Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజకీయ క్షేత్రంలోకి మన్మోహన్ సింగ్ పున్ణప్రవేశం చేసి వర్తమాన ఆర్థిక మందగమనంపై సంప్రదాయ నయావుదారవాద దృక్పథాన్ని వ్యక్తీకరించాడు. వర్తమాన ఆర్థిక మందగమనాన్ని అర్థం చేసుకోవటానికి మనముందు మూడు విభిన్న దృష్టికోణాలున్నాయి. డాక్టర్ మన్మోహన్ సింగ్ వ్యక్తీకరించిన సంప్రదాయ నయా ఉదారవాద దృక్పథం మొదటిది. 1991 నుంచి అమలవుతున్న నయా ఉదారవాద విధానాల పర్యవసానంగా సంక్షోభం ఏర్పడలేదని, మోడీ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించవలసిన బాహ్యకారకాలయిన నోట్లరద్దు, 'హడావిడిగా ప్రవేశపెట్టిన వస్తువులు, సేవల పన్ను'వంటివి దానికి కారణం అని ఈ దృక్పథం ప్రకటిస్తుంది. అవగాహనలేమి కారణంగా జరిగిన 'మానవ తప్పిదం' వల్లనే ఈ సంక్షోభం ఏర్పడిందని, అందువల్లనే వ్యవస్థ బయట నుంచి కుదుపులకు గురయిందే తప్ప నయా ఉదారవాద సదిశ(ట్రాజక్టరీ)లోనే అంతర్గతంగా నెలకొన్న ధోరణివల్ల సంక్షోభం ఏర్పడలేదని మన్మోహన్ సింగ్ పేర్కొన్నాడు. సంక్షోభాన్ని అధిగమించాలంటే నయా ఉదారవాద సదిశలోనే నడవాలి. ఆర్థిక విషయాలపై 'ఆలోచనాపరుల'ను సంప్రదిస్తూ వ్యవస్థకు బయటనుంచి షాకులు ఇవ్వకుండా చూసుకోవాలనే అవగాహనను ఈ దృక్కోణం ఇస్తుంది.
సంక్షోభానికి కారణం సమిష్టి డిమాండ్ కొరత అని ప్రత్యేకంగా ఈ దృక్పథం చెప్పదు. అంటే కాంగ్రెస్ పార్టీయే ఎన్నికల సమయంలో ప్రకటించిన మౌలిక ఆదాయ పథకం ద్వారా ప్రజల ఆదాయాన్ని పెంచాలనేటటువంటి మార్గాన్ని కూడా గుర్తించకుండా వ్యవస్థలో డిమాండ్ను పెంచవలసిన అవసరాన్ని ఈ దృక్పథం చూడదు. న్యాయపథకం అనే పేరుతో ప్రకటింపబడిన ఆ పథకం ప్రకారం అట్టడుగున గల ఐదవ వంతు కుటుంబాలలో ప్రతి కుటుంబానికీ నెలకు రూ.6000 అందించాలి. దేశంలో ఇటువంటి కుటుంబాలు ఐదు కోట్లు ఉన్నాయి. అయితే ఈ పథకానికి నిధులను ఎలా సమీకరిస్తారు? లబ్దిదారులను ఎలా గుర్తిస్తారు? పేదలకు సమన్యాయం ఎలా చేస్తారు? అనే విషయాల గురించి స్పష్టతనివ్వకుండా వదిలేశారు. ఆ పథకం ఒక ఆలోచన వ్యక్తీకరణే తప్ప సవివరమైన ప్రతిపాదన కాదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికపై నమ్మకంవున్న వాడిగా నేడు దేశం ఎదుర్కొంటున్న సంక్షోభానికి, ఆ పథకానికి మధ్య సంబంధం ఉన్నదని చూపించే ప్రయత్నం చేసి వుండాల్సింది. కానీ మన్మోహన్ సింగ్ అటువంటి ప్రయత్నం చేయలేదు. ఆ అర్థంలో ఈయన విశ్లేషణ, దృష్టికోణం, నిజానికి నయా ఉదారవాద సమర్థకులందరి అవగాహన ఈ ఏడాది మార్చి నెలలో రాహుల్ గాంధీ స్వయంగా చెప్పినదానికి పూర్తిగా భిన్నంగా ఉంది(న్యాయ పథకాన్ని కాంగ్రెస్ ప్రకటించినప్పుడు మన్మోహన్ సింగ్ ఏమీ మాట్లాడలేదు. ఈ పథకం అమలుచేయదగిందే అని మాత్రమే చిదంబరం అన్నారు. దీనినిబట్టి మనకు అర్థమయ్యేదేమంటే నయా ఉదారవాద సమర్థకులను ఈ పథకం అంతగా ఉత్సాహపర్చలేదు).
సంక్షోభంపై రెండవ దృష్టికోణం ప్రభుత్వానిది. ప్రభుత్వం దృష్టిలో నయాఉదారవాదంగానీ, నోట్లరద్దు గానీ, 'జీఎస్టీని హడావిడిగా ప్రవేశపెట్టటం'గానీ ఆర్థిక మందగమనానికి కారణం కాదు. నిజానికి ఆర్థిక మందగమనం ప్రభుత్వానికి కనపడటం లేదు. బడ్జెట్ ప్రతిపాదనలకు అతీతంగా పెట్టుబడిదారులకు నిర్మలా సీతారామన్ అనేక రాయితీలను ప్రకటించింది. రిజర్వ్బ్యాంకు తన రిజర్వ్ నిధుల నుంచి 1.76లక్షల కోట్లను ప్రభుత్వ వ్యయానికి ఇవ్వటమే కాకుండా వడ్డీ రేటును తగ్గించింది. కానీ ఈ చర్యలను తీసుకుంటున్న సందర్భంగా ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఏర్పడిందని ప్రభుత్వం ఎక్కడా అంగీకరించలేదు. అంతేకాకుండా మందగమనాన్ని అరికట్టటానికి ఈ చర్యలు ఏ మూలకూ సరిపోవు. వడ్డీ రేటును తగ్గించటం, పరపతిని మరింత తేలికగా అందుబాటులోకి తేవటంవంటి చర్యలు ప్రయివేటు పెట్టుబడిని ఆకర్షించలేవు. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పుడు ప్రయివేటు పెట్టుబడి వడ్డీరేటు తగ్గింపునకు స్పందించదు. రిజర్వ్ బ్యాంకు అందించిన 1.76లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ అంచనాలలో ఏర్పడబోయే రెవెన్యూ లోటును పూడ్చటానికే సరిపోతుంది. బడ్జెట్ విస్తృతం అయ్యే అవకాశం లేనందున రెవెన్యూ లోటును పూడ్చినంత మాత్రాన సంక్షోభాన్ని అధిగమించటం సాధ్యపడదు. క్లుప్తంగా చెప్పాలంటే ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన మందగమనాన్ని నిలువరించటానికి ప్రభుత్వం చేసింది నామమాత్రమే. అసలు ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఏర్పడిందనే వాస్తవాన్నే అది అంగీకరించలేదు. కాబట్టి ఈ రెండవ దృష్టికోణం వాస్తవాన్ని నిరాకరించే లేక మహాఅయితే గందరగోళంలో వున్న దృష్టికోణం.
ఈ రెండు దృష్టికోణాలకు భిన్నమైన దృష్టికోణం వామపక్షానిది. ఈ దృష్టికోణం సంక్షోభాన్ని, సంక్షోభం తీవ్రతను గుర్తించటమే కాకుండా దాని మూలాలు నయాఉదారవాద సదిశలో ఉన్నట్టుగా నిర్ధారిస్తుంది. నయాఉదారవాద విధానాలు రైతాంగ వ్యవసాయాన్ని పీడిస్తాయి. దానితో రైతాంగ ఆదాయం తగ్గిపోతుంది. వారు అనివార్యంగా అస్తిత్వంలో లేని ఉద్యోగాల వేటలో నగరాలకు వలసపోవలసిన స్థితికి నెట్టబడతారు. దానితో శ్రామిక నిరుద్యోగ సైన్యం పరిమాణం పెరుగుతుంది. ఆహారధాన్యాల ఉత్పత్తితోసహా వ్యవసాయ ఉత్పత్తి వృద్ధిరేటు తగ్గిపోతుంది. శ్రామిక ఉత్పాదకత నిరంతరం పెరుగుతున్నప్పటికీ, ఉత్పత్తిలో మిగులు వాటా పెరుగుతున్నప్పటికీ, సంపద, ఆదాయ అసమానతలు తీవ్రతరమౌతున్నప్పటికీ పెరిగిన శ్రామిక నిరుద్యోగ సైన్యం పరిమాణం ప్రభావం కారణంగా యావత్ శ్రామికుల ఆదాయాలు పెరగని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యవసాయాభివృద్ధి రేటు పడిపోవటం, అదాయ అసమానతలు తీవ్రతరం కావటంవంటి కారణాలచేత చాలా రకాల వస్తువులకు మార్కెట్ కుదింపబడుతుంది. గతించిన కాలంలో అణచివుంచబడిన డిమాండ్వల్లనో లేక ఆస్తుల ధర బుడగలవల్ల వచ్చిన సంపద ప్రభావంవల్లనో దీనిలో కొంతకాలంపాటు సమతౌల్యం కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే అంతిమంగా అది అధికోత్పత్తి సంక్షోభం రూపంలో తనను తాను వ్యక్తీకరించుకుంటుంది.
భారతదేశంలో ఇదే జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి ధోరణులే ప్రబలినందువల్ల అధికోత్పత్తి సంక్షోభం ప్రభావం ప్రపంచమంతా ఉంది. ఇటువంటి పరిస్థితులలో ఎగుమతులను పెంచటం ద్వారా దీని పర్యవసానాలను తప్పించుకునేందుకు భారతదేశం చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు. కాబట్టి నయా ఉదారవాదం ప్రపంచాన్ని దిక్కుతోచని, మరో మార్గాంతరంలేని స్థితికి చేర్చిందనే వాస్తవాన్ని మనం చూస్తున్నాం.
నోట్లరద్దు, జీఎస్టీ వంటి మోడీ ప్రభుత్వ చర్యలు భారతదేశంలో సంక్షోభాన్ని తీవ్రతరం చేశాయి. అయితే ఈ చర్యలవల్లనే భారతదేశంలో సంక్షోభం ఏర్పడిందనటం వాస్తవాలకు విరుద్దం. రద్దయిన నోట్లలో చాలావరకు చాలా కాలం క్రితమే కొత్త నోట్లకు మారకం అయినప్పటికీ నోట్లరద్దుతో వృద్ధిరేటు ఎందుకు తగ్గిందో మన్మోహన్ సింగ్, ఇతర నయాఉదారవాదులు వివరించరు. నోట్లరద్దు వల్ల చిన్న ఉత్పత్తి రంగంపై పడిన ప్రతికూల ప్రభావం చాలాకాలంగా కొనసాగుతున్నదనేది నిజం. అయితే ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఏర్పడటానికి ఇది కూడా దోహదం చేసినప్పటికీ ఆటోమొబైల్ రంగం నుంచి బిస్కట్ల దాకా కూడా డిమాండ్ కొరత ఏర్పడేటంత తీవ్రమైన సంక్షోభాన్ని ఇది మాత్రమే వివరించలేదు. ఆ విధంగా అధికోత్పత్తి సంక్షోభం భారతదేశానికి మాత్రమే పరిమితమవలేదని, అది ప్రపంచమంతా వ్యాపించిన ధోరణి అని ఇది వివరిస్తుంది.
ఈ సంక్షోభానికి చూపబోతున్న పరిష్కారం కూడా సుస్పష్టమే. అదేమంటే ఉచిత ఆరోగ్య సంరక్షణ, ఉచిత విద్య, ఉద్యోగ కల్పన, భద్రత, చౌకగా ఆహారపదార్థాలను అందించటం, వాటా ధనం చెల్లించకుండా వృద్ధులకు పెన్షన్ ఇవ్వటం వంటి చర్యలతో కష్టజీవుల కొనుగోలుశక్తి పెంచాలి. అదనపు కొనుగోలు శక్తిని ప్రజల చేతుల్లో ఉంచటం వలన పారిశ్రామిక రంగంలోగల సామర్థ్యాన్ని మరింతగా ఉపయోగించుకోవటానికి దారితీస్తుంది. దానితో పెట్టుబడులు పెరుగుతాయి. ఆహారధాన్యాల ధరలలో ద్రవ్యోల్బణం రాకుండా ఉండాలంటే వాటి ఉత్పత్తిని పెంచాలి. ఇందుకోసం రైతాంగ వ్యవసాయానికి మద్దతు ధరలను అందించటం, భూస్వాములకు, పెట్టుబడియొక్క ఆదిమ సంచయానికి పాల్పడేవారికి వ్యతిరేకంగా భూసంస్కరణలను అమలు చేయటం, వ్యవసాయానికి కావలసిన ఇన్పుట్స్ను సబ్సిడీతో రైతులకు అందేలా చూడటంవంటి చర్యలను ప్రభుత్వం తీసుకోవాలి. నిజానికి ఈ ప్రత్యామ్నాయ ఎజెండాను అమలు చేయటానికి కావలసిన ఆర్థిక వనరులను ఎలా సమకూర్చుకోవాలో తెలిపే అనేక అధ్యయనాలున్నాయి.
అయితే అన్నింటికీ మించి నయాఉదారవాద పాలన స్వభావానికి అనుకూలంగావున్న వర్గశక్తుల పొందికలో మార్పు తీసుకురావటానికి కష్టజీవులను సమీకరించవలసిన అవసరం వామపక్ష ఎజెండాకి ఉంటుంది. ఇది సోషలిస్టు ఎజెండా కానప్పటికీ దీనితో పెట్టుబడిదారులపై మరింతగా ముఖ్యంగా సంపదపై పన్ను రూపంలో పన్ను వేయవలసి ఉంటుంది. లేకపోతే ఇందుకు బదులుగా ప్రభుత్వ వ్యయానికి కావలసిన ఆర్థిక వనరుల కోసం సాధారణ ప్రజలపై పన్నులు వేస్తే సమిష్టి డిమాండ్లో ఏమంత నికర విస్తృతి ఉండదు. దానితో సంక్షోభం నుంచి ఉపశమనం లభించదు.
ఈ సంక్షోభాన్ని ఎలా అధిగమించాలనే విషయం గురించి నయాఉదారవాద విధానాలను కొనసాగించాలనేది కాకుండా మన్మోహన్ సింగ్వంటి నయావుదారవాద సమర్థకుల దగ్గర ఎటువంటి నిర్దిష్టమైన సూచనలు లేవు. 'ఆలోచనాపరుల'ను సంప్రదించమని ప్రభుత్వానికి వీరు సలహా ఇవ్వటంలో ప్రభుత్వానికి 'ఆలోచన' లేదనే అంత్ణస్సూచన ఉంది. ఈ అంత్ణస్సూచనతో విబేధించలేం. అయితే నయఉదారవాద శిబిరానికి చెందిన ఈ 'ఆలోచననాపరులు' ప్రభుత్వానికి దేనిపై సలహా ఇస్తారు? అని చూసినప్పుడు మౌనమే సమాధానంగా మన ముందుకు వస్తుంది. దీనితో ఆశ్చర్యపోనవసరం లేదు. మరో మార్గాంతరంలేని స్థితికి నయాఉదారవాదం చేరుకుందని అంటున్న దానిలో 'ఆలోచనాపరుల' ఆలోచనలు కూడా అడుగంటాయనే అర్థం ఉంది.
- ప్రభాత్ పట్నాయక్
అనువాదం: నెల్లూరు నరసింహారావు
సెల్ : 8886396999