Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 17 వస్తున్నదంటే చాలు.. బీజేపీ వాళ్లకు తెలంగాణ భక్తి పూనకంలా వస్తుంది. నిజాం మీదా, నిజాము అత్యాచారాల మీదా కారాలు మిరియాలు నూరుతుంటారు. నిజాముకు వ్యతిరేకంగా పోరాడిన వీరుల గురించి వారి త్యాగాల గురించి అలుపు సొలుపు లేకుండా పొగుడుతుంటారు. వీరి వీరావేశం చూస్తే, బీజేపీ వారు లేదా వారి పూర్వీకులు నిజాముకు వ్యతిరేకంగా విరోచిత పోరాటం చేశారేమోనని, అనుకుంటారు ప్రజలు. పోరాటంలో గొప్ప త్యాగాలు చేసారు కాబోలు అనుకుంటారు. బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్కు కానీ దాని అనుబంధ సంస్థలకు కాని, నిజాము వ్యతిరేక పోరాటంలో చీమకాలంత భాగస్వామ్యం కూడా లేదు. ఒక ఉద్యమంలో పాల్గొనకపోతే, ఆ ఉద్యమాన్ని పొగడవద్దనీ కాని బలపరచ వద్దనీ కాని అర్థం కాదు. కాని ఇక్కడ బీజేపీ అసలు ఆ ఉద్యమం ఎందుకు జరిగిందో ఏ లక్ష్యం కోసం జరిగిందో దాన్ని బలపరచడం లేదు, దాన్ని పొగడడం లేదు. తెలంగాణ చరిత్రను వక్రీకరించి, నిజాము వ్యతిరేక ఉద్యమానికి మతం రంగును పులుముతున్నది. పాలకులు ముస్లింలు కావడం వలన హిందూ ప్రజలను పీడించినట్టుగా, వేధించినట్టుగా చరిత్రను బీజేపీ నాయకులు వక్రీకరిస్తున్నారు. ముస్లిం పాలకులకు వ్యతిరేకంగా హిందూ ప్రజలు చేసిన పోరాటంగా తెలంగాణ ప్రజల సాయుధ పోరాటాన్ని చూపిస్తున్నారు. నిజానికి మతాలకు అతీతంగా తెలంగాణలోని అన్ని మతాల ప్రజలు నిజాముకు వ్యతిరేకంగా పోరాడినారు. వాస్తవం ఇలా ఉన్నా ఈ పోరాటానికి మతం రంగు పులిమి ఎన్నికల్లో ఓట్లు సాధించిపెట్టే ఆయుధంగా, తెలంగాణ సాయుధపోరాటాన్ని వాడుకోవాలని బీజేపీ చూస్తున్నది. ఇప్పుడు తెలంగాణలో అధికారం కోసం బీజేపీ రూపొందించిన ప్రత్యేక ఎత్తుగడగా, సెప్టెంబర్ 17 మారింది.
అసలు తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకు జరిగింది? నిరంకుశ రాజరిక భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యం కోసం తెలంగాణ సాయుధ పోరాటం సాగింది. అంతేకానీ ఒక మతానికి వ్యతిరేకంగానో, లేకపోతే నిజాము ముస్లిం కాబట్టి ఇస్లాంకు వ్యతిరేకంగానో జరిగిన ఉద్యం కాదుఅది. నిజానికి, నిజాము రాజరిక వ్యవస్థకు అసలు పునాది, విస్తతమైన పునాది హిందూ జాగీర్దార్లూ, భూస్వాములే. ప్రధానంగా హిందూ భూస్వాములే నిజాము రాజరికానికి బలమైన మూల స్తంభాలు. హిందూ భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్న క్రమంలోనే నిజాము పోలీసులు, తరువాత నిజాము సైన్యం రంగంలోకి దిగింది. ఇదీ అసలు చరిత్ర. తెలంగాణ సాయుధ పోరాటం ఏ భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిందో ఆ భూస్వాముల గురించి బీజేపీ మాట్లాడదు. వెట్టి చాకిరీలు ఎవరు చేయించారో చెప్పదు. వెట్టిచాకిరీ రద్దు గురించి చెప్పదు. గ్రామస్థాయిలో ప్రజలు ఏర్పరుచుకున్న ప్రజా ప్రభుత్వాల గురించి బీజేపీ మౌనవ్రతం పాటిస్తుంది. భూస్వాముల భూములు పంచుకోవడాన్ని బలపరచదు. యూనియన్ సైన్యాలు వచ్చి ప్రజలు పంచుకున్న భూములను తిరిగి భూస్వాములకు అప్పచెప్పడాన్ని బీజేపీ ఖండించదు. గ్రామాలలో ప్రజల ప్రభుత్వాలను ధ్వంసం చేసి, పారిపోయిన భూస్వాములను తీసుకు వచ్చి మళ్లీ వారికే అధికారాన్ని అప్పచెప్పడాన్ని బీజేపీ వ్యతిరేకించదు. అంటే తెలంగాణ సాయుధ పోరాటం అసలు ఎందుకు జరిగిందో దాన్ని బీజేపీ సమర్ధించడం లేదు.. మరి నిజాము వ్యతిరేక సాయుధ పోరాటాన్ని బీజేపీ ఎందుకు పొగుడుతున్నది? (అందులో దాని పాత్ర లేకున్నా). ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటం పట్ల తెలంగాణ ప్రజలలో ఒక గౌరవభావం ఉన్నది. ఆ సెంటిమెంటును ఉపయోగించుకుంటూనే దాన్ని వక్రీకరించి మతం రంగు పూసి తెలంగాణలోనూ ఎన్నికల ముందు మతతత్వాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నది. ఉత్తర భారతంలో కొన్ని రాష్ట్రాల ఎన్నికల ముందు, ముఖ్యంగా ఉత్తర్ప్రదేశ్లో గెలవడం కోసం బీజేపీ మతతత్వాన్ని రెచ్చగొట్టింది. అటువంటి పరిస్థితినే సెప్టెంబర్ 17 పేరు మీద తెలంగాణలోనూ సృష్టించాలనేది బీజేపీ వ్యూహం.
తెలంగాణ విమోచన పేరుతో బీజేపీ చెబుతున్న విషయాలను పరిశీలిస్తే అవి అసత్యాలు, వక్రీకరణలని సులువుగానే అర్ధమవుతుంది. 1. బీజేపీ ప్రకారం, మొత్తం భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు తెలంగాణకు రాలేదని. ఇది చరిత్ర వక్రీకరణ. హైదరాబాద్ రాజ్యం బ్రిటిష్ వలసగా లేదు. కొన్ని ఒప్పందాలు ఉన్నప్పటికి హైదరాబాద్ రాజ్యం స్వంత సైన్యం, కరెన్సీ, టెలి కమ్యూనికేషన్, రేడియో స్టేషన్, రైల్వేలతో ఒక స్వతంత్ర దేశంగానే ఉండింది. 1947 ఆగస్టు 15 నాడు బ్రిటిష్ వాళ్లు వెళ్లి పోయాక, హైదరాబాద్ రాజ్యం కూడా ఎటువంటి ఒప్పందాలు లేని పూర్తి స్వతంత్ర దేశంగా అవతరించింది. కాబట్టి 1947 ఆగస్టు 15 తెలంగాణకు స్వాతంత్య్రం రాలేదని చెప్పడం, బీజేపీ కట్టుకథ మాత్రమే. 2. బీజేపీ మరో వక్రీకరణ ఏమిటంటే, 1948 సెప్టెంబర్ 17న జరిగిన హైదరాబాద్ రాజ్యం విలీనాన్ని, విమోచనగా చెప్పడం. బీజేపీ ప్రకారం, యూనియన్ సైన్యాలు నిజామును ఓడించి తెలంగాణ ప్రజలకు విమోచన కలిగించాయి. వాస్తవానికి అప్పటికే కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణ ప్రజలు సాయుధ పోరాటంతో నిజాం ప్రభుత్వాన్ని దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. మూడువేల గ్రామాలలో నిజాము ప్రభుత్వాన్ని తుడిచి పెట్టేసారు. నిజాము భూస్వాముల లక్షలాది ఎకరాల భూమిని ప్రజలు పంచుకున్నారు. ప్రజాప్రభుత్వాలను ఏర్పరుచుకున్నారు. కమ్యూనిస్టులు రోజురోజుకు బలపడుతూ ఉండినారు. తెలంగాణలో కమ్యునిస్టులు ఎక్కడ అధికారంలోకి వస్తారో అనే భయంతోనే, నిజాముతో యథాతథా ఒప్పందం ఉన్నప్పటికి పోలీస్ యాక్షన్ పేరుతో తెలంగాణపై దాడి చేసి తెలంగాణను భారత్లో విలీనం చేశారు. దీనినే బీజేపీ వాల్లు, వల్లభ్ భారు పటేల్ తెలంగాణను విముక్తి చేశాడు అని ప్రచారం చేస్తున్నారు. అయితే బీజేపీ వాళ్లు ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. పటేల్, నిజాము నుంచి తెలంగాణను విముక్తి చేస్తే, విలీనం తరువాత అదే నిజామును తెలంగాణకు రాజ్ ప్రముఖ్, పటేల్ ఎలా నియమించారు? నిజామును రాజ్ ప్రముఖ్గా పెట్టుకుని తెలంగాణ ఎలా విముక్తి అయినట్టు? నిజాము దోపిడీ పీడనల గురించి, అత్యాచారాల గురించి కమ్యూనిస్టుల కంటే ఎక్కువ మాట్లాడుతున్న బీజేపీ వాళ్లు, నిజామును జైల్లో పెట్టకుండా రాజ్ ప్రముఖ్గా నియమించినందుకు సర్దార్ల్లభ్ భారు పటేల్ను ఎందుకు తప్పుబట్టరు? ఇంతే కాదు.. రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ చేసిన చేయించిన హత్యల గురించి అత్యాచారాల గురించి విన్న వారెవరైనా రజ్వీని ఉరితీయాలి అంటారు. కాని ఖాసీం రజ్వీని, కొంత కాలం జైలు శిక్ష తరువాత పాకిస్థాన్కు పోనిచ్చారు. తరువాత కరాచీలో తన ముసలి తనంలో ఖాసిం రజ్వీ చనిపోయాడు. ఖాసిం రజ్వీ చేసిన అత్యాచారాలను కారణంగా చూపి, వేలాది అమాయక ముస్లింలను భారత సైన్యం మద్దతుతో చంపివేసారు. కాని ఖాసిం రజ్వీని మాత్రం భద్రంగా జైల్లో పెట్టించాడు సర్దార్ పటేల్. తరువాత పాకిస్థాన్కు వెళ్లాడు. ఖాసిం రజ్వీ పైన సామూహిక హత్యా కేసులు, మానవ హనన కేసులు, యుద్ధ నేరాల కేసులు పెట్టి ఎందుకు ఉరి తీయించలేదు పటేల్. బీజేపీ నాయకులు సమాధానం చెబుతారా? నిజామును జైల్లో పెట్టించలేదు, ఖాసిం రజ్వీని ఉరి తీయించలేదు. కానీ, నిజాముకు రజ్వీకి వ్యతిరేకంగా పోరాడిన నాలుగు వేల మంది తెలంగాణ ప్రజలను, వల్లభ్ భారు పటేల్ పంపిన సైన్యాలు చంపివేసాయి. ఇదేనా తెలంగాణ విమోచన అంటే? దీనికే సర్దార్ పటేల్ను తెలంగాణ విముక్తి దాత అనాలా? ఇంతే కాదు ఇంకా ఉంది. నిజాముకు వ్యతిరేకంగా పోరాడిన నల్ల నర్సింహులు లాంటి కమ్యూనిస్టు యోధులకు నిజాము కోర్టు ఉరిశిక్షలు విధించింది. హైదరాబాద్, భారత దేశంలో విలీనం తరువాత, ఈ ఉరిశిక్షలను రద్దుచేయాలని సుప్రీం కోర్టుకు వెళ్లితే, సుప్రీం కోర్టు తిరస్కరించింది. అంతర్జాతీయంగా (జెనీవాలో, లండన్లో) ఈ ఉరిశిక్షలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగిన తరువాత, రాష్ట్రపతి ఈ ఉరిశిక్షలను జీవిత ఖైదుగా మార్చినాడు. అంటే, నిజాము రాజ్ ప్రముఖ్ అవుతాడు, రజ్వీ జైలు రక్షణలో జాగ్రత్తగా ఉంటాడు, కాని నిజాముకు వ్యతిరేకంగా పోరాడిన నాలుగు వేల మందిని చంపుతారు. పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టులకు ఉరిశిక్షలు వేస్తే వాటిని రద్దు చేయం.. అంటారు. సర్దార్ వల్లభ్భారుపటేల్ నాయకత్వంలో జరిగిందని బీజేపీ చెప్పే తెలంగాణ ''విమోచన'' కథ ఇది. తెలంగాణ అసలు చరిత్రను చెరిపేసి అసత్యాలు, అర్థసత్యాలు, చరిత్ర వక్రీకరణలపై ఆధార పడి అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రత్నిస్తున్నది. నిజమైన చరిత్రను, లౌకిక తత్వాన్ని ప్రజలలో విస్తతంగా ప్రచారం చేయడం ద్వారానే చరిత్ర వక్రీకరణలను అరికట్టి మత తత్వశక్తులను అడ్డుకోవడం సాధ్యం అవుతుంది.
- లంకా పాపిరెడ్డి
సెల్: 9492907953