Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ప్రభుత్వశాఖల్లో అతిపెద్ద కుంభకోణం బయటపడింది. ఈఎస్ఐ సంస్థలో సుమారు రూ.1000 కోట్ల స్కామ్ జరిగిందని ప్రచారం జరుగుతున్నది. ఏసీబీ విచారణలో ఇప్పటికే సంస్థ డైరెక్టర్ అయిన ఐఏఎస్ అధికారి మొదలు క్రిందిస్థాయి సిబ్బందితోపాటు బయటి వ్యక్తులు మొత్తం 13మంది అరెస్టయ్యారు. ఈ కుంభకోణంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులూ నాయకుల హస్తం ఉందని తెలుస్తున్నది. ఈ వైపున విచారణ జరగకుండా ప్రభుత్వ పెద్దలే అడ్డుకుంటున్నట్టు అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బంగారు తెలంగాణలో అవినీతికి తావుండదన్న ముఖ్యమంత్రి మాటలు వట్టి ప్రగల్బాలేనని తేటతెల్లమైంది. 2015 నుంచి గత ఐదేండ్లుగా అక్రమాలు జరుగుతున్నా, పెద్దఎత్తున అవినీతి జరిగినా పట్టించుకోలేదు. అనేక సందర్భాలలో ఈ అవినీతి వ్యవహారం రాష్ట్ర కార్మికశాఖా మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీల దృష్టికి వచ్చినా ఎందుకు పట్టించుకోలేదన్నది ప్రశ్న? రాష్ట్రంలోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ సంస్థ టెండర్ల ద్వారా మందులు, ల్యాబ్ టెస్ట్ కిట్స్ కొనుగోలు చేయాలి. ఓపెన్ టెండర్లు వేసి స్కూృటిని కమిటీ, పర్చేజ్ కమిటీ వేయాలని జీఓ51 ద్వారా నిబంధనలు ఉన్నా ఆ అంశాన్ని పక్కన పెట్టారు. ఉన్నతాధికారులూ ఫార్మా కంపెనీల ఏజెంట్లూ కుమ్మక్కై మందుల కొనుగోలు కోసం అధిక రేట్లతో ఇండెంట్లు సృష్టించి డబ్బులు స్వాహా చేశారు. 2015 నుంచీ 2019 వరకూ ఈ స్కామ్ జరిగింది.
ప్రయివేట్ వ్యక్తులు డైరెక్టర్ ఆఫీసులో దర్జాగా కూర్చొని మరీ సంతకాలు చేయించారు, దోచుకున్నారు. అధికారులతో కలసి వాటాలు పంచుకున్నారు. మందుల రేట్లు కూడా అడ్డగోలుగా నిర్ణయించారు. ఉదా|| టీఎస్ఎంఐడీసీ రేటు ప్రకారం డెంగ్యూ కిట్ రూ.4 ఉంటే ఈఎస్ఐ ద్వారా రూ.185.80, మలేరియా కిట్ ధర రూ.0.39పైసలు ఉంటే రూ.63.30, థైరాయిడ్ ర్యాపిడ్ కిట్ ధర వాస్తవంగా రూ.1.32 ఉంటే రూ.93.30కు ధర పెంచి దండుకున్నారు. ల్యాబ్ యంత్రాలను అవెంటర్, లెజండ్, ఓమ్నీ అనే కంపెనీలు ఉచితంగా సరఫరా చేసి వారి కంపెనీల ల్యాబ్ కిట్లను మాత్రమే కొనే విధంగా చేయడం ఈ అవినీతి వ్యవహారంలో మరో దోపిడీ. ఉదా|| ఈ కిట్ల వాస్తవ ధర రూ.46,480 ఉంటే రూ.2.67 కోట్లు దోచేశారు. అలాగే హెచ్ఐవీ ట్రా డాట్, హెచ్సివి, మలేరియా, హెచ్డిఎల్., కొలెస్ట్రాల్ ట్రొపోనిక్ తదితర కిట్ల కోసం ఓమ్నీ సంస్థకు రూ.12.44 కోట్లు చెల్లించారు. ఉమ్మడి రాష్ట్రంలో ల్యాబ్ కిట్స్ కోసం 3 నెలల కోసం 6 కోట్ల రూపాయలు ఖర్చయితే తెలంగాణలో ఏకంగా 20 కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఒక్క ఓమ్నీ కంపెనీ తరపున కుంభకోణంలో కీలకపాత్ర పోషించిన శివనాగరాజు 42మండల కంపెనీలకు ఏజెంటుగా వ్యవహరించడం ఈ అవినీతి విస్మృతిని తెలియజేస్తున్నది. ఇందులో కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీ నాయకుల పాత్ర ఉన్నదనే బలమైన ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణంపై సమగ్రంగా విచారణ జరపాలి. దోషులను కఠినంగా శిక్షించాలి.
సమస్యల వలయంలో ఈఎస్ఐ లబ్దిదారులు
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఇఎస్ఐ) పూర్తిగా కార్మికుడు, యజమాని వాటా ధనంతో నడుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం 2019 జూలై నుంచి సవరించిన వాటా ధనం కార్మికుడి జీతం నుంచి 0.75శాతం యజమాని నుంచి 3.25శాతం చొప్పున జమ అవుతున్నది. 2018-19లో దేశంలో 3.6కోట్లమంది కార్మికులు, 12,85,392 మంది యజమానులు మొత్తం 22,279 కోట్ల రూపాయల కంట్రిబ్యూషన్ కట్టారు. ఈ డబ్బులో నుంచే కార్మికుల వైద్య చికిత్సలు, మందులు, పరీక్షలు, ప్రసూతి సౌకర్యాలు, సూపర్ స్పెషాలిటీ వైద్యంతోపాటు కార్మికులు గాయపడినా, మరణించినా వేతనాలు, పెన్షన్ పొందుతున్నారు. కార్మికులపై ఆధారపడిన వారి తల్లిదండ్రులకు (డిపెండెంట్స్) కూడా వైద్య సౌకర్యం అందుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 17,00,000 మంది ఈఎస్ఐ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులను కలుపుకుంటే సుమారు 60లక్షలమంది ఈ పథకం ద్వారా వైద్య సేవలు పొందుతున్నారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వీరందరి ప్రయోజనాలపై దాడి చేసి ఈఎస్ఐ లబ్దిదారులను ప్రయివేట్ బీమా సంస్థలలో చేరడానికి ప్రోత్సహిస్తున్నది. ఈఎస్ఐ చట్టంలో మార్పులు చేయాలని చూస్తోంది. కార్మికుల హక్కులు కాలరాస్తున్నది.
రాష్ట్రంలోని నాచారం, ఆర్సీ పురం, వరంగల్, నిజామాబాద్, కాగజ్నగర్, జీడిమెట్లలో ఆసుపత్రులు, 70 డిస్పెన్సరీలు ఉన్నాయి. కానీ డాక్టర్లు 350మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 130ఖాళీ స్థానాలు ఉన్నాయి. గత ఏడేండ్లుగా ఎలాంటి నియామకాలు లేవు. ఈ మధ్య కాలంలో 5మంది డాక్టర్లను మాత్రమే రిక్రూట్ చేశారు. సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. మందుల కొరత తీవ్రంగా ఉంది. 2019 మార్చి నుంచి ఔట్సోర్సింగ్ సిబ్బందికి జీతాలు లేవు. అద్దె భవనాలే ఎక్కువగా ఉన్నాయి. ఇండెంట్లు పెడుతున్నా సరఫరా లేదు. నాలుగు మాసాలుగా ల్యాబ్కిట్స్ సరఫరా చేయడం లేదు. క్యాన్సర్, కిడ్నీ లాంటి వ్యాధులకు మందులు సరఫరా చేయడం లేదు. ఆర్థోపెడిక్, ఈఎన్టి, డెంటల్, గైనిక్, ఊపిరితిత్తుల వైద్యం కోసం కార్పొరేట్ ఆస్పత్రులకు రిఫర్ చేయడం లేదు. అత్యవసర చికిత్సల కోసం రిఫరల్ ఆస్పత్రులలో చేరి వైద్య సౌకర్యం పొందడానికి అవకాశం ఉండేది. ప్రస్తుతం ముందుగా కార్మికుడు డబ్బు చెల్లించి తరువాత ఈఎస్ఐ నుంచి క్లెయిమ్ (రీయింబర్స్ మెంట్) చేసుకోవాల్సి ఉంది. గత ఐదేండ్లుగా కార్మికులకు ఈఎస్ఐ పేమెంట్స్ చేయకపోవడం వల్ల కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. కార్మికులు తమ ఆస్తులు అమ్ముకొని, బంగారం తాకట్టు పెట్టుకొని దీనస్థితిలో ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గమైన గజ్వేల్లో సుమారు 50వేల మంది కార్మికులకు ఒక్క డిస్పెన్సరీ కూడా లేదు. అలాగే సదాశివపేట ప్రాంతంలో ఉన్న డిస్పెన్సరీ పరిధిలో 11వేల మంది ఇన్సూర్డ్ పర్సన్స్ ఉన్నా స్థాయి పెంచలేదు. రంగారెడ్డి జిల్లా పరిధిలో కంపెనీల విస్తరణ, కార్మికుల సంఖ్య పెరుగు తున్నా ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీల సంఖ్య పెంచనేలేదు.
తక్షణం ఈఎస్ఐ వైద్య సేవలను మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం త్రైపాక్షిక కమిటీలను బలోపేతం చేయాలి. అవినీతిని నిరోధించి దోషులను కఠినంగా శిక్షించాలి.. వైద్య సేవలను వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలకు ప్రభుత్వం పూనుకోవాలి.
- భూపాల్
సెల్: 9490098034