Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషి పుట్టుకలో క్షేత్ర ప్రధానమా బీజ ప్రధానమా అనే అంశంపై ఇప్పటికీ వివాదాలు చల్లారని చోట మరో సంఘర్షణకు తెర లేచింది. సంపద సృష్టికర్తలు ఎవరన్న దానిపై స్వయాన మన ప్రధాని మోడీ చర్చను ప్రారంభించారు. నరేంద్ర మోడీ పంద్రాగస్టు ఉపన్యాసం సందర్భంగా పెట్టుబడిదారులే సంపద సృష్టికర్తలని వారికి సహకరించాలని గంభీరంగా పిలుపునిచ్చారు. ఆ తరువాత ఆర్థిక శాఖా మంత్రి, నిర్మలా సీతారామన్ మరో అడుగు ముందుకేసి పెట్టుబడి దారులు సంపదే కాదు ఉపాధి సృష్టికర్తలూ అంటూ వ్యాఖ్యానించారు. ఇలా వ్యాఖ్యానించడం శ్రామిక వర్గాన్ని కించపరచడమే. ఎవరైనా సానుభూతితో ఉపాధిని సృష్టిస్తారా? తమకు అవసరం లేనిదే శ్రామికులకు పని కల్పిస్తున్నారా? శ్రామికులే లేకుంటే పెట్టుబడిదారులు ఏమి/ఎలా సృష్టిస్తారు? వీళ్ళేవరూ పైనుండి ఊడి పడలేదు. శ్రామికులు పెట్టుబడిదారులు పరస్పరాధారితులు. నేటి పెట్టుబడిదారులు సంపద సృష్టికర్తలు కాదు, ప్రభుత్వాల సృష్టికర్తలు, శ్రామికుల శ్రమను పిండి పాలకులతో కలిసి లాభాన్ని పంచుకునే దాష్టీకపు శక్తులు. వనరులపై ఆధిపత్యాన్ని సాధించి అత్యాశతో, ఆశ్రిత పక్షపాతాలతో పెట్టుబడిదారుల అవతారాలెత్తుతున్నారు. ఈ రోజు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోండటానికి కారణం శ్రామికులా పెట్టుబడిదారులా? శ్రామికులకు ఎక్కువ చెల్లించడం వల్ల మార్కెట్లు మందగించాయా? శ్రామికుల చేతుల్లో డబ్బే ఉంటే మార్కెట్లు కళకళలాడుతుండేవి. అంగట్లో అన్ని ఉన్నా అల్లుని నోట్లో శని ఉన్నట్టుగా అన్ని చోట్లా ఉత్పత్తి పెరిగింది. కానీ వాటికి గిరాకీ లేదంటే అర్థమేమిటి? సమాజం నుంచి కొనుగోలు శక్తిని ఎవరు హరించారు? పెట్టుబడి దారులు అత్యాశకు పోయి, ఉపాధి కల్పనలో క్రమ పద్ధతి పాటించకుండా తక్కువ వేతనాలిస్తూ, వీలైనంత తక్కువ కాలం ఉపాధి కల్పిస్తూ నిరంతర ఆదాయమనే సూత్రానికి నీళ్ళొదిలి శ్రామికులందరికీ పూట గడవటమే కష్టంగా మార్చినందుకేగా పారిశ్రామిక ఉత్పత్తులకు గిరాకీ తగ్గింది.
'వానరుడు నరుడుగా మారిన క్రమంలో శ్రమ పాత్ర' అని, వనరుల వినియోగం ద్వారా సమాజాభివృద్ధికి శ్రమనే మూలమని ఇన్నాళ్లు చదువుకున్నాం. దొర్లుతున్న రాయిని ఒక చక్రంగా మలిచిందీ, అటవీ భూముల్ని పంటలకు అనువుగా మార్చుకున్నదీ శ్రమ మాత్రమే అని తెలుసుకున్నాం. శ్రమ అంటే భౌతికమైనది మాత్రమే అనే భావన రావడం చాలా దురదృష్టం. మానసిక శక్తి లేకుండా భౌతిక శ్రమ ఉండదు. ఒక రాయిని ఒక చోట నుంచి తీసి మరో చోట పెట్టాలంటే భుజ బలమొక్కటే సరిపోదు, భుజ బలంలో బుద్ది బలం ఇమిడి ఉంటుంది. బుద్ది బలమే లేదనుకుంటున్న ఎద్దు కూడా తన యజమానికి సహకరించే బుద్ధి ప్రదర్శిస్తుంది. శ్రామికులు కార్మికులూ అంటే కాయకష్టం చేసే క్రింది తరగతి వారు అంటూ పాలకులు తప్పుడు భావనలో ఉన్నారు. శ్రమకు ఉపాయాన్ని తోడు చేసి, దానిని నైపుణ్యంగా మలిచి పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నాగరికత మలచుకున్నాడు మనిషి. శ్రామికుల లభ్యత ఎక్కువగా ఉన్నప్పుడు ఉపాయం గలవారు మిగులు శ్రమని విభిన్న కోణాల్లో ఉపయోగించుకోవడంతో ఉత్పత్తి మరింత పెరిగింది. అడవిలో ఒక చెట్టు పండ్లు దాని నుంచి రాలిపడి ఆ చెట్టు కిందే మొలకెత్తడం వల్ల వాటి పెరుగుదల జరగలేదు. ఆ పండ్లు మనిషి తిన్న తర్వాత గింజలను విసిరేసిన మరోచోట ఎదిగిన చెట్టు మరిన్ని పండ్లు కాసింది. ఈ క్రమమే బీడు భూమిని సాగు చేసి విత్తనాలు విత్తుకునే స్థాయికి మానవుణ్ణి పురిగొల్పింది. మానవాభివృద్ధికి మూలమైన వ్యవసాయరంగంలో పెట్టుబడి పాత్ర ఎప్పుడు వచ్చింది? కోట్లాది సంవత్సరాల తరువాత కానీ పెట్టుబడి అనే మాట రాలేదు. ఒక్కపైసా పెట్టుబడి పెట్టకుండా సేంద్రీయ వ్యవసాయం చేసి మిగులు సృష్టిస్తున్న రైతు సంపద సృష్టికర్త కాడా? ప్రతి వ్యక్తి తన శ్రమ వల్ల తన అవసరానికి మించి సాధించిన ఉత్పత్తి అంతా అతను సృష్టించినట్టే. సంపద సృష్టించబడటంలో పెట్టుబడిదారుడు ఒక సంధానకర్త మాత్రమే కానీ సృష్టికర్త ఎన్నడూ కాలేడు. రిలయన్స్ జియో సంస్థ మూడేండ్లలో ముప్పై కోట్ల వినియోగదారులను పోగు చేసుకున్న క్రమంలో సృష్టికర్త కేవలం ముఖేష్ అంబానియా? మార్కెట్లోని ఇతర కంపెనీలను తొక్కేయడానికి రూపొందించిన పథకాలు అమలయ్యేందుకు కేంద్ర ప్రభుత్వమే సహకరించిన మాట వాస్తవం కాదా? కాంట్రాక్టు పద్ధతిన నియమించుకున్న ఉద్యోగులకు అత్యంత తక్కువ చెల్లించి, విపరీత పోటీలు, ఇన్సెంటివ్లు పెట్టి ఇతర నెట్వర్కుల నుంచి కస్టమర్లను జియోకు రాబట్టుకున్నారు. నేడు సదరు చిరుద్యోగుల్ని తొలగించారు. జియోకి వీరు పని చేసిన కాలం తక్కువే. కానీ జియో సాధించే ప్రతి మిగులులో వీరి పాత్ర ఉంటుంది. తాటి చెట్టుకు రంధ్రం కొడితే ''నీరా'' కారుతుందన్న విషయాన్ని చెప్పినోడు జీవితాంతం దాన్ని అనుభవిస్తున్నాడు. ప్రాణాలకు తెగించి చెట్టెక్కి రంధ్రాన్ని కొట్టినోడికి మాత్రం ఓ రెండు పూటలా భోజనమా! పెట్టుబడిదారుడే సంపద సృష్టి కర్త అని నరేంద్ర మోడీ మాత్రమే కాదు, చాలా మంది సాధారణ ప్రజల్లో కూడా ఇదే అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడిదారుడు ఒక సంస్థ శ్రామికులను ఒక చోటకు చేర్చి పని కల్పించడం వల్లనే ఉత్పత్తి జరుగుతుంది. తద్వారా ఉద్యోగులకు జీతాలు, యజమానికి లాభాలు వస్తాయి అనే భావనలో ఉంటారు. ఇది కొంతవరకే నిజం. పెట్టుబడి అంటే మూలధనం, భూమి, శ్రమ. మొదటి రెండింటిని ఉపయోగించే మానసిక భౌతిక చర్యనే శ్రమ. భూమి, మూలధనాలను సేకరించిన వారిది కూడా శ్రమే. అతనూ శ్రామికుడే. పెట్టుబడిదారుడుగా పిలువ బడుతున్న వారిది సంకల్పం, చాణక్య యుక్తి మాత్రమే. శ్రామికుడికే సకల నైపుణ్యాలు ఉంటున్నాయి. అంటే పెట్టుబడిదారుడు తన ఉపాయంతో మూలధనం భూమీ శ్రమా ఒక చోటుకి చేర్చినప్పుడు శ్రామికుడు తన నైపుణ్యంతో మూలధనాన్ని భూమిని చాకచక్యంగా ఉపయోగించి విపరీతమైన ఉత్పత్తి సాధిస్తున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడిదారుడి పాత్ర నామమాత్రం. ఒక ప్రభుత్వరంగ సంస్థను ఏర్పరచడంలో ప్రభుత్వపాత్ర చట్టం రూపకల్పన వరకే ఉంటుంది. అందులోని శ్రామికుల శక్తియుక్తుల వల్లనే లాభాలు వస్తాయి. వాటిని ప్రభుత్వం ఆరగిస్తుంటుంది. ఉదాహరణకు జీవిత బీమా సంస్థ ఏర్పాటుకు కేవలం ఐదు కోట్లు పెట్టుబడి పెట్టింది. నేడు సాలీనా 95శాతం లాభాలను పాలసీ దారులకు పంచాక కూడా రెండున్నర వేల కోట్లను ప్రభుత్వానికి డివిడెండుగా చెల్లిస్తోంది. ఇందులో యజమాని పాత్ర పేరుకు మాత్రమే. ప్రభుత్వరంగ సంస్థ కాబట్టి లాభాలు పాలసీదారులకు పంచబడుతున్నాయి. ప్రయివేటు సంస్థ అయితే యజమాని తన సొంతమని చెప్పి, తానే దానిని సృష్టించినట్టు ప్రకటించుకుంటాడు.
మనం అనుసరిస్తున్నది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కాబట్టీ పెట్టుబడిదారులు అవసరమే. అయితే వారిపై కనీస నియంత్రణ లేకపోవడం వల్ల చెడు ఫలితాలు వస్తున్నాయి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థలోని ఈ లోపాల్ని సరిదిద్దుకుని సామ్యవాద ఆర్థికం దిశగా పయనించాల్సింది పోయి స్టార్టప్(అంకుర) కంపెనీలకు అనుమతిస్తూ దేశ భవిష్యత్తు ఇదే అని చాటారు. 2017లో ఏర్పాటైన స్టార్టప్ల్లో 50శాతం సంవత్సరంలోపే మూతపడ్డాయని అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ అభిప్రాయపడింది. మల్టీ నేషనల్ కంపెనీలకు అవకాశమిచ్చినచోట అంకుర సంస్థలు ఆరిపోవడం సహజం. పెట్టుబడి చిన్నదైనా పెద్దదైనా లాభాపేక్షనే ప్రధానం. కాబట్టి ప్రతి మనిషీ మరియొకణ్ణి దోచుకొనుటే... ఈ విధానం పర్యావసానమే దేశ సంపదలో 73శాతం ఒక్క శాతం జనాభాతో పోగైంది. ఇప్పుడు వచ్చిన సమస్యల్లా ఉపాయం(పెట్టుబడి) గొప్పదా నైపుణ్యం(శ్రమ) గొప్పదా? ఉపాయం అందలం ఎక్కుతుంటే నైపుణ్యం అధ్ణ పాతాళానికి తొక్కబడుతోంది. ఇప్పుడున్న పెట్టుబడిదారులకు సొంత ఉపాయం, చాణక్యత గానీ, సొంత మూలధనం అంటూ ఏదీ లేదు. వీటిని కూడా సేకరించుకుంటున్నారు. సంపాదించాలన్న సంకల్పంతో పాటు యుక్తిని కుయుక్తిగా మలచుకుని పెట్టుబడిదారుడు వ్యవహారాల్లోకి దిగుతున్నాడు. దానికోసం ఏ కంపెనీ పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి, మూలధనం ఎవరి నుంచి ఎలా సమకూర్చుకోవాలి సదరు ఉపాయాలన్నీ కూడా మళ్లీ యుక్తి గల శ్రామికుల నుంచే పొందుతున్నాడు. ఇక కావలసిన చట్టపరమైన సౌలభ్యతలన్నీ ప్రభుత్వానికి ఆశ్రితపక్షంగా ఉంటూ పొందుతున్నాడు. ఈ సంకల్పానికి కార్యరూపం ఇచ్చిన వారికి కూడా కొంత నగదు చెల్లించి చేతులు దులుపు కుంటున్నారు. వెరసి నయా పెట్టుబడిదారునికి ఉపాయం, భూమి, మూలధనం ఏవీ అవసరం లేదన్న మాట. శ్రామికుడు మాత్రం తన నైపుణ్యాన్ని రోజురోజుకు మెరుగుపరుచుకుని సంపదను అనేక రెట్లుగా పెంచుతూ వస్తున్నాడు. ఈ క్రమానికి నాంది పలికినందుకు దీని సృష్టికర్తలు.. తామే అంటున్న పెట్టుబడిదారులకు పాలకులు వత్తాసు పాడటం వారి పక్షపాతదృష్టే తప్ప వాస్తవం కాదు.
- జి. తిరుపతయ్య
సెల్: 9951300016