Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజకీయ నాయకులు తమ అస్థిరతను కాపాడు కోవడానికి, తిరిగి అధికార పీఠం దక్కించు కునేందుకు ఎప్పటికప్పుడు తమ వ్యూహాలను మార్చుకుంటూ ముందుకెళ్తుంటారు. ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు పొందేందుకు కొందరు సంక్షేమ పథకాల రూపంలో వెళ్తే.. మరికొందరు అందుకు భిన్నంగా ప్రజలను ఆకర్షించేందుకు కొత్తకొత్త వ్యూహాలను అమలు చేస్తుంటారు. అక్కడి భౌగోళిక స్థితిగతులు లేదా మతం, కులాల ఆధారంగా చేసే రాజకీయాలు మనం చూస్తునే ఉన్నాం. ఉదా.. ఉత్తర భారతంలో మతం, కులం ప్రభావితం చూపిస్తే అదే దక్షిణ భారతంలో మతం కంటే ఎక్కువగా కులాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇప్పుడు ఇదే కోవలోకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేరారు. ఇన్ని రోజులు బీజేపీ అనుసరిస్తున్న హిందూత్వ అజెండాపై బహిరంగంగా విరుచుకుపడ్డ మమతా కొన్ని రోజులుగా మౌనం పాటిస్తున్నారు. గతంలో కాషాయ గూండాలు, హిందూత్వ ఉగ్రవాదులుగా బీజేపీ, ఆర్ఆర్ఎస్ కార్యకర్తలను ఆమె అభివర్ణించారు. పార్లమెంట్ ఎన్నికల్లో జై శ్రీరాం పేరిట నినాదాలు ఇచ్చిన వారిపై కేసులు బనాయించి జైల్లో పెట్టాలని పోలీసులకు ఆదేశాలిచ్చిన దీదీ ఇప్పుడు వెనక్కితగ్గడానికి గల ఆంతర్యం ఏమిటీ?
బెంగాల్ ఎన్నికలు దగ్గర పడుతుండటమే కారణమా? హిందూత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే రానున్న ఎన్నికల్లో తన పార్టీకి గట్టిదెబ్బ తగులుతుందనే విషయాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ఇచ్చిన సలహాయే కారణమా? అంటే అవుననే ఆధారాలు ఇందుకు ఊతమిస్తున్నాయి. ఇదిలా ఉంటే 42ఎంపీ సీట్లు ఉన్న పశ్చిమబెంగాల్లో బీజేపీకి 18స్థానాలు రాగా టీఎంసీకి 22, ఇతరులకు 2 స్థానాలొచ్చాయి. అంతకు ముందు 34ఎంపీ సీట్లు ఉన్న టీఎంసీకి ఆ సంఖ్య 22కు పడిపోవడంతో దీదీకి హిందూత్వ భయం పట్టుకుందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. తన వ్యుహాలతో రాజకీయ ప్రత్యర్థులను చిత్తుచేస్తూ గుజరాత్ నుంచి ఏపీ వరకు 5 రాష్ట్రాలో తాను పనిచేస్తున్న పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చిన ప్రశాంత్కిషోర్ దీదీకి ఇచ్చింది ముందస్తు హెచ్చరికగానే రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రతి సభలోనూ అగ్రెసివ్గా మాట్లాడే మమత ఇప్పుడు ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. రాజకీయాల్లో చిరకాల మిత్రులు, శత్రువులు ఉండరనే సామెతను ప్రధాని మోడీ, మమతకు చక్కగా ఆపాదించుకోవచ్చు. ఈ మధ్యే బెంగాల్ సీఎం మమతా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీకి బెంగాలీ స్వీట్లు, శాలువాను బహుకరించారు. అనంతరం అమిత్షాతో భేటీ అయ్యారు. కేంద్రంతో సమన్వయానికి ఇదో ప్రయత్నం మాత్రమేనని దీదీ ప్రకటించారు. కానీ శారదా చిట్ఫండ్ స్కామ్లో సీబీఐ ఎక్కడ తనను టార్గెట్ చేస్తుందోనని డిఫెన్స్లో పడిన మమతా ముందస్తుగానే మోడీ, అమిత్షాను కలిసారనే గుసగుసలూ వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఐఎన్ఎక్స్ స్కామ్లో మాజీ హోంమంత్రి చిదంబరాన్ని తీహార్ జైలుకు పంపించిన సీబీఐ ప్రస్తుతం శారదా స్కామ్లో ఆధారాలు మాయం చేసిన అప్పటి సీఐడీ దర్యాప్తు అధికారి రాజీవ్కుమార్ కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తోంది. అతడు దొరికితే సీఎం మమతా బెనర్జీ పని అయిపోయినట్టే! ఎందుకంటే తన పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలకు శారదా స్కాంలో హస్తముందనేదీ ప్రధాన అంశం. అంతేకాకుండా రాజీవ్ను తప్పించింది దీదీనే అని కూడా ప్రచారం జరుగుతోంది. ఓవైపు బెంగాల్లో బీజీపీ తమ పార్టీలో చేరిన శారదాస్కామ్ నిందితుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తూ, చేరని వారిపై సీబీఐ దాడులకు దిగుతున్న నేపథ్యంలో తాను మళ్లీ అధికారంలోకి వస్తే తప్ప తన అధికార గణాన్ని రక్షించుకోలేనని గ్రహించిన దీదీ కొత్త ఎత్తులు వేస్తున్నారని చెప్పుకోవాలి. ప్రశాంత్ కిషోర్ సలహా మేరకు ఇన్ని రోజులు హిందువుల్లో తన మీద పెరిగిపోయిన విద్వేషాన్ని తొలగించుకోవడానికి పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే తాను హిందూ ధర్మాన్ని పాటిస్తానని అందులోనూ రామకృష్ట పరమహంస, స్వామి వివేకానందలు పాటించిన సిద్ధాంతాలను నమ్ముతానని బెంగాల్లో నిర్వహించిన ఓ సభలో ఆమె పేర్కొనడం గమనార్హం. అంతేకాకుండా విజయదశమిని పురస్కరించుకుని దుర్గామాత మండపాలకు పెద్దఎత్తున పర్మిషన్లు ఇవ్వడం, మండపాలకు వాడే విద్యుత్కు రాయితీలను ప్రకటించడం ఇవన్నీ రాజకీయంలో భాగమే. ఎలాగైనా రాబోయే ఎన్నికల్లో అధిక స్థానాలు సాధించి అధికారంలోకి రావడమే మమతా బెనర్జీ ప్రధాన ఎజెండా. అందుకు ఏ చిన్న అవకాశాన్నైనా అందిపుచ్చుకుని అందులో సఫలం అవడమే దీదీ ముందున్న ఏకైక మార్గం. ఇప్పటికైనా బెంగాల్ ప్రజలు రానున్న ఎన్నికల్లో మతతత్వ రాజకీయాలను పారద్రోలి దేశప్రజలందరికీ ఆదర్శంగా నిలవాలని ఆశిద్దాం.
- కట్టా సాయికుమార్
సెల్ : 7386340285