Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2014లో ప్రారంభమైన రోడ్డు భద్రతా బిల్లు 2019 జూలై 31న మోటారు వాహన చట్ట సవరణ బిల్లుగా రాజ్యసభ ఆమోదం, ఆగస్టు 8న రాష్ట్రపతి ఆమోదం పొందింది. అందులోని కొన్ని అంశాలు సెప్టెంబరు 1 నుంచి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అనేక రాష్ట్రాలలో అమలు మొదలైంది. ఈ నూతన చట్ట సవరణలను శాశ్వతంగా తిరస్కరించాలని అభ్యర్ధిస్తూ ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసింది. రవాణరంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉంది. కాబట్టి సవరణలను తిరస్కరించే హక్కు రాష్ట్రాలకు లేదనే వార్తలు వస్తున్నాయి. దీనిపై న్యాయ నిపుణుల వివరణ తీసికోవాల్సి ఉంది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? లోక్సభలో ఎన్డీఏకి, స్వయానా బీజేపీకే సంపూర్ణ మెజారిటీ ఉంది. కాబట్టి లోక్సభలో బిల్లు ఆమోదం పొందటంలో ఎలాంటి ఆశ్చర్యం, ఆందోళన లేదు. కానీ రాజ్యసభలో నేటికి ఎన్డీఏకి పూర్తి మెజారిటీ లేదు. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు చేసి వుంటే రాజ్యసభలో బిల్లు ఓడిపోయి ఉండేది.
మోడీ ప్రభుత్వ మొదటి ఐదేండ్లు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించి, సెలెక్ట్ కమిటీ నివేదికలో కూడా తమ తిరస్కారాన్ని రాత పూర్వకంగా నమోదు చేసిన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, అన్నా డీఎంకె పార్టీల సభ్యులు సహితం 2019 జూలై 31న జరిగిన ఓటింగ్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా బిల్లుకు అనుకూలంగా వ్యవహరించారు. కేవలం సీపీఐ, సీపీఐ(ఎం), డీఎంకె పార్టీల సభ్యులు 13మంది మాత్రమే బిల్లుకు వ్యతిరేకంగా రాజ్యసభలో ఓటు చేశారు. ఆ విధంగా వినాశకర బిల్లు పట్ల చివరి వరకు వ్యతిరేకంగా నిలిచి కార్మికవర్గంతో నిలబడిన సీపీఐ(ఎం), సీపీఐ, డీయంకే పార్టీలకు, వారి ఎంపీలకు నీరాజనాలు.
లైసెన్స్కు విద్యార్హతల తొలగింపు? ఆమోదం పొందిన చట్ట సవరణలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ప్రస్తుత 8వ తరగతి నిబంధనను తొలగించారు. కొంతమంది దీన్ని గొప్ప వరంగా కీర్తిస్తున్నారు. కానీ వాస్తవం ఏమిటి? దేశంలో హెవీ లైసెన్స్దారులు అవసరానికంటే 30శాతం తక్కువగా ఉన్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. కారణం ఏమిటనేది ప్రధాన అంశం. ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో, ఇంటికి సక్రమంగా చేరతానో లేదోననే భయాందోళన... రేయనక, పగలనక, ఎండ, వాన, చలి లాంటి వాతావరణ పరిస్థితులలో పని చేయాల్సి రావడం... రహదారుల వెంట విశ్రాంతి, పార్కింగ్తో కూడిన, అందుబాటు ధరలతో హోటళ్లు లేకపోవడం... అత్యంత హీనమైన వృత్తిగా పరిగణించి డ్రైవర్లను చులనకగా చూడటం... అతి తక్కువ వేతనాలు, నియమితిలేని పనిగంటలు, చట్టాలు వర్తించకపోవడం, సామాజిక భద్రతా పథకాలు లేకపోవడం డ్రైవర్ల కొరతకు ప్రధాన కారణాలు.
వీటి పరిష్కారాన్ని గురించిన కనీస ఆలోచనా, ఎలాంటి చర్యలూ ప్రణాళికా లేకుండా కేవలం విద్యార్హతలు తొలగించడం మాత్రమే పరిష్కారం కాదు. భారీ పెనాల్టీలు, శిక్షలు పరిష్కారమా? రహదారి నిబంధనలు ఉల్లంఘించిన వారికి, ప్రమాదాలు జరిగిన సందర్భాలలో డ్రైవర్లకు భారీగా జరిమానాలు, శిక్షలు పెంచటం చట్ట సవరణలో మరొక ప్రధాన అంశం. వాహన చోదకులు, రహదారుల వినియోగదారులు రహదారి నిబంధనలను ఉల్లంఘించకుండా చూడటం అవసరం. ఇందులో ఎలాంటి వివాదానికి తావుండకూడదు. అయితే ఉల్లంఘనలు ఎందుకు జరుగు తున్నాయి. అందుకు దారితీస్తున్న కారణాల నివారణకు చర్యలు తీసుకోవడం ప్రాధమికంగా జరగాలి. ప్రణాళికాబద్ధంగా రహదారుల నిర్మాణం, నిర్వహణ, వాహనాల నియంత్రణ ప్రధానం. ఇలాంటి మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. దీన్ని గాలికి వదిలేసి బాధ్యతారాహిత్యంగా వాహనాల కొనుగోలుకు విచ్చలవిడి రాయితీలు ఇచ్చి ప్రోత్సహించడం సమస్యకు మొదటి కారణం. వాహన చోదకులు, రహదారుల వినియోగదారులతో 'రోడ్డు భద్రత - రహదారి నిబంధనలు' పట్ల అవగాహన, చైతన్యం కల్పించకపోవడం రెండవ కారణం.
ఈ రెండింటిలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. తన వైఫల్యానికి ప్రజలను బలి పశువులను చేస్తున్నది. నిత్యం అమెరికా, ఇతర అభివృద్ధి చెందిన దేశాల గురించి నీతులు వల్లించే ప్రభుత్వం ఆ దేశాలలో మౌలిక సదుపాయాలు, రహదారి నిబంధనల పాటింపు ఎలా జరుగుతున్నదో పట్టించుకోకుండా భారీ జరిమానాలు, శిక్షలు పెంచటం పరిష్కారంగా ఎంచుకోవడం ప్రజలపై దాడి చేయడం తప్ప మరొకటి కాదు.
సంస్కరణల పేరిట జరుగుతున్న సరళీకరణ విధానాలను పొగిడి, బలపరచే దినేష్ మోహన్ (ఢిల్లీ 117 ప్రొఫెసర్) లాంటి వారు సహితం జరిమానాలు వ్యక్తి ఆదాయం, భరించగలిగే శక్తికిలోబడి ఉండాలని ఘోషిస్తున్నారు. కానీ జరిగిందేమిటి? రోజులో 10 నుంచి 15 గంటలు నానా అవస్థలు పడే ఆటో డ్రైవరుకు ఖర్చులు పోను మిగిలేది రోజుకు మహా అయితే ఐదు వందల రూపాయలు. కానీ నూతన చట్ట సవరణ ప్రకారం చిన్న చిన్న పొరపాట్లకు సహితం కనీసం వెయ్యి రూపాయల జరిమాన. అది మొదటి సారి. ఆ తర్వాత మరల జరిగితే జరిమాన మొత్తం పెరుగుతుంది. పైగా లైసెన్స్ సస్పెన్షన్, వాహన స్వాధీనం లాంటివి కూడా ఉంటాయి. దీన్ని ప్రజలపై యుద్ధం కాక ఏమనాలి? ప్రస్తుతమున్న రూ.100, 200 జరిమానాలే చెల్లించలేక పేరుకుపోయిన కేసులు కోకొల్లలు. ఇలాంటి తరుణంలో జరిమానాలు అనూహ్యంగా పెంచడం అవినీతిని ప్రోత్సహించ డానికే దారితీస్తాయ నడంలో సందేహం లేదు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారమే కేవలం 2శాతంగా వున్న జాతీయ రహదారులపై సుమారు 40శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ వాహనాలు చిన్న వాహనాల మధ్య జరిగే ప్రమాదాలు అత్యధికంగా ఉంటున్నాయి. ఇందుకు అనేక కారణాలున్నా మూడు కారణాలు ముఖ్యమైనవి. 1. భారీ, మధ్య తరహా, తేలికపాటి ద్విచక్ర వాహనాలతో సహా అన్నీ ఒకే రోడ్డులో వెళ్ళాల్సి రావటం. ప్రపంచంలోని అనేక దేశాలలో వాహన శక్తి, వేగాలకు అనుగుణంగా రోడ్డు వివిధ లేన్లుగా విభజించి ఉంటుంది. ప్రధానంగా జాతీయ రహదారులలో ఇలాంటి ఏర్పాటు తక్షణం జరగాలి. భారీ ఖర్చు లేకుండానే ప్రస్తుత జాతీయ రహదారులపై ఈ ఏర్పాటు చేయొచ్చు. మొట్ట మొదటగా కనీసంగా సరకు రవాణా వాహనాలకు ఒక లేను, ప్రయాణీకుల వాహనాలకు వేరొక లేను ఏర్పాటు చేస్తే తక్షణం కొంతమేర ప్రమాదాలు నివారించవచ్చు. 2. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవసరాల మేర పెరగకపోవడం, అత్యధిక వేగంతో వెళ్ళే అధునాతన వ్యక్తిగత వాహనాలు పెరగడం ప్రమాదాలకు మరొక ప్రధాన కారణం. ప్రజలకు అందుబాటులో ఉండే ఛార్జీలతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను విస్తరించాలి. 3. రోడ్ల నిర్మాణంలోని లోపాలు - మహబూబ్నగర్జిల్లా పాళెం వద్ద జరిగిన జబ్బార్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం, కరీంనగర్ జిల్లా కొండగట్టు బస్ ప్రమాదం, లాల్జాన్ బాషా, హరికృష్ణ, యర్రం నాయుడులు చనిపోయిన ప్రమాద ప్రాంతాలు రహదారి నిర్మాణ లోపాలతో జరిగినవే. ఇలాంటివి ఇంకా అనేకం వున్నాయి. వీటిని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. సవరించిన మోటారు వాహన చట్టంలో రహదారుల నిర్మాణ లోపాలకు బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారులకు జరిమాన లక్ష రూపాయలుగా నిర్ణయించారు. అదే మైనరు వాహనం నడిపి ప్రమాదానికి గురైతే 3లక్షల జరిమాన, జైలు శిక్ష,వాహన రిజిస్ట్రేసన్ రద్దు నిర్ణయించారు. అంటే ప్రభుత్వం ఎవరి ప్రయోజనం కోసం వుందో ఇది రుజువు చేస్తున్నది.
చట్ట సవరణ వెనుక అసలు రహస్యం? ప్రభుత్వ గణాంకాల ప్రకారమే ఆర్టీసీలలో అతి తక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు తగ్గించాలంటే ఆర్టీసీలను బలపరిచి విస్తరించాలి. కానీ చట్ట సవరణలో ఆర్టీసీలను నిర్వీర్యం చేసి సమాధి కట్టేందుకు పలు అంశాలు చేర్చారు. మరొక ముఖ్య అంశం 'అగ్రిటేటర్స్' పేర భారీ కంపెనీలను చట్ట సవరణలో చేర్చారు. ఫలితంగా రానున్న రోజులలో ఒకటి / రెండు వాహనాలుండి తాము కూడ డ్రైవరుగా పనిచేసే కోట్లాది మంది ఆటోటాక్సీ, లారీ, బస్ల చిన్న చిన్న యజమానులు భారీ కంపెనీలకు లొంగిపోవాలి. వాటికి అనుసంధానం చేసి కంపెనీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలి. మూడవ అంశం ప్రభుత్వ రవాణా శాఖను నిర్వీర్యం చేసి అన్నింటిని ప్రైవేటు ఏజెన్సీలకి అప్పగించడం. ప్రమాదాలను తగ్గించ డమే లక్ష్యం అయితే పై మూడు అంశాలు బిల్లులో ఎందుకు వచ్చాయి? తెరచాటు ఈ అంశాలే ప్రధానంగా చట్ట సవరణ లక్ష్యాలు తప్ప ప్రమాదాలు తగ్గించటం కాదు. అయితే ప్రమా దాలు ఎక్కువగా జరగడం, ప్రజలలో వాటి పట్ల వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆ ముసుగులో డ్రైవర్లను ముద్దాయిలుగా నిలిపి ప్రమాదాల నివారణ కోసమే చట్టసవరణ అని నమ్మించి, తమకు పలు విధాలుగా సహకరించిన భారీ కంపె నీల రుణం తీర్చుకొని ప్రభుత్వం ప్రజలను బలిపశువులను చేసింది.
- ఆర్. లక్ష్మయ్య
సెల్:9971511954