Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాశ్మీర్లో షూటింగులకు రావాలని ప్రధాని మోడీ జాతి నుద్దేశించి ప్రసంగం చేస్తున్నప్పుడే ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రాజ్యసభ ప్రతిపక్ష నేత గులామ్ నబీ ఆజాద్నూ, ఉభయ కమ్యూనిస్టు పార్టీల ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి. రాజాలను పోలీసులు విమానాశ్రయంలో అడ్డుకుని అరెస్టు చేసి ఢిల్లీ తిప్పి పంపేశారు. భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్థానికులతో కలసి హాయిగా భోజనం చేసి కబుర్లు చెప్పుకుంటున్న చిత్రాలు మాత్రం మీడియాలో పచార్లు కొడుతున్నాయి. మరో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధంలో కొనసాగుతున్నారు. కాశ్మీర్ నివురు గప్పిన నిప్పులా ఉందని ప్రతివారికీ తెలిసినా మభ్య పెట్టే కేంద్ర వ్యూహం ఇది. మోడియాగా మారిన మీడియా సంస్థలు కొన్ని ఈ ప్రచారాన్నే మింగిస్తే పెద్దగా ఆశ్చర్య పోవలసింది లేదు. ఎందుకంటే కాశ్మీర్ 370వ అధికరణం రద్దు, 35ఎ తొలగింపు వీరకృత్యమైనట్టు మోత మోగుతున్నది. ఇది దేశంలో మోడీ మలి దఫా పాలన ప్రతిబింబమే.
రాజ్యాంగ పరిహాసం
అసలీ 'రద్దు' తీరులోనే బూటకత్వం ఇమిడివెంది. 370కింద కాశ్మీర్కు సర్వ స్వతంత్ర హక్కులు సంక్రమించి ఉంటే దానిలోని ఒక ఉప నిబంధనతోనే ఎలా రద్దు చేయగలరు? రాజ్యాంగ సవరణ చేయలేదు గనక 370 ఇప్పటికీ ఉంది. కేంద్ర శాసనాలు ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదించాకే కాశ్మీర్కు వర్తించాలని ఉంటే దాన్ని మార్చి ఇప్పుడు అన్నీ వర్తిస్తాయన్నారు. గతంలోనూ రాష్ట్రపతి ఉత్తర్వులు 49లో 47, కేంద్ర జాబితా అంశాలలోని 97లో 94 కాశ్మీర్కు వర్తింపచేయబడ్డాయి. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య అని చెప్పే ఒకటవ అధికరణం 370 ప్రకారం కాశ్మీర్కు పూర్తిగా వర్తిస్తుంది. అంటే కాశ్మీర్కు మిగిలిన రాష్ట్రాలకున్న హక్కులు కాక స్వయం ప్రతిపత్తి అదనం. ఇప్పుడు ప్రత్యేక ప్రతిపత్తిని తీసేస్తున్నామంటూ రాష్ట్ర ప్రతిపత్తినే కత్తిరించారు. రాష్ట్ర ప్రజలతో శాసనసభతో సంప్రదించకుండానే ముక్కలు చేసి రాష్ట్ర హోదా కూడా లేకుండా చేశారు. లడక్ అభివృద్ధి కోసం త్రిపుర వామపక్ష ప్రభుత్వం వలె సాధికార ప్రతిపత్తి మండలి కోర్కె ఉంది గాని పరాధీన కేంద్ర పాలిత ప్రాంతంగా చేయమని కాదు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా లాగేసి కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం ఇన్నేండ్లలో ఏ రాష్ట్రానికి జరగని అన్యాయం. మాతృసంస్థ ఆరెస్సెస్ అడుగు జాడల్లో బీజేపీ చిరకాలంగా చెబుతూ వచ్చిన విధాన ఫలితం. బీజేపీ ఎన్నికల ప్రణాళికలో కూడా 370 రద్దు ఉంది కాని అందరితో సంప్రదించి చేస్తామన్నారు. సాయుధ దళాలను దింపి సస్పెన్స్ నింపి ఎంపీలకు కూడా తెలియకుండా మెడమీద పెట్టి చేయించుకున్నారు.
స్వార్థ రాజకీయాల ఫలితమే
భౌగోళిక వ్యూహాత్మక ప్రయోజనంకోసం కాశ్మీర్ను మన దేశంలో కలుపుకోవడానికి మనం ఇచ్చిన భరోసా 370. ఈ భరోసాకూ అప్పటి రాజు హర్సింగ్కు సంబంధం లేదన్నది మరోఅసత్యం. ఆ రాజు అప్పట్లో పాకిస్థాన్తోనూ మంతనాలు జరిపారు. కాశ్మీర్లో ప్రజా నాయకుడుగా ఉన్న షేక్ అబ్దుల్లా భారత్ వైపు నిలిచారు. హఠాత్తుగా దాడి చేసిన పాక్ సైన్యాలను గిరిజన తెగల నాయకులు తిరుగు బాటును ఎదుర్కొన్నారు. లేకుంటే కాశ్మీర్ విలీనమే సాధ్యపడేది కాదు. ఆయనను తెగనాడటం బీజేపీ రాజకీయాలకు సరిపోతుంది గాని చరిత్ర సత్యం కాదు. బీజేపీ ఇతర మతాలకున్న ప్రత్యేక నిబంధనలు చూడకుండా వ్యక్తిగత చట్టాలు ముస్లిములకే ఉన్నాయని చెబుతుంటుంది. అలాగే ఇతర రాష్ట్రాలకు ఉన్న ప్రత్యేక అధికరణాలు పట్టించుకోకుండా కాశ్మీర్వే చూపిస్తుంటుంది, అవన్నీ నిక్షేపంగా వుంటే కాశ్మీర్ దేశంలో భాగం కాకుండా పోయిందా? కాశ్మీర్ ప్రకృతి వరప్రసాదంగా సినిమా షూటింగులకు నిలయంగా విరాజిల్లినప్పుడు 370 లేదా? ఆ పరిస్థితి చెడగొట్టిందెవరు? షేక్ అబ్దుల్లాను జైలులో పెట్టి మీర్ కాసింను ముఖ్యమంత్రిని చేసి పాలించాలని పాకులాడింది కాంగ్రెస్. ఇందిరాగాంధీ ఎన్టీఆర్పై కుట్రకు ముందు కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లాను పడగొట్టి బావ షాను తీసుకొచ్చాకే పరిస్థితి మరీ దిగజారింది. అఫ్ఘన్ పరిణామాలతో అంతర్జాతీ యవరణమూ చెడింది. పాకిస్థాన్ దానికి వత్తాసుగా అమెరికా కుట్రలు నడిపాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదం వేర్పాటు వాదం తీవ్రమైనాయి. ఫరూక్, ఒమర్ అబ్దుల్లా తండ్రీ కొడుకులిద్దరూ బీజేపీ, కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాలలో ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్తోనూ పీడీపీతోనూ మిశ్రమ ప్రభుత్వాలు నడిపిన చరిత్ర రెండు పెద్ద పార్టీలకూ ఉంది. హర్సింగ్ కుమారుడైన కరణ్సింగ్ వీహెచ్పీ అంతర్జాతీయ అధ్యక్షుడుగా పనిచేశారు. బీజేపీ, కాంగ్రెస్లు రెంటికీ నిలయమైన సింధియాల కుటుంబంతో ఆయన వియ్యమందారు కూడా. (ఇప్పుడు వీరిద్దరూ కాంగ్రెస్లో ఉండి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు) మూడు కుటుంబాల వల్లనే అంతా పాడై పోయిందని చెబుతున్న బీజేపీ వాటితో ఎంతగా ముడివేసుకుందో చెప్పే వాస్తవాలివి.
370 చేసిన పాపమేమిటి?
వాస్తవానికి 370 సహాయంతో షేక్ అబ్దుల్లా ప్రభుత్వం సమూలమైన భూ సంస్కరణలు అమలు చేసింది. యాభైల ముందే రుణమాఫీ అమలు చేసింది. అందుకే కాశ్మీరీల రుణభారం, భూమిలేని వ్యవసాయ కార్మికుల శాతం మిగిలిన దేశంలో కన్నా తక్కువ. మరో వైపు కాశ్మీర్లో భద్రతా వాతావరణం దెబ్బతిందన్నా, ఉగ్రవాదులు చొరబడ్డారన్నా, విదేశీ శక్తుల కుట్రలు జరుగుతున్నాయన్నా 370 ప్రకారం కేంద్రం బాధ్యతే. రక్షణ విదేశీ వ్యవహారాలు సమాచార సంబంధాలు కేంద్రమే చూస్తుంది. 35ఎ కు సంబంధించి కూడా ప్రస్తుత ప్రచారం పూర్తి అసత్యం. 370 ప్రకారమైనా కాశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగం దేశ రాజ్యాంగానికి భిన్నంగా ఉండే అవకాశమే లేదు. ఇది రాజుకు సంబంధం లేకుండా షేక్ అబ్దుల్లా సర్దార్ పటేల్కు తెలియకుండా నెహ్రూ చేశారనే ప్రచారం సంఘ పరివార్ కట్టు కథే. ఎన్ని తేడాలున్నా నెహ్రూ పటేల్ కాంగ్రెస్ నాయకులే. హోం మంత్రి అమిత్ షా చేశారు గనక ప్రధాని మోడీకి సంబంధం లేదంటే బీజేపీ ఒప్పుకుంటుందా? నెహ్రూపై కత్తికట్టి, పటేల్ను పైకి లేపి గాంధీజీని తమ ప్రచారాలకు వాడుకునే బీజేపీ బృహత్ వ్యూహంలో భాగలే ఇవి.
కాషాయ ఎజెండానే
సరైన విధానాలతో కాశ్మీర్ ప్రజలను విశ్వాసంలోకి తీసుకుని ఉత్పత్తి ఉపాధి పెంచి ఉంటే ఆ సుందర సీమ ఇన్ని విధాల సంక్షుభితమయ్యేది కాదు. ప్రయివేటు పెట్టుబడిదారుల రాకకు ఏ ఆటంకం లేకున్నా వారు ప్రతికూల ప్రకృతి ఉన్నచోటకిరారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో 339సంస్థలు 23లక్షల కోట్ల పెట్టుబడులతో స్థాపిస్తే కాశ్మీర్లో కేవలం మూడంటే మూడు 123కోట్ల పెట్టుబడితో అతితక్కువ ఉద్యోగాలతో నడిపించారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు 18లో రెండు తప్ప అన్నీలాభాలతో నడుస్తున్నట్టు మొన్ననే కాగ్ నివేదిక వచ్చింది. ఏమైనా అక్కడ టూరిజం, హస్తకళలే ప్రధానం.కాని రాజకీయ కల్లోలాలతో అవీ వెనక్కు పోయాయి. నిరుద్యోగ యువతనే వేర్పాటువాదులు ఉగ్రవాదులు లోబర్చుకునే కుట్రలు సాగించారు. మోడీ ప్రభుత్వం కూడా రాళ్లదాడుల పేర నోట్లరద్దు, సర్జికల్ స్టయిక్స్, పుల్వామాకు ప్రతీకారం ఇలాంటివాటినే ఊదరగొట్టడం తప్ప ప్రజల స్థితిగతులను మెరుగుపర్చింది లేదు. కాశ్మీర్ దేశంలో అంతర్భాగం అని మనం సరిగానే చెప్పాం గాని కాశ్మీరీలలో దేశం అంతర్భాగం కావడానికి చేయవలసింది చేయలేదు. ప్రత్యేక ప్రతిపత్తిని తోసిపారేసి ప్రత్యేక సాయుధ బలాల చట్టంతో నిర్బంధం సాగించి యువతను దూరం చేసుకున్నాం. దేశాన్ని వంద రాష్ట్రాలు చేయాలనే రాజకీయ స్వప్నం బీజేపీది. మూడేండ్లలో జమిలి ఎన్నికల పాట పాడుతున్న బీజేపీ రేపు ఇతర రాష్ట్రాలతోనూ ఆడుకోవడం తథ్యం. ఇప్పటికైతే నేషనల్ కాన్ఫరెన్స్ నేతలతో సహా పలువురు కేంద్ర చర్యను సుప్రీం కోర్టులో సవాలు చేశారు. వాటిని వెంటనే విచారించడానికి కోర్టు కూడా నిరాకరించడం కొసమెరుపు.
- తెలకపల్లి రవి