Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగమ్మ పడగమీద నల్లని అందాల గీతల్లాంటి వంకలు తిరిగిన రోడ్డు మార్గంగుండా, నల్లమల అడవిలోకి ప్రవేశిస్తున్న సందర్భంలో నా మిత్రుడు ఓ అనుభవం పంచుకున్నాడు. గతంలో చెంచు పెంటల పరిశోధన కోసం వచ్చినప్పుడు చారు తాగాలనిపించి ఓ పెద్దాయనని ఆవు పాలు పిండుకుని చాయి చేసుకోమా తాతా..! అని అడిగితే, ఈ భూమ్మీద మనుషులు తప్ప వేరే జంతువు పాలు తాగే జీవి ఏదీ లేదు. మనిషి పాలు మనిషి తాగుతున్నట్టే, ఆవు పాలు ఆ లేగదూడే తాగాలి. మనం వాటి పాలు తాగడం ఎందుకయ్యా అన్నాడట. ఇంతటి ప్రకృతిసిద్ధంగా బతుకుతున్న వారి సహజ జీవనాన్ని ఛిద్రం చేసి, జీవిత వ్యవస్థను చిన్నాభిన్నం చేసే కుట్రను కేంద్ర ప్రభుత్వం రచించింది. పగబట్టిన ఆ పథకరచనలో భాగంగానే దశాబ్దకాలంగా కాల నాగులవలె నల్లమలలో చొరబడ్డారు. తిర్మలాపూర్లో 2012లో ఉచితంగా బోర్లు వేస్తామని అమాయక గిరిజనులైన చెంచులను మభ్యపెట్టి వారి పొలాల్లో రాత్రికి రాత్రి బోర్లు వేయడం మొదలెట్టీ, వారం రోజుల్లో నలభై బోర్లేశారు. అడిగితేనే ఏదీ యివ్వని ప్రభుత్వం అడగకుండానే బోర్లు వేయడమేంటని అనుమానమొచ్చి ఆ చెంచు రైతులు తిరగబడి బోర్లు వేయడం ఆపారు. వేసిన బోర్లు పూడ్చేసారు. పగబట్టేది పాములు కాదు. ప్రభుత్వాలు మాత్రమే పగబడతాయి అనేది నిత్యం నిరూపితమవుతూనే ఉందిక్కడ. అందుకే తన రాజ్యంలో తనే ఒక దొంగలా ప్రవర్తించి, తన ప్రజలనే మోసం చేయపూనుకుంది ప్రభుత్వం. ఇంతకన్నా నీచత్వం యింకొకటి ఉండదు. తను చేస్తున్న పని తప్పని అంతకు మించిన ముప్పనీ తనకు తెలుసు. అయినా కావాలనే దొంగదారిన తన ప్రజలను మోసగించి ఈ విధ్వంసానికి ప్రభుత్వమే పూనుకుంటుందని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహారణేమీ అక్కరలేదు.
ప్రజల వ్యతిరేకత రావడంతో అమ్రాబాద్, వంకేశ్వరం, మన్ననూర్ గ్రామాలల్లోని ప్రభుత్వ భూమైన కరెంటు సబ్స్టేషన్లలో వేల ఫీట్లు బోర్లు వేసి శాంపిల్స్ సేకరించి తీసుకెళ్ళారు. వెళ్తూ వెళ్తూ ఆ బోర్లను ఎవరూ పూడ్చివేయకుండా కాంక్రీట్తో చిన్న గోడ కట్టి దానికి ఇనుప డబ్బా బిగించి, డబ్బుల కట్టలున్న అల్మారాకు తాళం వేసినట్టే వేసుకుని వెళ్ళారు. తీసుకెళ్లిన శాంపిల్స్తో తాపీగా తమ పని ముగించుకుని అటవీ, పర్యావరణ శాఖా అనుమతితో జూన్ 19న సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖ పరిశోధనకు అనుమతినిస్తూ రాష్ట్రానికి ఉత్వర్వులు జారీ చేసింది.
కేంద్ర అటవీ మంత్రిత్వశాఖా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ సురేష్ కుమార్ ప్రకటనతో నల్లమల వేడెక్కింది. లక్షల మెదళ్ళు తక్షణ లక్ష్యాల గురించి మదనపడుతున్నాయి. నేలను తూట్లు పొడిచి విష ఖనిజాన్ని బయటకు తీయడం గురించి భయపడుతున్నాయి. ఈ క్రూర చర్యకు అటవీశాఖ ఆమోదం తెలపడంపై ఆక్రోశిస్తున్నారు. పచ్చని నల్లమల అడవి గుండెల్ని పగలజీరి యురేనియం తీయగల కర్కశ కాషాయదారి మోడీపై చెంచుపెంటలు భగ్గున మండుతున్నాయి. మా కాలి కింది నేలలో యురేనియమే కాదు, మా కడుపులోనూ యురేనియంకు మించి మండే కోపం మసులుతోంది. ముందు పేగుల్ని చీల్చండి ఆ తర్వాతే యురేనియం పరిశోధన మొదలెట్టండీ.. అంటున్నారు నల్లమల ప్రజలు. ఈ అడవి మాది. మా తాత ముత్తాతల, తరతరాల నుంచి ఇక్కడే ఉండి ఈ అడవిని కాపాడుకుంటున్నాము. ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఈ అడవిని ఎడారిగా మార్చుతామంటే మేము ఒప్పుకోము. పులులు, కొండచిలువలు, ఎలుగుబంటులతో పోరాడుతూ బతుకుతున్నవాళ్ళం.. యురేనియం అన్వేషణ అని వస్తే తన్ని తరిమేస్తాం అంటున్నారు ప్రజలు.
తీక్షణమైన శాస్త్ర పరిశోధనలు మానవాళికి విషాదాన్ని తెచ్చిపెడతాయి. సామూహిక విధ్వంసానికి కారణమవుతాయి అంటాడు అణు శాస్త్రవేత్త ఐన్ స్టీన్. అయినా వినకుండా అణువిద్యుత్, అణు ఇంధనం, అణుబాంబుల తయారీకి ఉవ్విళ్లూరుతున్న ప్రభుత్వాల వ్యాపార, యుద్ధదాహమే ఈ పర్యవసానాలకు మూలం. జార్ఖండ్ రాష్ట్రం జాదూగూడ యురేనియం ప్లాంట్ అనుభవాలను అనేకమంది శాస్త్రవేత్తలు మన ముందు పెడుతున్నారు. ఆ ప్రాంతంలోని ప్రజలకు దాదాపు యాభైవేల మందికి పైగా క్యాన్సర్ బారిన పడ్డారు. అక్కడి గర్భవతుల్లో ఎక్కువమందికి అబార్షన్లవడంతో అక్కడి భవిష్యత్తరం పుట్టక ముందే చచ్చిపోతున్న తీరు హృదయ విదారకం. ఏపీలోని కడప జిల్లాలో తుమ్మలపల్లిలో యురేనియం వెలికితీత 2013 నుంచి ఊపందుకుంది. పులివెందుల నియోజకవర్గంలో అనేక గ్రామాలు అధ్వాన్న పరిస్థితుల్లోకి నెట్టబడ్డాయి. తుమ్మలపల్లితో పాటు కె.కొట్టాల, భూమయ్యగారిపల్లె, రాచకుంటపల్లె, కనుంపల్లి, మబ్బుచింతలపల్లి లాంటి గ్రామాలైతే ఇంకా తీవ్ర ప్రమాదంలోకి నెట్టబడ్డాయి. భూమి గుల్లబారి పంటలు పండని పరిస్థితి ఏర్పడింది. భూమిపై వ్యర్ధాలతో కూడిన తెల్లమేట ఏర్పడి వందల ఎకరాల్లో పంటలు పండని పరిస్థితి తలెత్తింది. వెలికితీసిన యురేనియం శుద్ధికి చాలా నీరు అవసరమవుతుంది. అందుకు వేలాది బోర్లు వేసి భూగర్భ జలాలు తోడేయడం వలన ఇతర ప్రాంతాల రైతుల బోర్లు ఆగిపోయాయి. ఆ శుద్ది చేసిన వ్యర్ధాల వలన చెరువు, కుంటల నీరు కలుషితమయ్యాయని అక్కడ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇక మనుషులకు విపరీతమైన దురద, దద్దుర్లు వస్తున్నాయి. కొత్తగా అనేకమంది క్యాన్సర్ బారినపడ్డారు. శ్వాసకోశ, మూత్రపిండాల సమస్యల్లాంటి ఏడు రకాల వ్యాధులు సంభవిస్తున్నట్టు ఆరోగ్య శాస్త్రవేత్తలు అక్కడ గుర్తించారు. నీటి కాలుష్యం తీవ్రమవడం మూలంగానే ఇలాంటి దుష్పరిణామాలు జరుగుతున్నాయని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్లో ప్రస్తావించిన ఈ పరిశోధన అనుభవాలు మన కండ్ల ముందు ప్రమాదాలై హెచ్చరిస్తున్నాయి.
ఇన్ని ఘోర దారుణాలన్నీ యురేనియం వెలికితీయడం చెలగాటమని వివరిస్తున్నాయి. గాయాలు వెంటాడుతున్నాయి. ప్రాణాలు వేటాడబడుతున్నాయి. తెలిసి తెలిసీ యిదంతా చేస్తున్నది బుద్దిలేని క్రూర మృగాలు కాదు. దోపిడీ బుద్ది కలిగిన కనికరం లేని పాలకులు. నల్లమలను బ్లాకులుగా విభజించి తోడేయజూస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో 76 చ.కి.మీ.లు, నల్లగొండ జిల్లాలో 7 చ.కి.మీ.లు మొత్తం 83 చదరపు కి.మీ.లు నాలుగు బ్లాకులుగా చేసి ఇప్పటికే హద్దులు కూడా పెట్టారు. ఓపెన్ కాస్ట్ జేసి యురేనియం తీయడం వలన చుట్టూ కొన్ని కిలోమీటర్ల దూరం అణుథూళి ఆవరిస్తుంది. ఊపిరితిత్తులను, పర్యావరణాన్ని పిప్పిచేసి కణం కణం తినేస్తుంది. పచ్చని నల్లమలను పాడుచేసి పల్లేరుగాయలు కూడా మొలవకుండా చేస్తుంది. మహబూబ్నగర్, నల్లగొండ, కర్నూల్, ప్రకాశం, గుంటూర్ జిల్లాలపై రేడియేషన్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. చేపకు ఎర వేసినట్టు, విధ్వంసం చేయాలనుకున్న ప్రతీ చోట అభివృద్ధిని ఎరగా వేసి ప్రచారం చేయడం పరిపాటిగా మారింది. ఇక్కడ కూడా అదే జరుగుతున్నది. ప్రాణాల్ని తీయటాన్ని కూడా ప్రజాభివృద్ధిగా అభివర్ణించగల దుర్మార్గ పాలకులున్న దౌర్భాగ్య దేశం మనదేనేమో.!
ఇప్పటికే విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు, సాహిత్య సంఘాలతో పాటు కమ్యూనిస్టులు యురేనియం నల్లమల మెడకు ''ఉరే''నియం అంటూ అనేక శాస్త్రీయాధారాలు చూపిస్తున్నారు. అనేకమంది వ్యక్తులు, ప్రజాస్వామికవాదులు సేవ్ నల్లమల. స్టాప్ యురేనియం మైనింగ్ అంటూ నినదిస్తున్నారు. ఆ క్రమంలోనే నల్లమలకు వస్తున్న కోదడరామ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టు అమరుల వారోత్సవాలు ఉన్నందువల్ల రక్షణకోసం అరెస్టు చేశామని ప్రకటించడం తాటిచెట్టు ఎందుకు ఎక్కావు.. అని అడిగితే దూడ గడ్డికోసం అనే సామెతలా ఉంది. పదవులనుభవిస్తున్న ప్రభుత్వ ప్రతినిధి కూడా కాదు. అధికారిక కార్యక్రమంలో రాలేదు. ప్రజలను అతలాకుతలం చేస్తున్న సమస్య కోసం వచ్చారు. ఇదే కృష్ణ పరీవాహక ప్రాంతం దేవరకొండ దగ్గర లంబాపూర్, పెద్దగట్టులలో దశాబ్ద కాలం క్రితం యురేనియం ప్లాంట్ ఏర్పాటును తరిమిన అనుభవం కూడా ఇక్కడి ప్రజలకు, ప్రజాసంఘాలకు ఉన్నది. అరెస్ట్ చేస్తామంటే ముందే చెప్పండి ఎక్కువ మంది వస్తామనే నైజం ఇక్కడ ఉన్నది. కాబట్టి అరెస్టులతో బయపెట్టజాలరు. తెలంగాణ పోలీసుల అత్యుత్సాహం చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వం పట్ల కూడా అనుమానం వ్యక్తమవుతోంది. ఒక పక్క నల్లమలలో ప్రజలు ఆందోళనలో ఉంటే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ప్రకటన కూడా చేయలేదు. టీఆరెఎస్ ప్రభుత్వం ఎటువైపో తేల్చుకోవాలి. రాష్ట్ర ప్రజల వైపా? కేంద్ర ప్రభుత్వం వైపా? కపటం ఎరుగని ప్రజల వైపా? కార్పొరేట్ మైనింగ్ కంపెనీల వైపా? ఎటువైపో ప్రకటించకుండా తటస్థంగా ద్వంద వైఖరితో ఉండాల్సిన సమయం కాదిది. ప్రజా సంఘాలు ప్రజలను చైతన్యం చేస్తుంటే, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తూ ఉండరాదు. ఇలాంటి పరీక్షా సమయంలోనైనా ప్రజాప్రతినిధులమని గుర్తు తెచ్చుకుని ప్రజలతో కలిసి పోరాడాలి. ప్రజలకు ధైర్యమిచ్చేందుకు లేదా దండు గట్టేందుకు అక్కడి ఎమ్మెల్యేలు మంత్రులు ఎన్ని పెంటలు తిరిగారు? ఎన్ని గ్రామాల్లో మీటింగ్లు పెట్టారు? ఓట్లకు, పదవులకు మీరు. సమస్యలు తీర్చాల్సింది ప్రజాసంఘాలా? ముందు మీరెటువైపో ప్రకటించండి.
అమ్మ కడుపును తొవ్వి ఆనందించే వాడు క్రూరుడు. జన సమూహాన్ని అంతం చేసేవాడు నరహంతకుడు. పకృతిని పాడు చేసి పండుగ చేసుకునేవాడు ప్రకృతీఘాతకుడు. ఆ రకంగా తన నిర్ణయంతో నల్లమలకు ఉరితాడు వేస్తున్న మోడీ విధ్వంసకుడే కాదు హంతకుడు కూడా అని వారి పరిభాషలో చెంచులు ఆగ్రహిస్తున్నారు. అసహజమైన పద్ధతిలో చేసే ఏ చర్య అయినా ప్రతి చర్యకు గురికాక తప్పదు. దానికి అమాయక చెంచులను, ఇక్కడి ప్రజలను బలిచేయడం ఎందుకు? విధ్వంసానికి తప్ప అభివృద్ధికి పనికిరాని యురేనియం తొవ్వడం ఎందుకు? ప్రకృతికి మనమేమి ఇవ్వనప్పుడు, అడవికి, ఇక్కడి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడని యురేనియం విషాన్ని బయటకు తీయడానికి అడవినెందుకు అగ్నిగుండంగా మార్చాలి? మనిషి పాలను ఆవు తాగనప్పుడు, మనిషి ఆవు పాలు తాగి లేగ దూడలకు లేకుండా ఎందుకు చేయాలి? అని అక్కడి అమాయక అడవి బిడ్డలైన చెంచులు అడిగే ప్రశ్నలకు ఏ అభివృద్ధి సమాధానం చెప్పగలదు?
- ఎం. విప్లవకుమార్
సెల్: 9030546896