద్య ముసాయిదా 'హిందూత్వ', 'మనువాద' భావజాలాన్ని నెత్తికెత్తుకున్నదని స్పష్టం అవుతోంది.
నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల వారసత్వం నుంచి ప్రేరణ పొందినట్టు ముసాయిదా పేర్కొంది. అదే మన దేశంలోని బహుభాషల, భిన్న సంస్కతుల, విభిన్న బోధనా పద్ధతుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా వాటిని 'స్థానిక', 'రాష్ట్ర', 'ప్రాంతీయ' స్థాయిలకు చెందిన అంశాలుగా చిత్రీకరించారు. ఆవిధంగా జాతీయ స్థాయి 'ఏకరూప' సంస్కతి అంటూ ఒకటి ఉన్నట్లు, తక్కినవన్నీ దిగువ స్థాయికి చెందిన సంస్కతు లైనట్టు అభివర్ణించారు. హిందీని, సంస్కతాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని, తక్కిన భాషలను (అవి జాతీయ భాషలుగా రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూలులో పేర్కొన్న ప్పటికీ) ఆయా రాష్ట్రాలే చూసుకోవాలని ముసాయిదాలో సిఫార్సు చేశారు. బహుశా అందుకేనేమో, ముసాయిదా నివేదికను ఇంగ్లీషు, హిందీ భాషలలో మాత్రమే అందుబాటులో ఉంచారు!
బహు స్థానిక భాషలు ఈ దేశంలో ఉండినప్పటికీ, బ్రాహ్మణాధిపత్యం సుస్థిర మవుతున్న కొద్దీ పలు భాషలు సంస్కతీ కరింపబడ్డాయన్నది చరిత్ర స్పష్టం చేస్తోంది. అంటే స్థానిక భాషలపై సంస్కతాన్ని బలవంతంగా రుద్దారు (అచ్చ తెనుగు భాష కాస్తా గ్రాంథిక తెలుగు భాషగా సంస్కతీకరించబడినది ఈ క్రమంలోనే). కాని ముసాయిదా మాత్రం చరిత్రను తిరగేసి చెప్తోంది. పలు భారతీయ భాషలు సంస్క తం నుండే పుట్టాయని, కనుక ఈ ఆధునిక సమాజంలో సంస్క తాన్ని వాడుక భాషగా పెంపొందించాలని సూచిస్తోంది!
ప్రయివేటు కార్పొరేట్ సంస్థలతోబాటు ధార్మిక, మత సంస్థలకు కూడా విద్యా రంగంలో ప్రముఖమైన పాత్ర ఉండాలని ముసాయిదా పేర్కొంది. ఈ సంస్థలన్నింటికీ స్వయం నిర్ణయాధికారం ఉండాలని సూచించింది. ఫీజులను కూడా అవి స్వచ్ఛందంగానే నియంత్రించుకోవాలని చెప్పింది. ఈ విద్యా సంస్థలలో ప్రమాణాల పాటింపు విషయంలో పలు లోపాలు, వైఫల్యాలు వున్నప్పటికీ, పలు అంశాలలో అవి విద్యా హక్కు చట్టం నిర్దేశించిన ప్రమాణాలను పాటించకుండా నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ, విద్యాహక్కు చట్టం అమలు విషయంలో అంత పట్టింపు ఉండనవసరం లేదని జాతీయ విద్యా విధాన ముసాయిదా పేర్కొంది. అంతేకాదు, ఈ ప్రైవేటు సంస్థల ద్వారా సమాంతర విద్యా వ్యవస్థకు కూడా ఆస్కారం కల్పించే వీలుంది.
2019 ఫిబ్రవరిలో 'భారతీయ శిక్షా బోర్డు' అనే దానిని నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. వేద విద్యను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం 'మహర్షి సాందీపని రాష్ట్రీయ వేద విద్యా ప్రతిష్టాన్' అనే స్వయం నిర్ణయాధికార సంస్థను స్థాపించింది. ఆ సంస్థ భారతీయ శిక్షా బోర్డు ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. ఈ భారతీయ శిక్షా బోర్డుకు రామ్దేవ్ బాబా నేతృత్వంలోని పతంజలి సంస్థలు నిధులు సమకూర్చుతాయి. సిలబస్ రూపొందించడం, అచ్చు పుస్తకాలు తేవడం, పరీక్షలు నిర్వహించడం, సర్టిఫికెట్లు ఇవ్వడం, అన్నీ ఆ బోర్డు ఇష్ట ప్రకారమే జరుగుతాయి.
ఇంతవరకూ సెంట్రల్ బోర్డు ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వేరే ఏ ఇతర సమాంతర విద్యా వ్యవస్థనూ అనుమతించలేదు. ఇప్పుడు ముసాయిదా సిఫార్సు బట్టి చూస్తే భారతీయ శిక్షా బోర్డుతో పాటు ఆర్య సమాజ్, భారతీయ విద్యా భవన్ వంటివి నడుపుతున్న విద్యా సంస్థలన్నీ సీబీఎస్ఈ ప్రమేయం లేకుండా తమకు నచ్చిన విధంగా విద్యా రంగంలో తమ ఎజెండాను అమలు చేయడం సాధ్యపడుతుంది!
ఇంకోవైపు ప్రభుత్వ విద్యా సంస్థలోను, వయోజన విద్యలోను బోధనా ప్రమాణాలను మెరుగుపరచడం కోసం స్వచ్ఛంద కార్యకర్తలను, ట్యూటర్లను నియమించ వచ్చునని ముసాయిదా సూచించింది. అర్హతలున్న ఉపాధ్యాయుల స్థానే ఇటువంటి కార్యకర్తల నియామకాలు చేపడితే ప్రభుత్వ విద్యా సంస్థల ప్రమాణాలు ఇంకా దిగజారుతాయి. అంతిమంగా ప్రయివేటు సంస్థలకే లాభిస్తుందని వేరే చెప్పనవసరం లేదు.
పైగా రాజ్యాంగం ప్రకారం విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. రాష్ట్రాలకూ కేంద్రంతో సమానంగా హక్కు ఉంది. మొత్తం కేంద్రం పెత్తనం కింద నడపాలనడం రాష్ట్రాల హక్కులపై దాడి అవుతుంది. ఆయా రాష్ట్రాల చట్ట సభల అధికారాలను తృణీకరించడమే అవుతుంది. ఇది అప్రజాస్వామికం. కొఠారి కమిషన్ విద్యారంగాన్ని రాజకీయ, వ్యాపార శక్తుల ఒత్తిళ్ల నుంచి దూరంగా ఉంచి స్వేచ్ఛగా ఎదగనివ్వాలని సూచించింది. సామాజిక, మతపరమైన వివాదాలకు అతీతంగా శాస్త్రీయ భావాల వికాసం జరగాలని చెప్పింది. అయితే ప్రస్తుత జాతీయ విద్యా విధానం ముసాయిదా అన్ని కీలకాంశాల విషయంలోనూ ఘోరంగా విఫలమైంది.
- ఎం.వి.ఎస్. శర్మ