Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'తాగొచ్చిన భర్త జూదంలో భార్యను ఫణంగా పెట్టాడు. ఓడిపోయాడు. భార్యని అమ్ముకున్నాడు. కొనుక్కున్న ఇద్దరూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. చివరికి ఎలాగో బయటపడి పోలీసుల్ని ఆశ్రయించింది.
అక్కడో, ఇక్కడో ఇటువంటి వార్తలు చూస్తూనే ఉన్నాం. భార్య శీలంపై అనుమానంతో నిప్పుల మీద నడిపించే వాడొకడైతే సలసల కాగే నూనెలో చేతులు పెట్టించే వాడొకడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాటంత. నిజమే మరి! ధర్మరాజు పుట్టిన దేశం. శ్రీరాముడు ఏలిన రాజ్యం కదా! భార్యను పణంగా పెట్టిన ధర్మరాజు మహానుభావుడు. 'అయోనిజ' సీతపై అనుమానంతో నిప్పుల్లో దూకించి, అంతటితో ఆగక నిండు గర్భవతిని అడవులకంపిన శ్రీరాముడు మనకు దేవుడు. తండ్రి మాటను జవదాటక తల్లి రేణుకను గండ్రగొడ్డలితో తెగ నరికిన పరుశురాముడు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒక అవతారం. ప్రతి రోజూ ప్రతి ఇంట ఆడవాళ్లతో దేవుడు గూట్లో పూజా పునస్కారాలందుకొనే దేవుళ్లు. ఆలినమ్మే వాళ్లకు, నిప్పుల్లో దూకించే వాళ్లకు ఈ కలియుగంలో కొదవే లేదు. కలియుగ దేవుళ్లకూ కొదవలేదు.
ఔనండీ ఎందుకీ రచ్చ యిప్పుడు. ఎక్కడో ఒకడు ఏదో ఒక తప్పు చేస్తే ఇంత రచ్చ చెయ్యాలా? అని అంటారు కొందరు. అట్లా అమాయకంగా మాట్లాడే వాళ్లకు గూబ గుయ్యిమనే ప్రకటనలిచ్చారు మాజీ కేంద్రమంత్రి అనంత కుమార్ హెగ్డే. 'మనకెందుకీ అంబేద్కర్ రాజ్యాంగం. మనకున్నది ధర్మం. అదే మనుధర్మం' అని సెలవిచ్చారు. పాపం ఆయన రాజ్యాంగాన్ని, దాని విలువల్ని కాపాడతానని ప్రమాణం చేసి మంత్రి పదవి చేపట్టిన సంగతి మరచిపోయారు. కొంతమంది అభ్యుదయవాదులు 'ఔరా ఇవేం ప్రకటనలు! స్వాతంత్య్రోద్యమ కాలం నుండి మార్పులు కోరుకున్నాం కదా! అభ్యుదయం కావాలనుకున్నాం కదా! కులం, మతం, భాష, ప్రాంతం, స్త్రీ-పురుష వగైరా బేధాలు లేని సమాజాన్ని కదా మనం కోరుకున్నాం! అని అనుకోవచ్చు.
భారత రాజ్యాంగ రచనకు ముందు అనేక దేశాల రాజ్యాంగాలను, చట్టాలను పరిశీలించి, శోధించిన అనంతరమే రాజ్యాంగ రచన సాధ్యపడింది. స్వాతంత్య్రోద్యమంలో భాగంగా సాగిన పలు ఉద్యమాలు, అవి సంస్కరణోద్యమాలు కానీ, కులం పేరుతో సాగే అనాచారాలకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా గానీ, రైతాంగ పోరాటాలు గాని, స్త్రీల గౌరవం కోసం, సాగిన ఉద్యమాలు గాని, వీటి ప్రభావం రాజ్యాంగ రూపకర్తల మీద పడబట్టే కదా కొన్ని హక్కులంటూ వచ్చాయి.
అంతర్జాతీయంగా చరిత్రలో సాగిన పోరాటాలు, ఉద్యమాల ప్రభావం కూడా తక్కువ కాదు. 18వ శతాబ్దం ప్రారంభంలో వచ్చిన ఫ్రెంచి విప్లవం యూరప్ ఖండాన్ని ఒక కుదుపు కుదిపింది. కుళ్లి, కృశించి పోయిన సమాజాన్ని ప్రక్షాళన చేసింది. రాచరిక పాలన కింద నలిగి నుజ్జవుతున్న రైతాంగం, సాధారణ పౌరులు చేసిన తిరుగుబాటు రాచరికాన్ని తుదముట్టించింది. రాజుకు మరణ దండన విధించింది. స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నినాదాలు వెల్లువెత్తాయి. స్వేచ్ఛా వాయువులు ప్రపంచమంతటా ప్రసరించాయి. విద్య, ఉద్యోగం, వివాహం, విడాకులు వంటి అంశాల్లో స్త్రీ, పురుష సమానత్వం కోసం మహిళలు అశేష త్యాగాలు చేశారు. మరణదండన వంటి శిక్షలు కూడా అనుభవించారు. హక్కులు సాధించారు. ఆ తర్వాత 1917లో అక్టోబరులో వచ్చిన రష్యన్ విప్లవం రెక్కల కష్టం తప్ప మరేమీ లేని కార్మిక వర్గానికి అధికార పీఠం అప్పజెప్పింది. మొత్తం మీద తేలిందేమంటే, ఈ విప్లవాల ప్రభావం మన సమాజంపై మెండుగా ఉంది. రాజ్యాంగ కర్తల్ని ఈ విప్లవాలు ప్రభావితం చేశాయి.
వాటన్నిటి ఫలితమే రాజ్యాంగంలో కొంత మేరకైనా సామాన్య జనాలకు సమాన హక్కులు రావడం. రాజ్యాంగంలో 14వ నిబంధన నుంచి 21వ నిబంధన వరకు ఈ దేశంలో జీవించే పౌరులందరికీ ప్రాథమిక హక్కులు కల్పించబడ్డాయి. ఈ హక్కుల ప్రకారం, సమానత్వం, స్వేచ్ఛ, దోపిడీ అణచివేతల నుండి రక్షణ, యిష్టమైన మతాన్ని ఎంచుకొనే హక్కు, సాంస్కృతిక విద్యా పరమైన హక్కులతో పాటు జీవించే హక్కు గ్యారంటీ చేయబడ్డాయి. 14వ నిబంధన సమానత్వ హక్కు ప్రాథమిక హక్కు ప్రకారం రాజ్యం ఏ ఒక్క పౌరునికీ చట్టం ముందు సమానత్వాన్ని నిరాకరించలేదు. కులం, మతం, జాతి, లింగవివక్షలు నిషేధింపబడతాయి.
అయితే 70ఏండ్ల తర్వాత మళ్లీ మొదలయ్యిందీ చర్చ. 'ప్రతిభకు పట్టం కట్టాలి కదా! ప్రతిభను పక్కనబెట్టి రిజర్వేషన్ల పేరుతో శుంఠలకు, దద్దమ్మలకు ఉద్యోగాలా? వంటి వాదనలు వింటున్నాం. లక్షల రూపాయలు పోసి సీట్లు కొని చదివే వారికి ఏం ప్రతిభ ఉందో? వయోజనులైన స్త్రీ,పురుషులు కలిసి జీవించే హక్కు, వారి భవిష్యత్తు గురించి వారు నిర్ణయించుకొనే హక్కు ఉన్నది కదా! చట్టం ఆ హక్కు ఇచ్చింది కదా! మరి ఈ కుల దురహంకార హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? కన్న తల్లిదండ్రులే పచ్చి బాలింతను కొట్టి చంపిన ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో చూశాం. కన్న తల్లిదండ్రుల్లో రాక్షసత్వం ప్రకోపించడానికి గల భావజాలం ఏంటి? కుల దురహంకారం కూరుకుపోయిన సామాజిక పరిస్థితులు కారణం కదా!
మూఢాచారాలు, స్వామీజీల చుట్టూ ప్రదక్షిణాలు పెరిగిపోతున్నాయి. స్త్రీల నోములు, వ్రతాల పేరుతో ఆడవాళ్లను ఇంకా అంధకారంలో ఉంచే స్థితి యిప్పటికీ పాతుకుపోయి ఉంది. దాన్ని పెంచి పోషించడానికి బీజేపీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని చాపకింద నీరులాగా ప్రచారం చేస్తోంది. ఇటీవల మహిళా సంఘం మీటింగులో ఒక కార్యకర్త చెప్తోంది ఏమనంటే, 'కర్వా చౌత్' అనే నోము నోస్తారు ఉత్తరభారతంలో. భర్త ఆయురారోగ్యాలు కాపాడడానికట ఆ నోము. ఆ నోము నోచేవాళ్లు చెయ్యాల్సిన తతంగాల్లో ఒకటి చేతికి గోరింటాకు పెట్టుకోవడం. చేతికి గోరింటాకు లేదని చుట్టూ ఉన్న ముత్తైదువుల గోల పడలేక 'ఇదిగో చూడండి నేనూ గోరింటాకు పెట్టుకున్నాను. కర్వా చౌత్ నోచుకున్నాను' అని చెప్పి హమ్మయ్య..! అని ఊపిరి పీల్చుకొన్నదట ఆ కార్యకర్త.
తెలుగు వాళ్లకీ నోములు తక్కువేం గాదు! కొత్తగా పెళ్లయిన అమ్మాయిలకు 'తద్ది పేరంటాళ్లు' అని నోము నోయిస్తారు. ఆ వ్రతం సందర్భంగా చదివే కథలో ఏముందో తెలుసా? ఒక రాజుగారికి ఇద్దరు భార్యలు. ఇద్దర్నీ వదిలేసి వేశ్య చుట్టూ తిరుగుతున్నాడట రాజుగారు. రాజ పురోహితుల్ని సంప్రదిస్తే 'ఇదిగో ఈ తద్ది పేరంటాళ్లు పెట్టుకోమ'ని సలహా ఇచ్చాడట. అప్పుడు రాజుగారు వేశ్యని వదిలేసి రాణుల చుట్టూ తిరిగాడనే అనుకుందాం! మరి రాజ వేశ్య కూడా తద్ది పేరంటాళ్ళు పెట్టుకుంటేనో? ఇంతకీ ఇక్కడ చెప్పొచ్చేదేమంటే మగవాళ్ల చెడు తిరుగుళ్లకు కారణం ఆడవాళ్ల పూజల్లో లోపం గాని, తప్పు మగవాడిది కాదు. మగవాడేం చేసినా తప్పు లేదనే సమాజానిదీ కాదు. 'పుణ్యం కొద్దీ పురుషులు, దానం కొద్దీ బిడ్డలు', 'మగవాడు తిరక్క చెడ్డాడు. ఆడది తిరిగి చెడింది' వంటి సామెతలకు కొదవా! ఇవన్నీ ఎక్కడి నుండి ఊడిపడ్డాయి? శాస్త్రాలు అలా శాసిస్తున్నాయి. 'కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాతా శయనేషు రంభ క్షమయా ధరిత్రి' ఇది కాదా మనువు చెప్పింది. దశాబ్దాలే కాదు, శతాబ్దాల పాటు పోరాడి, ప్రాణ త్యాగాలు చేసి సాధించిన హక్కులు ఈ మనువాదులకు ధారపోయాలా?
మన వేలితో మన కన్నే పొడవడమంటే అదే! ఏ ఒక్క శాస్త్రమైనా, పురాణమైనా స్త్రీల హక్కుల్ని గౌరవించాలని చెప్పిందా. భారత, రామాయణాలను పుణ్య గ్రంథాలని నెత్తిన పెట్టుకుంటాం. కాని ఒక్కసారి భారతం చదవండి. అందులో 'అనుశాసన పర్వం' ఒకటుంది. అది తప్పక చదవాలి. అంపశయ్య మీదున్న భీష్ముడికి ధర్మోపదేశాలు చెయ్యడానికి ధర్మరాజు వెళ్తాడు. 'నారద పంచ చూడ సంవాదం చెప్తాడు. అందులో స్త్రీల గుణగుణాలు చెప్తాడు. స్త్రీలను, వారి శరీర భాగాల గురించి వర్ణిస్తాడు. అలాంటి ధర్మరాజును, భారతాన్ని యిన్నేళ్లూ మనం నెత్తిన బెట్టుకున్నదీ అని చదివిన వారెవరికైనా అనిపించక పోదు. మగవాడు ఎంత కురూపి అయినా, అతడిని చూస్తేనే ఆడదానికి కామం ప్రకోపి స్తుందట. ఇంతకన్నా నీచమైన వర్ణనలున్నాయి. పురాణాల పవిత్రత పేరుతో ఈ నీచ సంస్కృతిని ఆమోదించాలా? మనువాదపు ఆధిపత్యానికే మహిళలు లోబడి వుంటే ఇందిరాగాంధీ దేశ ప్రధాని కాగలిగే వారా? రాజ్యాంగం సమాన హక్కులు కల్పించింది గనుకనే అవగలిగారు.
అందుకే సోదర సోదరీ మణులారా! మనువాదాన్ని తిరస్కరిద్దాం! రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. కుల, మత బేధాలు, స్త్రీ, పురుష అసమానతలు లేని సమాజాన్ని నిజం చేద్దాం! ఆగస్టు 15 సందర్భంగా ప్రతిజ్ఞలు చేద్దాం. ఆగస్టు 9 క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన రోజు నుంచి ఆగస్టు 15 వరకు స్వాతంత్య్రోద్యమ నేతలు ఆకాంక్షించిన లౌకిక, ప్రజాతంత్ర భావాలను, సమన్యాయాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేద్దామన్న అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం పిలుపును ఆచరిద్దాం.
- ఎస్. పుణ్యవతి