Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాద్గిరి గుట్ట. నడినాత్రి గుల్లె నర్సిమ్మ సామికి మేల్కొచ్చింది. లచ్చిందేవి కండ్లబడలేదు. ఎప్పుడు పక్కపంటే ఉండేటి పెండ్లాం కానరాకుంటె గాయినకు ఎటూ సుత్రాయించలేదు. యాడికి బోయుంటాదా అని గాయిన ఒక్క తీర్గ సొంచాయించిండు. ఎంతగనం సొంచాయించినా పాయిదలేకుంట బోయింది. ఇగ దాంతోని లచ్చిందేవిని లెంకెతందుకు గాయిన గుల్లె కెల్లి ఎల్లిండు.
నర్సిమ్మ సామి మొగులు మీదికెల్లి బో బట్టిండు. యాద్గిరి గుట్ట దిక్కు వొస్తున్న నారదుడు గాయినకు ఎదురొచ్చిండు.
''నేను మీ తాన్కి వొస్తుంటె మీరు ఎటు బోతున్నరు సామీ'' అని నారదుడు అడిగిండు.
''నడినాత్రి మేల్కొచ్చి జూస్తె లచ్చిందేవి కానరాలేదు. గామెను లెంకెతందుకు బోతున్న. గామె యాడికి బోయిందో సమజైతలేదు.''
''మీ ఇద్దరి నడ్మ పంచాయితి ఏమన్న అయ్యిందా''''పంచాయితి గాలేదు. గని మా సుట్టాలను గీ సర్కార్ ఉన్న జాగలకెల్లి ఎల్లగొట్టెటట్లు గొడ్తున్నది. అన్ని ఎర్కున్నా మీరు సప్పుడు జేస్తలేరు అని పండుకొనే ముంగట లచ్మి నాతోని అన్నది''
''మీరేమన్నరు?''
''ఇంతకు మీ సుట్టాలెవ్వరు అని అడిగిన నేను గట్ల అడ్గంగనే గామె మొకం మాడ్సుకొన్నది. నాతోని మాటలు బంద్ జేసింది. నా మీద అల్గి యాడికో బోయింది'' అని నర్సిమ్మ సామి జెప్పిండు.
''యాడికో ఎందుకు బోతది. తల్లి గారింటికి బోతది. గామె తల్లిగారిల్లి నల్లమల అడ్విల ఉన్నది'' అని నారదుడు అన్నడు.
''లచ్చిందేవి తల్లిగారిల్లు అడ్విలనా!''
''మీ యాదిమర్సినట్లు గొడ్తున్నది. రాముని అవుతారంల సీత మీ పెండ్లాం. కిష్నుని అవుతారంల రుక్మిని నీ పెండ్లామైతె నర్సిమ్మవతారంల చెంచులచ్మి మీ పెండ్లాం. చెంచులు నల్లమల అడ్విల ఉంటరు. గసువంటప్పుడు చెంచులచ్మి తల్లిగారిల్లు అడ్విలనే ఉంటది గదా''
''గిప్పుడు కుల్లకుల్ల అంత సమజైంది నారదా! ఇంతకు చెంచులను నల్లమల అడ్వులల్లకెల్లి ఎందుకు ఎల్లగొద్దా మనుకుంటున్నరు. శాపలకు చెరువెసుంటిదో చెంచులకు అడ్వి అసుంటిది గదా''
''అమ్రబాద్ ఇలాకల 20వేల టన్నుల ఏక్ నంబర్ యురేనియం ఉన్నదట బూమిల ఉన్నగా దాన్ని మీద్కి దీసెటందుకు 4000 బోర్లు ఏస్తమంటున్నరు. యురేనియం కోసం తొవ్వెటప్పుడు చెంచులను అడ్విల ఉండనియ్యరు.''
''బూమిల ఉన్న యురేనియంను మీద్కి దీసుట్ల పాయిద ఏమున్నది? గాదాన్ని ఎవ్వరు దీపిస్తున్నరు?'' అని నర్సిమ్మ సామి అడిగిండు.
''మోదీ సర్కార్ ఇచ్చిన పర్మిసన్ తోని యురేనియంను తీస్తున్నరు. గా దాని తోని కరెంటు తయ్యారు జేసి పతొక్క పల్లెటూర్ల శీకటి లేకుంట జేస్తమని బిజెపి సర్కార్ జెప్తున్నది. యురేనియంల ప్లుటోనియమున్నది. గా దానితోని బాంబులు గూడ జేస్తరు'' అని నారదుడు జెప్పిండు.
''యురేనియంతోని పాయిద ఉండంగ లొల్లెందుకు బెడ్తున్నరు''
''యురేనియం దుమ్ముతోని గాలి ఇసమైతది. నీల్లు ఇసమైతయి. చెట్ల ఆకులు ఇసమైతయి. గా ఆకులను తినేటి పసులు సచ్చిపోతయి. యురేనియం దీసేటి ఇలాకకు దగ్గర్లనే కిష్ననది ఉన్నది. గా నది నీల్లు గుడ్క ఇసమైతయి. నాగార్జున్ సాగర్ నీల్లు ఇసమైతయి. రొండు తెలుగు రాస్ట్రాలల్ల తాగునీల్లు సాగునీల్లు ఇసమైతయి. యురేనియం చెడ్డ అసర్తోని పట్నం లస్కర్ల జెనమే గాకుంట గుంటూరు; విజయవాడ; అమరావతి జెనాలు రోగాల ఇన్పు కాగలిల ఇర్కపోయి తన్లాడ్తరు. నల్లమలల ఉన్న పెద్ద పులులు, చిర్తపులులు, గుడ్డేలుగులు, జింకలు, పాములు అసుంటియి కండ్లబడకుంట బోతయి. చెట్ల గుడ్క నాశనమైతయి. యురేనియం అసర్ 150 కిలో మీటర్ల దాంక ఉంటది. ఇగ దాంతోని దచ్చిన తెలంగాన; ఉత్తర ఆంద్ర జెనాలకు క్యాన్సర్; కిడ్నీలు చెడిపోవుడు ఆసువంటి రోగాలొస్తయి'' అని నారదుడు జెప్పిండు.
''గింత జనం నస్టముండ బట్కె లచ్చిందేవి చెంచుల దిక్కు కెల్లి కొట్లాడతందుకై బోయినట్టు గొడ్తున్నది. చెంచులను ఆల్లు ఉండేటి ఇలాకల కెల్లి ఎల్లగొట్టె తందుకు సర్కార్ రడీ అయితుంటె గాల్లు ఏమంట లేరా?'' అని నర్సిమ్మ సామి అడిగిండు.
''బూమిల ఉన్న దాంతోని బూమి మీదున్నోల్లను సంపుతరా? అని ఒక చెంచు సర్పంచి అడిగిండు. చిన్నోల్లమంత గల్సి ఒక పెద్దోన్ని ఎన్నిక జేస్కున్నం. ఎందుకెన్నిక జేస్కున్నం. మాకేమన్న అయితె మాతోని ఉంటడని గిప్పుడు మాకు కస్టమొస్తున్నదంటె పెద్దోడే అడ్డం దిర్గాలె గదా! తిర్గుతలేడు. ఇగ మేమేం జేస్తం. గానికే అడ్డం దిర్గుతం అని చెంచులు అంటున్నరు.''
''యురేనియం కోసం నల్లమల గుండెలు చీరొద్దనుకుంట ముక్యమంత్రి కెసిఆర్ సంటర్కు అడ్డం దల్గుత లేడా?''
''ఇయ్యాల్రేపు కెసిఆర్సంటర్ అస్సరు అంటె అదే సహి-దులా అంటె ఇదే సహి అంటున్నడు. ఆర్టీఐ మీద సంటర్ పార్లమెంటుల బెట్టిన బిల్లుకే గాకుంట కశ్మీర్ను 'కేంద్ర పాలిత ప్రాంతం' జేసెతందుకు మాట్లాడ్త లేడు'' అని నారదుడు జెప్పిండు.
''ఎందుకంటవు''
''మోదీ తందాన అంటె తానె తందాన అనకుంటె ఎమ్మెల్యేలను గొని కర్నాటకల కుమారసామి సర్కార్ను పడగొట్టిన తీర్గ బిజెపి టిఆర్ఎస్ ఎమ్మెల్యేల గొని యాడ తెలంగాన సర్కార్ను పడగొడ్తడోనని కెసిఆర్ బుగులు బడ్తున్నడు. లచ్మన్, కిసన్రెడ్డి అసువంటి బిజెపి లీడర్లు తెలంగానల మా సర్కారే వొస్తదని ఊకూకె అంటుంటె కెసిఆర్కు అన్మానం ఎక్వైంది. మల్లగలుస్త'' అన్కుంట నారదుడు మొగులు మీద్కి బోయి లచ్చిందేవి కోసం నల్లమలల ఉన్న చెంచు పెంటలకు నర్సిమ్మ సామి బోయిండు.
పొద్దటీల కెసిఆర్ నాస్త జేసిండు. చారు దాగి పేపర్లల్ల వొచ్చిన వార్తలు సద్వుకుంట గూసున్నడు. ఇంతల ఒక టిఆర్ఎస్ లీడర్ ఉరుక్కుంట గాయిన తాన్కి వొచ్చి-
''అన్నా యాద్గిరి గుట్ట గుల్లె నర్సిమ్మ సామే గాకుంట లచ్చిందేవి గుడ్క కండ్లబడ్తలేదంట'' అని జెప్పిండు.
''వామ్మో! నేనేం జేతురో. యాద్గిరి గుట్టల నూరు ఎక్రాలల్ల 1048 యాగ కుండాలతోని మహా సుదర్శన యాగం చేద్దామనుకున్న. అన్ని రాస్ట్రాల ముక్యమంత్రులు; గవర్నర్లనే గాకుంట అందరు స్వామీజీలను బిలుద్దామనుకున్న గిప్పుడు నర్సిమ్మ సామె లాపతా అయితె యాగమెట్ల జెయ్యాలె'' అన్కుంట కెసిఆర్ పల్లపల్ల ఏడ్సిండు.
''ఊకో అన్నా ఊకో'' అని టిఆర్ఎస్ లీడర్ అన్నడు.
''నేను గుట్టల కొత్త గట్టిపిస్తున్న గుడి వాస్తు పకారం లేదెమొ. వాస్తు బాగలేదని నేను సెక్రెటేరియట్కు బోతలేను. గదే తీర్గ కొత్త గుడి వాస్తు బాగలేదని నర్సిమ్మ సామి యాడికో బోయినట్లు గొడ్తున్నది''
''యురేనియం మీద్కి దీస్తె నల్లమల అడ్వులు నాశనమైతయని ఎర్కున్నా మీరు సప్పుడు జెయ్యకుంట ఊకున్నందుకు నర్సిమ్మ సామికి కోపమొచ్చినట్లు గొడ్తున్నది''
''నేను కోట్ల మొక్కలు బెట్టిపిస్తున్న, గవ్వి జల్ది బెర్గెతందుకు; విస్కి, బరండి, బీరు అసువంటి మందు బోబిస్తున్న. మందు దాగి ఊక్కుంట గవ్వి వారం దినాలల్ల పెద్ద పెద్ద చెట్లయితయి. గా చెట్లతోని అడ్వి అయితది. నల్లమలల ఉన్న పులులు; చిర్త పులులు, జింకలు, గుడ్డేలుగులే గాకుంట చెంచులు గూడ గా అడ్విల ఉండొచ్చు. యాడబడ్తె ఆడ తాగెతందుకు మందు దొర్కుతుండంగ మంచినీల్లు దొర్క కుంటేంది?'' అని కెసిఆర్ అడిగిండు.
- తెలిదేవర భానుమూర్తి
సెల్: 9959150491