Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జమ్ముకాశ్మీర్ సమస్యపైన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుగారి వ్యాసం ఆదివారం 'ఆంధ్రజ్యోతి' పత్రికలో ప్రచురితమయింది. వ్యక్తిగా అభిప్రాయాలెలా ఉన్నా, రాజ్యాంగాన్ని 'తొత్తడం చేసి' కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ అప్రజాస్వామిక నిర్ణయాన్ని రాజ్యాంగ పరిరక్షక పదవుల్లో ఉన్న ఆయన ఈ విధంగా సమర్ధించ బూనటం, ఆ సమర్ధనలోనూ అనేక అవాస్తవాలూ, వక్రీకరణలూ చేయటం విచారకరం.
'నా దృష్టిలో 370 అధికరణం రద్దు అనేది దేశ సమైక్యతను, సమగ్రతను పరిరక్షించే దిశలో సరైన ముందడుగు' అని వెంకయ్యనాయుడు అన్నారు. అయితే ఈ చర్య ఏవిధంగా దేశ సమైక్యత, సమగ్రతలను రక్షిస్తుందో, ఇప్పటివరకూ 370 అధికరణం మన దేశ సమగ్రతకు, సమైక్యతకు ఏవిధంగా భంగం కలిగించిందో మాత్రం ఆయన వివరించలేకపోయారు. మన దేశం అనేక భాషల, సంస్కృతీ సంప్రదాయాల, అసమాన ఆర్థికాభివృద్ధితో గూడిన వైవిధ్య భరితమైన సువిశాల ప్రదేశమనే సంగతి మనందరికీ తెలుసు. మనది భారతదేశమే. మనమంతా భారతీయులమే. అయితే ఒక జాతిగా మాత్రం లేము. అనేక జాతుల సమూహంగా మనం ఉన్నాం. ఈ వాస్తవాలను, ఈ వైవిధ్యాన్ని, భిన్నత్వాలను ఐక్యతవైవు అంటే ఏకత్వం వైపు నడిపించగలిగే శక్తి ఏమిటి? ఇది ప్రధాన ప్రశ్న. ఈ ప్రశ్న ఇప్పటిదే కాదు. స్వాతంత్య్రానంతర భారతదేశం ఎలా ఉండాలి అనేది స్వాతంత్య్రపోరాట సమయంలోనూ, స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత రాజ్యాంగ రూపకల్పన సమయంలోనూ ముందుకొచ్చిన ప్రశ్నే. దీనికి సమాధానంగానే(పూర్తి సమాధానం అయినా కాకపోయినా ఉన్నంతలో) రాజ్యాంగ రూపకల్పన జరిగింది. రాష్ట్ర, కేంద్ర అధికారాల విభజన, ఫెడరల్, యూనిటరీ లక్షణాలతో మన రాజ్యవ్యవస్థ ఏర్పడింది. అనేక ప్రాంతాలకు, రాష్ట్రాలకు వారి, వారి ఆర్థిక సామాజిక సాంస్కృతిక అసమానతలను బట్టి కొన్ని ప్రత్యేక రాయితీలు, హక్కులు, అధికారాలు ఇవ్వబడ్డాయి. అనంతర కాలంలో రాష్ట్రాలకు మరిన్ని హక్కులు, అధికారాలు ఇవ్వాలని రాజ్యాంగ సవరణలూ చేయబడ్డాయి. అయినా రాష్ట్రాల హక్కులను, అధికారాలను క్రమంగా కుదించటం, కొన్ని రాష్ట్రాలకు ఇచ్చిన ప్రత్యేక అధికారాలను కూడా కుదిస్తూ సర్వాధికారాలూ కేంద్రం చేతిలో కేంద్రీకరించబడటం అనేది ఒక ట్రెండ్గా సాగింది. దీనికి వ్యతిరేకంగా 'రాష్ట్రాల హక్కులు, అధికారాల'పైన పెద్దపోరాటమే జరిగింది. తర్వాత సర్కారియా కమిషన్ ఏర్పడి రాష్ట్రాల అధికారాలపై అనేక సిఫార్సులు చేసింది. అయినా రాష్ట్ర అధికారాలను కేంద్రం లాగేసుకునే 'ట్రెండ్' మాత్రం ఆగలేదు.
రాజ్యాంగంలో వివిధ రాష్ట్రాలకు ఇవ్వబడిన ప్రత్యేకతల్లో జమ్ముాకాశ్మీర్ కు ఇవ్వబడిన 'స్వయంప్రతిపత్తి' దానికను గుణంగా రూపొందిన 370 అధికరణం అనేది ఒకటి. ఏదైనా ఒక అంశాన్ని దాని చారిత్రక నేపథ్యంలో చూడకుండా ఆవేశ, కావేశాలతో హ్రస్వదృష్టితో చూడటం అన్యాయమవుతుంది. 'భారతీయులందరూ సమానులే ఎవరికీ ప్రత్యేక చట్టాలు ఉండకూడదు, ఏ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులుండకూడదు' అని వాదిస్తే ఈ ప్రమాదకరమైన ధోరణి ఎక్కడికి దారి తీయబోతోందో అర్థం కావాలి కదా?
మన దేశంలో అనేక రాష్ట్రాలకు, భిన్న తరగతుల ప్రజలకు ప్రత్యేక హక్కులు, రాయితీలు ఇవ్వబడ్డాయి. ఏ ప్రత్యేకత లేక వెనకబాటుతనం వల్ల అవి కల్పించబడ్డాయో ఆ ప్రత్యేకతలు, వెనకబాటుతనం అధిగమించబడేవరకూ అవి అలాగే కొనసాగటం, వాటిని చిత్తశుద్ధితో అమలు జరపటం ఈ దేశ సమగ్రాభివృద్ధికి, సమైక్యతకు అవసరమైన కీలకాంశం. మన దేశంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక రాయితీలున్నాయి. రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. గిరిజన ప్రాంతాలలో వారి భూమి 'పరాయీకరణ' జరగకుండా 1/70లాంటి చట్టాలున్నాయి. అక్కడ గిరిజనులు కాకుండా ఎవరూ భూములు కొనకూడదు. ఆ ప్రాంత పౌరులు, ఓటర్లకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. వీటిని పౌరులందరికీ సమాన హక్కులు అనే పేరుతో నిరాకరిస్తామా? రద్దు చేస్తామా? మన రాజ్యాంగంలో 370 ఆర్టికల్ మాత్రమే లేదు. 371 ఆర్టికల్ కూడా ఉంది. ఆ ఆర్టికల్ దాని వివిధ సబ్ఆర్టికల్స్ 371ఎ నుంచి 371ఐ వరకూ వివిధ రాష్ట్రాలకు ప్రత్యేక హక్కులు, అధికారాలు సంక్రమింపజేస్తోంది. ఈ ఆర్టికల్స్ అన్నీ వివిధ రాష్ట్రాలలో స్థానికేతరులు భూమి కొనుగోలు చేయటం దగ్గరనుంచీ స్థానికేతరులు ఉద్యోగాలు పొందటం వరకూ వివిధ రూపాల్లో నిషేధాలు విధించి అమలు జరుపుతున్నాయి. ఇవన్నీ తప్పంటామా? ఈ రాయితీలన్నీ తక్షణమే రద్దు చేయాలని ఎవరైనా చెప్పగలరా? తెలంగాణలో మొదట ముల్కీపేరుతో, తరువాత 371డి క్రింద స్థానికులకు ఉద్యోగాల ప్రాధాన్యత కల్పించే జోనల్ వ్యవస్థ వరకూ ఎన్ని ఉద్యమాలు, చర్చల తర్వాత సాధించబడ్డాయి? ఇవన్నీ తప్పని ఇపుడు మనం తీర్పు ఇవ్వగలమా? తాజాగా ఏపీలో ముఖ్యమంత్రి జగన్ 75శాతం ఉద్యోగాలు స్థానికులకే అనే జీవో ఇచ్చారు. అలాగే ఆంధ్రాలో అన్ని పార్టీలూ కోరుతున్న 'ఆంధ్రాకు ప్రత్యేక హౌదా' అనేది ఒక రాష్ట్రానికి ఇచ్చే ప్రత్యేక హక్కు కాదా? కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దును సమర్ధించిన జగన్పార్టీకి, టీడీపీకి ఈ డిమాండ్లు చేసే నైతిక అర్హత ఉంటుందా? ఇప్పుడు ఉన్న హక్కులు ఊడిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఏదో 'పరిస్థితి' లేక 'కారణం' చూపి కేంద్ర ప్రభుత్వం ఇపుడు వివిధ రాష్ట్రాలు లేక వివిధ తరగతుల ప్రజలు అనుభవిస్తున్న ప్రత్యేక హక్కులు, అధికారాలు అంతం చేయదనే గ్యారంటీ ఉంటుందా? దక్షిణాది రాజధాని పేరుతో మన హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయొచ్చని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే తెలంగాణ ఆర్థికపరిస్థి తేమిటి? 370ఆర్టికల్ రద్దును ఉత్సాహంగా సమర్థించిన మన కేసీఆర్ అపుడేం మాట్లాడగలరు? ఈ ధోరణులు, వాదనలు మన దేశ సమైక్యతకు, సమగ్రతకు ఉపయోగమని అనుకోవటం కంటే వెర్రితనం మరేమైనా ఉంటుందా?
వెంకయ్యనాయుడు మరో వ్యాఖ్యానం చేసారు. ''దేశ ప్రజల సంక్షేమానికి అమలుజేసే అనేక కీలక కేంద్ర చట్టాలను 370 అధికరణం మూలంగా జమ్మూ కాశ్మీర్లో అమలు చేయలేకపోతున్నామని'' ఆయన వాపోయారు. భూ చట్టాలు, విద్యాహక్కు చట్టాలు, పేదరిక నిర్మూలనా చట్టాలు వగైరా గురించి ఆయన ఉదహరించారు. కానీ మానవాభివృద్ధి సూచికల్లోని అన్ని విషయాల్లో దేశ సగటుకంటే జమ్ముకాశ్మీర్ రాష్ట్రం ముందున్నదనేది వాస్తవం కాదా? జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలో 1950లో ఏర్పడిన షేక్ అబ్దుల్లా నాయకత్వంలోని ప్రభుత్వం భూసంస్కరణలు అమలుజేసింది. కౌలుదార్లందరికీ భూమిహక్కులనిచ్చింది. 23ఎకరాలకంటే (20ఏండ్ల తర్వాత భారత్లో ఇందిర హయాంలో చేసిన భూసంస్కరణల చట్టం 54ఎకరాల పరిమితితో చేయబడింది) మించిన భూస్వాముల భూమినంతటినీ స్వాధీనం చేసుకుని భూమిలేని పేదలకు పంచింది. విశేషమేమంటే భూస్వాముల నుంచి స్వాధీనం చేసుకున్న ఈ వేలాది ఎకరాల భూములకు 'ఒక్కపైసా' నష్టపరిహారం చెల్లించకుండా ఈ భూపంపకం జరిపింది. రాజులకు రాజభరణాలను అప్పుడే రద్దుజేసింది. వేలాది ఎకరాల భూస్వాముల భూములను కౌలు చేస్తున్న కౌలుదారులకు చట్టం ద్వారా పూర్తి 'భూ యాజమాన్య హక్కు'ను కల్పించింది. ఇదంతా ఆ ప్రభుత్వం ఎందుకు చేయగలిగిందంటే భూస్వాముల హక్కులను రక్షించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 31 అనేది ఆ రాష్ట్రంలో వర్తించే వీలు లేదుగాబట్టే. ఆ వీలు ఎందుకు లేదంటే అక్కడ భారత్లోని అన్ని చట్టాలు ఆటోమేటిక్గ్గా అమలు జేసే అవకాశం లేకుండా 370 ఆర్టికల్ ఆ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు కల్పించింది కాబట్టే.
అభివృద్ధి అంటే మనుషుల అభివృద్ధి తప్ప కార్పొరేట్ల, ధనవంతుల అభివృద్ధి వారి విలాసజీవితాల విన్యాసాలు కాదు. దేశంలో దారిద్య్రరేఖకు దిగువన ప్రజల సంఖ్య 22శాతం ఉంటే అది జమ్ము కాశ్మీర్లో 10శాతం. దేశంలో భూమిలేని వ్యవసాయ కార్మికులు 23శాతం ఉంటే జమ్ముకాశ్మీర్లో కేవలం 2శాతం మందే ఉన్నారు. పుట్టిన ప్రతిబిడ్డా బతకటం దేశంలో 68శాతం ఉంటే జమ్ము కాశ్మీర్లో అది 73శాతంగా ఉంది. ఇలాగే విద్యలో, వైద్యంలో, ఇతర సూచికల్లోనూ ఆ రాష్ట్రం అగ్రగామిగా ఉంది. కానీ మీరు వాదిస్తున్నదేమిటి? 370 ఆర్టికల్ వల్ల అక్కడ అభివృద్ధి లేదు.. ఇప్పుడు దానిని రద్దు చేయటం ద్వారా కాశ్మీర్ అభివృద్ధి అవుతుందని? ఇది నిజమా? కాదు. ఈ చర్యతో ఇప్పుడున్న ప్రజల అభివృద్ధి నాశనం చేసి కార్పొరేట్ శక్తులను అభివృద్ధి చేయటం మీ లక్ష్యం. దానికోసం సంస్కరణలు కావాలంటున్నారు. దానికి అభివృద్ధి అనే పేరు పెడుతున్నారు. 'అభివృద్ది' అనగానే ఆనందించే అమాయక 'ట్రెండ్' మారాలి. ఏది అభివృద్ధి? ఎవరికి అభివృద్ధి అనే విశ్లేషణ జరగాలి. కార్పొరేట్ల అభివృద్ధి మాత్రమే కోరుకునే పాలకుల్లోనో, లేదా వారి కరుణా కటాక్షాలతో మాత్రమే 'అభివృద్ధి'కాగలమనుకునే రాజకీయ ఊసరవెల్లులనుండో ఈ దృష్టిని ఆశించలేం. కానీ కార్పొరేట్ల దోపిడీ పదఘట్టనలో నలిగిపోతున్న సాధారణ ప్రజల్లో ఈ చైతన్యం తప్పక అవసరం. అందుకు మన కృషి జరగాలి.
'విలీన సందర్భంలో ఈ ఆర్టికల్ లేదు... షేక్ అబ్దుల్లా వత్తిడిమేరకు తరువాత 370 అధికరణం చేర్చారు' అని వెంకయ్య నాయుడు అన్నారు. ఇంకొంతమందైతే 'నెహ్రూ వల్ల ఇది జరిగింది. పటేల్ అయిఉంటే ఇలా జరిగేది కాదని' వాదిస్తున్నారు. ఇవేవీ వాస్తవాలు కావు. కాశ్మీర్ విలీన సందర్భంలోనే వారికి ప్రత్యేక రాజ్యాంగం హక్కు అంగీకరించబడింది. ప్రత్యేక రాజ్యాంగ సభ ఏర్పడి, వారి రాజ్యాంగ రూపకల్పన జరిగింది. అలాగే మన రాజ్యాంగంలో ఈ అధికరణ చేర్పు గురించి సంపూర్ణ చర్చ తర్వాతే అందరి ఆమోదంతర్వాతనే చేర్చబడింది. ఇక్కడో విషయం చెప్పాలి. 1949 మే 15,16 తేదీల్లో పటేల్ ఇంట్లోనే ఈసమస్య చర్చించిన ముఖ్య సమావేశం జరిగింది. ఆయనతోపాటు, నెహ్రూ, షేక్ అబ్దుల్లాలు కూడా పాల్గొన్నారు. ఆ సమావేశ నిర్ణయాల ఆధారంగానే నెహ్రూ రాజ్యాంగపరంగా కాశ్మీర్కు ఉండే హక్కులను పేర్కొంటూ అబ్దుల్లాకు లేఖ రాసారు. ఇవన్నీ రికార్డుల్లో ఉన్నాయి. అలాగే అంబేద్కర్ గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఆయన 370 ఆర్టికల్ను వ్యతిరేకించారనటం వాస్తవం కాదు. ఆయన మాతో ఇలా చెప్పాడంటూ వేరేవాళ్ల రచనను వెంకయ్యనాయుడు ఉటంకిస్తున్నారు. ఇలాగే ఇంకా కొంతమంది కూడా చేస్తున్నారు. కానీ ఎక్కడా అంబేద్కర్ రచన నుంచో, రాజ్యాంగ సభలో ఆయన అభిప్రాయాల రికార్డుల నుంచో చెప్పలేకపోతున్నారు. ఎందుకని? వాస్తవంగా ఆయనలా చెప్పలేదుగాబట్టే. ప్రముఖులను, వారి పలుకుబడిని ఇలా అడ్డదారుల్లో దుర్వినియోగం చేయటం తగని పని.
వెంకయ్యనాయుడుగారి విశ్లేషణలో ఒక ముఖ్యమైన పొరపాటు మనం గమనించాలి. ''370 అధికరణ కాశ్మీర్ ప్రజలను మిగతా భారత ప్రజలతో సన్నిహితంజేసే బదులుగా అగాథాన్ని మరింత విస్తరింపజేసింది'' అన్నారు. అగాథం పెరిగిన మాట నిజమేగానీ, దానికి కారణం మాత్రం 370అధికరణ కాదు. దానిని బలహీన పర్చటం, ఒకటొక్కటిగా కాశ్మీర్ అధికారాలన్నింటినీ కేంద్రం లాగేసుకుని ఆ ప్రజలను 'పరాయివారి'గా ద్వేషించటం అసలు కారణం. వ్యాసంలో వెంకయ్య ఒకచోట 'ఈ అధికరణం చచ్చుబడిపోయిందనే'' నిజం చెప్పారు. అయితే అలా చచ్చుబడేయించిందెవరో చెప్పలేదు. అలాగే ఆ చచ్చుబడేయించటమే ఆయన చెప్పిన అగాథానికి అసలు కారణమనేదీ గ్రహించలేదు. కాశ్మీర్కు ఇచ్చి 'స్వయం ప్రతిపత్తి'లోని అనేక అంశాలను తొలగిస్తూ 1954 నుంచి ఇప్పటివరకూ 42సార్లు జీవోలు యిచ్చారు. దీనివల్ల కాశ్మీర్ ప్రజల్లో ముఖ్యంగా యువతలో అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. వారికి యివ్వబడిన స్వయంప్రతిపత్తిని అమలు జరపటం ద్వారా కాకుండా, బలప్రయోగంతో ఈ సమస్య పరిష్కరించాలని నెహ్రూ మొదలుకొని ఆ తర్వాత అన్ని ప్రభుత్వాలూ ప్రయత్నించాయి. ఈ తప్పుడు వైఖరే కాశ్మీర్ సమస్య రాచపుండు కావటానికి ముఖ్య కారణం. మరోవైపు పొంచి ఉన్న పాకిస్థాన్ ఈ అసంతృప్తిని వాడుకుంది. తన మిటిటెంట్లను జొప్పించి ఉగ్రవాద కార్యకలాపాలు సాగించింది. అలాగే స్థానికంగా అనేక ముస్లిం ఫండమెంటలిస్టు సంస్థలు పెరిగాయి. పాకిస్థాన్ సహాయంతో కార్యకలాపాలు సాగిస్తూ వచ్చాయి. అత్యధిక ముస్లిం జనాభా ఉన్నా విభజన సమయంలో పాకిస్థాన్తో విలీనం కావటానికి వ్యతిరేకించి భారత్తో కలవాలని కాశ్మీర్ ప్రజలు కోరుకున్నారు. రాజా హరిసింగ్ స్వతంత్ర రాజ్యంగా కొనసాగాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బ్రిటిషర్ల ప్రోద్బలంతో, పాకిస్థాన్ సైన్యం ప్రత్యక్ష తోడ్పాటుతో ఫక్తూన్లు, పఠాన్లు కాశ్మీర్ ఆక్రమణకు పూనుకున్నప్పుడు ఎన్నో త్యాగాలు బలిదానాలతో కాశ్మీర్ ప్రజలు షేక్ అబ్దుల్లా నాయకత్వంలో ఆ దురాక్రమణను ఎదుర్కొని పోరాడారు. మొదటి నుంచీ సూఫీ సంస్కృతితో, సెక్యులర్ భావాలతో, ఫ్యూడల్ వ్యతిరేక పోరాట చరిత్ర కాశ్మీర్ ప్రజలది. ఫ్యూడల్ దేశమైన పాకిస్థాన్లో విలీనమైతే ఈ సంస్కృతి మిగలదని, తమ ఫ్యూడల్ వ్యతిరేక పోరాట కర్తవ్యాలు పూర్తిగా నెరవేరే అవకాశం ఉండదని వారికి తెలుసు. ఆ భారతీయ ప్రేమికుల దేశభక్తి మన పాలకులకు అర్థం కాకపోవటం లేదా అర్థం చేసుకోవటం ఇష్టం లేకపోవటంవల్ల ఈ అనర్థమంతా జరిగింది. తత్ఫలితంగా భారతీయులంటే కశ్మీరీలు ద్వేషించే పరిస్థితికి పరిణామాలు దారి తీస్తున్నాయి.
ఇక చివరగా ''జమ్ముకాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత దానికి రాష్ట్రహౌదా లభిస్తుందనే విశ్వాసం కూడా నాకున్నది'' అని వెంకయ్యనాయుడు అన్నారు. అది జరగాలంటే 'మేము సాధారణంగా జీవించగలమనే విశ్వాసం' ఆ రాష్ట్ర ప్రజలకు ఏర్పడాలి. కానీ ఆ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఏమిటి? మొత్తం రాష్ట్రం దిగ్బంధించబడింది. కోటికిపైగా ఫోన్లైన్లు కట్ చేయబడ్డాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్టు నిలిపేసారు. ఇంటర్నెట్ సౌకర్యం తీసేసారు. స్కూళ్లు, ఆఫీసులు, షాపులు అన్నీబంద్ పెట్టారు. పత్రికలు, టీవీలు ఏవార్తా మాద్యమాలూ అక్కడ లేవు. అధికార పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీల నాయకులు జైళ్లలో ఉన్నారు. ఇంకా 4వేల మందికి పైగా జైళ్లకు తరలించారు. ఒక్కమాటలో కాశ్మీర్ రాష్ట్రమే ఒక జైలుగా మార్చబడింది. ఇది సాధారణ పరిస్థితిని సాధించే మార్గం కానేకాదు. కాశ్మీర్ ప్రజలను విశ్వాసంలోకి తీసుకుని చేసే గౌరవప్రదమైన రాజకీయ పరిష్కారమే కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం అవుతుంది.
- తమ్మినేని వీరభద్రం