Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలో రెవెన్యూశాఖ చర్చనీయాంశంగా మారింది. అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మరోసారి ముద్రవేసుకుంది. ఓ పక్క అవినీతి లేని రెవెన్యూశాఖగా ప్రక్షాళన చేస్తామని స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించటం, ఇదే సమయంలో రాష్ట్రంలో సంచలనం రేపే విధంగా రంగారెడ్డిజిల్లా కేశంపేట తహాశీల్దార్ లావణ్య అవినీతి బండారం బయటపడటం, భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఆన్లైన్లో పేరు నమోదుకు లక్షల్లో లంచం అడిగి అందులో తహాశీల్దార్ లావణ్యకు వాటా ఉందని ఏసీబీ అధికారులకు వెల్లడించిన వీఆర్ఓ అనంతయ్య వ్యవహారం ప్రజలను రెవెన్యూశాఖ వైపు దృష్టి మళ్లించే అంశాలుగా మారాయి. ఇదే సమయంలో వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలంలోనూ తహాశీల్దార్ బాగోతం బయటపడి చర్చనీయాంశంగా మారిన విషయాన్ని గమనించాలి. శాయంపేట మండల తహాశీల్దార్ ఓ మహిళతో షికారు చేసి జిల్లా రెవెన్యూశాఖలో చర్చను లేవనెత్తారు. పొలాల్లో వ్యవసాయపనులు చేసుకుంటున్న రైతులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చినప్పటికీ అందరినీ దబాయించి బాగోతం నుంచి జారుకున్న ఉదంతం నెలకొంది. అడ్డగోలుగా లంచాలు తీసుకున్న సంఘటనలు, పలు చోట్ల తహాశీల్దార్ల రాసలీలల బాగోతాలు పలు సందర్భాల్లో దుమారాన్ని రేపటం పరిపాటిగా మారింది. ఇలాంటివి పదేపదే పునరావృతం కావటానికి కారణమేంటి...? ఎందుకు అధికారులు ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు. లంచాలు ఇవ్వటం కూడా తప్పే అయినప్పటికీ వారి అవసరాల రీత్యా అనివార్యంగా లంచాలు ఇవ్వక తప్పని పరిస్థితి నెట్టబడ్డారు జనం..! అయితే శాఖాపరమైన కర్తవ్యాలన్నీ పక్కనబెట్టి విధుల్లో అనేక జిమ్మిక్కులకు ఎందుకు పాల్పడుతున్నారు. లంచాలకు ఎందుకు ఎగబాకుతున్నారు. అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా రెవెన్యూశాఖ మారటానికి కారణం లంచాలు ఇచ్చే వారా...? తీసుకునే అధికారులా...? లేక కట్టడి చేయలేని ప్రభుత్వాధినేతలా..? రెవెన్యూశాఖలో పని చేస్తున్న అధికారులు సిబ్బంది ప్రభుత్వం అప్పజెపుతున్న పనుల్లో దేనినీ వదలకుండా అన్నింటిలో తమ చేతివాటాన్ని చూపించటం బహిరంగ రహస్యంగా మారినప్పటికీ వీటిని కట్టడి చేయటంలో మాత్రం ప్రభుత్వం విఫలమవుతూనే ఉంది. సీఎం కేసీఆర్ సైతం కోటలు దాటే మాటలు చెప్పటం తప్ప రెవెన్యూశాఖను అభాసుపాలు చేసే అధికారుల తీరుపట్ల తగు చర్యలు మాత్రం చేపట్టడం లేదు. అవినీతి, లంచగొండితనం, తప్పుడు ప్రవర్తన కలిగిన రెవెన్యూశాఖ ఉద్యోగులకు మరోసారి తప్పులు చేయటానికి భయపడే విధంగా బలమైన చర్యలు తీసుకోకపోవటమే రెవెన్యూశాఖలో అధికారుల ఇష్టారాజ్యానికి కారణంగా భావించాల్సి వస్తోంది.
కేసీఆర్ ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళనకు పూనుకోవటం మేలైన చర్యగానే రైతులు భావించినప్పటికీ భూప్రక్షాళనలో రెవెన్యూ అధికారుల తీరు మాత్రం ఇబ్బందికరంగానే మారిందనటానికి అనేక ఉదాహరణలు ఉన్నాయ నటంలో సందేహం లేదు. శాయంపేట మండల తహాశీల్దార్పై ప్రచారం జరుగుతున్న రాసలీలల బాగోతం చర్చానీయాంశంగా మారిన నేపథ్యంలోనే భూరికార్డుల ప్రక్షాళనలోనూ చేతివాటం చూపడంలో ఆయనది అందెవేసిన చేయిగా తెలుస్తున్నది. భూరికార్డుల ప్రక్షాళన లక్ష్యానికి విరుద్ధంగా తహాశీల్దార్ వ్యవహరించటం దీనికి అడ్డుచేప్పేందుకు ఎవరూ లేకపోవటం, జిల్లాస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల ఆశీస్సులు ఉండటం రెవెన్యూ సిబ్బందికి వరంగా మారుతుందనేది గమనించాలి. అయితే అంతా అయిపోయాక ఆకులు పట్టుకోవటంకంటే ముందుగానే సరిచేసుకునే విధంగా రాష్ట్ర రెవెన్యూశాఖ చర్యలు చేపడితే బాగుంటుంది. భూప్రక్షాళన, భూరికార్డుల ప్రక్షాళన చేపట్టిన ప్రభుత్వం అందులో అధికారుల చేతివాటాన్ని అదుపు చేయటంలో మాత్రం విఫలమైందనే చెప్పాలి. రాష్ట్రంలో ఏ మండల ప్రాంతంలో చూసినా రెవెన్యూ శాఖలో ఆరోపణలు లేని అధికారులు లేకపోవటం గమనార్హం. ఓ రైతు సాగులో ఉన్న వ్యవసాయ భూమిని మరోకరికి పట్టాలు చేయటం, ఆన్లైన్లో పేరు నమోదు చేయటం, అసలే సంబంధం లేని వ్యక్తులకూ, రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులకూ భూములు ఉన్నట్టుగా రెవెన్యూ పట్టాలు సృష్టించటంలో తహాశీల్దార్లు, వీఆర్వోలు ఎవరికి వారే దిట్టగా మారారు. శాయంపేట మండలం గోవిందాపూర్లోని రైతు శ్రీశైలం కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిని స్థానిక ఎమ్మెల్యే సోదరుని కుమారుని పేరుమీద ఎకరం భూమిని పట్టాచేసే చర్యలు ఉన్నాయంటే మన ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి చర్యలు వెలుగు చూసినప్పుడు సరైన చర్యలు చేపట్టకపోవటం ఫలితంగానే అధికారులు తమకెవరూ ఎదురు లేరన్నట్టుగా రెచ్చిపోతున్నారనేది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర రెవెన్యూశాఖా గుర్తించాలి. అవినీతి, అక్రమాలకు పాల్పడిన ఘటనలో, రాసలీల బాగోతాల్లో వెలుగుచూసిన సందర్భాల్లో కఠినమైన చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ముఖ్యమంత్రి రెవెన్యూశాఖను ప్రక్షాళన చేస్తా..! అవినీతి లేని శాఖగా మారుస్తా అంటూ మాటలు చెప్పటం కంటే చర్యలు చేపట్టడంలో ఉంటే ఉపయోగం. రెవెన్యూశాఖపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవకతవకలకు బాధ్యులుగా గుర్తించిన రెవెన్యూసిబ్బందిపై సరైన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ప్రజలకు రెవెన్యూశాఖపై తిరిగి నమ్మకం కలుగుతుంది.
- దామెర రాజేందర్
సెల్ : 8096202751