Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జపాలకులు వైభోగంలో ఉన్నారు. ఆర్థిక నిపుణులు, మేధావులు, పరిశ్రమాధిపతులు, కార్మికులు ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుందనే భయంలో ఉంటే.. భవిష్యత్తు అంధకారంలో ఉంటుందని ప్రజలు నిద్రలేకుండా ఉంటే ఢిల్లీ పాలకులు సుఖంగా, హాయిగా, విలాసంగా ఉన్నారు. చంద్రయాన్ 2 గూర్చి కుప్పిగంతులేస్తున్నారు. ఆర్థిక మాంద్యం తరుముకొస్తుందని ఆర్థిక నిపుణులు చెపుతూ ఉంటే.. పాలకులు పట్టించుకోవటం లేదు. ఎంత విషాదమిది. దేశం గూర్చి దేశ ప్రజల గూర్చి, దేశ భవిష్యత్తు గూర్చి పాలకులకు ఫికరు లేదు. ఆర్థిక నిపుణుల మాటలు పాలకులు వినదల్చుకోలేదు.
ఆర్థిక మాంద్యం దేశాన్ని ఏమి చేస్తుంది. అర్థంకాని స్థితిలో ప్రజలుంటే.. ప్రధాని మోడీ విదేశీ పర్యటనలు చేస్తున్నారు. హౌంమంత్రి అమిత్షా ప్రతీకార రాజకీయాలలో బిజీగా ఉన్నారు. రాష్ట్రపతి ప్రతిభావంతులకు అవార్డులు యిస్తూ సంబరపడుతున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తనకు సంబంధంలేని విషయం మాట్లాడి పాకిస్థాన్ను హెచ్చరిస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక మాంద్యం లేదంటూనే, ఉద్దీపన పథకాలు బ్యాంకుల విలీనం పేరుతో కార్పొరేట్ సామ్రాజ్యాన్ని శక్తివంతం చేస్తున్నారు. మిగతా మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక మాంద్యం గూర్చి పట్టించుకోవటం లేదు. ప్రధాని మోడీ ఆర్థిక మాంద్యం గూర్చి బయట పడటానికి ఏమి చేయాలో, నిపుణులతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటే బాగుండేది. నిపుణులు లేరు, చర్చలు లేవు. న్యాయంగా మోడీ ఆర్థిక మాంద్యాన్ని అంగీకరించి, ఎదుర్కోవటానికి ఎన్నో చర్యలు తీసుకోవల్సింది.
ఆర్థిక నిపుణులు, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ లాంటి వారు హెచ్చరిస్తున్నప్పుడు తెలియదా? వారివద్ద లెక్కలుంటాయి. పరిశ్రమలు మూతబడటం, కార్మికులను, ఉద్యోగులను బయటకు పంపించటం ఇదంతా తెలియదా? ఆర్థిక మాంద్యానికి కారణం పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, బ్యాంకులు మొండి బకాయలంటూ మోడీ సర్కార్ వైఫల్యంగా ఎత్తిచూపుతారని, చాలా చాకచక్యంగా, అందర్నీ దారి తప్పించారు. చంద్రయాన్ పైన అడుగులు.. ఇప్పుడు అవసరమా? గవర్నర్ల మార్పు? ఇప్పుడు అవసరమా? ఆర్థిక మాంద్యం స్పష్టంగా కనిపిస్తున్న దృశ్యం.. గుర్రం చతికిలబడింది. దాన్ని లేపటం కష్టం. ఈ విషయం ప్రధాని మోడీకి తెలుసు. ఈ గగ్గోలు పుట్టకముందే ఆయనకు అర్థమయిపోయింది. కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు కూడా ప్రజలను పక్కదారి పట్టించటానికి చేసినట్టున్నారు.
భారతదేశాన్ని ఆర్థిక మాంద్యంలో ముంచటానికి కారణాలేమిటీ? 2008లో ప్రపంచం ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడింది. అప్పుడు భారతదేశం తట్టుకొని నిలబడింది. అమెరికా ధోరణి, ట్రంప్ అహంకారం వాణిజ్యాల మీద ప్రభావం చూపవచ్చు. కానీ ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెట్టలేదు. ట్రంప్ వాణిజ్య యుద్ధమనేది భయంకరమైన క్యాన్సర్ రోగం లాంటిది. తన అభిప్రాయాల క్యాన్సర్ను ప్రపంచం మీద రుద్దాలని ట్రంప్ పట్టుదలగా ఉన్నాడు. మొదట నుంచీ అమెరికాతో వచ్చిన చిక్కిదే. ప్రపంచ ప్రజలను దోచుకోవటానికి ప్రపంచ పెత్తనం కోసం ఉవ్విళ్లూరుతుంటుంది. ఇప్పుడు అమెరికాకు చైనా అడ్డంకిగా మారింది. ట్రంప్ వాణిజ్య యుద్ధానికి భారత్ ఆర్థిక మాంద్యానికి సంబంధం లేదు. 2014కు ముందు అంతో ఇంతో ఆర్థిక పరిస్థితులలో ఉన్న భారత్.. మోడీ గద్దె నెక్కిన తర్వాత చతికిలపడింది. మోడీ తీసుకొన్న పెద్దనోట్ల రద్దు, జీఎస్టీలు పుణ్యమా అని ఈ పరిస్థితి వచ్చింది. ఈ ఆరేండ్ల మోడీ పాలనలో భారత్కు జరిగిన మేలేమిటో అర్థం కావటం లేదు. ఒక్క లెక్క దొరకటం లేదు. ఎన్నో చట్టాలు కొత్తవి తీసుకొచ్చారు. ఉగ్రవాద నిరోధక చట్టం, ముస్లిం తలాఖ్ బిల్లు, కాశ్మీర్ల 370 ఆర్టికల్ రద్దు.. భయంకర ఆర్థిక మాంద్యం ఆవరించిన దేశంలో ఇవి అవసరమా?
2019 ఎన్నికలకు ముందు స్వయంగా మోడీ భారత్ అభివృద్ధి చెందిన దేశమని, అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడిన దేశమని గర్వంగా చెప్పుకున్నారు. ఏదీ అభివృద్ధి? రిజర్వ్ బ్యాంక్ ఆపదల నిల్వల నుంచి లక్షా 76వేల కోట్లు తీసుకోవటం అభివృద్ధా? లక్ష కోట్ల పైగా ఉన్న రైల్వే బడ్జెట్ను అసలు బడ్జెట్లో కలుపుకోవటం అభివృద్ధా?
వాహనాల రంగం అమ్మకాలు 25శాతం పడిపోయాయి. నిర్మాణ రంగం 30శాతం తగ్గిపోయింది. ఆఖరుకు పేరున్న బిస్కట్ల కంపెనీలు మూసివేస్తున్నారు. ఇప్పటికే కొన్ని వేలపరిశ్రమలు మూతపడ్డాయని, కొన్ని లక్షల ఉద్యోగులూ కార్మికులూ నిరుద్యోగులయ్యారని పత్రికలు రాస్తూనే ఉన్నాయి. స్పష్టంగా కనిపిస్తున్న విషయం.. ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. దిగుమతులు పెరిగాయి. ఎగుమతులు బాగా తగ్గాయి. రూపాయి విలువ పడిపోయింది. మార్కెట్ దిగజారింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాల పేరుతో వేల లక్షల కోట్లు జనంలోకి పంపిస్తున్నప్పుడు ప్రజల కొనుగోలు శక్తి ఎలా తగ్గింది? ఇదీ ప్రధాన ప్రశ్న.
- సిహెచ్. మధు
సెల్: 9949486122