Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇక్కడ ప్రశ్నలు వినిపించకూడదు
పెదాలూ విచ్చుకోకూడదు
విలువల ధ్వంసం
వెన్నెముకల ధ్వంసం
వ్యవస్థల విధ్వంసం నిరభ్యంతరంగా సాగుతున్నా
నిటారుగా నిలబడి
మనం రాజ్యాన్ని ప్రశ్నించ కూడదు
అవును! ప్రశ్నలు యిక్కడ ఉదయించకూడదు
అర్థరాత్రి స్వాతంత్య్రం సినిమాలో జైలునుంచి బయటపడిన మరు క్షణం వంగపండు 'చిన్న జైల్లో నుంచి బైటపడి పెద్దజైల్లోకొచ్చిపడ్డా' నంటాడు. నిజమే! దేశమే ఒక జైలుగా మార్చబడినతర్వాత ఎక్కడుంటేనేం? సమాజమే ఒక స్మశానంగా మార్చబడుతున్నచోట శవాలై ఊరేగినా చింతేమిటి? అందుకే.. అటు జైళ్లకు గాని, ఇటు స్మశానాలకు గానీ వెళ్లేందుకు సిద్ధపడే రాజ్యం ఆగడాలను అడ్డుకునేందుకు అడుగుముందుకేస్తున్నారు సాహసికులు. ఆయుధం పట్టుకున్న అన్నలు, అరుణ పతాకం చేబూనిన కామ్రేడ్లే కాదు.. చీమూ నెత్తురు, చైతన్యం పొంగిపొరలే మేథోజీవులు సైతం బలమైన సర్పం మీదికి చలిచీమలై కదలబారుతున్నారు. అటో ఇటో తేలాల్సిన సమయంలో, అటో ఇటో తేల్చుకోవాల్సిన తరుణంలో నిజం వైపే నిలుస్తున్నారు. న్యాయం వైపే నిలుస్తున్నారు. నియంత రాజ్యాన్ని నడిబజారుకీడ్చుతున్నారు... ఈ క్రమంలోనే కల్బుర్గీ చంపబడ్డాడు. గోవింద్ పల్సారే హత్యకు గురయ్యాడు. నరేంద్ర దబోల్కర్ నిలువునా నరకబడ్డాడు. గౌరీలంకేశ్ తుపాకీ గుండ్లకు బలయ్యారు.
ఎవరు వీళ్లంతా? ఆయుధాలు చేతపట్టి రాజ్యాన్ని కూల్చేస్తామని శపథం చేశారా? కాదు. రాజ్యాన్నేలుతున్న పాలకులను ఎన్నికలలో తుదముట్టించగల శక్తివంతులా? కాదు. రాజ్యం అండతో వేల లక్షల కోట్లు అప్పనంగా కొల్లగొడుతున్న పెట్టుబడిదారులకు ప్రత్యర్థులా? కాదు. మరి ఎందుకు వీళ్లపై ఇంత కక్ష. ఎందుకు వీళ్లపై ఇంత పగ? పట్టపగలు నడిరోడ్డుపై నిట్టనిలువున నరికేయాలన్నంత కసీ? పిట్టల్లా కాల్చేయాలన్నంత క్రోథం? రాజ్యం అండతో, రాజ్యంలో భాగంగా, రాజ్యాన్నే నడిపిస్తున్న హిందూ మతోన్మాద శక్తులకు ఎందుకు? ఎందుకు? ఎందుకు? వీళ్లపై ఇంతటి క్రోథం? ఎందుకంటే... ''చిమ్మచీకటిలో నడుస్తున్న జనాలను కాటేసేందుకు జన వ్యతిరేక భావజాలం అనే పాము మాటేసి ఉంది. మాటేసి ఉన్న పాము కాటేసే సమయంలో ఆ ప్రాంతంలో టార్చ్లైట్ వెలుగు పడింది.. పాము ఉనికి బయట పడింది. అప్పుడేమయ్యింది? ఆ పాముకు పాడె కట్టబడింది!.. టార్చ్లైట్ వెలుగులో తమను కాటేసేందుకు మాటేసి ఉన్న పాము ఉనికిని కనిపెట్టిన జనం దాని ప్రాణం తీసి పాడికెక్కించేశారు... ఇదిగో.. ఈ టార్చ్లైట్లాంటి వాళ్లే ఇప్పుడు చంపబడుతున్న.. జైళ్లల్లో కుక్క బడుతున్న, దాడులకు గురవుతున్న మేథావులు, కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు, న్యాయవాదులు, హేతువాదులు... మానవత్వం ఉన్న మనుషులు.
హిందూ మతోన్మాదం - పెట్టుబడిదారీ వర్గం కలిసి మన దేశాన్ని ఏలుతున్నాయిప్పుడు. కాబట్టే, హేతువాదాన్ని, ప్రశ్నను, పోరాటాన్నీ సహించలేకపోతోంది రాజ్యం. కాబట్టే, గత పాలకుల ఏలికలో ప్రశ్నపై, పోరాటంపై పడ్డ దెబ్బ ఇప్పుడు హేతువాదంపై కూడా పడుతూ ఉంది. నిజానికి, హిందూ మతోన్మాదుల లక్ష్యం కూడా మతం, మత ఉద్ధరణ, మత విస్తరణ కాదు, రాజ్యమే! అవును! రాజ్యం కోసమే మతం. రాజ్యాన్ని హస్తగతం చేసుకునేందుకు, రాజ్యం ద్వారా తమ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకునేందుకు మతాన్ని ఒక బలమైన సాధనంగా వాడుకుంటున్నారు హిందూ మతోన్మాదులు. దేవుడు పేరుతో ఆశ చూపి, దెయ్యం పేరుతో భయం కల్పించి, కర్మ సిద్ధాంతం పేరుతో కనులు, చెవులు, మెదడునూ మూసేసి ఈ దేశంలో మెజారిటీ ప్రజలైన హిందువులను కండ్లున్న గుడ్డివాండ్లుగా, చెవులున్న చెవిటివాండ్లుగా, మెదడున్న మూగవారిగా మార్చి అజ్ఞానపు ఊబిలో ముంచేస్తున్నారు. ఈ ప్రజల మెదళ్లలో విజ్ఞానం నిండనంతవరకు తమకు ఎదురుండదని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలను విజ్ఞానవంతులను చేయగల జ్ఞానం కలిగిన ప్రజానుకూల మేథోవర్గం వారికి లక్ష్యం (టార్గెట్) అవుతూ ఉంది. కాబట్టి, మునుపెన్నడూ లేనంతగా నేటి నరేంద్ర మోడీ హయాంలో హేతువాదులు హత్యలకు గురవుతున్నారు. మేథావులు జైళ్లపాలవు తున్నారు.
ప్రజావ్యతిరేక భావజాలంతో ప్రజల్ని ఏలాలను కున్నవాళ్ళు అనుక్షణం అభద్రతాభావంతో, భయంతో, సందేహంతో, సందిగ్ధంలో ఉంటారు. ప్రజలపక్షం వహించేవాళ్ళ పేరెత్తితే హడలిపోతుంటారు. వాళ్లు నోరెత్తితే ఠారెత్తిపోతుంటారు. ఈ లక్షణాలు పెరిగిపెరిగి చివరికి మృగాలైపోతారు. మనిషినీ మనిషితనాన్ని, మానవత్వాన్నీ సహించలేని స్థితికి చేరుకుని హంతకులుగా మారిపోతారు. ప్రజా వ్యతిరేకులైన హిందూమతోన్మాదుల విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతూ ఉంది. లేకుంటే ఈ నిర్బంధాలేమిటి? హత్యలేమిటి? హత్యాకాండలేమిటి? స్వేచ్ఛా విహంగాల రెక్కలకు ఈ నెత్తుటి గాయాలేమిటి?
హిందూ మతోన్మాదులు శత్రువులను మాత్రమే కాదు. తటస్థులను సైతం సహించలేరు. పూర్తిగా తమ సమర్థకులను తప్ప అన్యులను భరించలేరు. ఉంటే నాతో ఉండు. బతికితే నావాడిగా బతుకు. లేకుంటే నిన్ను వేధిస్తా. వేటాడుతా. వేధిస్తా. వెంటాడుతా. చివరకు అంతం చేస్తారు- ఇదీ హిందూమతోన్మాదుల తీరు. ఈ తీరును సమాజం సహంచదు కదా! కాలం భరించదు కదా..! అయినా సహించే విధంగా, భరించే విధంగా చేయగలుగుతామనుకుంటారు వీళ్ళు. తాము ఎవరినైనా మాయచేయగలమని, మభ్యపెట్టగలమని, దేన్నైనా తాము మసిపూసి మారేడుకాయ చేసి మింగించగలమనీ మనస్ఫూర్తిగా నమ్ముతుంటారు. ఈ నమ్మకాన్ని వారికిచ్చింది మనువాదం. ఈ ధీమా వారికి కలిగించింది కర్మ సిద్ధాంతం. ఈ కర్మసిద్ధాంతం దారిలోనే వాళ్లు కబోదులై పయనిస్తున్నారు. మనల్నీ పయనించమంటున్నారు. ఈ మాటలను ఆలోచన మన్నించదు. జ్ఞానం మన్నించదు. కాబట్టి ఆలోచనాపరులమీద, జ్ఞానం కలిగిన మేథావులమీదా వారికింత పగ. ప్రజలలో అతిచిన్న శాతంగా ఉన్న ఈ ఆలోచనాపరుల అడ్డు తొలగించుకుంటే తమకిక అడ్డే ఉండదని ఇప్పుడు హత్యలకు సైతం తెగబడుతున్నారు.
సంఫ్ు పరివారం నిత్యం జపించే అఖండ భారతంలో హిందూ రాజ్యం అసాథ్యమని వారికి తెలుసు. నిజానికి అది వారి లక్ష్యం కూడా కాదు. అంతే కాదు, హిందూ అన్న పదం తప్ప హిందూ మతం కూడా వారికి అక్కరలేదు. వారు నిర్వచించే హిందూ మతస్తుల హక్కులు, ఆర్థిక అవసరాలు, సామాజిక సమస్యలు, వారు ఎదుర్కొంటున్న సవాలక్ష కష్టాలూ వారికి ప్రధానం కాదు. అవును! హిందూ మతోన్మాదులకు కేవలం 'హిందూ' అన్న పదమే కావాలి. ఆ పదం సృష్టించగల, ఆ పదం సేకరించ గల ఓట్లు కావాలి. ఆ ఓట్లు తెచ్చిపెట్టే అధికారం కావాలి. ఆ అధికారం ద్వారా వారి ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవాలి. కాబట్టే హిందూ మతోన్మాదులు ఎప్పుడూ ప్రజల భౌతిక సమస్యలు పట్టించుకోరు. వాటి పరిష్కారానికి పాటుపడరు. ఈ దేశ చరిత్రలో ఒక్క కార్మిక ఉద్యమంలో, ఒక్క కర్షక ఉద్యమంలో, ఒక్క విద్యార్థి, ఉద్యోగ ఉద్యమంలో, అంతెందుకు సాగరహౌరై సాగిన స్వాతంత్య్ర ఉద్యమంలో హిందూ మతోన్మాదుల ఉనికే మనకు కనిపించదు! ప్రజల భౌతిక జీవితానికి సంబంధించిన ఏ విషయంలోనూ హిందూ మతోన్మాదుల ఉనికి లేకున్నా వారికి నేతృత్వం వహిస్తున్న సంఫ్ుపరివార్ చెట్టుకొమ్మ బీజేపీ ఇప్పుడు మన దేశాన్ని ఏలగలుగుతూ ఉంది! ఇదే పెద్ద ఆశ్చర్యం యిప్పుడు. ఆశ్చర్యానికి మించిన విషాదం యిప్పుడు. ఎందుకిలా జరిగింది? ఎందుకు ఇలా జరుగుతోంది? ఈ హిందూ మతోన్మాద శక్తులను ఎండగట్టడంలో, వారిని ప్రజల నుంచి దూరం చేయడంలో ఎక్కడ మనం విఫలమయ్యాం?
ఎక్కడ విఫలమయ్యాం మనం? ఒక్కమాటలో చెప్పాలంటే హిందూ మతస్తుల నుంచి హిందూ మతోన్మాదులను వేరు చేయడంలో విఫలమయ్యాం మనం. హిందూ మత విశ్వాసం వేరని - హిందూ మతోన్మాదం వేరనీ తెలియచెప్పడంలో వెనుకబడ్డాం. వాస్తవానికి హిందూమత విశ్వాసకులంతా హిందూ మతోన్మాదులను అనుసరించడం లేదు సరికదా, కనీసం అంగీకరించడం లేదు. హిందూమత విశ్వాసకులు హిందూ మతోన్మాదులను భారంగా భావిస్తున్నారే తప్ప, వారి ఎడల విరక్తితో ఈసడించుకుంటున్నారే తప్ప వారి చర్యలను అంగీకరించడం లేదు. ఇందుకొక గొప్ప నిదర్శనం ప్రఖ్యాత కన్నడ నాటక కర్త ఎస్. రఘనందన్.
రఘనందన్ హిందూమత విశ్వాసకుడు. శివభక్తుడు. అయినా ఆయన మహౌన్నత మానవతావాది. ప్రజా పక్షపాతి. కాబట్టే కేంద్రప్రభుత్వ సంగీత, నాటక అకాడమీ మంగళవారంనాడు తనకు ప్రకటించిన ప్రతిష్టాత్మక అవార్డును నిర్ద్వందంగా తిరస్కరించారు. 'ఈ దేశంలో ప్రజానుకూల మేధావులు, హేతువాదులు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, లాయర్లపై జరుగుతున్న దాడులు, మూకదాడులు, నిర్బంధాలు, హత్యల నేపథ్యంలో తాను ఈ అవార్డును స్వీకరించలేక పోతున్నాననీ, మిమ్మల్ని నొప్పించినందుకు నన్ను మన్నించమనీ అకాడమీ పెద్దలను అభ్యర్థిస్తూ, చివరగా.. ''అందరినీ శివుడు కరుణించుగాక'' అంటూ తన తిరస్కార బహిరంగ లేఖను ముగించారు.
నా ప్రియమైన హిందూ మత విశ్వాసకులారా! దైవభక్తులారా! రఘనందన్ను ఆదర్శంగా తీసుకోండి. మీ మత విశ్వాసానికి, దైవభక్తికీ నిండు మానవత్వాన్ని జోడించండి. హిందూ మత విశ్వాసకుల నుంచి, దైవ భక్తులనుంచి హిందూ మతోన్మాదులను దూరం కొట్టండి. ఈ దేశాన్ని కాపాడండి.
- కోప్ర
సెల్: 6301289321