Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హిందూత్వ వర్గ ధర్మం(క్లాస్ ఫంక్షన్) రోజురోజుకూ మరింతగా స్పష్టమౌతోంది. హిందూత్వ రక్షణలో మోడీ ప్రభుత్వం ప్రభుత్వరంగాన్ని పెద్ద ఎత్తున ప్రయివేటీకరించే కార్యక్రమానికి పూనుకుంది. కార్మికవర్గంపై దాడి చేస్తోంది. 'సాధారణ' బూర్జువా పాలనా పరిస్థితులలో అటువంటి కార్యక్రమాన్ని అమలు చేయటం సాధ్యపడక పోయేదే. దానికి తీవ్ర ప్రతిఘటన ఎదురయి ఉండేది. అయితే దేశం హిందూత్వ పేరుతో చీలిన స్థితిలో, మెజారిటీ ప్రజల మనసుల్లో నాటిన 'ఇతరుల' పట్ల భయం, దాని పర్యవసానంగా ఏర్పడిన ద్వేషం కలగలసిన స్థితిలో ప్రభుత్వం ఇలా ప్రయత్నించటానికి ధైర్యం చేసింది. భయం 'రక్షకుడి' అవసరాన్ని సృష్టిస్తుంది. 'రక్షకుడు' అనుకుంటున్నవాడే ప్రయివేటీకరిస్తుంటే ప్రజలు అంతగా వ్యతిరేకించరు. ప్రయివేటీకరణ ప్రధాన భాగంగా వున్న కార్పొరేట్-ఫైనాన్స్ వర్గ ఎజెండాకు ప్రజలు సవాలు విసరకుండా హిందూత్వ ప్రవచనం పక్కదారి పట్టిస్తోంది. క్లుప్తంగా చెప్పాలంటే ప్రవచనంలో హిందూత్వ తెచ్చిన మార్పు కార్పొరేట్- ఫైనాన్షియల్ వర్గం ప్రయోజనాలకు అనుకూలంగా ఉంది.
ప్రయివేటీకరణను వివిధ మార్గాలలో ప్రవేశపెడు తున్నారు. నష్టాలలోవున్నవే కాకుండా మంచి లాభాలలోవున్న ప్రభుత్వరంగ సంస్థలను కూడా తెగనమ్మటానికి సిద్ధపడుతున్నారు. వేరేవాటిలో ప్రభుత్వం తన వాటాను పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 51శాతం కంటే కిందకు కుదించుకుంటుంది. అంతేకాకుండా ప్రభుత్వ రంగ మొత్తం కార్యకలాపాలను వివిధ వైయక్తిక కార్యకలా పాలుగా విడగొట్టి ప్రయివేటీకరించాలనే ఆలోచన ప్రభుత్వా నికి ఉంది. ఈ చివరి పద్ధతిని రైల్వేలలో అమలు చేస్తున్నారు.
ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటీకరించటానికి అనుసరిస్తు న్న ఈ మార్గాలకు తోడుగా ప్రభుత్వరంగం అస్థిత్వంలోవున్న దగ్గర దాని విస్తృతిని సాధ్యమైనంతగా పరిమితం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటివరకు దాదాపు ప్రభుత్వరంగంలోవున్న బొగ్గు ఉత్పత్తివంటి రంగాలలో విదేశీ పెట్టుబడులను కూడా ఆహ్వానిస్తున్నారు. రైల్వేలలో లోకోమోటివ్స్ వంటి భాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అలా దేశంలోని ప్రభుత్వరంగాన్ని కుదించటం జరుగుతోంది. ఇది ప్రభుత్వరంగాన్ని అంతమొందించే ప్రక్రియకు ఆరంభంగా ఉంది.
ఈ ప్రక్రియలో భాగంగా అస్థిత్వంలోగల శ్రామిక చట్టాలను 'సంస్కరించి' కార్మికులను తొలగించే పనిని తేలికచేసేందుకు వీలుకల్పించే సవరణలు రాబోయే పార్లమెంటు సమావేశాలలో ప్రవేశపెట్టనున్నారు. నిజానికి 'సంఘటిత రంగం'లో క్యాజువలీకరణ వేగవంతంగా అమలవుతున్న కారణంగా దేశంలోని మొత్తం కార్మికులలో కేవలం 4శాతం మందికే శ్రామిక చట్టాల రక్షణ ఉంది. కాబట్టి శ్రామిక చట్టాలలో చేయదలచిన మార్పు లక్ష్యం కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయటమే. కార్మికులను సంఘటితం చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వెంటనే పనినుంచి వారిని తొలగించేస్తారు.
ప్రభుత్వరంగాన్ని ప్రయివేటీకరిస్తే సరిగ్గా అదే జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వరంగంలోకంటే ప్రయివేటు రంగంలో పనిచేస్తున్న కార్మికులు తక్కువ స్థాయిలో కార్మిక సంఘాలలో ఉంటారు. ఉదాహరణకు అమెరికాలో ప్రయివేటు రంగంలో పనిచేస్తున్న కార్మికులలో కేవలం 7శాతం మంది కార్మిక సంఘాలలో ఉండగా, ప్రభుత్వ రంగం(విద్యారంగంతో కలుపుకుని)లో అదే నిష్పత్తి 33శాతంగా ఉంది. కాబట్టి ప్రభుత్వ రంగం నుంచి ప్రయివేటు రంగానికి మారే ప్రతి యూనిట్ కార్మిక సంఘాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అలా మోడీ ప్రభుత్వం కార్మికవర్గం లక్ష్యంగా దాడులు చేస్తుంటే కార్పొరేట్ ఫైనాన్షియల్ వర్గం ఆనందిస్తోంది. ఇలా గతంలో చేయటం ఇంత తేలిక కాలేదు. హిందూత్వ నీడలో దీనిని సాధించాలనే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది.
హిందూత్వ నీడలో కార్పొరేట్లు లాభపడటం యాథృచ్ఛికంగా జరగలేదు. నిజానికి హిందూత్వవాదుల ఆర్థిక భావజాలం ఎటువంటి దాపరికం గానీ, సిగ్గూ శరం గానీ లేని కార్పొరేట్ అనుకూల భావజాలం. ఈ వాస్తవాన్ని నరేంద్ర మోడీనే స్వయంగా వ్యక్తీకరించారు. పెట్టుబడిదారులు దేశ 'సంపద సృష్టికర్తలు' అని ఆయన చేసిన ప్రకటనను ఆమోదించటానికి బహుశా బూర్జువా అర్థశాస్త్రం కూడా వెనకడుగు వేస్తుంది. ప్రమాణీకరింపబడిన బూర్జువా అర్థశాస్త్ర వాచకాల ప్రకారం భూమి, శ్రమ, పెట్టుబడి, ఎంటర్ప్రైజ్ అనే నాలుగు 'ఉత్పత్తి కారకాల' కలయిక మీదనే సంపద సృష్టి ఆధారపడివుంటుంది. పెట్టుబడిదారులు 'పెట్టే' పెట్టుబడికి శ్రమకున్నదానికంటే తక్కువ ప్రాధాన్యత ఉండదనే సంవరణ వాద(ఎక్లెక్టిసిజం) సూచన ఇది. వేరేమాటల్లో చెప్పాలంటే పెట్టుబడిదారులు సోషలిస్టులు వాదిస్తున్నట్టు దోపిడీదారులు కాకపోగా వారు సంపద సృష్టిలో సహభాగస్వాములుగా ఉంటారు.
అయితే హిందూత్వవాదులు ప్రామాణిక బూర్జువా అర్థశాస్త్ర వాచకాల పరిధిని కూడా దాటిపోయారు. సంపద సృష్టికర్తల జాబితానుంచి శ్రామికులను పూర్తిగా తీసివేశారు. బూర్జువా వాచకాలు చెప్పినట్టు సంపద సృష్టించటంలో పెట్టుబడిదారులు శ్రామికులతోపాటు సహభాగస్వాములుగా ఉంటారని కాకుండా వారిని మాత్రమే సంపద సృష్టికర్తలుగా హిందూత్వ వాదులు చూస్తున్నారు. నేటి ప్రపంచంలో కార్పొరేట్ పెట్టుబడిదారుల ముందు ఇంతగా సాగిలపడటాన్ని ఊహించలేం. నిజానికి ప్రకృతిపై మానవ శ్రమను ఉపయోగించటమే అన్ని వస్తువుల లేక ఉపయోగితా విలువల సృష్టికి మూలమని బూర్జువా వాచకాలకు అతీతంగా మనం చెబుతాం. ప్రకృతిపై మనిషి కార్యశీలమయ్యే ప్రక్రియలో వీటిలో కొన్నింటిని శ్రమ సాధనాలు (క్యాపిటల్ స్టాక్) గా ఉపయోగిస్తారు. పెట్టుబడిదారులనే ఒక వ్యక్తుల సమూహం ఈ శ్రమ సాధనాలకు తమనుతాము యజమానులుగా చేసుకుంటారు. అలా ఉత్పత్తి అయిన వస్తువులలో కొంత భాగాన్ని శ్రమతో ప్రమేయం లేకుండా తమదే అని ప్రకటిస్తారు. వాళ్ళు దోచినదానిలో కొంత వినిమయం చేస్తారు. మిగిలిన భాగాన్ని శ్రమ సాధనాల స్టాక్కు జోడిస్తారు.
శ్రమ సాధనాల స్టాక్కు జోడించినందుకు పెట్టుబడిదారు లను మోడీ శ్లాఘించటాన్ని పరిశీలిద్దాం. అప్పటికి కూడా వారు దోచినదానినంతా వినిమయం చేయకుండా శ్రమ సాధనాలకు జోడించినందుకు వారిని 'సంపద సృష్టికర్తలు' అనటమంటే మొత్తం ప్రక్రియకు సంబంధించిన జ్ఞానం ఏమాత్రం లేదనేది సుస్పష్టం.
ఈ మధ్యకాలంలో కార్పొరేట్లకు 1.45లక్షల కోట్ల పన్ను రాయితీలను ప్రభుత్వం ప్రకటించటాన్ని మోడీ అందరి లాభం కోసమేనని చెప్పటం అటువంటి అజ్ఞానానికి పరాకాష్టగా ఉంది. కార్పొరేట్లకు అలా పన్ను రాయితీ ఇవ్వటం 120కోట్ల మంది భారతీయులకు 'పరస్పరం లాభసాటి'గా ఉంటుందట! ఇక్కడ పెట్టుబడిదారులను 'సంపద సృష్టికర్తలు'గా తాను చేసిన ప్రకటనను కూడా మోడీ దాటాడు. కార్పొరేట్లు శ్రమ సాధనాల స్టాక్కు అదనంగా ఏమీ జోడించకుండా మొత్తం 1.45లక్షల కోట్లను దాచుకున్నప్పటికీ (దానితో సమిష్టి డిమాండ్ తరిగి పెద్ద ఎత్తున నిరుద్యోగం ఏర్పడుతుంది) అది 'పరస్పరం లాభదాయకం'గానే ఉంటుందట!
హిందూత్వ అర్థశాస్త్ర అవగాహన చాలా సామాన్యమైందనేది సుస్పష్టం. కార్పొరేట్లకు ఎంత డబ్బును అందజేస్తే సమాజానికి అంత మంచిది. అయితే కార్పొరేట్లకు ఎంత అందజేయాలనేదానికి పరిమితి కార్మికులకు ఎంత ఇచ్చితీరాలనే దానిపై ఆధారపడి వుంటుంది. కాబట్టి కార్మికులకు ఎంత తక్కువ ఇస్తే సమాజానికి అంత మంచిదని హిందూత్వ భావిస్తుంది! క్లుప్తంగా చెప్పాలంటే హిందూత్వ దృష్టికోణం అందరికీ తెలిసిన మైనారిటీ, దళిత, ఆదివాసీ, మహిళా వ్యతిరేకమైనదే కాకుండా అది మౌలికంగా కార్మికులకు కూడా వ్యతిరేకం.
ఇక్కడ ఒక దుర్మార్గమైన వాదన పనిచేస్తోంది. దేశాన్ని అతలాకుతలం చేస్తున్న ఆర్థిక సంక్షోభం పరిష్కారం కావాలంటే కార్పొరేట్ల చేతుల్లో మరింతగా డబ్బు గుమ్మరించాలని హిందూత్వ చెబుతోంది. అర్థశాస్త్రంపట్ల హిందుత్వకు ఉన్న అవగాహనకు అంతకు మించిన భావనలు అందుబాటులో ఉండవు. అయితే ఇలా చేయాలంటే 'ఒక జాతి-ఒక భాష', నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజెన్స్', సిటిజెన్షిప్ అమెండ్మెంట్ బిల్ వంటి 'భయకంపితులను చేసే' చర్యలకు ప్రభుత్వం దిగాల్సి ఉంటుంది. వీటిలో ప్రతి చర్యా ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసేదిగాను, దేశ సమైక్యతకు విఘాతం కలిగించేదిగానూ ఉంటుంది.
అయితే అదనంగా కార్పొరేట్ల చేతుల్లో మరింత డబ్బు గుమ్మరించటంతో సంక్షోభం పరిష్కారం కాకపోగా అది మరింతగా తీవ్రమవుతుంది. అటువంటి ప్రమాదకరమైన చర్యలు తీసుకోవటం ఆపకుండా హిందూత్వ ప్రభుత్వం వాటిని మరింత తీవ్రంగా చేపడుతోంది. వేరేమాటల్లో చెప్పాలంటే ఒకవైపు సంక్షోభం తీవ్రమవుతుంటే మరోవైపు దానిని పరిష్కరించటానికి తీసుకునే కార్పొరేట్ అనుకూల చర్యలతో సంక్షోభం మరింతగా తీవ్రతరం అవుతుంది. దానితోపాటే నిస్సహాయులైన మైనారిటీలపై మతతత్వ దాడులు కూడా పెరుగుతాయి.
హిందూత్వచేత రూపొందిన ఈ ప్రత్యేక వర్గ అవగాహన ప్రాతిపదికన ఏర్పడిన హిందూత్వ-కార్పొరేట్ అక్షం ఒక దుర్మార్గమైన గతితర్కాన్ని వదిలింది. అయితే అలా వదిలిన గతితర్కంతో సంక్షోభం మరింతగా తీవ్రతరం అవుతుంది. అదే దాని దుర్బలత. అంతిమంగా ఆ దుర్బలతే దానిని ముంచెత్తే ప్రతిఘటనను ముందుకు తెస్తుంది.
- ప్రభాత్ పట్నాయక్
అనువాదం: నెల్లూరు నరసింహారావు
సెల్: 8886396999