Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచీకరణ ప్రవేశపెట్టబడిన 1991 నుంచి గత మూడు దశాబ్ధాలుగా సమర్థించుకోవడానికి మన్మోహన్సింగ్ నుంచి నేటి నిర్మలాసీతారామన్ వరకు ''వృద్ధిరేటు'' చూపెట్టి ఊదరగొట్టారు. వృద్ధిరేటు పెరుగుదల అన్నిటికీ పరిష్కారం చూపెడుతుందని అన్నారు. అన్ని సమస్యలు వాటంతటవే పరిష్కారమవుతాయని, చేయవలసిందల్లా పబ్లిక్ సెక్టార్ ఎత్తేసి ప్రయివేటీకరణ శరవేగంగా చేయాలని, అంతర్జాతీయంగా, జాతీయంగా ఉన్న నియంత్రణలు ఎత్తేయాలని, పేదరికాన్ని తగ్గించడానికి ప్రభుత్వ జోక్యం అనవసరమని, మార్కెట్ ఆ పనిచేస్తుందని సెలవిచ్చారు. వీరు కొత్తగా చెప్పినదేమీలేదు. సంప్రదాయ ఆర్థికవేత్తలు జెప్పిన ''సప్లరు దానంతట అదే డిమాండ్ సృష్టించుకొంటుంది'' అని కాలంచెల్లిన సూత్రాన్ని ప్రపంచీకరణ పేరుతో రుద్దారు. 1929-1933 మధ్యకాలం అమెరికాలో యితర దేశాలలో ఆర్థికమాంద్యం వచ్చినప్పుడు ప్రపంచమంతా కుప్పకూలింది. ఈ సూత్రం విఫలమైనప్పుడు కీన్స్ సూచించిన ''కొనుగోలు శక్తి పెంచడం - ప్రభుత్వ జోక్యం అవసరం'' సూత్రాన్ని అనుసరించి, ఆనాటి అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్డ్ ఆధ్వర్యంలో పరిష్కరించుకున్నారు. అందుకే కీన్స్ను పెట్టుబడిదారు వ్యవస్థ వైద్యుడు అని పిలిచారు. పెట్టుబడిదారి వ్యవస్థ సహజ లక్షణాలైన వ్యాపార చక్రాలలో భాగమే మాంద్యం లేదా ద్రవ్యోల్బణం అని కారల్మార్క్స్ అన్నాడు. ఈనాడు చర్చలో మార్క్స్ విశ్లేషణ ప్రక్కకు పెడదాం.
పెట్టుబడిదారి వ్యవస్థలో పరిష్కారం చూపిన కీన్స్ను కూడా పక్కకుపెట్టి భారత ఆర్థికవ్యవస్థలో కార్పొరేట్ మార్గాన్ని ఎన్నుకున్నారు. ప్రపంచీకరణ అనుసరించిన తరువాత వచ్చిన ప్రతి సంక్షోభం నుంచి బయటపడడానికి 'మార్క్సిస్టు దృక్పథమే' శరణ్యమైంది. 90వ దశకంలో కరెన్సీ పూర్తి కన్వర్టబులిటీని అనుసరించిన ఆసియా టైగర్స్ అని పిలువబడుతున్న దేశాలన్ని ద్రవ్య సంక్షోభం ఎదుర్కొని చతికిలబడ్డాయి. మనదేశంలో ఆనాడు విధాన నిర్ణేతలుగా వున్న ఆర్థికవేత్తలు అత్యుత్సాహంతో ''పూర్తి కన్వర్టబిలిటీకీ'' సిద్ధమైనప్పుడు మార్క్సిస్టు ఆర్థికవేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. రూపాయి మార్పిడి చేస్తే ఈ దేశానికి వచ్చే పెట్టుబడులకన్నా పోయేదే ఎక్కువగా ఉంటుందని చెప్పారు. వామపక్ష, అభ్యుదయ రాజకీయ సామాజికశక్తులు వ్యతిరేకిం చడంతో మనదేశం ఆసియా పులులుగా పిలవబడే దేశాలలాగా సంక్షోభంలో చిక్కుకోలేదు. 2008 నుంచి అమెరికాలో 'సబ్ప్రైమ్' సంక్షోభంలో కుప్పకూలింది. 110 బ్యాంకులు, అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ జీఐసీ కుప్పకూలాయి. వీటి వాటాలున్న అన్ని దేశాల కంపెనీలకు ఈ సంక్షోభం ఎగబాకింది. ఆనాటికే మనదేశంలో ఉన్న బ్యాంకులను, ఇన్సూరెన్స్ కంపెనీలలో ఎక్కువశాతం, అవసరంమైతే మొత్తాన్ని విదేశీ కంపెనీలకు అప్పజెప్పడానికి పెద్ద ప్రయత్నమే జరిగింది. ఇక్కడ కూడా మార్క్సిస్టు ఆర్థిక వేత్తలు, వామపక్ష అభ్యుదయశక్తులు, బ్యాంకు, ఇన్సూరెన్స్ ఉద్యోగ సంఘాల ప్రతిఘటన వలన ఈనాటి వరకు వాయిదాపడింది. ఆనాడే జరిగి ఉంటే ఆనాడే అమెరికా అనుభవం మనదేశంలోను జరిగేది. వాయిదా పడటం వలన మన బ్యాంకులు, బీమా సంస్థలు సంక్షోభానికి లోనుకాలేదు. డబ్ల్యుటీవోలో చేరినపుడు అన్ని రకాల అభ్యుదయ శక్తులు వ్యతిరేకించాయి. వినకుండా ప్రభుత్వం సంతకం చేసింది.
1995 నుంచి ఈనాటి వరకు 3.5లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దేశచరిత్రలో అనేక కరువులతో చనిపోయారు. కానీ, మార్కెట్లో అప్పులపాలయి చనిపోతున్న చరిత్ర మనకండ్లముందున్నది. వ్యవసాయరంగం రక్షించబడా లంటే ప్రభుత్వం పాత్ర ఉండాలని ఆనాడు అడిగితే వినని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈనాడు (ఎన్నికల ప్రయోజనం కోసమైనా) రైతాంగానికి అనేక పథకాలు ప్రకటిస్తున్నారు. కానీ వ్యవసాయరంగంలో కీలకమైన మార్పులకు పూనుకోవడంలేదు. గత 3దశాబ్దాలుగా అనేక అనుభవాలు ఎదురైనప్పటికీ ప్రభుత్వాలు తమ విధానాలు మార్చుకోవడం లేదు. ప్రభుత్వాలు మారుతూ ఉంటే పోటీబడి ప్రయివేటీకరణకు పూనుకొని కార్పొరేట్ విధానాలు అమలు జేస్తున్నాయి.
బీజేపీ ప్రభుత్వం గత ఐదేండ్లుగా కార్పొరేట్ల చేత, కోసం, యొక్క విధానాలు అమలు జరుపబడుతున్నాయి.
నేడు నిరుద్యోగం విషయంలో 45ఏండ్లలో అత్యధికంగా వున్నది. 6ఏండ్ల త్రైమాసకాలంలో కనిష్ఠంగా ఈసారి జీడీపీ 5శాతం పడిపోయింది. తయారీరంగం 0.5శాతానికి, వ్యవసాయం రంగం 2.5శాతానికి పడిపోయింది. అంతర్జాతీయ వ్యాపారంలో కరెంట్లోటు పెరుగుతూ ఉన్నది. నోట్లరద్దు, జీఎస్టీతో 5లక్షల చిన్న పరిశ్రమలు మూతబడ్డాయి. ప్రయివేట్రంగంలో 2కోట్లమంది ఉపాధి కోల్పోయారు. అనేక అంచనాల ప్రకారం యిప్పటికే దేశంలో 40కోట్ల మంది పేదరికంలో వున్నారు. ప్రభుత్వరంగాన్ని గత 25ఏండ్లుగా చేసిన ప్రయివేటీకరణ కన్నా ఈ ఐదేండ్లలో ఎక్కువ జరిగింది. ఆర్థికమాంద్యం కాలంలో ప్రభుత్వరంగం కీలకపాత్ర వహించాలన్న కీన్స్ చెప్పిన సూత్రం కూడా నిరాకరించే స్థితికి వచ్చింది.
కార్పొరేట్ల ప్రభుత్వాలు కలిసిపోయి అనుసరించిన విధానాల వలన ఆర్థికమాంద్యం చుట్టుముడుతున్నది. మాంద్యం సృష్టికర్తలే నేడు రక్షించమని గగ్గోలు పెడుతున్నారు. వాహన యజమానుల నుంచి అందరు సహాయం కోసం వరస కడుతున్నారు. ఈ సంక్షోభం నుంచి బయటపడేయడం కోసం కార్పొరేట్ల సలహాతో ప్రభుత్వం యజమానుల పెట్టుబడుల పెరుగుదల కోసం, కొనుగోలు దారుల సుంకాల కోసం వడ్డీరేట్లు తగ్గించారు. ఆనాడే 'కీన్స్' వడ్డీరేట్లు తాత్కాలిక ఉపశమనమేనని దీర్ఘకాలంలో పనిచేయదని చెప్పాడు. 2008 అమెరికాలో ఉద్దీపనులు ప్రకటించి వడ్డీరేట్లు తగ్గించారు. తాత్కాలికంగా ఉపశమనం కల్గినప్పటికీ, గత దశాబ్దకాలంలో మాంద్యం పరిస్థితులు కొనసాగుతూ వృద్ధిరేటు కనీసస్థాయిలో కొనసాగుతున్నది. అదేకోవలో ఆర్థికమంత్రి నిర్మల 70 వేలకోట్లు ప్రభుత్వం బ్యాంకులకు మూలధన పెరుగుదలకు సమకూర్చారు. బ్యాంకులు తక్కువవడ్డీ రేట్లకు రుణాలిస్తే, వాహనాల విక్రయాలు యితర వస్తుసేవలు కొనుగోలు పెరుగుతాయనే సిద్ధాంతం యిమిడి ఉన్నది. ఆనాడే కీన్స్ అది పనిచేయదని చెప్పాడు. ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటే 'ఆదాయ' స్థాయి పెరగాలని సూచించాడు. వేతనస్థాయి కృత్రిమంగా నొక్కిపెట్టి రుణాలిస్తామంటున్నారు. 7వ వేతన సవరణలతో 3.5రెట్లు మూలవేతనం పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తే 2.57 రెట్లు పెంచారు. వేతన సవరణ చరిత్రలో అత్యంత కనిష్ఠ స్థాయి పెంపకం యిదే.
కేంద్ర వేతనాన్ని ఉదహరణకు తీసుకొని అన్ని రాష్ట్రాలు వేతన స్థాయిని అణచివేస్తున్నాయి. అసంఘటిత రంగంలో కోట్లాది మందికి కనీస వేతనం లేదు. వృత్తులవారి వ్యవస్థ, రైతాంగం, మధ్యతరగతి వర్గ జీవితాలు జీవనాధార స్థాయిలో బతుకునీడుస్తున్నారు. ఓపెన్ మార్కెట్లో 'నిరుద్యోగ సైన్యం'ను చూపెట్టి వేతన నిర్బంధం కొనసాగుతున్నది. పరిశ్రమ, సేవారంగాలలో అదనపు ఉత్పాదకతకు - అదనపు వేతనానికి మధ్య గ్యాప్ అంతరం పెరిగి, కార్పొరేట్లకు మిగులు పెరిగి మరొక వైపు శ్రామికులకు కొనుగోలుశక్తి సరిపోవడం లేదు. యీ కారణాలతో మాంద్యం ఏర్పడింది. ఈ దృష్ట్యా ఉద్దీపనులు కావలసింది కార్పొరేట్లకు కాదు, ప్రజల ఆదాయాల పెంపునకు ఉద్దీపనలు కావాలి. 1933లో అమెరికాలో కూడా కీన్స్ సూచించినట్టు పనిదినాలు సృష్టించే ఉపాధి కల్పనకు అనేక స్కీమ్లు ప్రవేశపెట్టి ఆదాయస్థాయి పెంచారు. అందుకనీ వడ్డీరేటు తగ్గించడమనేది 'ఒకమెట్టు' వరకే సరిపోతుంది. ప్రజలు సంపన్నులు అయితే సమిష్టి డిమాండ్ పెరుగుతుంది తప్ప కృత్రిమ వినియోగదారుత్వం దీర్ఘకాలంలో నిలబడదు.
మాంద్యం పరిష్కరించడానికి ప్రభుత్వం కార్పొరేటు మార్గం ఎంచుకున్నది. కార్పొరేట్లకు ఉద్దీపనలు ప్రకటిస్తే ఉన్న సంస్థలు లాభపడవచ్చు కాని కొత్తవిరావు. మోడీ ప్రభుత్వం వడ్డీరేటును కనిష్టస్థాయికి తగ్గించి ప్రపంచమంతా తిరిగి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం ఆర్జించినా ప్రోత్సాహకరంగా లేదు. కొన్ని ఎఫ్పీఐలు లేదా విలీనాలు, స్వాధీనాలు తప్ప ప్రత్యక్ష ఉత్పత్తి పెట్టుబడులు ఆశాజనకంగా లేవు. దేశంలో స్థిరమైన ఆర్థిక, సాంఘిక వాతావరణం ఉన్నపుడే వస్తాయి. ఎంత సరెండర్ అయినా విదేశీ పెట్టుబడుదారులకు మన మతతత్వ రాజకీయాల ఎడల అనుమానాలున్నాయి. రాజకీయ వ్యవస్థలో కనీస ప్రజాస్వామ్య పద్ధతులు అవలంబించకపోతే, విదేశీ పెట్టుబడులు నిరుత్సాహపడతాయి. ప్రపంచబ్యాంక్, డబ్ల్యుటీవో ఒప్పందాల మేరకు కొద్దోగొప్పో పారిశ్రామికీకరణ జరిగినప్పటికీ ఉపాధికి ప్రోత్సాహం లేదు, ఆదాయ సృష్టి లేదు.
పెట్టుబడిదారీ విధానం ఎలా కూలిపోతుందో కారల్మార్క్స్ చెబితే, కీన్స్ పెట్టుబడిదారీ విధానాన్ని ఎలా బతికించాలో చెప్పాడు. ముఖ్యంగా మాంద్యం పరిస్థితులలో ప్రభుత్వ వ్యయం ప్రధానపాత్ర వహించాలన్నాడు. అవసరమయితే 'విత్తలోటు'ను అనుసరించాలన్నాడు. కానీ ప్రపంచ బ్యాంక్ ఆదేశంతో మన బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్టు తెచ్చుకున్నాం. ప్రస్తుతం జీడీపీలో 3.3శాతం మించి లోటు ఉండటానికి వీలు లేదు. జీఎస్టీ మొదలైన అస్థిర పన్నుల విధానాల వలన ప్రభుత్వ ఆదాయానికి పరిమితి ఏర్పడింది. ఖర్చును పూడ్చుకోవడానికి రిజర్వుబ్యాంకు నిధులను నిర్బంధంగా మళ్ళించుకుంటున్నది. ఎన్నికలకు ముందే ఆర్బీఐ మీద వత్తిడి ప్రారంభించింది. మాజీ గవర్నర్లు వ్యతిరేకించి రాజీనామా చేసి వెళ్ళారు. ఈ మాంద్యం పరిస్థితి నుంచి ప్రజలను రక్షించడం కాకుండా కార్పొరేట్లను ఆదుకోవడానికి ప్రభుత్వం పూనుకున్నది. సంపన్న వర్గాలపై సర్చార్జీ ఉపసంహరణ, అంకురాలకు పన్ను మినహాయింపు జీఎస్టీ రిఫండ్, వాహనాలపై జీఎస్టీ తగ్గించి ప్రోత్సహించడం, ప్రభుత్వమే కొత్త కార్లు కొనడం అనేకం ఉన్నాయి. వీటన్నిటికి పరిమితులున్నాయి. చివరకు బ్యాంకుల ఏకీకరణ వలన కార్పొరేట్లకు పెద్ద రుణాలిచ్చేందుకు ఉపయోగపడ్డాయి తప్ప, ప్రజల వద్దకు వెళ్ళిన శాఖలు తగ్గాయి. గత ఐదేండ్లలో 4.3లక్షలకోట్లు రుణమాఫీ చేశారు. చివరకు 'ప్రజల కోసం బ్యాంకులు' అన్ని బ్యాంకుల జాతీయకరణ అన్న లక్ష్యం వదిలేసి, పెద్దలకోసం ఏకీకరణ అమలు చేస్తున్నారు. ముందుముందు ఆర్థిక మాంద్యం తీవ్రమైతే ఆర్బీఐ బలంగా ఉండాలి. కానీ మూలధన నిధులను అవసరాలకు ఉపయోగించుకొన్న నిర్వీర్యం చేయడం ప్రమాదకరంగా మారుతుంది. కార్పొరేట్లు మార్కెట్ విలువకన్నా అప్పులు ఎక్కువవుతున్నాయి. వీటినుంచి బ్యాంకులు తిరిగిరాబట్టే రుణాలు తక్కువ. నమ్మకం పోయినప్పుడు ఓపెన్ మార్కెట్లో నిధులు సమీకరించలేక అనేక సంస్థలు చేతులెత్తేస్తున్నాయి. ఈ పరిస్థితులు యిలా ఉంటే కొంతమంది ఆశావాదులు 5ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను యానిమేషన్లో చూపెడుతున్నారు. మన వృద్ధిరేటు శక్తి ఏమిటో ఐదేండ్లుగా తెలిసి వచ్చింది. పెరుగుతున్న ధరలలో కాకుండా వాస్తవ ధరలలో లెక్కగడితే వృద్ధిరేటు యింకా తక్కువగా ఉంటుంది. అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం నుంచి లాభపడి, ఎగుమతులు పెంచుకొని ఆదాయం పెంచుకొంటున్న వారు ఉన్నారు. కానీ అవకాశం వచ్చినా ఉపయోగించుకొనే సాంకేతికత, ఉత్పత్తి సామర్థ్యం మన పారిశ్రామిక రంగానికి లేవు. ఇప్పటికిప్పుడు రావాలంటే వచ్చేదికాదు.
ఈ మాంద్యం నుంచి బయట పడటానికి ప్రభుత్వ వ్యయం పెంచడం, ఉపాధికల్పన స్కీమ్లను మరిన్ని పెంచి ప్రజల ఆదాయాలు పెంచడం, ఉత్పత్తితో వేతనాలు వాటాలకు అన్ని రంగాలలో పెంచడం, వ్యవసాయం, వివిధ వృత్తులు, చిన్న పరిశ్రమలకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం, పారిశ్రామికీ కరణకు మౌలిక వసతులు కల్పించడం, అన్ని రంగాలలో ప్రజల కొనుగోలుశక్తి పెంచే మార్గాలు వెదకాలి.
ప్రభుత్వ విధానాలు మార్చి యీ పరిస్థితుల నుంచి దేశాన్ని, ప్రజలను ఆదుకోవడానికి రాజకీయ పార్టీలు ఆలోచించాలి. ప్రజల దృష్టి మరల్చడానికి, సంక్షోభ కారణాలను ఆలోచించకుండా చేయడానికి అనేక విధాలుగా ఆవేశాలను సృష్టిస్తున్నారు తప్ప శాస్త్రీయ ఆలోచనలు లేవు.
- డాక్టర్ అందె సత్యం
ఆర్థిక విశ్లేషకులు, ఫోన్: 9848187559