Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవ నాగరికత సృష్టించిన అత్యంత భయంకర ఆయుధం ప్రయోగంతో తన విధ్వంసక రూపాన్ని ప్రదర్శించిన రోజు ఆగస్టు ఆరు. 1945 ఆగస్టు 6 ఉదయం 8.16 నిమిషాలకు అమెరికా ప్రయోగించిన తొలి అణుబాంబు (లిటిల్ బారు) జపాన్లోని హిరోషిమా నగరంలో పాఠశాలలకు వెళుతున్న చిన్నారులతో సహా అప్పటికప్పుడు 90,000 మంది ప్రాణాలు హరించింది. 35,000 మందిని క్షతగాత్రులను చేసింది. మరో మూడు రోజులకు ఆగస్టు 9వ తేదీ ఉదయం 11.02 గంటలకు జపాన్లోని మరో నగరం నాగసాకీపై అమెరికా వేసిన రెండో బాంబు (ఫ్యాట్ మాన్) సుమారు 70,000 మంది ప్రాణాలు తీసింది. ప్రపంచంలో ఇప్పటి వరకు మానవులపై ప్రత్యక్షంగా ప్రయోగించబడిన అణు బాంబులు ఈ రెండే. ఇవి సృష్టించిన విధ్వంసం ప్రయోగించబడిన ఆ క్షణానికే పరిమితం కాలేదు. ఆ తరువాత నెలలు, సంవత్సరాల పాటు ప్రజలు చనిపోతూనే ఉన్నారు. కాలిన గాయాలు, అణు రేడియేషన్ ప్రభావంతో క్యాన్సర్ వంటి వ్యాధులతో మరో లక్షన్నర మందికి పైగా మరణించారు. కొన్ని లక్షల మంది అంగ వైకల్యానికి గురయ్యారు. అణుధార్మికతకు గురైనవారి బిడ్డల్లో, వారి తరువాతి తరాల్లో కూడా దాని ప్రభావం కనిపిస్తూనే ఉంది.
ప్రపంచమంతటా బాంబులే
హిరోషిమా, నాగసాకీ తరువాత ప్రపంచంలో మరెక్కడా అణు బాంబులను ప్రయోగించ లేదు. కానీ ప్రపంచంలోని 9 దేశాల వద్ద ప్రస్తుతం సుమారు 16,000 వరకు అణు బాంబులు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఏ క్షణంలోనైనా పేల్చడానికి సిద్ధంగా సుమారు 4,000 బాంబులు, మిగిలినవి రిజర్వులో ఉన్నాయి. హిరోషిమా, నాగసాకీలతో పోలిస్తే ఈ బాంబుల ఒక్కోదాని విధ్వంసక సామర్ధ్యం కొన్ని వందల రెట్లు ఎక్కువ. అంటే ఈ బాంబులన్నీ పేలితే భూగోళం ఒక్కసారి కాదు, వందల సార్లు భస్మీపటలమవుతుంది. అణు బాంబులు ప్రయోగించగల సాధనాలు కూడా ఆధునికమయ్యాయి. నేడు యుద్ధ విమానాలే కాదు, అణు బాంబులను 10,000 కిలోమీటర్లకుపైగా మోసుకుపోయి కచ్చితంగా లక్ష్యంపై ప్రయోగించగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, అణు జలాంతర్గాములు కొన్ని వేల సంఖ్యలో ప్రపంచమంతటా మోహరించబడి ఉన్నాయి.
ఆయా దేశాల వద్ద ఉన్న అణుబాంబులు నేడు ఒక దేశంపై మరొకటి ఎక్కుపెట్టి ఉన్నాయి. అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధం సంభవిస్తే అది ఎంతటి వినాశనానికి దారితీస్తుందో ఊహించలేం. అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లో పడితేనో? లేక మతోన్మాద శక్తుల చేతుల్లో పడితేనో? కలిగే ప్రమాదం కూడా నేడు ప్రపంచానికి పొంచి ఉంది. ఇప్పటికిప్పుడు ఉగ్రవాదుల చేతుల్లో అణ్వాయుధాలున్నాయని చెప్పలేం గానీ మతోన్మాద శక్తుల చేతుల్లోకి, ఫాసిస్టు ఉన్మాదాన్ని ప్రభోదించే శక్తుల చేతుల్లోకి ఈ ఆయుధాలు చేరుకున్నాయని చెప్పగలం. ఉదాహరణకు పాకిస్థాన్లో ఇస్లాం ఉన్మాదం, భారత్లో హిందూత్వ ఉన్మాదం ప్రభోదించే శక్తులు రాజ్యమేలుతున్నాయి. ఈ శక్తులు అధికారంలో ఉన్నా, లేకపోయినా నిత్యం ఒకదానిపై మరొకటి నిప్పులు చెరుగుకుంటాయి. ఆ దేశాల్లో మైనారిటీలపై దాడులకు తెగబడుతుంటాయి.
నేడు ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం పశ్చిమ దేశాల్లో ఉన్మాద శక్తులకు ఊతం ఇస్తోంది. అమెరికాలో జాత్యహంకారి డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న ఉన్మాదపూరిత ప్రకటనలు ప్రపంచాన్ని మరోసారి యుద్ధం వైపు తీసుకెళ్లే ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. చైనా జలాల్లో భారీ 'వాయిదా' యుద్ధ నౌకను ప్రవేశ పెట్టడం, ఇరాన్ వైపు యుద్ధ విమానాల వాహక నౌక 'అబ్రహం లింకన్' తీసుకు పోవడం ఇవన్నీ కూడా మరోసారి ప్రపంచానికి అణు యుద్ధ ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం మరింత ప్రమాదకరమైంది. 1987లో అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ నాటి సోవియట్ యూనియన్ నేత మిఖాయిల్ గోర్బచేవ్ మధ్య కుదిరిన అణు ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేస్తున్నట్టు రెండు రోజుల క్రితమే ప్రకటించాడు. అంతేకాదు చైనా కూడా ఆ ఒప్పందం లోకి వస్తేనే ఒప్పందం కొనసాగుతుందనీ లేనిచో ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించాడు. అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో ఇటీవల ఓ ప్రకటన చేస్తూ మొత్తం ఆసియా ఖండంలో అణు క్షిపణులు మోహరిస్తామని చెప్పడం అమెరికా అహంకారాన్ని తెలియజేస్తుంది. ఆర్థికంగా దిగజారిపోతున్న అమెరికా, యుద్ధం ద్వారా ప్రపంచం మీద తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలు మరోసారి ఈ ప్రపంచానికి అణు యుద్ధ ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి.
అణు రియాక్టర్లు కూడా బాంబులే
ప్రయోగానికి సిద్ధంగా ఉన్న అణు బాంబులతోనే కాదు. విద్యుత్తు కోసం ప్రపంచమంతటా నెలకొల్పబడిన అణు రియాక్టర్లతో కూడా భూగోళానికి అణు ముప్పు పొంచి కూర్చుంది. 1950 దశకం తరువాత ఇప్పటివరకు అణు రియాక్టర్లలో జరిగిన వందకుపైగా ప్రమాదాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నిజానికి ప్రతి అణు రియాక్టర్ కూడా ఒక అణు బాంబే.
మన దేశానికి ప్రమాదం
ఈ మధ్య మనలాంటి వర్ధమాన దేశాలకు మరోరకం అణు ముప్పు ఏర్పడింది. అది అమెరికా, రష్యాల వద్ద మిగిలిపోయిన అణు వ్యర్ధ పదార్ధం నుంచి. 1991లో సోవియట్ విచ్ఛిన్నం తరువాత అమెరికా, రష్యాలు అణ్వాయుధాల తగ్గింపు ఒప్పందాలు చేసుకున్నాయి. దాంతో రెండు దేశాలు అణు బాంబులను గణనీయంగా తగ్గించుకున్నాయి. తగ్గించుకున్న అణు బాంబులను పగలగొట్టడం వల్ల అణు పదార్థం పెద్ద ఎత్తున మిగిలిపోయింది. ఈ పదార్థాన్ని పారేయాలంటే కుదరదు. అణు వ్యర్థాలను భద్రంగా ఉంచకపోతే దాని నుంచి వచ్చే అణు ధార్మికత భూ, జల, వాయు పరిసరాలను కాలుష్యం చేస్తుంది. మానవజాతికే అపార నష్టం కలిగిస్తుంది. అలాగని వ్యర్థాలను లక్షల సంవత్సరాల పాటు భద్రంగా కాపాడడం చాలా వ్యయ ప్రయాసలతో కూడిన పని. అందువల్లనే అమెరికా, రష్యాలు పోటీలు పడి మన దేశంలో అణు రియాక్టర్లు నెలకొల్పడానికి ముందుకొస్తున్నాయి.
అమెరికా మన దేశంతో 2005లో అణు ఒప్పందం చేసుకుంది. భారత దేశం అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకాలు చేయలేదన్న నెపంతో అప్పటి వరకు తీవ్రమైన ఆంక్షలు పెట్టిన అమెరికా ప్లేటు ఫిరాయించి మనకు అణు పదార్థాలు, అణు రియాక్టర్లు సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక ఆ దేశ ప్రయో జనాలే మినహా మన దేశ ప్రయోజనాలు లేవు.
మన వేళ్లతో మన కండ్లు...
అణు ఒప్పందం ద్వారా అమెరికా మన వేళ్లతో మన కండ్లనే పొడవడానికి సిద్ధమైంది. మన దేశంలో అమెరికా ప్రయివేటు కంపెనీలు రియాక్టర్లను నెలకొల్పుతాయి. అయితే సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత దేశానికి యివ్వవు. అంటే ఆ రియాక్టర్లపై మన దేశానికి అదుపు ఉండదు. ఆ రియాక్టర్లలో ప్రమాదం జరిగితే ఒకే సారి వేలాదిమంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని కంపెనీలకు తెలుసు. అందువల్లనే అటువంటి ప్రమాదాలు జరిగేటప్పుడు నష్టపరిహారాన్ని తమ కంపెనీలు ఇవ్వకుండా భారత ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించేట్టు మన ప్రభుత్వంతోనే పార్లమెంటులో అణు ప్రమాదాల నష్టపరిహార చట్టం చేయించారు. అంటే లాభాలొస్తే అమెరికా కంపెనీలవీ, నష్టాలు వస్తే భారత ప్రభుత్వానిదీ (ప్రజలది) అన్నమాట.
అమెరికా ఒత్తిళ్లకు లొంగి నాటి కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం అమెరికా అణు షరతులకు అంగీకరించి ఒప్పందం మీద సంత కాలు చేసింది. ఆ ఒప్పందాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి పూనుకుంది నేటి బీజేపీ ప్రభుత్వం. అందువల్ల భారత ప్రయోజనా లను అమెరికాకు తాకట్టు పెట్టడంలో కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఒకటే అన్న విషయాన్ని ఈ అణు ఒప్పం దాలు తెలియజేస్తున్నాయి.
- ఎస్. వెంకట్రావు
సెల్: 9490099333