Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ దేశంలో చీమ చిటుక్కుమన్నా మానవ హక్కులు హరించుకుపోతున్నాయని గోల చేసే అమెరికా, కాశ్మీర్లో 80లక్షల మందికి రెండు నెలల నుంచి మానవ హక్కులు నిలువునా హరించినా మాట్లాడటం లేదు. మతోన్మాదులు, హంతకులే హత్యలు చేయగలరు. బీజేపీ అటువంటి శక్తులన్నింటినీ మూటగడుతున్నది. అది ఇప్పుడూ సామ్రాజ్యవాదుల తొత్తే.
నేడు ఆర్ఎస్ఎస్ నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్ పేరుతో విదేశీయులని తేలిన ముస్లింలను మాత్రమే దేశం నుంచి తరిమేస్తామని స్వయంగా హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. కేవలం అసోంకే పరిమితమైన ఎన్ఆర్సీని దేశవ్యాపితం చేస్తామని ప్రకటించారు. పైగా విదేశీయులైన హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైన్లను దేశ పౌరులుగా గుర్తిస్తామని ప్రకటించారు. మన దేశంలో పుట్టి పెరిగి చైనా, జపాన్ దేశాలకు విస్తరించిన బౌద్ధాన్ని భారత దేశంలో చిదిమేసిన ఈ హిందూ మతోన్మాదం, విదేశీ బౌద్ధులకు కూడా దేశంలో పౌరసత్వం ఇస్తామనడం పచ్చి మోసం. జర్మనీ వలనే ఒకరి తరువాత ఒకరిని అందరినీ అంతం చేయడమే దాని లక్ష్యం. జనం ఈ మతం, కులం గొడవలలో ఉండగా కార్పొరేట్ కంపెనీలకు దేశం యావత్తును అప్పజెప్పేయడం అసలు లక్ష్యం. ఈ సందర్భంగా ఒక జర్మనీ కవి రాసిన ఈ వ్యాఖ్యలు అక్షర సత్యాలు.
'వారు మొదట యూదుల కోసం వచ్చారు
నేను యూదును కాదు కాబట్టి పట్టించుకోలేదు
తరువాత వారు క్రైస్తవుల కోసం వచ్చారు
నేను క్రైస్తవుడను కాదు కాబట్టి పట్టించుకోలేదు
తరువాత వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు
నేను కమ్యూనిస్టును కాదు కాబట్టి పట్టించుకోలేదు
తరువాత వారు నా కోసం వచ్చారు
నన్ను రక్షించేందుకు ఎవరూ మిగలలేదు.''
జర్మనీలో హిట్లర్, నాజీ ఫాసిస్టు శక్తులు పెరగడం, రెండవ ప్రపంచ యుద్ధం రుద్దడం, 3కోట్ల మంది చనిపోవడం, 6కోట్ల మంది క్షతగాత్రులు కావడం, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నేడు భారతదేశంలో కూడా ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు మూకలు జర్మనీలో నాజీల తరహాలోనే చేస్తున్నాయి. నాజీలు మాట్లాడుతున్నట్లే అబద్ధాలు మాట్లాడుతున్నాయి. నాజీలు పెరుగు తున్నట్టే పెరుగుతున్నారు.
జర్మనీలాగే భారత్ నష్టపోతుంది
జర్మన్లే అత్యున్నత జాతి. జర్మన్లకే ప్రపంచాధిపత్యం వహించే శక్తి ఉన్నది. జర్మన్లంతా ఒక జాతిగా ఐక్యం కావాలి. జర్మన్ ఆధిపత్యానికి యూదులు, క్రిష్టియన్లు, కమ్యూనిస్టులు వ్యతిరేకులు కాబట్టి అంతర్గత శత్రువును అంతం చేసి జర్మన్ జాతి అంతా ప్రపంచ యుద్ధానికి తలపడితే ప్రపంచం మన వశమవుతుంది. ఇదీ ఆనాటి నాజీలు, హిట్లరు కూసిన కూతలు. హిట్లర్ తమ ఉన్నతి కోసమే ఇదంతా చెబుతున్నట్టు నమ్మారు జర్మన్ ప్రజలు. అందువలన యూదులను చంపినా, క్రిష్టియన్లను కడతేర్చినా, హిట్లర్, నాజీలే పార్లమెంటు భవనం కూల్చేసి ఆ నేరం కమ్యూనిస్టులపై మోపినా అంతా మన మంచికే అనుకున్నారు జర్మన్లు. చివరికి రెండో ప్రపంచ యుద్ధాన్ని బలపర్చారు. జర్మన్లు తీవ్రంగా నష్టపోయారు. భారత్ లోనూ ఆర్ఎస్ఎస్ మూకలు ఇదే తీరున వ్యవహరిస్తున్నాయి. హిందూ మతోన్మాదాన్ని 'జాతీయత' అనే విధంగా చిత్రీకరించి జాతీయ ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నాయి. జాతీయ ఉన్మాది కానివాడల్లా దేశ ద్రోహుల కింద జమ కడుతున్నాయి.
కార్మికవర్గం చేతిలో చిత్తుగాక తప్పదు
నాజీలు, హిట్లర్ పెరుగుదల ప్రపంచానికి ప్రమాదంగా పరిణమిస్తుందని మూడవ కమ్యూనిస్టు ఇంటర్నేషన్, రష్యా అధ్యక్షులు స్టాలిన్ హెచ్చరించినా హిట్లర్ పెరిగితే అది కమ్యూనిస్టులకే నష్టమనే భావంతో బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాలు మిన్నకున్నాయి. పైగా హిట్లర్కు సహాయం కూడా చేశాయి. పెరిగి పెద్దదయిన నాజీ ఫాసిస్టులు సోవియట్ యూనియన్ (రష్యా)ను జయించాలంటే ముందు మిమ్మల్ని కూడా మింగి బలపడాలని ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికాలపై యుద్ధం ప్రకటించాయి. అప్పటికి గాని ఫాసిజం సంగతి అర్థం కాలేదు. 14 రోజుల్లో ఫ్రాన్సును పాదాక్రాంతం చేసిన హిట్లర్ సైన్యం తూర్పు యూరప్ దేశాలన్నింటినీ స్వాధీనం చేసుకుని సోవియట్ యూనియన్ (రష్యా)పై దాడికి దిగింది. సోవియట్ హెచ్చరికలు పెడచెవిన పెట్టిన బ్రిటన్, ఫ్రాన్సు, అమెరికాలు సోవియట్తో కలవక తప్పలేదు. సోవియట్ రెడ్ ఆర్మీ 2కోట్లమందిని బలిదానం ఇచ్చి హిట్లరు సైన్యాలను తరిమి కొట్టి హిట్లర్ను ఆత్మహత్య చేసుకునేలా చేసింది. అంతేకాక, సోవియట్ రెడ్ ఆర్మీ ఫాసిస్టు మూకల నుండి ప్రపంచాన్ని రక్షించిన చరిత్ర ఎంతో మందికి తెలుసు.
గొంతులు కోసినా ప్రశ్నలు ఆగవు
ఇది జర్మనీలో జరిగిన వాస్తవం. నేడు భారతదేశంలో కూడా ఆర్ఎస్ఎస్ మతోన్మాదులు అదే తరహాలో పథకం ప్రకారం దాడులు చేస్తున్నారు. ప్రశ్నించిన మేధావుల గొంతులను కోసేశారు. కల్బుర్గీ, పన్సారే, దభోల్కర్, గౌరీ లంకేశ్లను చంపేసి ఎవరు ప్రశ్నించినా ఇదే గతి పడుతుందని హెచ్చరికలు జారీ చేశారు. అయినా ప్రశ్నించే గొంతులు పెరిగాయి. గొడ్డు మాంసం తిన్నారని, గొడ్డును చంపేందుకు తీసుకు పోతున్నారని, ఇలాంటి కారణాలతో ఇప్పటికే 35మంది దళితులను, మైనారిటీలను కొట్టి కాల్చి (మూక దాడులు) చంపారు. మహిళల మీద, పిల్లల మీద స్వాములు, పూజారులు, బీజేపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దారుణంగా లైంగిక వేధింపులు చేస్తున్నారు. లైంగిక దాడులను, హత్యలను ఇదే మా సాంప్రదాయమని బీజేపీ ప్రభుత్వాలు, ఆర్ఎస్ఎస్ మూకలు బలపరుస్తున్నాయి.
నిరంతరం అబద్ధాలే
నోరు విప్పితే అబద్ధాలే తప్ప నిజం అన్నదే రావడం లేదు ఈ మూకలకు. మహాత్ముడు 'ఈశ్వర్ అల్లా తేరే నామ్' అని జీవితాంతం ఘోషించాడు. 'మత ఘర్షణ వద్దు. హిందూ ముస్లిం భాయీ భాయీ' అన్నాడు. ఈ నేరానికి ఆర్ఎస్ఎస్ పథకం ప్రకారం మహాత్ముణ్ణి నాథూరాం గాడ్సేతో హత్య చేయించింది. నాథూరాం గాడ్సేకు గుడి కడతామని ఒకవైపు ప్రకటిస్తూ గాంధీజీ పట్ల ఎనలేని ప్రేమ ఒలకబోస్తున్నది బీజేపీ. పైగా గాంధీ మహాత్ముని తమకు ఆదర్శంగా చెప్పుకుంటోంది. సర్వమానవ సౌభ్రాతృత్వం గాంధీజీ లక్ష్యం కాగా హిందూ మతోన్మాదం బీజేపీ లక్ష్యం. కాశ్మీర్ విషయంలో చెప్పిన అబద్ధం చెప్పకుండా అబద్ధాల హోరులో దేశ ప్రజలకు అబద్ధాన్నే నిజం అని నమ్మించింది. ఆర్ఎస్ఎస్ బీజేపీ మూకలు దళితులను హిందువులు, దళిత క్రిష్టియన్ల కింద విభజించి దళిత క్రిష్టియన్లకు రిజర్వేషన్లు ఇవ్వరాదని వివాదం సృష్టిస్తున్నది. రిజర్వేషన్లు, ఉండరాదని ఒకప్పుడు ప్రకటించిన మోహన్ భగవత్ ఇప్పుడు సమీక్ష చేయాలన్నారు. ప్రస్తుతానికి ఆ పంచాయితీ వాయిదా వేశామన్నారు.
చెడుకు ప్రతీకగా మారుతున్న బీజేపీ
విధానాలతో నిమిత్తంలేని పదవుల కోసం వెంపర్లాడే వివిధ పార్టీల్లో ఉండే ఊసరవెల్లుల్ని బీజేపీ పోగేసుకుంటున్నది. బ్యాంకుల డబ్బును కాజేసిన వారిని, అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్న వారిని, హత్యలు, లైేంగిక దాడులు చేసిన రౌడీలను, అసాంఘిక శక్తులను, స్వాములను బీజేపీ తన బలగంగా మార్చుకుంటున్నది. భారతదేశంలో కాంగ్రెస్తో సహా ఏ పార్టీలోనూ ఇంత చెడు పోగు పడలేదు. బీజేపీ చెడుకు ప్రతీకగా మారుతున్నది.
ఎప్పుడూ సామ్రాజ్యవాద ఏజెంట్లే
స్వాతంత్య్ర కాలంలో కూడా బ్రిటిష్ వారికి ఏజెంటుగా పని చేసిన బీజేపీ నేడు అమెరికన్ సామ్రాజ్యవాదుల ఏజెంటుగా మారింది. మొన్న అమెరికా వెళ్లిన మోడీ నేరుగా ట్రంప్ను గెలిపించమన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి పాలస్తీనాను కబళించిన దేశంగా ఇజ్రాయిల్ను భారతదేశం పరిగణిస్తున్నది. ఇప్పుడు మోడీయే ఆ జాత్యహంకార ప్రభుత్వంతో సంబంధాలు పెట్టుకున్నది. మన దేశంలో ఆయుధాలు తయారు చేసే ఆర్డినెన్సు ఫ్యాక్టరీలను మూసి వేసి పన్నులు లేని విధంగా విదేశాల (అమెరికా) నుంచి ఆయుధాల దిగుమతికి మోడీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏ దేశంలో చీమ చిటుక్కుమన్నా మానవ హక్కులు హరించుకుపో తున్నాయని గోల చేసే అమెరికా, కాశ్మీర్లో 80లక్షల మందికి రెండు నెలల నుంచి మానవ హక్కులు నిలువునా హరించినా మాట్లాడటం లేదు. మతోన్మాదులు, హంతకులే హత్యలు చేయగలరు. బీజేపీ అటువంటి శక్తులన్నింటినీ మూటగడు తున్నది. అది ఇప్పుడూ సామ్రాజ్యవాదుల తొత్తే. దేశ ప్రజలు అప్రమత్తమై విభజించి దెబ్బతీసే బీజేపీ కుయుక్తులు ఎదుర్కోకపోతే రేపు నీవంతు రాక మానదు. కాబట్టి రాజకీయాలు ఏమైనా మన ప్రజలను ఐక్యంగా నిలబెట్టిన రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా ఉద్యమించాల్సిన తరుణమిది. ప్రజలంతా అప్రమత్తం కావాలి.
యం. కృష్ణమూర్తి